క్యాంటీన్లు ఏవి జ‌గ‌న‌న్న‌? నిగ్గ‌దీసి అడిగిన ర‌ఘురామ‌..

న‌వ ర‌త్నాల‌కు కౌంట‌ర్‌గా.. న‌వ ప్ర‌భుత్వ క‌ర్త‌వ్యాలు. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు చుక్క‌లు చూపిస్తున్నారు. రోజుకో ప్ర‌జాస‌మ‌స్య‌ను ప్ర‌స్తావిస్తూ.. ముఖ్య‌మంత్రికి లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాటిని తుంగ‌లో తొక్కిన వైనాన్ని నిగ్గ‌దీసి అడుగుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో మాట త‌ప్పిన‌, మ‌డ‌మ తిప్పిన అంశాల‌ను ఎత్తి చూపుతున్నారు. అటు ప్ర‌జాస‌మ‌స్య‌లు, ఇటు రాజ‌కీయ విధానాల లోటుపాట్ల‌పై ఘాటైన లేఖ‌లు రాస్తున్నారు. ఇన్నాళ్లూ వీడియోల‌తో వాయించిన ర‌ఘురామ‌.. కొంత‌కాలంగా లేఖ‌ల‌తో సీఎం జ‌గ‌న్‌రెడ్డిని కుళ్ల‌బొడుస్తున్నారు. తాజాగా.. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే ర‌ద్దు చేసిన అన్న క్యాంటీన్ల అంశాన్ని ప్ర‌స్తావించారు. పేద‌ల‌కు అన్నంపెట్టే అన్న క్యాంటీన్ల ర‌ద్దును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. అన్న క్యాంటీన్ల బ‌దులు జ‌గ‌న‌న్న క్యాంటీన్ల‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని లేఖ‌లో డిమాండ్ చేశారు ర‌ఘురామ‌. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు రాసిన ఆ లేఖ య‌ధాత‌ధంగా.....

‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అని దాదాపు అన్ని పవిత్ర గ్రంథాలలో చెబుతుంటారు. ఆకలితో ఉన్న వారికి మంచి ఆహారం అందించడం అనేది ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎంతో అవసరమైనది. ఈ లేఖ ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అన్నదానం అనేది అన్ని దానాల్లోకెల్లా మిన్న అనే నానుడి కూడా మనం చిన్నతనం లోనే నేర్చుకున్నాం. అన్నదానం ద్వారా మంచి పేరు రావడమే కాకుండా మీరు ‘దైవదూత’ అనేది కూడా జన బాహుళ్యంలో స్థిరపడిపోతుంది. అందుకని.. తక్షణమే జగనన్న క్యాంటీన్ స్కీమ్ ప్రారంభించాలని సూచిస్తున్నాను’’

‘‘గతంలో ఈ పథకం ద్వారా ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అందించేవారు. మూడు విడతలుగా అందించే ఈ ఆహారం కేవలం రూ.15కే పేదవారికి అందేది. ఈ స్కీమ్ లేకపోతే ఇదే మూడుపూటల ఆహారం కనీసం రూ.150 అయ్యేది. ప్రభుత్వానికి ఈ మూడు విడతల ఆహారానికి కలిపి రూ.58 ఖర్చు అయ్యేది. ఒక్కో క్యాంటీన్‌లో 900 నుంచి 1200 మంది వరకూ ఆకలి తీర్చుకునేవారు. ఇలా అన్ని క్యాంటీన్లలో కలిపితే సుమారు 2.15 లక్షల మందికి ప్రతి సారి ఆకలి తీరుతూ ఉండేది. గత ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించడమే కాకుండా దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి మొత్తం 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు, 75 పట్టణ ప్రాంతాలలో 103 అన్న క్యాంటీన్లు, మొత్తం 73 మున్సిపాలిటీలలో 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. గత ప్రభుత్వాన్ని తలదన్నే విధంగా  రూ.వెయ్యి కోట్లతో జగనన్న క్యాంటీన్లను ప్రారంభించాలని కోరుతున్నాను’’

