నాదెండ్ల భాస్కరరావు జీవిత చరిత్ర

posted on: Apr 22, 2026 3:22PM

 

నాదెండ్ల భాస్కరరావు  1935 జూన్ 23న  పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు. బాల్యం మొత్తం అక్కడే గడిచింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన చదువులో రాణించారు. చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు కలిగిన వ్యక్తిగా ఎదిగిన భాస్కరరావుపై చదువుకునే రోజులలోనే రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండేది. సమకాలీన రాజకీయాలు, సమాజంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండేవారు.

హైదరాబాద్‌లో బీఏ పూర్తిచేసి, అక్కడే ఈవెనింగ్ లా కాలేజీలో బి.ఎల్. (LLB) పట్టా పొందారు. అనంతరం న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1959లో  లలితని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంచి పేరు సంపాదించిన ఆయన, అదే సమయంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరి, అనంతరం ఇందిరా కాంగ్రెస్‌లో ఏపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.

1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుండి 1989 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు ఒక నెలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. మర్రి చెన్నారెడ్డి,  టి. అంజయ్య మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.

1982 మార్చి 29న నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించగా, 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ ప్రభుత్వంలో నాదెండ్ల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

భాస్కరరావుకి ఇద్దరు కుమారులు నాదెండ్ల మురళీ,  నాదెండ్ల మనోహర్. చిన్న కుమారుడు మనోహర్ 2004లో తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా, 2011 నుండి 2014 వరకు చివరి శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. తరువాత 2018లో కొణిదెల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...