Home » Dr ravuri bharadwaja » పాకుడురాళ్ళు

                                           *              *           *            *                           
రాజా వరప్రసాదరావు బహద్దూర్ గారు మంగళాపురం జమీందారు. చిన్నవాడే తల్లి దండ్రులు గతించారు. దివాన్ శర్మ గారు, ఆ ఎస్టేట్ ను ప్రాణప్రదంగా కాపాడుకొస్తున్నారు. రాజాగారు, మొన్నటివరకూ ఇంగ్లండులో చదువుకొన్నారు. ఎస్టేటుకు రాగానే, దివాన్ గారు పెళ్ళి విషయం ప్రస్తావించారు. తనకు కావలసిన కన్యను తనే వెదుక్కుంటానని, పుష్కలంగా డబ్బు, కారుతీసుకుని రామారావుగారు బయలుదేరి, దేశమంతా తిరుగుతూ, వేసవి నాటికి కాశ్మీర్ చేరుకున్నాడు. శ్రీనగర్ పరిసరాలలో షూటింగ్ చేస్తున్నప్పుడే వారికి తొలిసారిగా కళ్యాణి కనిపించింది.
కళ్యాణి భువనమోహనంగా వుంటుంది. ఆధునిక నాగరికతకు ఆవిడ ఆటపట్టు. కళ్యాణి వెంట రాధమ్మ అని ఒక వయసు మళ్ళిన ఆవిడ వుంది. కళ్యానికి, ఆవిడే బాడీగార్డు. సలహాదారు, అన్నీనూ.
రాజా రామారావుగారు రాధమ్మద్వారా అన్ని వివరాలు తెలుసుకొంటాడు. కళ్యాణి "మడేపురం" జమీందారుగారి ఏక సంతానమనీ, తండ్రి గారు లేరనీ, తల్లి రోగిష్టి అనీ, కళ్యాణి బాగా చదువుకొన్నదనీ, ఇంకా పెళ్ళి కాలేదనీ, తగినవరుడు లభిస్తే పెళ్ళి చేసుకుంటుందనీ రాధమ్మ చెప్పింది. రామారావుగారు అదే రోజున కళ్యాణిని ఏకాంతంగా కలుసుకొని తన అభిప్రాయం తెలియచేశాడు. కళ్యాణి వొప్పుకొంది దివాన్ గారికి ఉత్తరం రాస్తూ పెళ్ళికి
 బ్రహ్మాండంగా ఏర్పాటు చెయ్యమని రాజాగారు ఆదేశించారు.
మంగళాపురంలో రంగ రంగ వైభవంగా వివాహం జరిగింది. ఆ పెళ్ళికి కళ్యాణి తరపున రాధమ్మ తప్ప మరెవ్వరూ హాజరుకాలేదు. అందరూ లోలోపల అనుకున్నారే తప్ప, ఈ మాటపైకి ఎవ్వరూ అనలేకపోయారు. రమారమిగా పాతికవేల రూపాయలు ఈ పెళ్ళికి ఖర్చయ్యాయి.
మంగళాపురంలో నీ రాజాగారి దేవి బ్రహ్మాండమయింది. చిన్నా పెద్దా భవనాలు, యాభై దాకా ఆ కోటలో వున్నాయి. పెద్ద బిల్డింగులో కొన్ని డజన్ల విశాలమైన గదులున్నాయి. ఆ యింటిపెత్తనమంతా కళ్యాణి చేతికొచ్చింది. కళ్యాణి రాధమ్మ చేతిలో కీలోబొమ్మ ఆమెను చూచినప్పుడల్లా, ఆమెతో మాట్లాడినప్పుడల్లా కళ్యాణి భయపడుతూ వుండేది.
