నేనింక అయిదు నిముషాలు ఆగలేదు. ఒక పెట్టెలో మా యిద్దరి బట్టలు కుక్కేశాను. తలుపులు వేసేసి తాళం చెవులు సరళ కిచ్చాను. ఆహడావిడి లో ఆమెతో యిలా చెప్పినట్టు జ్ఞాపకం.
'సరళా, నే వెడుతున్నాను. జరిగింది ఆయనతో చెప్పు. మానవత్వం అన్నది మిగిలి ఉంటె అక్కడికే వచ్చి నన్ను కలుసుకోమను.'
* * * *
రిక్షావాడికి డబ్బులిచ్చి పంపేసి, ఒకచేత్తో మధురిమను నడిపించుకుని వస్తూ అన్నయ్య ఇంట్లో అడుగు పెట్టేసరికి నా కాళ్ళు ఒణికాయి. ఎటువంటి దృశ్యం చూడవలసి వస్తుందో అని గుండె వేగంగా , భయంగా కొట్టుకుంది. మొట్టమొదట కనిపించింది వదిన. ఒక్క నెలలో ఎంత ఎక్కువ మార్పు వూహించగలమో అంత మార్పూ కనిపించింది ఆమెలో.

ఎన్నాళ్ళో అయి దువ్వుకున్నట్లుంది ఆ తల. ఎన్నాళ్ళో అయి మార్చినట్లుంది ఆ చీర.
ఇవేవీ నాకు అక్కర్లేదు.
ఎన్నాళ్ళో అయి నవ్వినట్టుంది ఆ మొహం!
రాగానే నన్ను కౌగలించుకుంది . పరస్పరం దుఃఖించడం వల్ల అనుకుంటాను మా భుజాలు తడిసిపోయాయి. చెయ్యి పట్టుకుని పెరట్లోకి తీసుకు పోయింది.
'అడగందే అమ్మాయినా పెట్టదంటారు. పిలుస్తే గాని భగవంతుడయినా పలుకడంటారు. ఎదుటి వాళ్ళ బాధలనూ, కష్టాలను గ్రహించి తమంతట తామే ఉపకారం చేద్దామని బయలుదేరిన వాళ్ళను ఏమంటారు?'
నేను వదినకు ఏమీ చెప్పదల్చుకోలేదు. అడగడానికి, వినడానికి నేను రాలేదు కూడా. పరిస్థితులు గ్రహించి చెయ్యడానికి ఏమయినా మిగిలిఉంటె వెంటనే చెయ్యడమే అంతే.
'మంజూ! నీకోసం ఎన్నిసార్లు తలుచుకున్నానో చెప్పలేను. మనసులో ఎన్ని వందల సార్లు పిలుచుకున్నానో తెలీదు. నిన్ను పంపించమని ఎందరు దేవుళ్ళకు మొక్కుకున్నానో లెక్క కట్టలేము. ఎదుటి వాళ్ళకు చెప్పకుండా కుమిలిపోవడం నాకు చేత కాలేదు. ఆయనతో ఎన్నేళ్ళు కాపురం చేసినా సరే.
ఒకరి బలవంతం మీద నేర్చుకున్న నీతులు అలాగే ఉంటాయేమో! నిష్కామమైన అయన శీలం , నిస్వార్ధమైన అయన త్యాగం , ఆయనకే చెల్లు - నా వల్ల కాదు! ఇప్పుడు నువ్వోచ్చావ్ , కొండంత బరువు నామీంచి దింపేసినట్టుంది!"
వదిన భుజం మీద చెయ్యి వేసి ప్రేమానురాగాలతో నిమిరెను.
వదినా! నా మీద నీకున్న నమ్మకం అలాంటిది . నేను వచ్చాను. ఇదివరకులా నా మటుకు నిన్ను వదిలి వెళ్ళను.'