’‘గత ప్రభుత్వం 13 జిల్లాలను మూడు జోన్లుగా విభజించి 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించి... వాటిని  నిర్వహించే బాధ్యత అక్షయ పాత్ర ఫౌండేషన్‌కి అప్పగించింది. ఈ ప్రభుత్వం వచ్చాక.. వారికి ఆర్డరు క్రమంగా తగ్గిస్తూ ప్రభుత్వం పూర్తిగా వాటిని మూసివేసింది. ఒక్కో జోన్‌లో అన్న క్యాంటీన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సుమారు రూ.6 కోట్లు ఖర్చు చేసినట్లుగా నాకు తెలిసింది. ఫేస్ రికగ్నిషన్ సహా.. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి.. అవకతవకలకు తావు లేకుండా చేసింది. కరోనా విజృంభించిన వేళ ప్రభుత్వం నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం, నెలవారీ ఆర్థిక సహాయం అందించినా... నిరాశ్రయులను ఆదుకోలేకపోయింది. తమిళనాడులో ‘అమ్మ క్యాంటీన్లు’, కర్ణాటకలో ‘ఇందిరా క్యాంటీన్లు’, తెలంగాణలో ‘అన్నపూర్ణ క్యాంటీన్లు’ గుణాత్మకమైన సేవలు అందిస్తుండగా మీ పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నిరాశ్రయులను గాలికి వదిలేశారు.’’

‘‘లాక్‌డౌన్ సమయంలో ఇల్లు కూడా లేని కడు నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి దుర్భర పేదరికంలో ఉన్నవారిని కరోనా లాక్‌డౌన్ సమయంలోనే కాకుండా అన్ని వేళలా కాపాడాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లను మార్చేందుకే అన్న క్యాంటీన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు...మంత్రి బొత్స ప్రకటించి.. తర్వాత వాటిని పునరుద్ధరిస్తామని సెలవిచ్చారు. దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ వాటిని పునరుద్ధరించే చర్యలు ఏవీ చేపట్టలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రజావ్యవహారాల సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి త్వరలో క్యాంటీన్లను తెరుస్తామని చెప్పిన మాటలు కూడా ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఈ క్యాంటీన్ల ‘రంగు’, ‘పేరు’ మార్చి ఎప్పుడు తెరుస్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో మంది తమ సంతోషం కోసం చేసుకునే వ్యక్తిగత ఆడంబరాలు, కార్యక్రమాలకు వెచ్చించే సొమ్మును ఈ పవిత్ర కార్యానికి విరాళాలు ఇవ్వాలని కోరవచ్చు. దీని వల్ల ఆడంబరంగా పుట్టిన రోజులు, పెళ్లి రోజులు జరుపుకొనే వారు ఆ సొమ్మును విరాళంగా ఇచ్చి ఈ పథకాన్ని కొనసాగించేందుకు తమ వంతు సాయం అందించేందుకు అవకాశం ఉంది. వారి వారి పుట్టిన రోజులు, పెళ్లి రోజులకు గుర్తుగా విరాళాలు కూడా అందించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉంటారు. మూడు జోన్లు లేదా జిల్లాలు, మండలాల వారీగా ఇలా సేకరించిన విరాళాలు ఈ పథకం కోసం ఖర్చు చేయవచ్చు.’’ 

‘‘సాటి మనిషి ఆకలి తీర్చడం కన్నా పరమాత్ముడి సేవ ఇంకేముంటుంది ?ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన అక్షయ పాత్ర సంస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, మంగళగిరి, నెల్లూరులో అక్షయ పాత్ర వంటశాలలు కూడా ఏర్పాటు చేసింది. ఈ పథకానికి వారి సేవలు వినియోగించుకుంటే, వారిని భాగస్వామిగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అనాథలను, అభాగ్యులను, దివ్యాంగులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఎలా భావిస్తారో.. అలానే నిరుపేదల ఆకలి తీర్చడం కూడా ప్రధానమైన అంశంగా మీరు గుర్తించాలని కోరుతున్నాను. పేదవారి ఆకలి తీర్చడం ద్వారా మానవత్వం ప్రదర్శించేందుకు ఇది వేదిక అవుతుంది. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి కార్యక్రమం సందర్భంగా జగనన్న క్యాంటీన్ లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ఈ స్కీమ్‌ను మళ్లీ ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’