అనుకొన్న సమయానికి ప్రసాదు వచ్చాడు. వెంట కవికూడా ఉన్నాడు. ముందుగా కధ చెప్పమన్నది మంజరి. కవిగారు కధ చదివాడు. చదువుకున్నంతసేపూ కళ్యాణిని చూస్తూనే ఉంది మంజరి. కళ్యాణి ముఖంలో ఉత్సాహం లేదు. కవి గుండె మోకాళ్ళలోకి జారిపోయింది.
మంజరి కయితే ఈ కధ బాగానే వుంది. మరి కళ్యాణికి నచ్చలేదు గనక, తనకూ నచ్చనట్లే.
"ఎలావుంది?" అన్నాడు ప్రసాద్.
కళ్యాణి కేసి చూసి "ప్చ్" అన్నది మంజరి. "ఏమక్కాయ్ నీకూ నచ్చినట్టులేదు." అన్నది తనకు నచ్చలేదన్న భావాన్ని పరోక్షంగా వ్యక్తం చేస్తూ.
"నచ్చలేదంటే - దానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా అది హీరో పిక్చర్. హీరోయినంటూ ఉన్న, ప్రామినెన్సు చాలా తక్కువ" అన్నది కళ్యాణి.
"కరెక్టు" నేనూ అదే అనాలనుకొంటున్నాను అన్నది మంజరి కళ్యాణి అభిప్రాయాన్ని బలపరుస్తూ.
ప్రసాద్ కవి వేపు చూశాడు.
"చిత్తం అమ్మాయిగారన్న మాటలోకూడా నిజమన్నది లేకపోలేదనుకోండి. మనం ఈ కధనే ఫైనలైజ్ చేయబోవడం లేదు. హరివోమ్మంటూ ప్రారంభించాం. ట్రీట్ మెంట్ రాసుకునేటప్పుడు మార్పులు చేసుకోవచ్చు గదా! కాదూ కూడదంటారా? మనమిప్పుడు కూచుని, సబ్జెక్టును డిస్కస్ చేదాం. రిపీ వేళకు మళ్లారాసుకొస్తాను" అన్నాడు కవి.
"దట్స్ గుడ్, అలాచేదాం" అన్నది మంజరి.
కళ్యాణి మంజరీ కలిసి, కధనంతా తిరగతోడారు. ఈ పంపిణీ ప్రకారం, కధ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతూంది. హీరోయిన్ కు, కదాంతాన భర్తయ్యే కారెక్టర్ హీరో గనక -అతగాడికి అట్టే ప్రాముఖ్యం లేదు. ఎక్కువ కాలం అతను జైల్లో ఉంటాడు. లేదా అడవుల్లో తిరుగుతాడు. ఈ రెండవ వెర్షన్లో, కళ్యాణికి సరిపోయిన కారెక్టరుకూడా వున్నది. మంజరికి నాలుగు డాన్సులున్నాయి! ఒకచోట స్విమ్మింగ్ ఫూల్ సీన్ ఉంది. ఒక డ్రీంసీక్వెన్సీ ఉంది.
"ఎక్కువక్లోజప్ లుండాలి అందుకోసం ఎంత తీసుకోడమన్నది మనం మాట్లాడుకొందాం. అలాగే మద్రాసు పిక్చరులో, స్విమ్మింగ్ ఫూల్ సీన్ ఇంతవరకూ లేదు. మనమే తొలిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం" అన్నది మంజరి.
"అంటే -నువ్వు బేతింగ్ డ్రెస్ వేసుకోవాలన్న మాట" అన్నది కళ్యాణి.
"కాదామరి! ఏదో వో నావెల్టీ లేందే బాక్సాఫీస్ నిద్రపోతుంది." అన్నది మంజరి.
మొత్తానికి ఇద్దరూ కలిసి, ప్రసాద్ చేత "జే" ననిపించారు. ప్రతిదానికి తలూపటం అలవాటయిన కవిగారు, ఈ కొత్తకధ భేషుగ్గా ఉన్నదనటమే కాకుండా ఇంకొంచెం గుగ్గిలం పోగాకూడా వేశారు.
"అమ్మయ్యో! మీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండీ అమ్మాయిగారూ! మీరు సబ్జెక్ట్ చేసిన పాయింట్లు వండర్ గా ఉన్నాయి సుమా! మీరు చెప్పిన విధంగానే గనక కధరాస్తే అధ్బుతంగా ఉంటుందనడంలో నాకెలాంటి అనుమానమూ లేదు" అని కూడా అన్నాడు.
ఈ రకంగా రాసి కధలో, మంజరి హీరోయిన్ కళ్యాణి హీరోయిన్ వంటిది. హీరోను, మంజరి, కళ్యాణి కలిపి నిర్ణయిస్తారు. మిగతా ఆర్టిస్టుల విషయంలో కూడా వీళ్ళు సాయం చేస్తారు. మంజరి పాడవలసిన పాటలు వసంత పాడుతుంది. అందుకు వేరే ఇవ్వాలి. ఈ పనులన్నీ చేసినందుగ్గాను ముప్పయ్ వేలు మంజరి డిమాండ్ చేసింది. కళ్యాణి ఇంకో ఐదువేలు పెంచుక్కూచుంది. హీరోకు, మిగతా వాళ్ళకు, ప్రసాదే ఇచ్చుకోవాలి.
"చాలా ఎక్కువ" అన్నాడు ప్రసాదు.
"అయితే మనం ఈ టాపిక్ డ్రాప్ చేసి, ఇంకేదన్నా మాట్లాడుకొందాం" అన్నది కళ్యాణి.
ఆ సమాధానం విని మంజరికూడా రవంత నొచ్చుకొంది. అలాగని, తను కళ్యాణిని నొప్పించ నూలేదు. ప్రసాదును సర్ధనూలేదు. ఎలాచావడం?
"పోనీ మీ అభిప్రాయం చెప్పండి అందుబాటులోవుంటే చూదాం. మీరు కాష్ పే చేసినా అంతకంటే తక్కువకు ఎవ్వరూ రారు" అన్నది మంజరి.
