Home » Krishna - (Mulam Venugopl) » Vasthava Gadhalu



    "అమ్మయ్యో! మా అమ్మా వాళ్ళు నా కోసం వెతుకుతారు' అని చెప్పింది రజని.
    "ఫరవాలేదు. నేను చేపుతానుగా. ఈ రాత్రికి ఇక్కడే పడుకో. తెల్లవారిన తరవాత నేనే మీ ఇంట్లో దిగబెదతాను నిన్ను."
    రజనికి భయం వేసింది. కానీ, టీచర్ మాటను కాదనలేక పోయింది.
    అందరూ భోజనం చేశారు. మళ్లీ మధ్యగది లోకి వచ్చారు.
    సాయంకాలం నుంచీ రాజు చూపుల్నీ, చేష్టల్నీ నిశితంగా గమనించ సాగింది వెంకటమ్మ. ఆకలి గొన్న ప్రాణి లా అతను సంచరించాడు. అతని చూపులు రజని మీద కేంద్రీకరించాయి.
    రాత్రి పడుకోండయింది. అప్పుడు లేచారు నిద్రకు. కొడుకు బలరామ్ కూతూరు సీతా బయట పడుకున్నారు.
    లోపలి గదిలో రజని వద్ద వెంకటమ్మ పడుకుంది. రజని నిద్రపోగానే వెంకటమ్మ బయటికి వచ్చేసింది.
    బయటికి వచ్చిన తరువాత ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. నిద్ర పోలేదు. మేలుకునే ఉంది.
    కొంచెం సేపే అయి ఉంటుంది. రజని బయటికి వచ్చింది. శ్వాస కొట్టుకుంటుంది. భయంతో వణికి పోతూ నుంచుంది.
    "ఏమిటి, రజనీ?"
    "నాకు భయంగా ఉంది లోపల ఉండాలంటే."
    "ఏం?'
    ఏం బదులు చెప్పాలో తెలీలేదు రజనికి. లోపలేదో జరిగి ఉంటుందని వెంకటమ్మ ఊహించింది. ఇంతలో ఆమె చూపు లోపల నుంచున్న రాజు మీద పడింది. రజనిని లోనికి పంపించ వలసింది గా సంజ్ఞ చేస్తున్నాడు. అతను సహనం కోల్పోయిన వానిలా కనిపించాడు.
    'అలాగేనమ్మా , రజనీ! నువ్విక్కడే పడుకుందువు గాని. నాకు ఒకటే దాహం వేస్తుంది. లోపలికి వెళ్లి కొంచెం మంచినీళ్ళు తీసుకు వస్తావూ?' అంది వెంకటమ్మ.
    రజని భయపడింది.
    "వెళ్ళమ్మా. మంచినీళ్ళు తీసుకు వచ్చి ఇక్కడే పడుకుందువు గాని."
    రజని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన రజని మళ్లీ తిరిగి రాలేదు.
    వెంకటమ్మ బయట మేలుకునే ఉంది. ఆమెకు ఒకటే దిగులు. ఏం జరుగుతుందో అని ఊహించ సాగింది.
    ఒక్క ఘడియ గడిచింది. ఆమెకు ఆదుర్దా ఎద్దువయింది. లోపలంతా చీకటి. ఏం చేయ్యా;లో ఆమెకు అర్ధం కాలేదు. లోపలి నుంచి మాటలేమీ వినిపించలేదు. రజని కూడా బయటికి రాలేదు.
    చాలాసేపటికి లోపల దీపం వెలిగింది. రాజు వెంకటమ్మ ను పిలిచాడు. భయంతో ఆమె లోపలికి వెళ్ళింది. లోపల -- మధ్యగదిలో -- నేల మీద ఆమె చూసింది....?
    దేహం చల్లబడి నెత్తురు గడ్డ కట్టింది. గదిలో నేల మీద రజని చచ్చిపడి ఉంది. కళ్ళు మూతలు పడ్డాయి.
    ఆమె వంగి చూసింది. ఏమిటో గుర్తుకు వచ్చింది. భయంతో ఆమె కంపించి పోయింది. రజని దేహాన్ని తాకి  చూసింది. ఒళ్ళు చల్లగా ఉంది. జరిగిన ఆ ఘోరం ఆమెకు అర్ధమయింది. భర్త వైపు చూసింది భయపడుతూ. దగ్గర్లో చెమటలు కారుతూ ఉండగా రాజు రొప్పుతూ కనిపించాడు.
    "ఏం పని చేశారండీ. ఎంత అన్యాయం చేశారండీ? ఇప్పుడు నేనేం చెయ్యను? వాళ్ళకేం చెప్పను బదులు?" అని మొత్తుకుంది.
    జరిగిన సంగతి ఇది: మంచినీళ్ళ కోసం రజని లోపలికి వెళ్ళగానే ఆమెను తన వద్దకు లాక్కుని ఉంటాడు రాజు. ఆమె అరవకుండా ఉండేందు కు గాను ఆమె నోట్లో గుడ్డ కుక్కి బలవంతం చేశాడు. తన వాంఛ పూర్తయిన పిదప టవల్ తో (తుండు గుడ్డతో) గొంతు బిగించి ఆమెను చంపివేశాడు.
    వెంకటమ్మ భయంతో వణికి పోయింది. నుంచో లేకపోయింది కూడా.
    "మ్....మ్....తొందరగా ఒక తాడూ, ఒక గొని సంచీ తీసుకు రా" అన్నాడు రాజు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడుస్తూనే వెంకటమ్మ అతను చెప్పినట్లు చెయ్యసాగింది.
    తరవాత త్వరత్వరగా పనులు జరిగాయి . రజని కాళ్ళూ చేతులూ కట్టేశారు. మృత శరీరాన్ని ఒక గొని సంచిలో దూర్చ్గారు. లోపలికి వెళ్లి వంటింట్లో గొయ్యి తీసి, అందులో గొని సంచీ ని పూడ్చి వేశారు. పూడ్చిన చోటుని కుండలతో కప్పి వేశారు.
    ఇవన్నీ అయ్యేసరికి రాత్రి మూడున్నర అయింది. అప్పుడు వాళ్ళు బయటికి వచ్చారు.
    ఇంతసేపూ వాళ్ళు చేసిందంతా జాగ్రత్తగా గమనించాయి రెండు కళ్ళు. వెంకటమ్మ కొడుకు-- ఎనిమిదేళ్ళ బలరామ్ కళ్ళే అవి!
    ఆరోజు అతనికి నిద్ర పట్టలేదు. రజని తమ ఇంటికి రావడం, ఆమెను వెంకటమ్మ లోపల పడుకోమని చెప్పడం-- అంతా గమనించాడు. లోపల జరిగే దంతా అతనికి అయోమయంగా కనిపించింది.

