కరోనా మందుపై పాలకులే కుట్ర చేశారా? ఆనందయ్య సంచలన ఆరోపణలు..
posted on Sep 28, 2021 4:24PM
గుర్తున్నారుగా ఆనందయ్య. ఒకప్పుడు తెలుగుస్టేట్స్లో ఫుల్ ఫేమస్. కరోనాకు సమర్థవంతమైన ఆయుర్వేద మందును అందించిన వాడిగా ఎనలేని పాపులారిటీ. ఆయన మందు కోసం వేలల్లో ప్రజలు క్యూ కట్టారు. రెండు చుక్కలు కంట్లో వేస్తే చాలు.. కరోనా హుష్కాకి. కాసింత మందు నోట్లో వేస్తే పావుగంటలో లేచి కూర్చొనేవారు పేషెంట్లు. ఆక్సిజన్ లెవెల్స్ పాదరసంలా సర్రున ఎగబాకేవి. తన మందుతో కొన్ని వారాల్లోనే మెరాకిల్స్ చేసి చూపించారు ఆనందయ్య. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య మందుపై ప్రభుత్వమే కుట్ర చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను హైజాక్ చేసి.. ఆ మందును ఎవరికీ అందకుండా కట్టడి చేసి.. క్రమంగా తెరమరుగు చేశారు. వైపీసీ పెద్దలు, అధికారులు తమకు కావలసిన వారికి బకెట్లకు బకెట్లు ఆనందయ్య మందును సరఫరా చేయించుకుని.. ప్రజలకు మాత్రం మొండిచేయి చూపించారు. ఆ వనమూలికలతో చేసే ఆ మందుకు ఆయుష్ ఓకే చేసినా.. హైకోర్టు సైతం గ్రీన్సిగ్నల్ ఇచ్చినా.. ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఆనందయ్య పేరు గానీ, ఆ ఆయుర్వేద మందు ఊసుగానీ లేకుండా చేశారు. తాజాగా, ఆ అంశంపై ఆనందయ్య షాకింగ్ విషయాలు వెల్లడించారు.
మా కరోనా మందు ప్రజల్లోకి రానివ్వలేదంటూ పరోక్షంగా వైసీపీ పాలకులపై సంచలన ఆరోపణలు చేశారు ఆనందయ్య. కరోనా చికిత్స కోసం తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా చాలా అడ్డంకులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులంతా ఆ సమయంలో అండగా నిలవడం వల్లే అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారని వాపోయారు.
ఆనందయ్య మాటలతో ప్రభుత్వమే కుట్ర చేసినట్టు సుస్పష్టంగా తెలిసిపోతోంది. ఆయన్ను అరెస్ట్ చేయడానికీ పోలీసులు ప్రయత్నించారంటే పాలకులే దగ్గరుండి ఆ మందును ప్రజలకు దక్కకుండా మాయం చేశారని తెలిసిపోతోంది. జస్ట్.. కాసింత కరెంట్, కొన్ని వంటపాత్రలు అందిస్తే చాలు.. ఎంతమందికంటే అంత మందికి మందు తయారు చేసిస్తానని ఆనందయ్య అనేకసార్లు సర్కారుకు మొరపెట్టుకున్నా.. ప్రభుత్వ పెద్దల చెవికి అది వినిపించలేదు. వినిపించలేదు అని చెప్పలేం కానీ, వినిపించీ పట్టించుకోలేదని.. డ్రగ్స్ మాఫియా ఒత్తిడితో పాలకులే ఆనందయ్య మందును కనుమరుగు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కృష్ణపట్నంకు ప్రజలెవ్వరూ రాకుండా ఆంక్షలు విధించి.. ఆనందయ్యను వారాల తరబడి హైజాక్ చేసి.. క్రమంగా ప్రజలకు ఆ మందును దూరం చేశారు. తాజాగా ఆనందయ్య చేసిన కామెంట్లతో ఆ పాపమంతా ప్రభుత్వానిదేనని.. దోషులంతా పాలకులనే విషయం మరోసారి వెల్లడైందని అంటున్నారు.