ప్రసాద్ చెప్పిన అంకెకు కళ్యాణి వొప్పుకోలేదు.
"వేడుకమాటలు అనవసరమండి! నాకు పాతికివ్వండి. అక్కకు ముప్పయ్ ఇవ్వండి. హీరోను నారేటు కన్నా తక్కువకు బుక్ చేసే బాధ్యత మాది. మా కేమన్నా ఎక్సెస్ పేమెంట్ అనుకొంటే -ఆవార, హీరో బుకింగ్ లో మీకు కలిసొస్తున్నది కదా! ఎగ్రిమెంట్స్ లో చేరి పదివేలకన్న రాయడానికి లేదు. మిగతా ఎమౌంట్ జూనియర్ ఆర్టిస్టుల మీద సర్దుబాటు చేసుకోండి. ఇంతకుమించి నేను చెప్పవలసిందేమీ లేదు." అన్నది మంజరి తుది తీర్పునిస్తూ.
ప్రసాద్ "ఇంకోసారి ఆలోచించండి" అన్నాడు.
"ఇప్పటికే చాలా మార్జిన్ ఇచ్చాం. ఇక ఆలోచించవలసింది మీరే" అన్నది మంజరి.
ప్రసాద్ "సరే" నన్నాడు. రేపే మనం ఎగ్రిమెంట్స్ రాసుకొందామన్నాడా. మంజరి చెప్పినట్లుగా కధ తయారు చేయమని కవిగారికి పురమాయించాడు.
"ఈ పూట మిమ్మల్ని భోజనానికుండమందునుగానీ, ముందుగా చెప్పలేదండీ! మన్నించాలి" అన్నది మంజరి.
"థాంక్స్, ఫర్వాలేదు, వస్తాను" అంటూ ప్రసాద్ లేచాడు.
కవిగారు కూడా "వస్తానండమ్మాయిగారూ!" అన్నది కళ్యాణి సోఫాలో బారుగా పాడుకొంటూ.
"ఏంగొడవలు రావుగాదా?" అన్నది మంజరి.
"ఏమీ రావు. రేపు మూర్తిగారికో రావుగారికో ఫోను చెయ్యి. పిక్చరు నీ దేనను, కాకపోతే జయా బేనర్ మీద తీస్తున్నానను. ఇన్ కంటాక్సు బాధ తప్పుకోవడానికి ప్రసాదును ప్రొడ్యూసరుగా వుంచానను. తప్పకుండా వొప్పుకుంటారు. లేదా - కొత్తగా వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరికి కబురు పెట్టినా ఎగిరి గంతేసి వొప్పుకుంటారు" అన్నది కళ్యాణి.
"ఆపని కూడా కాస్త నువ్వే చేసి పెట్టాలక్కయ్యా!" అన్నది మంజరి.
"అలాగే" అన్నది కళ్యాణి.
అన్నదేగానీ ఆవిడ ధ్యాస ఇక్కడలేదు.
కళ్యాణి ముఖం నిమిషంలో మారిపోయింది. అంతదాకా ఉన్న ఉత్సాహం అస్తమించి విషాదచ్చాయలు, మోసులెత్తాయి. కళ్ళల్లో ఎర్రజీరలు చోటు చేసుకున్నాయి.
"ఏమిటక్కా -అలా ఉన్నావేం?" అన్నది మంజరి ఆదుర్దాగా.
కళ్యాణి పలకలేదు. రెండు కణతలూ లోపలికి నొక్కుకుంటూ కుర్చీలో కూచుండిపోయింది.
"చెప్పకూడదయితే తప్ప-"
"అదేంకాదు మంజూ! ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను.... నీ దగ్గర డబ్బేమాత్రముంది.?"
"రెండుమూడు వందలుంటాయేమో! కనుక్కోనా?" అన్నది మంజరి.
"ఇంట్లో కాదు బ్యాంకులో -నాకో పదిహేను కావాలి పీకల మీదికొచ్చింది. నీదగ్గరుంటే సర్దు" అన్నది కళ్యాణి.
"అలాగే! రేపు పంపుతాను."
"నన్ను రక్షించావు మంజూ! ఇన్ కంటాక్సు వారు నన్ను వేటాడుతున్నారనుకో. వాళ్ళేమో ఎగ్రిమెంట్సు ప్రకారం మన ఇన్ కం లెక్క గడతారు. వాటిల్లో సగానికి సగం కూడా మనకు రావు. రాలేదయ్యా అంటే వూరుకోరు. దావావేసి వసూలు చేసుకోక పోయావా అంటారు. కోర్టుల కెడితే ట్రబుల్స్ ఆర్టిస్టంటారు. వెళ్ళక పోతే డబ్బురాదు. అయినా మనం మాత్రం దేవుడా అంటూ చెల్లించాల్సిందే! నిన్నడగ్గూడదనుకుంటూనే అడిగాను." అన్నది కళ్యాణి.
"ఫర్వాలేదక్కాయ్! నా విషయంలో నువ్వలాంటి మొఖమాటాలు పెట్టుకోకు" అన్నది మంజరి.
"నువ్వుకాదంటే ఏం చేయాలో కూడా ఆలోచించాను. నాకారు, జువెలరీ మార్ట్ గేజ్ చేసిదాన్ని తరవాత ఎప్పుడో విడిపించుకొనేదాన్ని" అన్నది కళ్యాణి.
మంజరి భయంతో నిట్టూర్చింది.
"ఏం బ్రతుకులో మంజూ! మనజీవితాలకో అర్ధమంటూ లేకుండా పోతోంది. ఇదంతా ఎందుకు చేస్తున్నామన్న ప్రశ్నకు మనం చెప్పుకోగలిగే జవాబెమీ లేదు. బ్రతుకు ఎంత నీరసంగా,. నిస్తేజంగా వుంటుందంటే, హఠాత్తుగా ఏ రైలుకిందనో పడి ముక్కలు ముక్కలయి పోవాలనిపిస్తుంది. మళ్లా ఆ బాధంతా అనుభవంలోకి రావాలని కూడా ఉంటుంది. అయితే ఇవేమీ జరగవు, జరగబోవు. మనమిలా ఈ పంజరాల్లో ఉండవలసిందే!"
