Home » V S Sukthankar » Ram Sastri



                                 4
    పూనా నగర పరిసరాలలో ఒక కొండ మీద ఉన్న పార్వతి దేవాలయం నేటికీ ఒక గొప్ప పుణ్య క్షేత్రం. దానిని ఆనాడు పీష్యా నానా సాహెబ్ కట్టించాడు. అది అయన కుటుంబానికి కులదేవాలయం గా ఉండేది. పీష్వా రాజ్యంలో ఈ దేవాలయ వైభవం అవర్ణనీయం.
    అప్పటికీ నవరాత్రులు మొదలయి మూడు రోజులయింది. ఎందరో సభికులు వీలయినంత వేగంగా పార్వతీ గుడి వైపుకి వెళ్ళిపోతున్నారు. అక్కడ జరుగబోతున్న నవరాత్ర యజ్ఞం చూడాలని వారి ఆదుర్దా. ఈ యజ్ఞాన్ని పీష్వా మహారావు స్వయంగా నడిపిస్తున్నాడు. ఎక్కడ ఆలస్యం అవుతుందో, అని కొందరు హడావుడి పడిపోతున్నారు.
    ఇలా వెళ్లేవారిలో ఆజానుబాహుడయిన ఒక యువకుడు ఉన్నాడు. అతని దుస్తులు అతి సామాన్యంగా ఉన్నప్పటికీ, తలపాగా తో ఠీవి గా, చూసే వారిలో గౌరవ భావం కలిగించేలాగ కనిపిస్తున్నాడు. "ఎవరీ పెద్ద మనిషి' అనుకున్నారు కొందరు. ఎవరికీ ఈ ప్రశ్నకి సమాధానం తెలియలేదు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడిచి వెళ్ళిపోతున్న ఈ వ్యక్తీ గమనానికి ఒక అంతరాయం కలిగింది. పార్వతి గుడి కొంత దగ్గిరే గొడ్ల మంద ఒకటి ఉంది. దృశ్యాన్ని బట్టి ఆ పశువుల యజమానులు వాటిని అమ్మి వేస్తున్నారని ఈ సభికుడు గ్రహించాడు. వారిలో ఒకరిని సమీపించి నెమ్మదిగా ఇలా అడిగాడు.
    "బాబూ, చాలా గొడ్లు అమ్మకానికి ఉన్నట్లున్నాయి, ఏమిటి విశేషం?"
    "ఏముందయ్యా. రోజులట్లా ఉన్నాయి! మా బాధలు భగవంతుడి కి తెలియాలి-- ఈ ప్రాంతాల్లో కరువు సంగతి మీరు వినే వుంటారు. మాకే తిండి లేక చస్తూ వుంటే పాపం ఈ నోరు లేని పశువుల నెక్కడ మేపగలం? వీటి నమ్మయినా కాస్త పొట్ట నింపు కుందామని........." అని దీనంగా జవాబు చెప్పాడు ఆ మనిషి. బక్కచిక్కి పోయిన పశువులని, వారి యజమానుల దుస్థితిని చూసిన ఆ తలపాగ వ్యక్తీ ముఖంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. మవునంగా ముందుకి నడిచి వెళ్ళిపోయాడు. అయితే ఇంతలోనే అతని కంటికి మరొక విషాద దృశ్యం కనిపించింది.
    కొందరు చిన్న పిల్లలని బానిసలూ గా అమ్ముతున్నారు. వారి తల్లి దండ్రులు. దారిద్ర్యం వల్ల ఈ పని చేస్తున్నారని అడగగా తెలిసింది. అంతేకాక, యుద్దంలో చనిపోయిన కొందరు సైనికుల సంతానం కూడా ఈ దురవస్థ కి లోనయిందని తెలిసింది. ఒక పన్నెండు సంవత్సరాల బాలిక పరిస్థితి మరీ దీనంగా ఉంది. విధవ అయిన ఆమె తల్లి ఏడుపు తలపాగా మనిషి కళ్ళు చేమర్చేట్లు చేసింది. బాలికని కొన్న వ్యక్తీ తన వెంట రమ్మని హెచ్చరిస్తూ వుంటే ఆమె తన తల్లిని, అన్న చెల్లెళ్ళ నీ వదలలేక పోతోంది. అసలు, దుఃఖంతో కుంగిపోయిన ఆమె కాళ్ళూ, చేతులూ ఆడటమే లేదు.