                                      
    పనులన్నీ అయిన తరువాత రాజూ, వెంకటమ్మ బయటికి వచ్చారు. పిల్లల్ని చూశారు. నిద్ర పోతున్నట్లు నటించిన బలరామ్ కూడా లేచాడు. వాళ్ళందర్నీ టాక్సీలో ఎక్కించాడు. పట్టణానికి దగ్గర్లో ఉన్న ఒక పల్లెటూరి కి వాళ్ళు చేరుకున్నారు.
    పట్టణం లో రజని కనిపించలేదు. తలిదండ్రులు ఆమె కోసం వెతకడం మొదలు పెట్టారు. టీచర్ వెంకటమ్మ ఆమెను పిలుచుకోవడం తప్ప వాళ్ళ కింకేమీ తెలీదు. పోలీసులకు రిపోర్టు చేశారు. ఈసంగతి పత్రికలలో పడింది.
    మూడు రోజులు గడిచాయి. ఉన్నట్టుండి రాజూ, వెంకటమ్మ పట్టణం లోని తమ పాత ఇంటికి వచ్చారు. ఇంట్లో సామాన్ల న్నిటినీ ఒక టాక్సీ లోకి ఎక్కించి, ఇల్లు ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ చుట్టూ పక్కల వాళ్ళకు వాళ్ళ మీద సందేహం కలిగింది. రజని కనిపించని వార్తను వాళ్లు అంతకు క్రితమే పత్రికలలో చూశారు. వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. రాజు దంపతుల్ని ఖైదు చేశారు. వెంకటమ్మ ఏడ్చింది. భయంతో వణికి పోయింది.
    విచారణ జరిగినప్పుడు తాను చేసిందంతా-- ఒక్కటీ విడిచి పెట్టకుండా పూర్తిగా చెప్పింది వెంకటమ్మ. రాజు వద్ద నుంచి కూడా పోలీసులు నిజం రాబట్టారు. తరవాత వంటింట్లో ఉన్న గొయ్యి తవ్వి , మృత శరీరాన్ని బయటికి తీశారు. రజని కాళ్ళూ, చేతులు కట్టబడిన ఆ తీరుని చూసేసరికి ఒక పోలీసు అధికారికి మరొక సంఘటన గుర్తుకి వచ్చింది. చాలా ఏళ్ళకు మునుపు, అదే విధంగా కట్టబడి కుళ్ళి పోయిన ఒక మృత శరీరాన్ని అయన మురుగు కాలవ నుంచి వెలికి తీయవలసి వచ్చింది. ఆ స్త్రీ మరణం తాలూకు వివరాలు తెలియ రాలేదు. ఇప్పుడీ కేసును చూసిన తరవాత రజనిని చంపినవాడే ఆ స్త్రీని కూడా హత్య చేసి ఉండవచ్చునని అయన అనుకున్నాడు. విచారించగా ఆ నిజం కూడా బయట పడింది.
    కళా అనే మరొక స్త్రీ తో రాజు కాపరం ఉండేవాడు. ఆమె విసిగి పోయింది. దానితో రాజు ఆమెను చంపేసి, భూగర్భం లోని మురుగు కాలవ లోకి తోసి వేశాడు. ఆ హత్య ఇప్పుడే తెలియ వచ్చింది.
    అన్ని విదారణలు ముగిసిన తరువాత రజని హత్య కేసు కోర్టుకి వచ్చింది. ఇది ప్రసిద్ది కెక్కిన కేసుగా మారింది. కోర్టులో రాజు అసలు స్థితిని మార్చి చెప్పాడు. "నగలను అపహరించే నిమిత్తం వెంకటమ్మే ఈ హత్య చేసింది" అని వాదించాడు.
