Latest News
అలకలో పిడకలవేట!
posted on: Jan 30, 2014 7:10PM

అధికారాన్ని నిలుపుకోవడానికి ఏ అవకాశాన్నీ వదులుకోని శైలి కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ ఏ అవకాశమూ లేకపోతే కొత్త అవకాశాలను కల్పించుకునే శైలి కూడా కాంగ్రెస్ పార్టీదే. అత్యుత్సాహంగా తెలంగాణని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఆల్రెడీ గల్లంతైపోయింది. విభజన పాపాన్ని మూటగట్టుకున్నప్పటికీ తెలంగాణ ప్రాంతలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదని, వచ్చే ఎన్నికలలో ఇప్పుడున్న సీట్లు కూడా వచ్చే ఆశలు లేవని ఈమధ్య జరిగిన కొన్ని సర్వేలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో గెలిచే అవకాశాలున్న ఇతర పార్టీల నాయకులను లాక్కోవడానికి పథకాలు వేస్తోంది.
టీఆర్ఎస్తో ఒకవైపు విలీనం చర్చలు జరుపుతూనే ఆ పార్టీ నాయకులను బుట్టలో వేసుకునే పనులు ముమ్మరం చేసింది. తెలుగుదేశం నాయకులను కూడా ఆకట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. లేటెస్ట్ గా రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేయలేదని అలిగిన మోత్కుపల్లి నర్సింహులు మీద కాంగ్రెస్ పార్టీ కన్ను వేసింది. మోత్కుపల్లి అలిగినట్టు ఇలా సమాచారం వచ్చిందో లేదో కాంగ్రెస్ పార్టీ మోత్కుపల్లిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో ఎవరు కాస్తంత అలిగినా వాళ్ళ మీద ‘ఆకర్ష’ పథకాన్ని ప్రయోగించడానికి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహపడిపోతూ వుంటుంది. గతంలో ఎర్రబెల్లి అలిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆశలు పెట్టుకుని స్వాగత ద్వారాలు తెరిచింది. అయితే ఎర్రబెల్లి మాత్రం అవసరమైతే రాజకీయాల్లోంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని బతుకుతా తప్ప కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరనని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. అయినా జ్ఞానోదయం కలగని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నాయకుల మీద గాలాలు, వలలు విసురుతూనే వుంది. తాజాగా మోత్కుపల్లి మీదకి వల విసిరింది. ఈసారి కూడా కాంగ్రెస్ వల చిరిగిపోయే ఛాన్స్ వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.