    "కరువు కాలంలో పోలమేమి సాగుబడి చేస్తుంది! ఇలా తన పెద్ద కూతురిని అమ్ముకునయినా కాస్త తెరిపి తెచ్చుకుందామని ....." ఎవరో అన్న మాటలు తలపాగా భరించిన వ్యక్తీ చెవిన పడ్డాయి.
    బాలికని గదమాయిస్తున్న మనిషి తో , "అయ్యా ఆమె బెదిరి పోతోంది. కొంచెం దయ తలచండి ....." అన్నాడు.
    అతనూ మంచివాడి లాగే కనిపించాడు. "ఏమి చెయ్య మంటారయ్యా! కొనుక్కున్నది నా పై వారు. వారి అజ్ఞాలని నెరవేరుస్తున్నానంతే! ఇంతకీ ఈ పిల్లని పార్వతి గుడిలో జరిగే యజ్ఞం లో 'దాసీ దానా'నికి ఉపయోగిస్తారట యజమాని ఎవరో కాదు, పీష్వా సాహెబ్ వారే! సకాలంలో అక్కడికి చేరాలా?' అన్నాడు సంజాయిషీ చెప్పుకునే ధోరణి లో.
    అదే సమయానికి అక్కడ పెద్ద డెక్కల చప్పుడు వినిపించింది. "కొట్వాల్ సాహెబ్ వస్తున్నారు!" అనే వార్త అక్కడ ప్రతిధ్వనించింది" వారు సపరివారంగా వస్తున్నారు!"
    కొట్వాల్, అతనితో బాటు మరికొంత మంది ఆశ్వీకులూ అక్కడికి రానే వచ్చారు. తలపాగా మనిషిని చూడగానే కొట్వాల్ హడావుడి గా గుర్రం దిగి ఆయనాకి నమస్కారం చేశాడు. "మేము చెయ్యగలిగినదేమయినా వుంటే  సెలవిప్పించండి!" అన్నాడు.
    'అబ్బే! ఏమీ లేదు! ఏమీ లేదు!" అనేసి ఉష్నీషదారి చకచక నడిచి వెళ్ళిపోయాడు.
    "మీ కసలు బుద్దంటూ ఉందా!' అని కన్నెర్ర చేశాడు కొట్వాల్ అక్కడ నుంచున్న వారితో. "మన మారాజూ రాజ్య ప్రధాన న్యాయాధిపతికి తగిన మర్యాద చూపించాలని తెలీదూ! అయన చుట్టూ అలా ఎగాబడ్తరా?"
    అయన ఆగ్రహానికి జడిసిన కొందరు తమకి ఆ పెద్ద మనిషి ఆనవాలు తెలియక అలా ప్రవర్తించామని క్షమార్పణ కోసం వేడుకున్నారు. 'సరే ఇకనయినా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి కొట్వాల్ గారు తన దళం తో ఒకరిని అక్కడ కాపలా ఉంచి అలజడి లేకుండా చూడమని ఉత్తరువు వేసి గుర్రం ఎక్కి తనూ వేగంగా గుడి వైపు వెళ్ళిపోయాడు,
    "ఈ బ్రాహ్మడు మన ప్రధాన న్యాయాధిపతా?"
    "అవును, అయన పల్లకీ ఎక్కి కాక నడక సాగిస్తున్నాడెం?"