మంజరి కళ్ళార్పకుండా కళ్యాణికేసి చూడసాగింది.
"తలంతా నాదుగా ఉన్నదమ్మీ! ఇంట్లో ఏమన్నా ఉన్నదా?"
"ఆఁ "
వసంత, ఫ్రెజిడేరీలోంచి సోడాలు, సీసాలు పట్టుకొచ్చి మీద ఉంచింది.
కళ్యాణి ఆదమరచి నిద్రపోయింది గానీ మంజరికి చాలా రాత్రి మీ కంటిమీద కునుకే రాలేదు, చాలాసేపు ఆవిడ కళ్యాణిని చూస్తూ కూచుంది. ఆ తరువాత వసంత పడుకొన్న గదిలోకి వచ్చింది. ఓ టేబుల్ మీద, కొన్ని పాటల కాగితాలు, ప్రక్కనే రేడియో గ్రాము. ఓ షెల్ఫ్ లో రికార్డులూ దాని ప్రక్కనే టేపురికార్డరూ రెండు డజన్ల టేపులూ ఉన్నాయి. వీటికోసం తను అయిదారు వేలు దాకా ఖర్చు చేసింది. ఎందుకు చేయవలసి వచ్చిందన్న ప్రశ్నేలేదు. ఆ లెక్క కొస్తే, కళ్యాణి తనకు చేసిన సాయమంతా ఎందుకు చేసినట్లుట?
మంజరి ఏమితోచక టాం చూసింది. పన్నెండుదాటి పదకొండు నిమిషాలయింది. రాజమణి నిశ్చింతగా, మెడదాకా దుప్పటి కప్పుకొని పడుకొంది. వసంత నిద్రపోతోంది. చలపతి - నిద్రపోయే ఉంటాడు. డ్రైవరు - కారుదగ్గరగా కాంప్ కాట్ మీద నిద్రపోతున్నాడు. ఒక్క తనుమాత్రమే మేలుకొని ఉంది. తన కీపూట నిద్రపట్టదు. కనీసం పట్టే సూచనలు కనుచూపుమేరలో కూడా లేవు.
ఏమీతోచక ఆఫీసుగదిలో కొచ్చింది మంజరి, ఆరోజు వచ్చిన ఉత్తరాలన్నీ ఓ పక్కగా ఉన్నాయి. ఒక్కొక్క దాన్నేచింపి చూడసాగింది. అందులొ చాలా ఉత్తరాలు తన ఫోటోకోసం రాసినవి, కొన్ని ఉత్తరాలు తననూ తన నటననూ అభినందిస్తూ రాసినవి. కొంతమంది తనను "అక్కా" అనీ, "సోదరీ" అని సంబోధించారు. పది పదిహేను ఉత్తరాలు తనతో - కోరుతూ రాసినవి కింద సంతకాలైతే ఉన్నాయిగాని అడ్రసులులేవు. మంజరికి నవ్వొచ్చింది. ఒక ఉత్తరం ఎవరో ఎసోసియేషన్ వారు రాశారు. వారి వార్షికోత్సవం ఇంకో వారం రోజుల్లో ఉన్నదిట. ఆ సందర్భంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను తను ప్రారంభించాలట. ఒక అనాధ శరణాలయం వారు తన సహాయం కోరుతూ జాబురాశారు.
మరో ఉత్తరం - ఆకుపట్ట సిరాలతో అడ్రసు రాసి ఉంది - చూస్తూనే మంజరి కళ్ళు చిట్లించింది. ఆ దస్తూరీ కూడా తనకు పరిచయం ఉన్నదానిలాగే అనిపించిందామెకు, ముసురుకొంటున్న జ్ఞాపకాల నుండి తప్పుకొంటూ ఆ కవరు చింపింది మంజరి. అది మాధవరావు రాసింది. ఆపేరు చూడంగానే మంజరికి పాత సంగతులెన్నో జ్ఞాపకంలో మెదిలాయి. గుంటూరులో తన గత జీవితం, నాగమణి దయాదాక్షిణ్యాలమీద తను ఆధారపడటం నాటకాలు, రామచంద్రం కోటేశ్వరరావు, తగాదాలు - ఎన్ని గొడవలు!
మెల్లగా ఉత్తరం చదవసాగింది. మంజరి!
