ఆ పాపం జగన్రెడ్డిదే.. ప్రభుత్వంపై ఆనందయ్య ప్రకోపం..
posted on Jun 23, 2021 6:46PM
ఆనందయ్యను ఆగం చేసింది జగన్రెడ్డి ప్రభుత్వమే. ఆనందయ్య మందు అందరికీ దూరం చేసిందీ జగన్రెడ్డి సర్కారే. ఈ ఆరోపణ ప్రతిపక్ష నేతలు చేస్తున్నది కాదు. స్వయాగా ఆనందయ్యే ఈ విమర్శలు చేయడం సంచలనంగా మారింది. తాజాగా, మీడియాతో మాట్లాడుతూ.. మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని, సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. సరైన సామాగ్రి లేక మందు తయారీ విషయంలో వెనుకబడ్డానని ఆనందయ్య చెప్పారు. బడ్డి కొట్టుల్లో తన మందు అమ్ముతున్నారంటే.. అది ప్రభుత్వ లోపమని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆనందయ్య కోరడం కలకలం రేపుతోంది.
ఎంత ఆవేదన. ఎంత బాధ. ఆనందయ్య మాటలతో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన ఏం అడిగారు పాపం? మందు తయారీకి కావలసిన గిన్నెలు.. కాసింత కరెంటు.. మందు పంపిణీకి ఏర్పాట్లు.. ఇంతే. ఇంకేం కోరలేదు ఆనందయ్య. ప్రజల కోసం ఆ మాత్రం ఉడతాభక్తి సాయం చేయని ప్రభుత్వం ఉండెందుకు? ఆనందయ్య మందుపై అంత కుట్ర ఎందుకు? అంటూ నిలదీస్తున్నారు ప్రజలు.
ఆనందయ్య మందు కరోనా బాధితుల పాలిట సంజీవని. ఆయన మందుతో పోయే ప్రాణం లేచి కూర్చుంటోంది. ఆ మందుతో మిరాకిల్ జరుగుతోంది. అందుకే ఆయుష్ శాఖ అన్నిరకాల ప్రయోగాలు చేసి మరీ ఆనందయ్య మందు ఓకే చేసింది. హైకోర్టు సైతం మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరిక ప్రాబ్లమ్ ఏముంది? అంగట్లో అన్నీ ఉన్నా.. సర్కారులో మాత్రం చిత్తశుద్ధి కరువైందని అంటున్నారు. వైసీపీ నేతలు ఆనందయ్యను హైజాక్ చేసేసి.. తమ నియోజకవర్గాల్లో మాత్రమే మందు పంపిణీ చేసుకుంటున్నారు. అది కూడా ఆనందయ్య బొమ్మ లేకుండా.. తమ ఫోటోలతో, వైసీపీ గుర్తులతో ఆనందయ్య మందుతో నీచ రాజకీయం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఓ దశలో వెబ్సైట్లో పెట్టి మరీ ఆనందయ్య మందుతో కాసులు దండుకోవాలనే ఎత్తుగడ వేసినా.. టీడీపీ నేత సోమిరెడ్డి జోక్యంతో ఆ కుట్ర బెడిసికొట్టింది.
ఒకప్పుడు కృష్ణపట్నంలో అందరికీ ఉచితంగా లభించిన ఆనందయ్య మందు.. ఇప్పుడు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆనందయ్య మందును అసలు న్యూస్లోనే లేకుండా చేయడం వెనుక డ్రగ్ మాఫియా కుట్రతో పాటు ప్రభుత్వ పాత్ర కూడా ఉందనే అనుమానం వినిపిస్తోంది.
ఎంతమందికైనా మందు తయారు చేసేందుకు ఆనందయ్య రెడీగా ఉన్నారు. అందరికీ ఉచితంగా మందు ఇస్తానంటున్నారు. ప్రజలు సైతం ఆనందయ్య మందు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి, ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది? ఆనందయ్యను అడ్డుకుంటున్నది ఎవరు? ఆనందయ్యకు సహాయ నిరాకరణ చేస్తున్నది ఎవరు? ఇంకెవరూ జగన్రెడ్డి ప్రభుత్వమే అంటున్నారు ఆనందయ్య. నేరుగా సర్కారునే దోషిగా చూపిస్తున్నారు. ఇంతకంటే సాక్షం ఇంకేం కావాలి? ఆనందయ్యే చెబుతుండగా ఇంకా అనుమానమేముంది? జగన్రెడ్డి సర్కారు ఆనందయ్యపై, ఆయన తయారు చేసే మందుపై అంత కుట్రపూరితంగా ఎందుకు వ్యవహరిస్తోంది? డ్రగ్ మాఫియా, మెడికల్ మాఫియా నుంచి ఒత్తిడే కారణమా? ప్రభుత్వ పెద్దలు పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారా? అందుకే, ఆనందయ్య మందును కనుమరుగు చేసేశారా? ప్రజల ప్రాణాలతో ఇంతలా చెలగాటమా? ఏపీలో పుట్టడమే ఆనందయ్య చేసిన పాపమా? జగన్రెడ్డి పాలనే ప్రజల పాలిట శాపమా?