    "పేదవారి బాగోగులు పట్టించుకునే పెద్ద మనుషులేవారీ రోజుల్లో -- పాపం అయన మాత్రం మంచి వాదిలాగానే కనిపిస్తున్నాడు --"
    ఇలా అనుకోనటం మొదలు పెట్టారు అక్కడి జనం. కొందరు తమ ప్రధాన న్యాయాధిపతిని గురించి మరి కొంత తెలుసుకోవాలని అక్కడ కొట్వాల్ ఉంచి వెళ్ళిన భటుడి చుట్టూ మూగి మరికొన్ని ప్రశ్నలు వేశారు.
    దేశ ప్రధాన న్యాయదిపతిని గురించి మాట్లాడేందుకు అవకాశం దొరికినందుకు భటుడు ఉబ్బిపోయాడు. ముందు, వారందరికీ చివాట్లు వేశాడు. తర్వాత వారికి రాజ్యాంగ విధానం గురించి కొంచెం చెప్పాడు. ఆ తర్వాత, "అసలు మన ప్రధాన న్యాయాధిపతి గారి పేరు రామ్ ప్రభూ. ఈదేశంలో అయన కన్నా చదువు కున్నవాడు లేడు! కాని, ఆయనకి డబ్బంటే ఆశ లేనే లేదు. నిజంగా ధర్మాత్మ అంటే రామ్ శాస్త్రి గారే! ఇటువంటి మనిషి మన ప్రధాన న్యాయాధిపతి కావటం మన అదృష్టం! కొంతకాలం కింద కాశీలో పెద్ద పండిత సభ చేసి శాస్త్రి బిరుదు , మహా వస్త్రం సంపాదించు కున్నాడు. పాపం స్వగ్రామం మహులీ కి తిరిగి వచ్చేశాడో లేదో తల్లి గారు పోయారు .....ఊ! -- అయన పాండిత్యం పీశ్వాగారి చెవిన పడింది. తమ కుమారుడు రాజ కుమార్ మాధవవరావు కి చదువు చెప్పమని కోరాడు. న్యాయాధిపతి గా ఉండమని కోరాడు! అందుకనే, తండ్రి పోయిన తర్వాత కూడా పీష్వా మాధవరావు గారికి గురువు గారంటే అంత గౌరవం! ప్రధాన న్యాయాధిపతి గా చేసేశారు!
    "ఇంకా చెప్తాను వినండి అయన ప్రధాన న్యాయాధిపతి ఉద్యోగం చేస్తున్నాడా? కాని,  ఆ ఉద్యోగానికి తగిన జీతం పుచ్చుకోననేశాడు. విద్య నమ్ముకునే బ్రాహ్మణుడు పెద్ద పాపి అంటాడు! తనకీ, తన భార్యకీ ఏటా రెండు జతల బట్టలు, రోజూ సరిపోయే తిండి -- ఇవి మాత్రం పుచ్చుకుంటారు! ప్రధాన న్యాయాధిపతికి ఇచ్చే అందలం ఎక్కడు నౌకర్లు అనవసరం అంటాడు-- ఇటువంటి న్యాయాధిపతి నెక్కడా చూడము! అసలాయన వచ్చిన తర్వాతనే కదా బీదవాళ్ళ మొరవినే ప్రభువంటూ దొరికారు.......
    "రాజూ, పెదా -- అందరూ అయన కొకటే, ఇంత నిష్పాక్ష పాతి అయిన న్యాయాధిపతి ఉండడంటే నమ్మండి!"
    "అరెరే-- ఎంత పెద్దమనిషిని ఎంత చులకనగా చూశాము!.........ఆయనని తెలిస్తే కాళ్ళ మీద పడేవాడిని కదా....ఇప్పటి కయినా అయన క్షమార్పణ కోసం వేడుకోవటాని కేమి ....' అనే మాటలు ఎన్నో నోళ్ళ నుండి వెలువడ్డాయి.