వదిన అన్నయ్య ఆరోగ్యం గురించి చెప్పింది. ఇదివరకులా కాకుండా అన్నయ్య శ్రద్దగా మందు పుచ్చుకుంటున్నాడట. కాని ఏ రోజూ కారోజూ రోగం ఎక్కువై పోతున్నదట. డాక్టర్ని పిలిచి చూపిస్తే మందు మార్చి డోసు కూడా ఎక్కువ చేశాడుట. మాత్రలు ఎక్కువ తీసుకున్న కొద్ది జీర్ణశక్తి మందగించి బాగా అరుచి ఎక్కువై ఆహారం బొత్తిగా యిమడడం లేదట.
'వదినా, నీతో చెప్పెను కదా, ఒట్టు వేయించుకున్నాను కదా , మళ్ళీ మళ్ళీ రాశాను కదా -- అన్నయ్య సంగతి వదిలి పెట్టి నువ్వేనా ఎందుకు రాశావు కావు? ఒక్క కార్డు ముక్క రాస్తే యింకా ముందే వచ్చేదాన్నిగా!చూస్తూ ఎలా వూరుకున్నావు?'
'అయన శరీరంలో అర్ధభాగాన్ని నేను. ఎలా రాయను?' విషాదంగా వదిన జరిగిన సంగతులు చెప్పింది.
నేను ఆరోజు అన్నయ్య టేబిలు మీద కవర్లో రసీదూ, ఉత్తరమూ పెట్టి వెళ్లిన్నాడు, జరిగిన సంఘటన ఇది.
వదిన వంటింట్లో కూచుని ముక్కలు వేయిస్తోంది. ఎవరో నిశ్శబ్దంగా ఏడుస్తున్నట్టయి ఆమె ఆశ్చర్యంగా ఇవతలి కొచ్చింది. ఎప్పుడూ కన్నీరు ఎరుగని అన్నయ్య రెండు కళ్ళల్లోనూ కాలువలు కట్టే నీరు చూసి ఆమె హృదయం దేవిసినట్లయింది. ఒక్కసారి ఆమెలో దుఃఖం పొంగిపొర్లింది. లోపలికి వెళ్లి మొహం కడుక్కుని వచ్చేసరికి మరింత కళా విహీనంగా తయారైంది అన్నయ్య మొహం. చేతిలో ఉత్తరం తీసి చదివింది వదిన.
'ఎలాగైనా నన్ను దీవించు.అందుకైనా పది కాలాల పాటు జీవించు.' అలాగే మంజూ! తప్పకుండా బతుకుతానమ్మా, నీ కోసమైనా జీవిస్తానమ్మా! నిన్ను దీవుస్తూనే ఉంటాను తల్లీ!"
హృదయంతరాళాల్లోంచి పెల్లుబికి వచ్చిన ఈ ప్రేమ వాహినుల వెల్లువతో నీరసంగా ఉన్న అన్నయ్య శరీరం ఉద్రేకంతో ఉక్కిరిబిక్కిరి అయిపొయింది. ఆరోజే అన్నయ్యకి మూడవసారి మరొక హార్ట్ ఎటాక్ వచ్చిందిట.
'మంజూ, భర్త శరీరంతో సగం నాదని చెప్పుకుంటాను, ఏం లాభం? ఆయనలా కోడిపిల్లలా కొట్టుకుంటుంటే కూడా ఉండి అయన బాధని నేను ఏం పంచుకోగలిగాను? వెల్లకిలా పడుకోలేక, సరిగా కూచోలేక , ఏ పొజిషన్ లోనూ సుఖం చిక్కక అయన ప్రాణం గిలగిల్లాడుతుంటే గుడ్లప్పచెప్పి చూడ్డం దుఃఖాన్ని దిగమింగడం తప్ప అయన ఆవేదనని నేనేం తీసెయగలిగాను? కేవలం కబుర్లే. ఎవరికీ ఎవరమూ ఏమీ కాము.'
నేను నగ నమ్మి అప్పు తీర్చినందుకు ఏమాత్రం సంతోషించక పోగా మరింతగా రుణం పెరిగిపోయినట్టు ఆందోళన పడ్డాదుట అన్నయ్య.