"చిరంజీవి మంగమ్మకు -
"ఇలా సాహసంగా నిన్నా పాతపేరుతోనే పిలుస్తున్నందుకు నీక్కోపం వస్తుందేమో మరి! అయినా, నిన్ను "మంజరి" అని పిలవడం, ఎంచాతో నాకిష్టంలేదు. నీకు రామచంద్రం కోటేశ్వరరావు జ్ఞాపకం ఉన్నారనుకొంటాను. వారే లేనప్పుడు, నేనూ ఉండి ఉండను. రామచంద్రం భార్య చాలా జబ్బున పడింది. ఏడాదినుండీ ఆస్పత్రిలోనే ఉంది. వాడిపొలంకాస్తా హరించిపోయింది గానీ, భార్యజబ్బు మాత్రం నాయమ్కాలేదు. ఈ మధ్య వాడు నీకు రెండు జాబులు రాశాడు. నీనుండి కనీసం జవాబన్నా వొస్తుందని ఆశించాడు. రాలేదు. వాడెంత బాధపడ్డాడో నేను చెప్పలేను. " ఆ సినిమా ప్రపంచంలో కెళ్ళినవాళ్ళకు మామూలు ప్రపంచం కనిపించదు. మామూలు మనుషులు మనుషులనిపించరు." అన్నాడు వాడు. నువ్వటువంటి దానివి కావని నాకిప్పటికీ నమ్మకముంది. నా సంగతి సరేసరి. కంపతోడుగు లాగినట్టు ఈ సంసారాన్ని లాక్కొస్తున్నాను. ఈ ఏడు పెద్ద దాని పెళ్ళి చేయాలనుకుంటున్నాను. పంట చూదామా, అంతత మాత్రంగా ఉంది. పొయ్యి మీదికి కుండెక్కడమే అంతంతమాత్రంగా వుంది. నీకు మేం జ్ఞాపకం ఉంటే, నీకు వీలయితే, ధర్మమని నువ్వు అనుకుంటే - రామచంద్రానికేమన్నా సాయం చెయ్యి, నువ్వలా చేస్తావన్న నమ్మకంతోనే వాడు నీకు రాశాడు. సహాయం చెయ్యాలని ఎక్కడా రాసిపెట్టలేదు. కేవలం ధార్మిక దృష్టితో అడుగుతున్నాను. తనయితే వొద్దనే వొద్దన్నాడు. నేనే వాడికి తెలీకుండా రాస్తున్నాను. నువ్వు పంపినా, పంపకపోయినా, నాకు సంతోషమే! నేనేమీ అనుకోను. నువ్వింకా పైకి రావాలనీ, ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదించాలనీ, నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ మధ్య నువ్వున్న పిక్చరొకటి చూశాను. అందులొ నీ యాక్షను నాకేమీ నచ్చలేదు. డైలాగ్స్ ఎందుకంత పట్టిపట్టి అనడం? సినిమాల్లో అలా అనడమే అవసరమయితే, నేను పొరపాటు పడ్డానన్నమాట. ఇలా అన్నందుకు కోపగించు కోకు. జవాబు - కనీసం జవాబురాయి. ఉంటాను"
కనీసం నాలుగు సార్లయినా ఆ జవాబు చదివి ఉంటుంది మంజరి. అందులోని ప్రతి అక్షరమూ తనను, పిండివేస్తున్నట్లుగా బాధ పడింది. రామచంద్రం తనకు జాబురాసిన జ్ఞాపకమే ఆమెకులేదు. రాసేఉంటే! ఈ విధంగా అతిముఖ్యమైన ఉత్తరాలు ఎన్ని తనదాకా రాకుండా పోతున్నాయోననుకొంది మంజరి! రామచంద్రం జాబురాస్తే, డబ్బు పంపకుండా ఉండటమన్న ప్రసక్తేలేదు. తను ఎందరికో ఎన్నో విధాలుగా సాయం చేసింది. రామచంద్రానికి చేస్తే తప్పేమిటట?
అప్పటికప్పుడే మాధవరావుకు జాబురాసింది మంజరి. అందులొ - తనకా ఉత్తరాలు- రామచంద్రం రాసినవి - చేరనేలేదని రాయలేదు. తను, గత నాలుగు వారాలుగా మద్రాసులో లేననీ ఔట్ డోర్ షూటింగుల నిమిత్తం మఫజుల్ కెళ్ళాననీ రామచంద్రం జాబులతో బాటుగా, మీ జాబుకూడా ఈపూటే చూశాననీ తనను అపార్ధం చేసుకోవడం భావ్యం కాదనీ, రాసింది. "అక్కడకన్నా మద్రాసులో వైద్య సదుపాయాలలు బాగా ఉంటాయి. రామచంద్రం గారిని భార్యతోసహా ఇక్కడికే రమ్మనండి, మా ఇంట్లో ఉండొచ్చు. మంచి డాక్టర్ నెవర్నయినా ఎంగేజ్ చేదాం. లేదా అక్కడే చేయించుకొంటానంటే వారిష్టం. అవసరమయినప్పుడు నాకు ఓ కార్డు రాయండి ఉన్నంతలో మీ కేలోపమూ జరుగదు." అని కూడా మంజరి రాసింది.
ఉత్తరం పూర్తిచేశాక మంజరికి ఏడుపూ, కోపమూకూడా కలిగాయి. ఆ ఉద్వేగంతోనే కుర్చీకి చేరబడి కళ్ళు మూసుకొంది. ఆవిడకు నిద్రపట్టలేదు. పూర్తి మెలకువగానూ లేదు.
మంజరిని ఆఫీసు కుర్చీలో తొలిసారిగా చూసింది తాయారు. ఇంతోసి కష్టం అమ్మగారు పడినందుకు, దాని గుండెలు నిజంగా అవిసిపోయాయి. అది తనంతతాను పడదిట్టుకొంటూ, మంజరిని మేడమీదికి - దాదాపు మోసుకొంటూ తీసుకొచ్చింది. మంజరి కింకా పూర్తి బద్ధకం వదల్లేదు. అలా తూలుకొంటూ వెళ్ళి మంచంమీద పడుకొని పదిగంటల దాకా నిద్రపోయింది.
ఉదయం ఆఫీసు గదిలో కొచ్చిన చలపతి, ఉత్తరాలన్నీ చించి ఉండటం చూస్తూనే జరిగిన విషయాన్ని గ్రహించాడు. ఈ పూట ఏదో కొంప మునుగుతుందనుకొన్నాడు. మంజరికి తనకూ, ఈనాటితో రుణం తీరిపోయిందని చలపతి గట్టిగా నమ్మాడు. అలాంటిదే జరిగితే తనేం చేయవలసింది కూడా అతను ఆలోచించి పెట్టాడు ఆ నిస్చయానికొచ్చాక, అతనికి దిగులూ విచారమూ లేకుండా పోయింది.
"అమ్మగారు పిలుస్తున్నారు" అంటూ కబురొచ్చింది.
"భగవాన్" అనుకొంటూ చలపతిలేచాడు.
"కూచోండి" అన్నది మంజరి. చాలా తాపీగా.
అతను కూచున్నాక -
"ముఖ్యమైన ఉత్తరాలు ఏమన్నా ఉంటే నాకు పంపుతుండండి" అన్నది మంజరి.
"అలాగే!" అన్నాడు చలపతి.
మంజరికిక మాట్లాడడానికేమీ మిగలదనుకొన్నాడు చలపతి.
"అయితే -ఏవి ముఖ్యమైన ఉత్తరాలో మీకెలా తెలుస్తాయి?" అన్నది మంజరి.
"ఆమాట నిజమే!" అన్నాడతను.
"అందుకని వచ్చిన టపా అంతా, నాకు పంపుతుండండి! నేనే చూసుకొంటాను"
చలపతి పలుకలేదు.