    "లేదు. ఆ అమమయిని బలవంతం చేసి ఆయనే హత్య చేశాడు" అని వెంకటమ్మ చెప్పింది. విచారణ లో బలరామ్ ఒక ముఖ్యమైన సాక్షి. తాను చూసిన దంతా వివరించాడు బలరామ్.
    సెషన్స్ కోర్టు వారు ఇద్దరికీ మరణ శిక్ష విధించారు. ఇద్దరూ అప్పీలు చేసుకున్నారు. హైకోర్టు లో రాజుకి విధించబడిన శిక్ష ఖాయం చేయబడింది. వెంకటమ్మ కు యావజ్జీవ శిక్ష విధించారు.
    ఆ తరువాత మరణ భీతితో రాజు జైలు లోంచి రాష్ట్రపతి కి దయ దలచి విడిచి పెట్టవలసిందిగా అర్జీ పెట్టుకున్నాడు. దాన్ని స్వీకరించడం జరిగింది. మరణ శిక్ష యావజ్జీవ శిక్షగా మార్చబడింది.
    రాజూ, వెంకటమ్మ చాలా ఏళ్ళు జైలులో గడిపారు. పిల్లలిద్దరినీ సర్టిఫైడ్ స్కూల్లో చేర్చారు. ఇటీవల గాంధీజీ శత జయంతి సందర్భంగా చాలామంది ఖైదీలకు జైలు శిక్ష రద్దు అయింది. వెంకటమ్మ విడుదల అయింది.
    బయటికి వస్తూ ఆమె జైలు ఆఫీసర్ గారితో ఇలా చెప్పింది.
    "రాజు విడుదల అయి బయటికి వచ్చినా, ఆయనతో నేనింక కాపరం చెయ్యను. ఆయన్ని చూస్తేనే భయంతో వణికి పోతున్నాను. తనతో కాపురం చేసే ప్రతి స్త్రీని అయన చంపి వేస్తాడు. ఆయనొక మృగం! బయటికి వెళ్ళిన తరవాత ఏదైనా పని కోసం ప్రయత్నిస్తాను. పని కనక దొరికితే, నా పిల్లల్ని నా దగ్గిరికి రప్పించు కుంటాను. అవకాశం కనక లభిస్తే , మరెవరి నయినా పెళ్లి చేసుకుంటాను."
    వెంకటమ్మ విడుదల అయిన కొన్ని వారాలకే రాజుని కూడా విడుదల చేయవలసి వచ్చింది. అతనికో వ్యాధి అంకురించింది. అటువంటి వ్యాధి ఉన్నవారిని విడుదల చేయవలసిందిగా జైలు నియమం ఒకటి ఉంది. అందువల్లనే అతను విడుదల అయ్యాడు.
    రాజు విడుదల అయిన రెండవ రోజుకే వెంకటమ్మ మళ్లీ జైలుకి వచ్చింది. ఆఫీసర్ గారిని కలుసుకుంది. 'అయన విడుదల అయ్యారుగదా! అలా జరుగుతుందని నేననుకోలేదు. నిన్న రాత్రంతా నేను ఇంట్లో ఉండలేక పోయాను. ఆయనకు భయపడి బయటే మేలుకుని ఉన్నాను. దయచేసి నా కేక్కడైనా రక్షణ కల్పించండి. లేదంటారా, ఈ జైల్లోనే ఉండ నివ్వండి" అని బతిమాలింది.
    ఆమె మీద అధికారులకు జాలి కలిగింది. ఆమెను 'మహిళల పునరావాసం నిలయాని కి పంపించారు. ఆమె అక్కడే ఉంటుంది. రాజు పట్టణం లో ఏ మూలనో ఉంటున్నాడు.

                                *    *    *




Related Novels


Vasthava Gadhalu

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.