"నవీన్!" నై గట్టిగా పిలవాలని ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుంది. కానీ ఆమె వశం కాలేదు. అంతులేని వ్యాకులత, నీరసం వలన ఆమెకి శోష వచ్చింది. నెమ్మదిగా ఆ బెంచీమీద ఆమె వాలిపోయింది.
* * *
కాలచక్రం తిరుగుతూనే వుంటుంది. అది ఎవరికోసం ఆగదు.
దయామణి డిశ్చార్జి అయి ఇంటికెళ్ళిపోయింది.
నవీన్ కి ఆఫీసులో వేరే ఉద్యోగం ఇచ్చారు ధర్మానందరావుగారు.
ధృతి, నవీన్ ఒకరికొకరు ఎదురుపడినా తప్పుకుపోతున్నారు. ధృతి తనంతట తాను పలకరించాలని ప్రయత్నించినా మొదట్లో అతను ఆస్కారం ఇవ్వలేదు.
నవీన్ ప్రేమ్ ని కలిసి అతని డబ్బు వడ్డీతో సహా తీర్చేస్తానని అన్నట్లు ప్రేమ్ ద్వారా తెలుసుకుని నిట్టూర్చింది. అతని పట్టుదల ఆమెకి తెలుసు. ఇక దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడతాడు.
గాయత్రీదేవి అవసరమున్నప్పుడల్లా తన అభిజాత్యం ప్రదర్శిస్తూనే వుంది.
ధృతి చాలా శాంతంగా వుండగలుగుతోంది.
సీతారామయ్య, సుభద్రా ఆమె మౌనాన్ని పెళ్ళికి అంగీకారంగా భావించి పొంగిపోతున్నారు.
ధృతికి ఎవరిమీదా కోపం కలగడంలేదుకాని ధర్మానందరావు గారిని తలుచుకుంటూ వుంటే మాత్రం ఎనలేని బాధ కలుగుతోంది. ఈ జరుగుతున్న నాటకమంతా ఆయన విజయంగా భావించుకున్నట్లు వూహించుకుంది ఆమె.
మరునాడే అనుకోని విధంగా ఆమె ఆయన్ని కలవాల్సొచ్చింది. కారులోకి ఎక్కబోతున్న ఆయన దగ్గరకు రయ్యిమని వచ్చి "మీరు నాతో ఒక చోటుకి అర్జెంటుగా రావాలి" అంది.
ఆయన ఎర్రగా కందిపోయిన ఆమె మొహాన్నీ, ఆవేశంతో వణుకుతున్న శరీరాన్నీ చూసి "ఎక్కడికి?" అన్నారు ఆశ్చర్యంగా.
"లీలని చూడడానికి ఆమె హాస్పిటల్లో వుంది" అంది.
"లీలకి ఏమైంది?"
"కారులో చెపుతాను" అంది క్లుప్తంగా.
ఆయన ఓ క్షణం ఆలోచించి "పద" అన్నారు.
లీలది ఎవరి గురించీ పట్టించుకోని స్వభావంలా గోచరించేది. ఎవరితోనూ చెప్పకుండా పెళ్ళి చేసుకున్న చెల్లెలి గురించీ, లాటరీ టిక్కెట్ల పిచ్చి నాన్నని గురించీ బాధపడినట్లు ఎప్పుడూ కనిపించలేదు. పైగా నవ్వుతూ వాళ్ళ గురించి వర్ణించి చెప్పేది. అటువంటి అమ్మాయిలోనూ కనిపించని మమకారం దాగివుందనీ, తనవాళ్ళపట్ల అంతులేని ఆప్యాయతానురాగాలు అజ్ఞాతంగా అణచిపెట్టబడి వున్నాయనీ తెలిపే సంఘటన జరిగింది.
లీల అక్కకి రెండు కిడ్నీలూ పాడయిపోయాయి అన్న విషయం విన్న వెంటనే నిర్ణయం తీసేసుకుంది, తన కిడ్నీ ఒకటి అక్కకి ఇచ్చేయాలని అమలు జరిపేసింది కూడా.
ధర్మానందరావుగారిని ధృతి వెంటబెట్టుకురావడం చూసి లీల విపరీతమయిన ఆశ్చర్యానికి లోనయింది. లేవలేని పరిస్థితుల్లో ఆయనకి తలతో అభివాదం చేయబోయింది.
ఆయన తన రెండు చేతులూ జోడిస్తూ "కనిపించని ఆ భగవంతుని కన్నా ఓ ప్రాణదానంచేసిన నువ్వు నిస్సందేహంగా గొప్పదానివమ్మా" అన్నారు.