కళ్యాణి ప్రోత్సాహం మీద, రాజా రామారావుగారు, కోటను ఆనుకొనివున్న కొండ అంచున కొత్తగా వొక బిల్డింగ్ కట్టించారు. దాన్ని నవనాగరికథ ఉట్టిపడేలా గది అలంకరించారు. దూరంగావున్న నదిని కలుపుతూ, ఒక కాలువను తవ్వించారు. రాజారామారావు గారు, కళ్యాణి గారు అప్పుడప్పుడు ఆ కాలువద్వారా, నదిలోకి పడవ షికారు వెళ్ళుతుండేవారు. ఆ పరిసరాలలో పెద్ద తోటను కూడా వేయించాడు రామారావు.
కళ్యాణి తరచుగా కాలువ వొడ్డునవున్న బిల్డింగులోనే వుండేది. తన అనుమతిలేనిదే అక్కడకు ఎవ్వరినీ  రానిచ్చేదికాదు.
కళ్యాణి రాకతో ఖర్చులు పెరిగిపోయాయి. వేలాది రూపాయలు ఖర్చు రాయించి, కళ్యాణి
పుచ్చుకొంటూవుండేది.. దివాన్ శర్మగారు ఒకసారి వివరాలడిగి అవమానింపబడ్డారు. ఆయన గారు తనవారిని రహస్యంగా కళ్యాణి వెంటవుంచి, అసలు రహస్యాన్ని కనుక్కొన్నారు.
"బాబుగారూ! నా అనుమానం నిజమయింది. రాణిగారి దగ్గరకు రహస్యంగా ఎవరో వచ్చి పోతున్నారు. ఇది మన దివానానికే అవమానం. నా బాధ్యతగనక చెప్పాను. తగిన చర్య తీసుకోండి" అని చెప్పారు శర్మగారు.
రాజారామారావుగారు దివాన్ గారి మాటలు మొదట నమ్మలేదు. కానీ, రహస్యంగా వచ్చిపోతున్న వాణ్ణి స్వయంగా చూశాక నమ్మక తప్పలేదు. అతను కళ్యాణిని కలుసుకొని అడిగాడు. అతను తనకు స్నేహితుడనీ,. ఈ పెళ్ళికాకముందునుండీ తమ ఇద్దరకూ పరిచయం వున్నదనీ చెప్పింది. రామారావుగారు కొన్ని వేళ రూపాయలిచ్చి, కళ్యాణిని వెళ్ళమంటాడు. తను వెళ్లనన్నది కళ్యాణి. ఆ రాత్రి తన స్నేహితుడు వస్తాడనీ,. అతని అభిప్రాయం కూడా తెలుసుకొన్నాక తను వెళ్ళేదీ, లేనిదీ రేపు చెబుతాననీ ఆవిడన్నది. ఆ రాత్రి రాజుగారు, కాలువ వద్దనున్న భవనం దగ్గర కొచ్చే సరికే ఒక భారీ విగ్రహం చక చకా కొండ దిగిపోవడం కనిపించింది. గదిలోనుండి కళ్యాణి నవ్వు వినిపించుతోంది. రామారావుగారు కోపంతో గదిలో కళ్యాణిమీదకు దూకబొయ్యేంతలో, ఎవరో అతని తలమీద బలంగా బాదారు. రామారావు స్పృహ తప్పి పడిపోయారు.
అతను కళ్ళుతెరచేసరికి కళ్యాణి చచ్చిపడివుంది. ఆ శవాన్ని కొండదిగవ లోయలో పూడ్చేసి, ఆగదికి తాళం వేసి, అంతపురానికి వచ్చాడు. కళ్యాణి తరచుగా డాక్టర్ దగ్గరకు, వెళ్ళడం రివాజు గనక ఈ రోజునా వెళ్ళివుంటుందని అందరూ అనుకొన్నారు. రామారావుగారికి మనశ్శాంతి నశించిపోయింది. మళ్ళా దేశాటనం బయలుదేరారు.
రామయ్య చిన్నపాటి రైతు. అతని కొక కూతురున్నది. ఆమె పేరు శాంత. రామయ్య మంచాన పడ్డాడు. తన అవసాన కాలంలో కూతురును దగ్గరకు పిలిచి, తన మరణానంతరం ఈ గ్రామంలో వుండవద్దనీ, నీ పినతల్లిదగ్గరకు పొమ్మనీ, లోగడే తనావిడకు జాబు రాశాననీ చెప్పి కన్నుమూశాడు.