    కొందరు అయన వెళ్ళిన దారినే వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు. మరికొందరు అటు వెళ్ళనే వెళ్ళారు. కొండ ఎక్కటానికి సిద్దంగా ఉన్న రామ్ శాస్త్రిని సమీపించారు. అతను ఒక చిన్న వాగు పక్కనే నుంచుని అక్కడ తటస్థ పడిన కొందరు అధికారులతో మాట్లాడుతూ ఉండటం చూసి కొంచెం వెనుకాడారు.
    రామ్ శాస్త్రి అధికారులతో వీధ్ -- బిగార్ పద్దతిని గురించి అడుగుతున్నాడు. అతను కొండ సమీపించే సమయానికి యజ్ఞానికి కావలసిన సామగ్రితో కొన్ని ఎద్దు బళ్ళు నుంచుని ఉన్నాయి. వాటిని వేఠీ-- బిగార్ కోసం అధికారులు రప్పించారు. వేఠీ-- బిగార్ అంటే ప్రభుత్వం బలవంతంగా చేయించే సేవ అన్నమాట. ఈ పద్దతి ప్రకారం పిలుపు వచ్చినప్పుడు గ్రామాలలో వారు తమ గోడ్లతో బాటు వచ్చి అధికారులు చెప్పినట్లు చెయ్యాలి. వేఠీ-- బిగార్ మహారాష్ట్రానికి ప్రత్యేకం కాదు. భారతదేశం మొత్తం వాడుకలో ఉండేది) అలిసిన ఎడ్లని నీరు తాగించటాని కని వాగు వద్ద బళ్లని ఆపినందుకు కొందరు అధికారులు బళ్ల వారిని శిక్షించారు. వారికి కొరడా దెబ్బలు తగిలాయి. ఈ దృశ్యాన్ని చూసి రామ్ శాస్త్రి చాలా బాధపడ్డాడు. సంగతేమిటో కనుక్కుని మరేమీ మాట్లాడుకుందా పార్వతి గుడికి వెళ్ళిపోయాడు. అతన్ని పలకరించటానికి ధైర్యం లేక ఆగిపోయారు వచ్చిన వారు.
    అప్పటికే యజ్ఞ ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. పురోహితులు, హడావుడి గా యజ్ఞ గుండం చుట్టూ మూగి ఉన్నారు. మాధవరావు పీష్వా ఒక వేదిక మీద కూర్చుని సంతృప్తి తో ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. రామ్ శాస్త్రిని చూడగానే అవసరంగా దిగి వచ్చి అతనిని సగౌరవంగా ఆహ్వానించాడు. తనతో బాటు వేదిక మీద కూర్చో బెట్టారు.
    "తమరితో అతి ముఖ్యమయిన విషయం గురించి మాట్లాడుదామని వచ్చాను. రాజ భవనం లో తమర్ని కలుసుకునే అవకాశం లేకపోయింది. మన్నించాలి" అన్నాడు రామ్ శాస్త్రి గంబీరంగా.
    "ఎంతమాట ! నాతొ ఎప్పుడయినా ఏ విషయం గురించి అయినా మాట్లాడే హక్కు మీకు కాక మరెవరి కుంది/ పాపం ఎండలో ఇంతదూరం నడిచి వచ్చాడన్నమాట! ఈ మూడు రోజులూ భవనంలో ఉండక పోవటానికి కారణం ఈ యత్నం హడావుడి వల్లనే........ఇదీ మనదేశ క్షేమానికే కదా!"
    రామ్ శాస్రి వెంటనే జవాబు ఇవ్వలేదు. ఇంతకీ ముందు బానిస గా అమ్ముడు పోయిన అమ్మాయిని అప్పుడే అక్కడికి తీసుకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడి కి దానంగా ఇవ్వటం కూడా జరిగి పోతోంది. భయంతో ఏడుస్తున్న ఆ పిల్ల కొంగుని ఆ బ్రాహ్మణుడి పంచకి ముడివేసి మంత్ర పఠనం తో అతనికి ఇచ్చి వేశారు.
    రామ్ శాస్త్రి ఈ దృశ్యాన్ని సూచిస్తూ, పీష్వాతో వినయంగా, దృడమయిన స్వరంతో, ఇలా అన్నాడు: "ప్రభువులు యజ్ఞకాండని సక్రమంగా చేయిస్తున్నారనటానికి సందేహం లేదు. ఈ దాసీదానాన్ని చూడండి -- అమ్మాయి పాపం! తల్లి ప్రేమని నోచుకోలేక అమ్ముడు పోయింది. ఇప్పుడు ఏలిన వారి రాజ్య క్షేమం కోసం దానంగా ఇచ్చేస్తున్నారు. ఈ దారుణమయిన దానం నిజంగా దేవతలకి సంతృప్తి కలిగిస్తుందా?"
    పీష్వా సమాధానం ఇచ్చే లోపుగా రామ్ శాస్త్రి తిరిగి ఇలా అన్నాడు:-- "ఈరోజు నాకు చాలా విషయాలు తెలిశాయి. యుద్ధం వల్ల దేశంలో నరహీనం వచ్చింది. నిరుపెదలయిన పల్లె జనం తమ పశువులనే కాక, పిల్లలని సయితం అమ్ముకుంటున్నారు . నిప్పు మీద ఆజ్యం పోసినట్లు మన రాజ్యదికారులు వేఠీ-- బిగార్ తో వారిని మరింత హింస పెడుతున్నారు!
    "ఏలిన వారు నన్ను క్షమించాలి! నాకే కాక సకల మహారాష్ట్ర సామ్రాజ్యానికి మీరు ప్రభువులు! స్వతంత్రించి మాట్లాడుతున్నందుకు నన్ను అపార్ధం చేసుకోనవద్దని కోరుతున్నాను! ఈ యజ్న యాగాలు చేయించటం కన్నా పరిపాలన మీద కొంత దృష్టి సారించారంటే దేశానికి మరింత మేలు చేసిన వారవుతారు. ధర్మ ప్రభువులు, మీకు ఇది తెలియనిది కాదు! ఎన్ని శాస్త్రాలు, చదివినా, ఎంత జ్ఞానం సంపాదించు కున్నా తోటి మానవుని బాధని సహించ లేక కరుణతో కన్నీరు తుడిచినప్పుడు లభించినంత పుణ్యం రాదంటారు!"
    ఇలా అనేసి రామ్ శాస్త్రి మరొకసారి పీష్వా కి వంగి నమస్కరించి గబగబ యజ్న శాలని వదిలి వెళ్ళిపోయాడు.

                            *    *    *    *
    మర్నాడు రాజధాని ఒక వింత వార్తతో మారు మోగిపోయింది. నవరాత్రి ముగిసేదాకా వదిలి రారనుకున్న పీష్వా మాధవరావు యజ్న శాలని మధ్యలోనే ఆ దినమే తిరిగి వచ్చేసి రాచకార్యాలలో మునిగి పోయారుట!
    మరి రెండు దినాలు గడిచాయి. ప్రజలని మరొక వింత సంభ్రమాశ్చర్యలలో ముంచి వేసింది. ప్రతి వీధిలోనూ దండోరా వేస్తున్నారు.

                             
    "వినండహో! పీష్వా వారు పుణ్య ప్రతాప్ మాధవరావు సాహెబ్ వారు సెలవిచ్చె దేమనగా ఈనాటి నుంచీ ప్రభువులు వేఠీ-- బిగార్ పద్దతిని రద్దు చేస్తున్నారు! వినండి! వినండహూ! ఇక పైన వేఠీ-- బిగార్ అనుసరించిన వారందరినీ పీష్వా వారు కఠినంగా శిక్షిస్తారు! వినండి వినండహో--"




Related Novels


Ram Sastri

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.