'నాకు ఒక్కగా నొక్క చెల్లెలు. దానికి నా చేత్తో నేనింత పెట్టడం పోయి దాని చేత పుచ్చుకోవలసి వచ్చిందా భగవంతుడా! దాని మొగుడసలే తెలివి తక్కువ మనిషి. నా వల్ల దాని పచ్చని సంసారంలో ఏం చిచ్చు రగులుకుంటుందో! నేను అప్పు చేసిన సంగతి దాని కేలా తెలిసింది? మంగళా, ఇవన్నీ చెప్పి దాని వల్ల ఉపకారం పొందడం కన్న మంచి మార్గం నీకు తోచలేదా?'
నిర్దోషి అయిన మంగళ గజగజలాడిపోయింది!
'నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు నమ్మండి' అంది వదిన.
'స్టేషను కి వెళ్ళి రెండు చేతులూ పట్టుకుని దాన్ని దింపిన నిన్నెలా నమ్మేది? కష్టాలు మనిషి లోని సహనాన్ని పరీక్షిస్తాయి. స్వచ్చమైన జీవితం కత్తి మీది సాము లాంటిది. దానికి కరుకుతనం అవసరం. కలం కాగితం తీసుకురా.'
అన్నయ్య డిక్టేట్ చేస్తుండగా వదిన రాసింది.
'భగవంతుని దయవల్ల రోజు రోజుకీ ఆయనకు ఆరోగ్యం చేకూరుతున్నది. నీ సహాయమునకు అన్ని విధాలా కృతజ్ఞులము' అని రాసిన ఉత్తరం.
'మంజూ , నువ్వయినా నన్ను నమ్ము. ఎన్నో సార్లు నీకు రాద్దామనుకున్నాను. నీకోసం కాదు, నాకోసమే. చెప్పుకుని వెళ్ళగ్రక్కుకుని దుఃఖం తగ్గించుకుందామని, వెళ్ళేముందు వారానికి ఒక ఉత్తరమేనా రాయమని నువ్వు చేతిలో చెయ్యి వేయించుకున్నావు. కానీ నీకు తను చెప్పినప్పుడు తప్ప ఉత్తరాలు రాయొద్దని అయన కూడా చేతిలో వేయించుకున్నారు. ఇందులో నేను ఏది ఆచరించేది? స్త్రీకి భర్త చెప్పినది ముఖ్యమా అదెంతటి వాళ్ళు గానీ తదితరులా?'
నా ముఖం వెలవెల బోయింది. యధాలాపంగా వదిన వేసిన ఈ ప్రశ్న సూటిగా నాకేనా?' ',మానవత్వం అన్నది ఏమాత్రమైనా మిగిలి ఉంటె ఆయన్నే అక్కడికి రమ్మను' అని వచ్చేముందు సరళ కి చెప్పెను. మిగిలిఉండక పొతే ? ఏది స్త్రీకి ముఖ్యం? భర్తా, అదెంతటి వాళ్ళు గాని తదితరులా?
'వదినా, నువ్వింకా ఇక్ష్వాకులనాటి కబుర్లు చెప్పడం నాకేం నచ్చలేదు. సందిగ్ధావస్థతో వేమన చెప్పిందే వేదం అన్నది కాదు, విచక్షణ ముఖ్యం. ఎవరు చెప్పెరన్నది ప్రధానం కాదు. విషయంలో మంచి చెడ్డలు ప్రధానం. పాఠ్యగ్రంధాలు చదవక పోయినా పాత పురాణాలు పరిశీలించిన దానివి నీకు నేనేం చెప్పేది?'
వదిన పొడిగా నవ్వింది. నిజంగా పాత పురాణమే ఒకటి తీయబోయింది. అంతా నాలుగేళ్లయి కాలం చేసిన వాళ్ళ నాన్నగారు సత్యనారాయణగారి ఫోటో ఒకటి అందులోంచి పడింది. దాని వెనక ఆయన్ని గురించి ఒక పదం క్రింద మరొక పదం నిలువుగా ఇలా ఉంది.