"రాత్రి నేను టపా చూశాను. అందులో వో ముఖ్యమైన ఉత్తరం ఉంది. లోగడ "రామచంద్రం" అనే వారెవరైనా నాకు జాబు రాశారా!" అన్నది మంజరి.
రాశారేమో నాకు జ్ఞాపకం లేదు. ఆ పేరుగలవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఉత్తరాలన్నీ మీకు తెచ్చివ్వమంటారా?"
"ఊఁ"
"అలా అయితే మీకు మరీ కష్టం. వచ్చిన ప్రతిచెత్తనూ మీరు చూడడానికి టైముండాలికదా! అందుకని, చాలాభాగం నేనే చూచి పారేస్తున్నాను. ఫోటోలు కావాలనీ, చందాలు కావాలనీ, ప్రారంభోత్సవాలకు రమ్మనమనీ రాస్తుంటారు. ఇవన్నీ చూడటం మీకు సాధ్యమా" అన్నాడు చలపతి.
"దీనికేదన్నా ఇంకోమార్గం చూదాం మీరు వెయ్యిరూపాయలకో డ్రాప్టు తెప్పించండి. రామచంద్రం పేరుమీదుగా గుంటూరులోని బాంకుకు ఈ ఉత్తరంతో కలిపి పంపించండి"
"అలాగే!"
చలపతి వెళ్ళిపోయాక, పకపకలాడుతూ, కళ్యాణి వచ్చింది.
"అంత త్వరగా వదిలావేం మంజూ? నువ్వతనితో దెబ్బలాడుతా వనుకొన్నానే!" అన్నది కళ్యాణి.
"నాకీ మూడ్సు బాగాలేవు.
"రావుగారు వచ్చారు. రమ్మంటారా?" అంటూ చలపతి స్వయంగా పైకి కబురు పట్టుకొచ్చాడు.
మంజరి, కళ్యాణి వొకరినొకరు చూసుకొన్నారు. రావుగారేమిటి? తనింటికి రావడమేమిటి?"
మంజరి, కళ్యాణి కూడా ఆదరా బాదరా కిందికొచ్చి చూసేసరికి మామూలుగా ఓ కుర్చీలో కూచుని ఉన్నాడు.
"నమస్కారమమ్మా! మీకూనండీ కళ్యాణి గారూ!" అన్నాడు రావు.
"మీతో ఓ చిన్న పనుండి వచ్చాను. మీరు బిజీగా లేకపోతే పది నిమిషాలు-"
చలపతి అవతలికెళ్ళిపోయాడు.
"ముందుగా కబురన్నా చేయక పోయారా బాబూ!" అన్నది కళ్యాణి.
"ఇప్పుదేమన్నా అర్జెంట్ పని ఉంటే నేను తరవాత వస్తాను" అని లేవబోయాడు రావు.
"అందుగ్గాదు. మేమే వచ్చేవాళ్ళం గదా" అన్నది మంజరి.
"మరేం ఫర్వాలేధంమా! ఏదో పనుంది పోతూపోతూ ఇలా వచ్చాను" అన్నాడు రావు, మెల్లగా సిగరెట్ వెలిగించుకొంటూ. "మీతో ఓ చిన్న ఆబ్లిగేషన్ ఉన్నదమ్మా! మీరు కనీసం నాకోసమన్నా వోప్పుకోవాలి. మరేంలేదు -మన నారాయణ పిక్చరు తీస్తానంటున్నాడు. నన్నడిగితే సరేనన్నాను. హీరోయిన్ గా మీ పేరు సజెస్టు చేశాను. వొప్పుకొన్నాడు మీ ఉద్దేశం కనుక్కొందామని వచ్చాను."
"అతడు సరిగా పేచెయ్యడని విన్నానండీ!" అన్నది మంజరి.
"అదీ నిజమే!" అన్నాడు రావుగారు. "మీకా భయంలేదు డబ్బు పూచీ నాది. కధ కూడా నేనే తయారు చేయిస్తున్నాను. ప్రతి ఇన్ స్టాల్ మెంటూ మీకు డిస్ట్రిబ్యూటరిస్తాడు. నా మీద నాకు నమ్మకమే గదా! కధ నచ్చితే మీకు అగ్రిమెంటు పంపుతాను."
"అలాగే! చాలా థాక్సండీ! ఈ సంగతి చెప్పడానికి మీ రింతదూరము రావాలా బాబూ, ఫోను చేస్తే నేనే వద్దునుగదా!" అన్నది మంజరి.
"ఫర్వాలేదు మరి నేనొస్తాను" అంటూ రావుగారు వెళ్ళారు.
"అసాధ్యుడు" అన్నది కళ్యాణి కింది పెదవి కొరుక్కొంటూ. "నిజంగా ఈ ఫీల్డుకు సరిపోయిన మనిషి మంజూ! ఎంత తెలివైన వాడంటే-"
"ఊ" అన్నది మంజరి.
"అతనితో పోల్చడానికి ఇంకెవరూ లేరు. ఎలా నేర్పుగా వ్యవహరించాలో, ఎంత తియ్యగా మాట్లాడాలో మనం రావుగారి నుండి నేర్చుకోవాలనుకొంటాను. అతనేది మాట్లాడినా, చాలా ఆలోచించి గానీ అనడు."
"అలాగా?" అన్నది మంజరి.
"నారాయణ దాదాపు ఇరవై వేలు సున్నా చుట్టాడు. అయినా రావుగారు కిమ్మనలేదు. ఇంకొకరితో చెప్పనూలేదు. ఇప్పుడు మళ్లా అతని పిక్చర్లో వేషం వేస్తున్నాడు. నువ్వయితే ఏం చేస్తావే?" అన్నది కళ్యాణి.
"ఇంతవరకూ నాకిలాంటి సమస్య రాలేదక్కా!" అన్నది మంజరి.
"ఒకవేళ వచ్చిందనుకో? అప్పుడు?"
"నిర్మొహమాటంగా కాదంటాను" అన్నది మంజరి.