ఆమె బలహీనంగా నవ్వి "నా గొప్పతనం ఏమీలేదు సార్! అక్కపోతే ఆ అనాధ పిల్లల్ని కూడా నేనే పెంచవలసి వస్తుందనే స్వార్ధమంతే" అంది.
ధృతికి కళ్ళనిండుగా నీళ్ళు చేరాయి. గొప్పతనాన్ని ప్రదర్శించుకోకపోవడం నిజమయిన గొప్పతనం. సెలయేరులా గలగలా ప్రవహించే ఈ అమ్మాయి మనసు సముద్రమంత లోతన్నమాట అనుకుంది.
లీల బావ భార్యకి పరిచర్యలు చేస్తూ కనిపించాడు.
లీల చెల్లెళ్ళూ, తల్లిదండ్రులూ, తాతగారూ, తమ్ముడూ అందరూ ఆరాటంగా ఆస్పత్రి వరండాలో తిరుగుతూ కనిపించారు. అందరి మొహాలలో ఆమె పట్ల ఆప్యాయథా, ఆందోళనా కొట్టవచ్చినట్లుగా కనిపిస్తున్నాయి.
ధృతి కారు బయల్దేరాక "చూశారా రక్తపాశం ఎంత బలమైందో?" అంది.
ధర్మానందరావుగారు వెంటనే జవాబు చెప్పలేదు. చాలా గంభీరంగా కనిపించారు. నెమ్మదిగా తలతిప్పి ధృతివైపు చూస్తూ "ఋషులంటే అడవుల్లో ముక్కు మూసుకుని తపస్సు చేసేవాళ్ళు కాదు. కాస్త తపోభంగం అవగానే కళ్ళుతెరిచీ, కామించీ, కోపించీ, శపించేవాళ్ళు కానేకాదు. ఋషులంటే ఈ నవనాగరీక జనారణ్యంలో స్వార్ధం తమచుట్టూ కరాళ నృత్యం చేస్తున్నా పట్టించుకోకుండా తమ జీవనపంథా తాము వదిలిపెట్టనివాళ్ళు. జీవితంలో 'అప్ అండ్ డౌన్స్' వచ్చినా దేనికీ అతిగా స్పందించకుండా ఒకేలా బేలన్స్ డ్ గా ప్రవర్తించేవాళ్ళు. ఆనందాన్ని, విషాదాన్ని పగలూ, రాత్రీ అంత తేలిగ్గా తీసుకోగలిగేవాళ్ళు" అన్నారు.
ధృతి ఆయన మాటలు అర్ధంచేసుకుంటున్నట్లుగా శ్రద్దగా వింది. ఆమెకి లీల వ్యక్తిత్వం అపురూపంగా అనిపించింది. ఎన్నడూ తనలా ఆమె నాకు కొన్ని సిద్దాంతాలున్నాయి, ఆశయాలున్నాయి అని చెప్పుకోలేదు. కానీ హిమాలయాలంత ఎత్తుగా, అవలీలగా ఎదిగిపోయి కనిపిస్తోంది ఇప్పుడు.
"ఋషి అంటే ఏమిటో అద్బుతంగా చెప్పారు" అనుకుంటూ ధర్మానందరావుగారికేసి చూసింది. కళ్ళు మూసుకుని, వెనక్కి జారగిలబడి కూర్చున్న ఆయన కూడా ఆమె కళ్ళకి ఒక ఋషిలా కనిపించారు.
* * *
సుభద్ర పెద్ద గొంతుతో చెపుతోంది. "గాయత్రీదేవిగారు కబురు చేశారు. వచ్చేనెల మొదటివారంలోగా ముహూర్తాలు పెట్టేసుకోవాలని. రెండవ వారంలో వాళ్ళు వెళ్ళిపోవాలట."
సీతారామయ్య "ఊ....ఊ...." అంటూ ఆనందంగా తల వూపుతున్నారు.
ఏదో పుస్తకం చదువుతున్న ధృతి చటుక్కున తలెత్తి చూసి "ముహూర్తాలు ఎందుకమ్మా?" అనడిగింది.
తల్లీ తండ్రీ యీ అనుకోని ప్రశ్నకి మొహమొహాలు చూసుకుని "అదేం ప్రశ్న? నీ పెళ్ళికే" అన్నారు.
"నా పెళ్ళా? ఎవరితో?" అంతకన్నా ఆశ్చర్యం వెలిబుచ్చింది ధృతి.
"ఏమిటా తలతిరుగుడు మాటలు? ప్రేమ్ తో నీ పెళ్ళి నిశ్చయించినట్లు తెలియదా?" అంది సుభద్ర ఆయాసపడిపోతూ.