'సత్యవాక్య పరిపాలకుడు.
కాంతమూర్తి.
పరోపకార వ్రతుడు.
సహనశీలి
మహా పండితుడు.
కావున నిరుపేద!
చివర చూడగానే నా గుండె జలదరించింది. వాళ్ళ నాన్నగారి గురించి ఇదివరకు చూశాను. విన్నాను. అత్మీయుడైన అన్నయ్య అక్షరాలతో ఆ మహత్తర వ్యక్తీ గురించి అంత చక్కటి పరిశీలన నాకు చాలా తృప్తి నిచ్చింది.
తెలుగు రామాయణంలోని వాళ్ళ నాన్నగారు వదినకు చాలా పద్యాలు చెప్పేవారు. అందులో ఆమెకు చాలా యిష్టమైనది జనకమహారాజు సీతమ్మను అత్తవారింటికి పంపేటప్పుడు చెప్పిన సూక్తులు. అవి వదిన పనులు చేసుకునేటప్పుడు అస్తమానూ పాడుతుండేది. కొన్ని కొన్ని ముక్కలు నాకూ నోటికి వచ్చేవి ఒకప్పుడు. వదిన అడక్కుండా చెయ్యకుండా ఇప్పుడా పద్యం చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్య మనిపించింది.
'పూర్వ పుణ్యంబు కొలదిని పురుషు డండ్రు
అత డేవరైన యెట్టి వాడైన గాని
పడతి కిహపర దైవమా పతియే, తల్లి!
పతి పదాంబులు సేవయే పరమ తపము.
పరమ సుఖదయకమ్ము సౌభాగ్యకారి
సకల భయహరణమ్ము భూషణము ధనము
పతి మనో భీష్టమున కాత్మ బలి యొనర్చి
పూర్ణకాముని చేసిన పాలతి మిన్న
అన్నపూర్ణా సమాలనై అమర నిమత
చరితలైనారు పతిభక్తీ మరువకుండ
జానకీ! వారి ధర్మపధాన జనుము
అనుచు కనుగొనల్ ఆశ్రువుల్ చినుక బలికె
జానకమ్మను పంపురు జనకరాజు.'
ఇది చదువుతూ నా మొహాన్ని పరిశీలిస్తుంటే యిప్పుడే మంటావ్' అన్నట్టుంది. నేను వూరుకోలేదు.
'చెప్పానుగా యిది యిక్ష్వాకులనాటి కబుర్లనీ? ఈ కాలం వేరు-- ఈ కాలం వేరు.'
'కాలం వేరు కావచ్చు. కాని, భారత స్త్రీ హృదయాన్ని పాలిస్తున్న ధర్మం ఒకటే.'
'అయితే భర్త తెలివితక్కువగా ప్రవర్తించినా సరిదిద్దడం పాపం అని ఆ కాలం వారి అభిప్రాయమా?'
'ఏమో పాతకాలపు వాళ్ళందరూ పాతకాల వాళ్ళు అని నేను నమ్మలేను. అదలా ఉంచి మనపాటి విచక్షణ వాళ్ళకి లేకపోలేదు. మొత్తమ్మీద మీ అన్నయ్య భయపడినంతా జరిగిందనుకుంటాను. ఇంట్లో అంతో యింతో గొడవ పెట్టుకు రాకపోతే నువ్విలా మాట్లాడవు . అవునా?'
'అబ్బే, అదేం లేదు వదినా!'
'నా దగ్గిర దాచకు మరి. ఇన్ని కబుర్లు చెప్పిన నువ్వూ నీ భర్తను వెనకేసుకుని వస్తున్నావు. మీ సంసారపు గుట్టును దాచడానికి ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఆ కాలమైనా ఈ కాలమైనా మన సంప్రదాయాలు మారలేదుగా?
వివేకవతీ, విదుషీమణీ అయిన వదిన దగ్గిర నేనేం మాట్లాడను!