"అవునా! అందువల్ల, నీకు రావలసింది రాకపోగా అనవసరంగా ఒక చాన్సు కూడా పోగొట్టుకొంటున్నావన్న మాట! రావుగారయితే అలా చేయరు. చెయ్యలేరు కూడాను, ఆయన, నారాయణ చేత పిక్చరు తీయిస్తున్నాడు. అందులో తను హీరోగానూ., నిన్ను హీరోయిన్ గా నూ బుక్ చేశారు. చేసినట్టేననుకో, ఆ పిక్చర్లో తన డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీకే యిప్పిస్తున్నాడు. అంటే - పౌతిఫిలిం డబ్బు కొత్త ఫిలిం డబ్బు కూడా అతను వసూలు చేసుకుంటున్నాడన్నమాట. అయన ఎంతో కొంత పెట్టుబడి ఎటుగూడి పెడుతున్నాడు. ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ ఆ పిక్చర్ తీసుకోపోడు. అలాకాకుండా, మంచి కధ మంచి కాస్టింగ్, ఇప్పించాడనుకో, ఎన్ని విధాలుగా లాభించిందో నువ్వే ఆలోచించు" అన్నది కళ్యాణి.
మంజరి ఆశ్చర్యపోయింది. నిజంగా ఇది తనకు సరికొత్త అనుభవం!
"మరి మనం రావుగారితో జయావారి స్కీంను గురించి చెబితే బాగుండేది కదూ?" అన్నది మంజరి.
"నిజమే గానీ మనకా అవకాశం ఇప్పుడు లేదు. తానిలా అడిగినందుకు మనం ప్రతిగా ఈ స్కీం చెప్పామనుకొంటాడు. ముందుగా మూర్తిగారినడుగుదాం. ఆయన వొప్పుకుంటే సరేసరి, లేదా ఆ రెండు టౌన్ల డిస్ట్రిబ్యూటింగ్ రైట్సు నువ్వు తీసుకో. ఇంతలాభం చూచుకొని మరో కంపెనేకి అమ్మేసేయ్. హీరోకు నువ్వే డబ్బిచ్చెయ్, పోయిందేముంది గనక?" అన్నది కళ్యాణి.
"అంతడబ్బు కావద్దా?" అన్నది మంజరి.
కళ్యాణి ఓ నిమిషంపాటు ఏమీ పలుకలేదు.
"కావాలి, అలాగని అవకాశాన్ని జారవిడుచుకోవడం మాత్రం తెలివైన పనికాదు.. రాజన్ ఉన్నాడు గదా! అతడేమన్న సర్ధగలడేమో చూద్దాం, లేనప్పుడు ఇంకేదన్నా ఆలోచిద్దాం" అన్నది కళ్యాణి.
ఏదో విషయాన్ని తనకు చెప్పకుండా కళ్యాణి దాచిపెడుతున్నదని మంజరి గ్రహించింది. డబ్బు గురించి అంత భరవాసాగా అంటున్నదంటే, ఏదో గట్టిసోర్సు కళ్యాణికి తెలిసి ఉండాలనీ, సమయం వచ్చినప్పుడు గానీ ఆ విషయం కళ్యాణి బయట పెట్టదనీ మంజరి అనుకొన్నది.
ఆ విషయమై వారిద్దరూ ఏమి అనుకోలేదు.
మూర్తి గారికి ఈ స్కీంను గురించి చెప్పినప్పుడు, ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడాడు.
"నన్ను మన్నించాలమ్మాయ్! నాకిటువంటి వసవసలేమీ పనికిరావు. నేను డబ్బు మనిషిని. దేశసేవనీ, సంస్కృతిని ఉద్దరించడమనీ, నానా చెత్త వాగడం నాకు గిట్టదు. మనలో ఎవ్వరూ వీటి కోసం కట్టుకుపోవడం లేదు. ఒక్కదమ్మిడీ వొదులుకోవడం లేదు. మామూలుగా నారేటు చొప్పున నాకివ్వు. నీకేదో ఇంటరెస్టున్నదంటున్నావు గనక ఇంకో అయిదు వేలు తగ్గించుకో" అన్నాడు మూర్తి.
"పోనీ మీరింకోసారి ఆలోచించి చూడండి. మళ్లా కలుస్తాను" అన్నది మంజరి.
"లాభంలేదు అయినా అన్నాను కూడా అడిగి చూస్తాను ." అన్నాడు మూర్తి.
ఈ వ్యవహారం నీళ్ళు కారిపోయినట్లే ననుకొన్నది మంజరి. అయితే కళ్యాణి సలహామీద రావుగారితో, ఈ ప్రతిపాదనను ఇంకో రూపంలో తీసుకొచ్చింది.
"నేను -మీ రడిగినట్లుగానే., నారాయణగారి పిక్చరులో పని చేస్తాను. నాకు చిల్లి దమ్మిడీ వద్దు. దానికి బదులుగా మీరు ఈ పిక్చరులో పనిచేసి పెట్టండి!" అన్నది మంజరి.
రావుగారు ఇంకో ఆలోచన లేకుండా వొప్పుకున్నాడు. తను గానీ, తన డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీగానీ, చిల్లిదమ్మిడి ఇవ్వకుండా మంజరి పనిచేసి పెడుతుంది. అందుగ్గాను తనకింకో పిక్చర్ లో వేషం దొరికింది. ఇందులో తను నష్టపడవలసిందేమీ రావుగారికి కనిపించలేదు.
రెండు వారాలు తిరక్కుండానే, మంజరి చాలా మంది ఆర్టిస్టులను, ప్రసాద్ పేరుమీదుగా బుక్ చేసింది.
"మీరు పిక్చరులో పనిచేసి పెట్టండి, నేను పనిచేసే మిగతా పిక్చర్లలో మీకు వేషాలిప్పిస్తాను" అన్నది మంజరి.
ఈ మందు బ్రహ్మాండంగా పనిచేసింది. మంజరికున్న పలుకుబడి ఎలాంటిదో ఫీల్డులో చాలా మందికి తెలుసు. ఆవిడ కన్నా పెద్దవారు - ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళతో, ఎప్పుడు వో మంచిముక్కన్నాచాలు, వేషాలు దొరుకుతాయి. ఓ పిక్చర్ లో పది రూపాయలు తక్కువొస్తే గనక?