శాంత పినతల్లి ఒక అడవిలోని సత్రంలో ఉంటోంది. పగలు కూడా ఆ దోవన ఎవ్వరూ వెళ్లరు. శాంత పినతండ్రి గజదొంగల నాయకుడు. అతని చేతికింద చాలా దొంగల ముఠాలున్నాయి. వారందరూ తస్కరించి తెచ్చిన డబ్బు సత్రం గదుల్లో మూలుగుతోంది. అక్కడ నియమాలు చాలా క్రూరంగా ఉంటాయి. ఒకానొక దొంగ తెలివిగా దొంగతనం చేయలేకపోయినందుకుగాను నాయకుడతన్ని స్తంభానికి కత్తి చనిపోయేదాకా కొరడాలతో బాదించాడు. ఒక మూల తుపాకులు, కత్తులు, బల్లాలు పడివున్నాయి. శాంత పినతల్లికి వొక కన్నూ, కాలూ లేదు ఒకసారి కోపంవచ్చి ఆవిడ భర్త కన్నును పెరికాడనీ, కాలు నరికేశాడనీ చెప్పుకొన్నదావిడ. దార్లు కానీ, గ్రామాలమీదపడి ఆ దొంగలముఠాచేసే అఘాయిత్యాలను, హత్యలను శాంత చూడలేక తల్లడిల్లి పోతూవుంది.
అక్కడే సంతకు సూరితో పరిచయమయింది. వాడో వెర్రిబాగుల నాగన్న. శాంతంటే పడి చచ్చేవాడు. శాంతను పెళ్ళాడాలని వాడి తలంపు. శాంతంటే పడి చచ్చేవాడు. శాంత పినతండ్రిగూడా దానికి వొప్పుకొన్నాడు తనా నరక కూపంనుండి బయటపడాలంటే సూరితప్ప, మరోగత్యంతరంలేదని శాంతకు తెలుసు, వాడితో నాయగారాలుపలికి, ఒక నాటి రాత్రి, కిటికీలోగుండా తాడు సాయంతో కిందికి దిగి, కాపలావారి కంట పడకుండా, సూరికి కూడా చిక్కకుండా పారిపోయింది.
ఎడతెరపిలేక, ధారాపాతంగా కురుస్తున్న వానలో, రోడ్డుకు వారగా చెట్లచాటుపడి పరిగెత్తుతున్న శాంతకు దూరంగా కారులైట్లు కనిపించాయి. శాంత చెట్టుచాటున నక్కింది. ఆ కారు వంతెనదాకా వచ్చి ఆగిపోయింది. శాంత వెనకగా వెళ్ళి డిక్కీలో దాక్కున్నది. అలసిపోయిన శాంత అక్కడే పడి నిద్రపోయింది.
అది రాజారామారావు కారు. కళ్యాణి మరణానంతరం, మనస్సు వికలమై దేశ సంచారం చేస్తున్నాడు. ఉదయం డిక్కీలో వున్న శాంతనుచూసి, ఆమె గాధవిని తనతోనే ఉండమన్నాడు, శాంతతో కొంతకాలం అన్ని క్షేత్రాలూ తిరిగి, మంగళాపురం వచ్చాడు. ఈసారి జరిగిన పెళ్లిచాలా నిరాడంబరంగా వున్నది.
శాంత సహజంగా ఉత్తమురాలు. అమాయిక, కష్టాల్లోపుట్టి కష్టాల్లో పెరిగిన మనిషి. రాచ మర్యాదలూ ఆమెకు తెలియవు. ప్రతి పనీ తనే స్వయంగా చేసుకోవడం ఆవిడకు అలవాటు. ఇక్కడ అది కుదరదు. దీనికి తోడుగా రాధమ్మ ఆమెను అనుక్షణం సూటీ పోటీ మాటలతో గాయపరుస్తూ వుండేది. రాజాగారికి పాతభార్య అంటేనే అభిమానమనీ, నువ్వంటే అసహ్యమనీ, నూరిపోస్తూ వుండేది. శాంత మనశ్శాంతి క్రమ క్రమంగా క్షీణించసాగింది.
