Home » Dr C ANANDA RAMAM » Aparajitha



    'ఇంకా చేసుకోలేదు-ఇంకా వారంలో చేసుకుంటాను-రిజిస్టర్ మేరేజ్-'
    'అదేవిటన్నయ్యా? రిజిస్టర్ పెళ్ళి కర్మమేం? లక్షణంగా ఫెళ్ళుమంటూ పెళ్ళి చేసుకోక...'
    'వాళ్ళ వాళ్ళకీ పెళ్ళి ఇష్టంలేదు-అందుకని...'
    'అంత ఇష్టం లేని సంబంధం దేని కన్నయ్యా!'
    'ఇష్టం లేనిది పెద్ద వాళ్ళకి-నాకూ ఆవిడకీ ఇష్టమే! అని చాలదూ!'
    'మరే! అదుంటే చాలు-'
    ఎలాగో అనేసి తన హావభావాలు దాచుకోవటానికి అక్కడినుండి వెళ్ళి పోయింది-
    పార్వతిని కంటితో చూడక ముందే పార్వతి పట్ల ఒక విద్వేష భావాన్ని పెంపొందించుకుంది రుక్మిణి-పార్వతి రాధాకృష్ణ కు ఇల్లాలిగా వచ్చాక ఆ ద్వేషం మరింత ఎక్కువయింది-పాపం, పార్వతి ఆడబిడ్డ తో స్నేహంగా ఉండాలనే ప్రయత్నించింది- కానీ, ఆ రుసరుసలూ, మూతి విరుపులూ చూసి తటస్థంగా ఉండిపోయింది -తన, అన్నయ్య దయమీద ఆధారపడి ఉంది గనుక-ఆ అన్నయ్యకు పార్వతంటే ప్రాణం కనుక - రుక్మిణి కి తన ఆడపడుచుతనం చూపించు కోవటానికి మాత్రం అవకాశం రాలేదు-
    పార్వతితో కాపురం ప్రారంభించాక కూడా రాధాకృష్ణ రుక్మిణికి, అడపా దడపా అయిదూ, పదీ సర్దుతోనే ఉన్నాడు-అయినా రుక్మిణి కి మంటగానే ఉండే-అవును మరి! ఈ 'దెయ్యమే' రాకపోతే, అన్న సంపాదనంతా తనదయ్యేది కాదూ!.......రుక్మిణికి తనపట్ల ఏకోశానా సద్భావం లేదనీ, కలగదనీ అర్ధమయి పోయాక, పార్వతి అసలు రుక్మిణిని పలకరించటమే మానుకుంది -
    ఈ నాటికి పార్వతికి ఆ రుక్మిణినే ఆశ్రయించవలసిన దురవస్థ పట్టింది- డబ్బు సంగతలా ఉంచి, తానున్న స్థితిలో ఒక అండ లేకుండా వంటరిగా ఎలా ఉండగలదు? ఎన్నాళ్ళు గానో మనసులో అణిచేసుకున్న రుక్మిణి కోరిక ఈ నాటికి ఫలించింది-
    తన ఆడబడుచుతనం చెలాయించటానికి మంచి అవకాశం దొరికింది-
    జీవచ్చవంలా తయారయిన పార్వతిని చూస్తోంటే ఆవిడకి జాలి బదులు చిరాకే కలిగింది-
    'ఒకొక్కళ్ళ పాదం! అడుగు పెడుతూనే భగ్గుమనిపిస్తారు - రాయిలాంటి మనిషి-ఏనాడూ జిర్రున చీదెరగడు-నిముషాల మీ దెగిరిపోయాడు - వైధవ్యయోగం రాసిపెట్టి నాతల్లి మెళ్ళో తాళి కట్టాక ఇంక నా అన్న నాకెలా దక్కుతాడు?'
    ఇలాంటి వాక్యాలు రోజుకు పదిసార్లయినా దొర్లేవి రుక్మిణి నోట్లోంచి. అసలే పార్వతిలో జీవం చచ్చిపోయింది- ఈమాటలు విని విని తనంటే తనకు అసహ్యం బయలు దేరింది -అన్నం మానేసి-చన్నీళ్ళు స్నానం చేసి తడి బట్టలతో గంటలకొద్దీ ఉండిపోయి-ఇలా తనను తను ఎన్నివిధాల హింసించుకోగలదో, అన్ని విధాలా హింసించుకునేది- ఫలితంగా చిక్కి శల్యమయి కూచుంటే లేవలేని దశ కొచ్చింది-
    'అమర్చిపెట్టే వాళ్ళుంటే అందరికీ రోగాలే! నేనొక దాన్నున్నానుగా చాకిరీకి-'
    అని రుక్మిణి ఎంత సణుక్కున్నా పార్వతికి మంచం మీంచి లేచే శక్తి లేక పోయింది-
    సృష్టి కన్న విచిత్రమైంది ఎక్కడుందీ? ఇంచుమించు మరణావస్థలో ఉన్నా, ఏమాత్రం వైద్యసహాయం లేక పోయినా, నాటు మంత్రసాని మోటు తనం మరింత ప్రాణాల మీదకు తెచ్చినా, పార్వతి ప్రసవించింది - ఆడపిల్ల - ప్రసవవేదన పడి పడి శిశువును భూమి మీద వదిలి తన రాధాకృష్ణ దగ్గిరకు పారిపోయింది పార్వతి-