పిక్చర్ ప్రారంభోత్సవం చాలా అట్టహాసంగా ఏర్పాటు చేసింది. మంజరి ఇందుకోసం పనిమాలా రాజన్ ట్రిచ్చినుండి వచ్చాడు. అసలు అతని చేతనే కెమెరా స్విచాన్ చేయిస్తానన్నది మంజరి. కళ్యాణి పగ్గాలు బిగాలాగకపోతే అంతపనీ చేసేదికూడాను.
"పిచ్చిదానా, నీ పైత్యమంతా వొక్కసారే వెళ్ళబోసుకోకు. రాజన్, నా కన్నా నీకు దగ్గరవాడు కాదు. అతగాడేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు. నీ కిష్టమయితే ఇంకో పనిచెయ్యి!" అన్నది కళ్యాణి.
'ఏమి'టన్నది మంజరి.
బాంబే నుండి 'లాలారాం' వచ్చాడు. హాపీ సెంటర్ లో ఉన్నాడు. నువ్వెళ్ళి అతన్ని రిక్వెస్టు చెయ్యి. అతన్ని వొప్పించగలిగితే 'నీ రొట్టె విరిగి నేతిలో పడిందన్నమాటే!' అని సలహా ఇచ్చింది కళ్యాణి.
"అనుకోడు. ఎందుకంటే, నువ్వూ వాడూ కలిసివెళ్ళి లాలారాంను అడుగుతున్నారయ్యె. అతగాడేమో, ఆలిండియా ఫిలిండైరెక్టరయ్యే. అవసరమైతే, ఈ పిక్చర్ నే నువ్వు హిందీలోకి డబ్ చేసి నార్తులో రిలీజ్ చేదామని కూడా అనుకొంటున్నావయ్యె. అందుకోసం లాలారాం సహాయం నీకు తప్పకుండా కావాలాయె. ఇన్ని జరగవలసి ఉండగా ఎవడో గన్నాయ్ ఏదో అనుకొంటాడంటావేం! అనుకొంటే మాత్రం మనకు పోయేదేమిటి? ఈ దేశంలో రాజన్ వొక్కడే ధనవంతుడు కాదు. ఇంకా చాలామంది ఉన్నారు." అన్నది కళ్యాణి.
"ఆల్ రైట్!" అన్నది మంజరి ఉత్సాహంగా.
ఈ ప్రయత్నాన్ని గురించి రాజన్ తో చాలా నేర్పుగా చెప్పింది మంజరి.
"మన పిక్చరుకు మనమే స్విచాన్ చేసుకోవడమేమిటండీ నీ బొంద. అలా అంటేగానీ మీరు రారని అన్నాను. అయినా మీరా గొడవల్లో పడితే, నేను జ్ఞాపకం రాననుకొంటాను. కనీసం వారానికొకసారైనా కనిపించమని మీ కెన్నిసార్లు చెప్పినా వినిపించుకోరాయే; ఎలా మీతో వేగడం?" అన్నది మంజరి.
రాజన్ ముసిముసిగా నవ్వాడు.
"లాలారాం వచ్చాట్ట. హాపీసెంటర్ లో ఉన్నాట్ట. మనం వెళ్ళి ఇన్ వైట్ చేద్దాం. ఎలాగైనా ఆలిండియా మార్కెట్ ఉన్న డైరెక్టరు. మన కధనచ్చితే, హిందీ రైట్ అతను కొనగలడు....డబ్బుమీరు పెడుతున్నా, దాన్ని పదిలంగా తిరిగిమీకు వొప్పగించవలసిందాన్ని నేనే గదా!" అన్నది మంజరి.
ఈ కారణాలన్నీ సబబైనవే! రాజన్ కు నచ్చడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఇద్దరూ ప్రయాణమవుతుండగా కళ్యాణి ఇంకో సంగతి చెప్పుకొచ్చింది.
"లాలారాం ఊరికే ఇక్కడికి రాలేదే పిచ్చిదానా! ఆయన పిక్చరుకు సిటీలో డిస్ట్రిబ్యూటర్ని
మాట్లాడుకొందుకువచ్చాట్ట. మెహతాతోగానీ, కిశోర్ తోగానీ, నేనీలోగా ఫోను చేయిస్తాను. నువ్వు బయలుదేరు" అన్నది కళ్యాణి.
వీరు వెళ్ళేసరికి లాలారాం వీరికోసమే ఎదురుచూస్తున్న వాడిలాగా కనిపించాడు.
రాజన్ ను చాలా హై స్టైల్లో పరిచయం చేసింది మంజరి.
మంచినీళ్ళ ప్రాయంగా ఆవిడ ఇంగ్లీషులో మాట్లాడుతుంటే లాలారాం విస్తుపోయాడు.
"సౌతిండియన్ స్టార్స్ అట్టే చదువుకున్నవారు కాదని నాకెవరో చెప్పారు. ఇప్పుడుగానీ, అది అబద్దమనుకో లేదు." అన్నాడు లాలారాం.
తనకిలాంటి అవకాశం ఇచ్చినందుకు, మంజరినీ, రాజన్ ను కూడా అతను అభినందించాడు.
"భాషాభేదాలు, ప్రాంతీయ భేదాలు ఇంకేవరికన్నా అవసరమేమోగానీ, కళాకారులు వీటన్నింటికీ అతీతులు, ప్రజలకు విజ్ఞాన వినోదాలను కలిగించడం ద్వారా, వారు నిజమైన ప్రజా సేవచేస్తున్నారు" అన్నాడు లాలారాం స్విచాన్ చేస్తూ. "మనం భారతీయులం ఆసేతు హిమాలయ పర్యంతం ఉన్న భారతీయులందరూ వొక్కటే: భారతీయాత్మ ఒక్కటే! మనకు ఇతర విభేదాలేమీ లేవు. మన మందరం, కళాస్వరూపమైన ఈ పరిశ్రమలో కార్మికులంతా పనిచేస్తున్నాం" అని కూడా లాలారాం అన్నాడు.