* * * *
ఒకటి రెండు రోజులై అన్నయ్య కాస్తలో కాస్త నింపాదిగా ఉన్నట్టు నాకు అనిపించింది. అందులో ఇంగువ చారు సత్తు గిన్నెలో కలిపి ఒక్కొక్క చెమ్చా నోటికి అందిస్తుంటే వాడు గుటుకూ గుటుకూ మింగుతుంటే నాకు కాస్త ప్రాణం తెప్పరిల్లినట్లుండేది.
'నువ్వొచ్చి నాన్నకి చేస్తున్నావని అమ్మ మా కిప్పుడు చేసి పెడుతోంది గాని మును పెన్నిసార్లు పిల్చినా దగ్గిరుండే పలికెది కాదు అత్తా' అని ఫిర్యాదు చేసేవాడు ముకుందం తల్లిచేత తల దువ్వించుకుంటూ- సీత అందుకుంది.
'అవునత్తా , మొన్న ఎంత ఏడ్చినా నాకు రెండు జడలూ వేస్తేనా?'
'మీరిలా పైకి తేలిపోతున్నారు గాని మా కోడలు చూడండి, ఏమైనా మాటాడుతుందేమో!' అంది వదిన మధురిమను చూస్తూ.
'ఓ, దాని బుద్దీ, నా బుద్దీ చెప్పాలి, గండుబిడాలి, దండు మరాటి' అని నేను అంటుంటే అన్నయ్య నవ్వేడు. ఆ నవ్వు చూస్తుంటే నాకు పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఏముంది, ఎంతెంతవాళ్ళనయినా రోగాలు అన్ని విధాలా పీల్చి పిప్పి చేసేస్తాయి. నీరసమూ, బలహీనతా దాడి చేసినప్పుడు , బహుముఖమైన నిస్సహాయత, పీడించి నప్పుడు ఎంతటి దీరులైనా పసివారలై పోతారు. ఎంతటి జ్ఞానులైనా , వృద్దులైనా , జ్ఞాన వృద్దులైనా సేవ చేసేవారి చేతిలో చంటి పిల్లలై పోతారు. గగనమంతా హృదయమూ, వసుధ అంత సహనమూ గలదని స్త్రీ పేరు తెచ్చుకోనేది రోగుల సేవలోనే. వచ్చిన మూడో రోజే అయన పేర ఉత్తరం రాశాను.
శ్రీవారికి,
మీరీపాటికి ఇల్లు చేరుకున్నారనుకుంటాను. నేనూ, మధురిమా యిక్కడ క్షేమంగా చేరేము. ఏమిటో ఎప్పుడూ మీతో చెప్పకుండానే యిక్కడికి వస్తున్నందుకు నాకు విచారంగా ఉంది.
అన్నయ్యకు యీ మధ్య చాలా ఎక్కువై పోయింది. ఆయాసంతో వెల్లకిలా పడుకోలేక రాత్రింబవళ్ళు కూచునే ఉంటున్నాడు. రాత్రి నిద్రపోవడం కూడా అలాగే. రక్తపోటు బాగా ఎక్కువైందిట. ఒకటి, రెండు రోజుల్నుంచి కొంచెం నయం అనుకోండి. వాడి ఆరోగ్యం లో తగినంత మార్పు కనబడగానే నేను బయలుదేరి వచ్చేస్తాను. ఏమయినా ఇంకొక పదిహేను రోజులు పడుతుందనుకుంటాను.
మీరు వీలయితే ఒకసారి వస్తే వీళ్ళతో పాటు నేనూ సంతోషిస్తాను. 'రాహు కేతువు లెందరైనా రవి ప్రకాశము కుంటుపడునా?' అన్నట్టు మీ సహజ సౌజన్యం మారదనీ, నాకు దూరం కాలేరని నాకు తెలుసు.
మధురిమ అస్తమానూ మిమ్మల్ని తలుస్తోంది. సరళ రోజూ క్యారియరు పంపోస్తోందని తలుస్తాను.
హృదయ పూర్వక ప్రణామములతో ,
మీ చరణదాసి, మంజుల.