                                     2

    కొందరు కొందరు వ్యక్తులు ఎందుకు పరమ రాక్షసంగా ప్రవర్తిస్తారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు - వాళ్ళలో మానవత్వం లేదా? మానవుడై జన్మించాక మానవత్వం లేకుండా ఎలా ఉంటుంది?- ఎప్పుడో మేల్కొంటుంది-అప్పుడు వాళ్ళు మానవులు కావచ్చు-అట్టే మాట్లాడితే దేవతలూ కావచ్చు-కానీ ఆ క్షణంలో మాత్రం రాక్షసులు -మానవుడి భావం మానవత్వం-మానవులంతా ఒకలా ఉండరు -పరిస్థితుల్ని బట్టి విజ్ఞానాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టి, వాతావరణాన్నిబట్టి వేరువేరు విధాలుగా ఉంటున్నారు - ఒక పరిస్థితిలో పరమదుర్మార్గుడు గా అనిపించిన వ్యక్తి మరో పరిస్థితిలో ఏంటో సహృదయుదిగా ప్రవర్తించచ్చు-అలాగే మానవత్వమూ అందరిలోనూ ఒక్కలా ఉండదు - ఎనిమిదేళ్ళు నిండీ నిండని మాధవి మీరు రుక్మిణి కెందుకంత ద్వేషమంటే సమాధానం లేదు-నిజాని కది ద్వేషం కూడా కాదు-ఎదుగూ బొదుగూ లేని ఎలిమెంటరీ స్కూల్ బడిపంతులికి పెళ్ళాం-చాలీచాలని జీతం రాళ్ళు-మేము మేమంటూ ముగ్గురు పిల్లలు-ఇంట్లో ఏమూల చూసినా ఇనపగజ్జెల తల్లి అందెల ఘలంఘల ధ్వని-ఇలాంటి పరిస్థితుల్లో మనసు చికాకుతో సుడులు తిరిగిపోవటం సహజం-ఆ చికాకు కక్కడానికి ఎవరైనా దొరకితే వాళ్ళని ఉపయోగించుకోక మానరు-
    రుక్మిణికి తన చిరాకునంతా గుమ్మరించదానికి మాధవి దొరికింది. అలాంటి పరిస్థితుల్లో సహితం నిగ్రహంగా ఉండే వాళ్ళు లేకపోలేదు-వాళ్ళు ఉత్తములు -కాని రుక్మిణి సరాసరి మనిషికి ఒక మెట్టు దిగువలో ఉన్న వ్యక్తి-న్దుకే మాధవికి ఎనిమిదేళ్ళకే బ్రతుకులో చేదంతా అనుభవంలోకి వచ్చేసింది-
    రుక్మిణి లోనూ మానవత్వం ఉంది- అందుకే-మూడు చెక్కలూ ఆవకాయ ముక్కలయితేనేం గాక-మాధవికి కడుపు కింత అన్నం పెడుతుంది-
    అదీ పెట్టకపోతే మాత్రం అడిగే వాళ్ళెవరూ? తనకూతుళ్ళ బాగా చినిగిపోయిన పరికిణీలు ఒకటీ రెండూ (వాళ్ళ కుండేవే నాలుగు) మాధవికే ఇస్తుంది-ఎప్పుడైనా పిల్లలొద్దని మిగిల్చేస్తే ఆ కాఫీ మాధవికే ఇస్తుంది-
    ఇలా ఇన్నివిధాల చూస్తున్నా ఆ పిల్లకు విశ్వాసం లేదు- నీళ్ళకని చెరువు కెళ్ళి గంటకి కాని తిరిగి రాదు- అదేమంటే 'పెద్దబిందె అత్తయ్యా!' అంటుంది ఏడుపు మొహంలో - దానికీ వాళ్ళమ్మ ముఖమే! ఎప్పుడూ ఏడుపుముఖం, పెద్ద బిందయితే మాత్రం? ఆ మాత్రం తేలేదూ? పోతులా తింటుందే! సమయానికి ఒక్క గిగ్నే అందివ్వదు-చేతులు బొబ్బలెక్కి పోయాయని ఏడుస్తూ కూచుంటుంది-సుకుమారం కడుక్కు పోతోంది-ఈ దరిద్ర గొట్టుకి సాయం ఈ సుకుమారా లెక్కడివో? ఆరోజు ఉదయమే పాలవాడొచ్చి బెదిరించిపోయాడు-
    'రెండు నెలలబట్టీ పాలదబ్బు లియ్యటం లేదు-ఇవాళ మొత్తం ఇయ్యకపోతే రేపటినుండి పాలు పొయ్యను -'అని-
    రుక్మిణి మనసంతా చికాగ్గా ఉంది-
    ఎన్నాళ్ళిలా? పాలవాళ్ళ బెదిరింపులు-కూరగాయలమ్మి దెప్పుళ్ళు - ఇల్లు గలాయన అరుపులు-ఈ సమస్యలన్నీ ఏనాటికి తీరతాయి?
    ఆలోచించీ ప్రయోజనం లేని ఈ చికాకులతో రుక్మిణి తల పగిలిపోతోంటే ముందు గదిలోంచి గందరగోళంవిని పించింది-విసుగ్గా అక్కడి కొచ్చింది రుక్మిణి-
    'అమ్మా చూడే! నా పరికిణీ కట్టేసు కుంటోంది-'
    మొహమంతా చెండుకుని ఫిర్యాదు చేసింది రుక్మిణి పెద్ద కూతురు బాల-
    'లేదత్తయ్యా! మడత పెడుతున్నాను-అంతే!'