ఆ తరువాత, మెహతా, రాజన్, మంజరి మాట్లాడిన పిమ్మట ప్రసాద్ వంతు వచ్చింది.
"సినిమా కళ - విచ్ఛిన్నమైన జాతీయైక్యతను సాధిస్తున్న దానడానికి ఇప్పటి సంఘటనే పెద్ద ఉదాహరణ. తెలుగువారు, తీస్తున్న పిక్చరుకు తమిళులైన రాజన్ గారి అండదండలున్నాయి. బొంబాయి డైరెక్టరు ప్రారంబోత్సవం చేస్తే అహమ్మదాబాదు వ్యక్తి ఆశీర్వదించాడు." అన్నాడు ప్రసాద్.
* * * *
ఒక్క పిక్చరు తీయడానికి నాలుగైదు సంవత్సరాల టైము అవసరం లేదనీ,
అందరూ టీం వర్కుగా ఫీలయి పనిచేస్తే, అయిదారు మాసాలకొక పిక్చరు తీయవచ్చునని మంజరి అనుభవ పూర్వకంగా గ్రహించడమే కాకుండా, మిగిలినవారికి కూడా రుజువు చేసింది.
అయితే అందరకూ ఇలానే అన్నీ కలసిరావు. తగినంత డబ్బులేకా, డబ్బుంటే ఆర్టిస్టుల సహకారంలేకా, ఇవి రెండూ ఉన్నప్పుడు ముడి ఫిలిం లేకా, అన్నీ కుదిరినప్పుడు స్టూడియోలు ఖాలీలేక, డిస్ట్రిబ్యూటరు గొంతెమ్మకోరికలను తీర్చలేకా, చాలా సినిమా కంపెనీలు ఈసురోమంటూ, సంవత్సరాలకొద్దీ, ఒకే పిక్చారును, ప్రొడ్యూస్ చేస్తూ, దానిమీద అపరిమితమైన ఖర్చులుచేసి, అవన్నీ రాక, నామరూపాలు లేకుండా నశించిపోతూ ఉంటాయి. పూర్తయి కూడా విడుదలకు నోచుకోని సినిమాలు, సగంలో ఆగిపోయిన సినిమాలూ, అసలు పిక్చర్ ప్రారంభం కాకముందే, మూసేసుకొన్న సినిమా కంపెనీలూ, బోలెడున్నాయి.
మంజరి - ఈ బాలారిష్టాలన్నిటినీ చాలా చాకచక్యంగా తప్పుకొన్నది. అడిగినప్పుడల్లా వేలకువేలు గుప్పించాగల రాజన్ చేతిలో ఉన్నాడు. ఈ సినిమా వంకతో రాజన్ నుండి చాలాసార్లు, చాలా పెద్ద మొత్తాలు పుచ్చుకొన్నది మంజరి. ఒకసారి రాజన్, కాస్త విసుక్కొన్నందుకు మంజరి ముక్క చీవాట్లు వేసింది పైగా.
"ఈ డబ్బంతా నేను మింగడంలేదు. మీ పిక్చర్ కె పెడుతున్నాను. అణాపైసలతో సహా నా దగ్గర లెక్క రాసివుంది. మీకే క్షణాన కావలసినా ఎకౌంటు బుక్సు చూసుకోవచ్చు. నేనేదో తింటున్నానని అనుమానం మీకుంటే మీరే ఇక్కడ ఉండి అన్నీ స్వయంగా చూసుకోరాదా? మీ పని నేను చేసి పెడుతున్నందుకు, నాకేదన్నా ప్రజంట్ చెయ్యడం పోయి, విసుక్కుంటే అర్ధమేమిటి? రేపు వేళకు వేలు లాభాలోస్తే మీరు తీసుకొంటారు గానీ, నాకేమన్నా ఇస్తారా?" అని ఝాడించింది మంజరి.
"ఏం లాభాలో ఏం లోకమో!" అన్నాడు రాజన్.
"అంత నమ్మకం లేనివాళ్ళు - అసలీ గొడవల్లోకి ఎందుకు దిగారండీ బాబూ! దమ్మడీలతోసహా లెక్క చెప్పడానికి నేను సిద్దంగా వున్నానంటే మీరు చప్పరిస్తారేమిటి? మీ ధోరణి చూస్తుంటే అనవసరంగా, దోవనబొయ్యే తద్దినాన్ని నెత్తికెక్కించుకొన్నానా - అనిపిస్తోంది. ఈ క్షణంలో నాకూ నీ కంపెనీ వ్యవహారాలకూ రాం రాం. అందరికీ పారేసినట్లు, నాకిచ్చేదేదో పారేయండి. సలాంలు కొడుతూ పనిచేసిపోతాను. కూడూ నీళ్ళు లేకుండా, రాత్రిం బావల్లు ఈ దిక్కుమాలిన కంపెనీతో నేను చావడమేమిటి? ఇన్ని అనుమానాలు కడుపులో పెట్టుకొని, నాప్రక్కనే పడుకోవడానికి మీకు సిగ్గువెయ్యడం లేదా? పైగా ఎందుకలా దొంగ నవ్వులు నవ్వుతారు?" అని దులిపేసింది మంజరి.
ఆ మానవుడు మళ్లా నోరెత్తితే వొట్టు.
ఈ కంపెనీవల్ల ఇంకో లాభంకూడా జరిగింది. తనకు ఇతర కంపెనీల నుండి రావలసిన డబ్బును మంజరి పిండి పారేసింది.
"మీరేమో మీ ఇబ్బందులు చెబుతారు. నే నెవరికి చెప్పుకోను మరి? మీకు మల్లేనే నేను అవతల ఆర్టిస్టులకు డబ్బివ్వాలంటారా లేదా? అందులోనూ చాలా మందిని నెల జీతాలమీద కుదిర్చాను. నేను తిన్నా తినకపోయినా, నెలాఖరుకు ఐదువేల రూపాయలు అలా ఠంగున చెల్లించాల్సిందే! నాలుగు కంపెనీలవారూ నన్నిలా తిప్పితే నేనేం కావాలి? నేనూ నావాళ్�
