బీజేపీ 46 ఏళ్ల ప్రస్థానం!

posted on: Apr 6, 2026 10:25AM

1980 ఏప్రిల్ 6న న్యూఢిల్లీలోని కోట్లా మైదానంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బిజెపి అధికారికంగా ఆవిర్భవించింది. భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ పార్టీకి మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆనాటి సభలో ఆయన చేసిన అంధేరా ఛాటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా ప్ర‌క‌ట‌నే నేడు నిజ‌మైంద‌ని అంటారు క‌మ‌ల‌నాథులు. తెలుగులో దీన‌ర్ధం ఏమిటంటే.. చీకటి తొలగుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. ఆ నినాదం ఇప్పటికీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

బిజెపికి  1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి.  అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది. 

2026లో బీజేపీ 46వ‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వ‌హిస్తోంది. ఏప్రిల్ 5 నుండి 12 వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేస్తోంది. ఈ వారోత్స‌వాల్లో భాగంగా.. వికాస్ యాత్రలు, సేవా కార్యక్రమాల‌ను ప్లాన్ చేసింది బీజేపీ. ప్రతి బూత్ స్థాయిలో జెండా  ఆవిష్కరణ,  పార్టీ సిద్ధాంతకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు నివాళులర్పించడం వంటివి చేస్తోంది.   కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేసి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక గ్రామ బస్తీ చలో కార్య‌క్ర‌మం విష‌యానికి వ‌స్తే.. ఏప్రిల్ 7 నుండి 12 వరకు నాయకులు గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ.. ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. 

తెలంగాణ‌లో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల‌తో కమలం పార్టీ బలంగా ఉంది.  ఇక ఎమ్మెల్సీ, మున్సిపాల్టీల్లోనూ ప‌ట్టు నిలుపుకుంటూ వ‌స్తోంది. వ‌చ్చే  ఎన్నిక‌ల‌లో అధికారమే టార్గెట్ గా అడుగులు వేస్తు ముందుకు సాగుతోంది.  ఇక ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంది.  అటు కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో కూడా  కూటమి అధికారంలో ఉండటంతో, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిధులు, మరియు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాల్లో కేంద్రం నుంచి ల‌బ్ధి పొందడంలో బిజెపి   వారధి గా పనిచేస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపికి ప్రాతినిధ్యం ఉంది. సత్యకుమార్ యాదవ్ వంటి నేతలు మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహిస్తున్నారు.  కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయడంలో బిజెపి చురుకైన పాత్ర పోషిస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. సొంతంగా బిజెపి ముఖ్యమంత్రులు   14 రాష్ట్రాలలో, బీజేపీ యేతర సీఎంలు ఉన్నప్పటికీ  ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏడు ఉన్నాయి. అంటే దేశంలో మొత్తం 21 రాష్ట్రాలలో   ప్ర‌స్తుతం బీజేపీ  నాయ‌క‌త్వంలోని ఎన్డీయే కూట‌మి అధికారంలో ఉంది.
 
ప్రస్తుతం  అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అంటే మే 4న ఈ లెక్కల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈసారి బిజెపి గట్టి పోటీనిస్తోంది.  

ఏది ఏమైనా బీజేపీ త‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో స్వ‌ర్ణ‌యుగంలాంటి రోజుల‌ను ఆస్వాదిస్తోంది. దేశ వ్యాప్తంగా అత్య‌ధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ.. గా ఈ ఏడాది ఆవిర్భావ ఏడుక‌ల‌ను ఎంతో ఘ‌నంగా  నిర్వ‌హిస్తోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...