                              
    బిక్కముఖంతో అంది మాధవి-
    'అబద్ధాలు - నువ్వు వంటిమీద పెట్టుకోలేదూ?'
    'నీవే అబద్ధాలు-నేను పట్టుకుని మడత పెడుతున్నానంతే! నువ్వేగా మడత పెట్టమన్నావ్!'
    'మడత పెట్టమంటే కట్టుకోమనా? పైగా నావి అబద్దాలంటావా?'
    'నువ్వు నన్ను అనలా?'
    'అబ్బబ్బ! వెధవ దెబ్బలాట!'
    కోపంతో ముందుకొచ్చింది రుక్మిణి-విసురుగా చెయ్యెత్తింది - తన ఉడుకు చల్లారాలంటే ఎవరినో బాధాలి -బాల నెందుకు కొట్టటం? మాధవి వీపుమీద దభీ దభీమని దెబ్బలు పడుతున్నాయి-'అమ్మో! బాబో!' అని అరుస్తూ తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది మాధవి-మాధవి అలా తప్పించుకోవటానికి ప్రయత్నించిన కొద్దీ మరింత కసిగా బాదుతోంది రుక్మిణి-సరిగా ఆ సమయంలో వచ్చింది పరమేశ్వరి-మెరుపులా మాధవికి అడ్డు నిల్చుని మాధవి మీద పడాల్సిన దెబ్బ తాను అందుకుంది-తెల్లబోతూ క్షణం ఆగింది రుక్మిణి-
    'మీరెవరు?' విసురుగా అడిగింది-
    రుక్మిణిదెబ్బ తగిలినచోట చేత్తో నిమురుకుంటూ 'పార్వతికి అక్కయ్యని'- కంది పరమేశ్వరి-
    'ఒహో! పార్వతిని చూడటానికి వచ్చారా?' వెటకారంగా అడిగింది రుక్మిణి-
    'పార్వతిని చూటానికయితే స్వర్గానికెళ్ళాలి-ఇక్కడి కెందుకూ?' శాంతంగా చెప్పింది పరమేశ్వరి - ఆవిడ కంఠం ఎంత శాంతంగా ఉన్నా ఆమాటలు చురుక్కున తగిలాయి రుక్మిణికి-
    'ఇంతకూ తమరు మా గృహం ఎందుకు పావనం చేస్తున్నారో?'
    'చెయ్యవలసి వచ్చింది - మాధవి కోసం-'
    'మాధవి కోసమా? దానికీ మీకూ ఏం సంబంధం?'
    'మీకన్న దగ్గిర సంబంధమే! దాన్ని నాతో తీసుకుపోదామని వచ్చాను-'
    ''వీల్లేదు - దాన్ని పంపను - మా అన్నయ్య పార్వతిని నా కప్పజెప్పాడు - ఆ నాడు పార్వతి ముఖం చూడటానికైనా మీరెవ్వరూ రాలేదు-నేనే దిక్కయ్యాను- ఈ నాటిక మాధవి కావలిసి వచ్చింది-"




Related Novels


Nanrushi Kurutay Kavyam

Sampenga Podalu

Swathi Jallu

Aparajitha

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.