లోయకు దిగువగా రోడ్డువేసే ప్రయత్నంలో కళ్యాణి శవం బయటపడింది. ఆమె చేతినున్న ఉంగరం ఆధారంగా అధికారులు ఆమెను గుర్తించి, రాజా రామారావుగారు హంతకుడని పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
దివాన్ శర్మగారు, శాంతను ఓదార్చి, కళ్యాణి తరచుగా ఏ డాక్టరుదగ్గరకు వెడుతుందో తెలుసుకొని, అతనినుండి  ఆమె వ్యాధికిసంబంధించిన సర్టిఫికెట్టును సంపాదించి, కోర్టులో దాఖలు చేశాడు. కళ్యాణి పెట్టుకొన్న నగలు కొన్నింటిని, శాంత తన పినతండ్రిదగ్గర చూసింది. ఆ సంగతి దివాన్ శర్మగారు పోలీసులకు తెలియచేసి, కళ్యాణి నగలకోసం దొంగలముఠావారు చంపి వుంటారనీ, ఆ ముఠా ఫలానాచోట వున్నదనీ, రిపోర్టుచేశాడు. పోలీసులు మంది మార్భలంతో బయలుదేరారు. దోవచూపడానికి శాంతకూడా వారితో ప్రయాణమయింది.
ఈ సంగతి పోలీసులు అనుకొంటున్న మాటలద్వారా రామారావు విన్నాడు. శాంతకు ఏదన్నా ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో, జైలునుండి తప్పుకొని, అక్కడేవున్న పోలీసు కారులో సత్రం వేపుగా బయలుదేరాడు. ఖైదీ తప్పించుకెళ్ళిన సంగతి పోలీసులకు తెలిసి, అతన్ని వెదుకుతూ అన్ని దిక్కులకూ వారు బయలుదేరారు.
దొంగల ముఠాకూ, పోలీసులకూ, చాలా సేపు యుద్ధం జరిగింది. చాలామంది చనిపోగా, మిగిలినవారు ఖైదేస్ గా చిక్కారు. ఆ సరికే అక్కడకు చేరిన రాజారామారావును, అతనికోసం వెదుక్కొంటూ వచ్చిన పోలీసులు కలుసుకొని, తిరిగి బంధించారు.
రామారావుగారు నిర్దోషులని రుజువుచేసే బాధ్యత శాంత మీద పడింది. ఆవిడ సూరిని కలుసుకొని అతన్ని చెల్లించి అన్ని వివరాలూ అడగ్గా ఒకసారి తానొక ముఠాతో కలిసిపోతున్నప్పుడు కాలువ వొడ్డునున్న బిల్డింగులో లైట్లు వెలుగుతున్నాయనీ  అందమైన ఒక యువతి మరో ఆజానుబాహువైన వ్యక్తి ఆ గదిలో ఉన్నారనీ, ఆ వ్యక్తి వెళ్ళిపోయాక, ఇప్పుడు కైదులోవున్న రామారావు వచ్చాడనీ, తను రామారావును స్మృహ తప్పిపోయేలాగా కొట్టి, ఆ యువతి వంటి మీద నగలు ఊదతీస్తున్నప్పుడు ఆ పెనుగులాటలో ఆవిడ బళ్లకు తగిలి, చనిపోయిందనీ, తను నగలు తీసుకొని వచ్చేశాననీ చెప్పాడు. ఈ సంగతులన్నీ టేప్ మీద రికార్డు చేయబడ్డాయి. ఈ సాక్ష్యంతో రామారావు హంతకుడు కాదని జడ్జి తీర్పు చెబుతూ, జైలునుండి పారిపోయినందుకూ పోలీసువారు అపహరించినందుకు మూడు మాసాలు శిక్షను విధించాడు.
పోలీసులు వాన్ లో ఎక్కించి రామారావును తీసుకుపోతున్నప్పుడు, శాంత కళ్ళనీళ్ళు కళ్ళ కక్కుకుంటూ "మీరు త్వరగా రండి మీకోసం వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తూ వుంటాను" అంటుంది.
వాన్ వెళ్ళిపోయింది.

                                                         *    *    *    *
శ్రీకాంత్ చదవడం ఆపుచేశాడు చలపతి అమాంతం అతన్ని ఆలింగనం చేసుకొన్నాడు.
"చాలా రోజుల తరువాత నేనో మంచి కధవిన్నాను. గొర్రెదాటు విధానం ఇందులో లేదు. నీ అదృష్టం బావుంటే ఇదే నిన్ను కీర్తి శిఖరాలమీద కూచోబెడుతుంది" అన్నాడు చలపతి.
ఈ మాటలు నిజంగా ఫీలయి అంటున్నాడో, మొహర్బానీ కోసం అంటున్నాడో మంజరి తేల్చుకోలేకపోయింది.
"అయితే ఓ చిన్న సంగతి. దీన్ని నాకిచ్చినట్లుగా ఎక్కడా అనకు నువ్వు రేపు సాయంత్రం కనిపించు మిగతా డబ్బు ఇచ్చేస్తాను. దీన్ని పిక్చర్ తీయడమే జరిగితే. నీ పేరుతోబాటు మరో పేరుకూడా వుంటుంది. టైటిల్స్ లో నీకేమన్నా అభ్యంతరమా?" అన్నాడు చలపతి.
"అదెందుకండీ?" అన్నాడు శ్రీకాంత్.
"మీతో వచ్చిన చావే ఇదీ! నీకెంత తెలివితేటలున్నా, నువ్వు రాశావంటే, ఏ ప్రొడ్యూసరూ డబ్బివ్వడు. ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకురాడు. అంచాత, బాక్సాఫీసు రైతుగా పేరున్న మరో మహాకవి పేరు కూడా నీ పేరును జోడిస్తాం. నీ డబ్బేదో నీకు ముందుగానే ముట్ట చెబుతున్నాంగా, అందులొ నువ్వు బాధపడవలసిందేముంది?" అన్నాడు చలపతి కాస్త విసుగుపడుతూ.
"కష్టపడింది నేనేకదండీ!" అని నసిగాడు శ్రీకాంత్.
నేను మాత్రం కాదన్నానా! ఇన్నేళ్ళనుంచీ నువ్వు కష్టపడుతూనే వున్నావు. ఏమన్నా లాభించిందా! ఆ వారంతా ఈ వొక్క పిక్చర్లోనే రావాలంటే ఎలా? ముందుగా నీ పేరు పబ్లిక్ లో కాస్త ప్రచారంకానివ్వు ఆ తర్వాత నువ్వు బిర్ర బిగిసినా నీకోసం కంపెనీలు వస్తాయి."
శ్రీకాంత్ ఇంకేమీ అనలేదు.
"మరి - మీకేమన్నా పనులుంటే చూచుకోండి.... రేపు సాయంత్రం నన్ను కలుసుకోవడం మర్చిపోదురుగా!"
"లేదండీ!"
శ్రీకాంత్, గాలిలో తెలుతున్నట్లుగా వెళ్ళిపోయాడు.
చాళా మంచి కధ మంజరీ ఇది! ఇందులో సినిమాక్కావలసిన హంగులన్నీ వున్నాయి. చెయ్యగలిగితే దీన్నో రత్నంలాగా తీర్చిదిద్దవచ్చు. చూస్తూవుండు. దీనిమీద నేను వేలు వసూలు చేసేస్తాను అన్నాడు చలపతి.
మంజరి లోపల ఏమనుకొన్నా పైకిమాత్రం ఆనందించినదానిలా కనిపించింది.
మన తెలుగుజాతిలో వున్న గొప్ప దౌర్భాగ్యమేమిటంటే, మన గొప్పదనం మనకు తెలియకపోవడం, ఇదో బెంగాలీ కాదనో మరాఠీ కధనో చెబుతే, మనవాళ్ళు కళ్ళు  మూసుకొని వేలు గుమ్మరించేస్తారు. దీనిమీద ఎంతనాటకమైనా ఆడవచ్చు....ఈ విధంగా వెలుగులోకి రాకుండా, ఎన్ని మాణిక్యాలు మూలబడి వున్నాయో తెలీదు మంజరీ!" అన్నాడు చలపతి.
మంజరి ఏమీ అనలేదు. సన్నగా నిట్టూర్చింది.

                                                               9
అటు వెంకటేశ్వర్లు గారూ, ఇటు రామబ్రహ్మంగారూ ఎంత తొందరపడ్డా లాభంలేకపోయింది. నాలుగైదు ముహూర్తాలు మాంచి ముహూర్తాలు పరబ్రహ్మశాస్త్రిగారు ఎన్నిక చేశారు.
"ఇవన్నీ చక్కని ముహూర్తాలండీ బాబయ్యగారూ! సమస్త గ్రహగతులున్నూ ఉచ్చదశను సూచిస్తున్నాయి. ఈ ముహూర్తాల్లో ప్రారంభించబడిన ఏ కార్యములైనప్పటికిన్నీ, దిగ్విజయం కావలసిందే తప్ప మరోలాగా అయేందుకు అవకాశమన్నది ఎంత మాత్రం లేదని, నేను ఘంటాపదంగా చెప్పగలను" అన్నారు శాస్త్రిగారు.
అంటే - ఇప్పటి నా పిక్చర్ బాక్సాఫీస్ హిట్ కాక తప్పదంటారు." అన్నాడు చలపతి.
అతను -నవకళా చిత్రాలయ సంస్థ తనదేనన్న ధోరణిలో మాట్లాడడం ప్రారంభించి చాలా రోజులయింది. కంపెనీ, తనదేననీ, రామబ్రహ్మంగారూ, ఫైనాన్స్ చేస్తున్నారనీ, తనుకూడా కొంత పెట్టుబడి పెడుతున్నాననీ, చలపతి కొందరి దగ్గర ఆన్నాడు.
పరబ్రహ్మశాస్త్రిగారు, మరో మారు, కాగితంమీద గళ్ళుగీసి వళ్లు కణుపులులెక్కించి, గట్టిగా నిట్టూర్చి తలను అడ్డంగానూ, నిలువుగానూ కదుపుతూ -"ఊఁహు -తప్పదు బాబయ్యగారూ! హరిహరాదులు అడ్డువచ్చినా, ఈ పిక్చర్ బ్రహ్మాండంగా సక్సెస్ కాక తప్పదు. ఆ విషయం దాని మొకాన స్పష్టంగా రాసివుంది." అన్నారాయన..
"గుడ్, గుడ్" అన్నాడు చలపతి.
తరవాత రామబ్రహ్మంగార్ని చాటుకు పిలిచి, ఓ పది నిముషాలు గుస గుసలాడాక చిన్న పింగాణీ పళ్ళెంలో నూటపదహారు రూపాయలూ, వక్కాకులూ ఉంచి, వెంకటేశ్వర్లు గారిచేత, శాస్త్రి గారి కిప్పించాడు చలపతి.
"శాస్త్రిగారూ! మీరు మరోలాగ అనుకోకండి, షూటింగ్ రోజున మిమ్మల్ని మళ్లీ పిలుద్దాం అనుకొంటున్నాం. సంతోషించాలి మీరు. తప్పదు" అన్నాడు చలపతి.
శాస్త్రిగారు, వాటిని స్వీకరించి నాలుగడుగులు వేయగానే, చలపతి ఆయన్ను కలుసుకొన్నాడు.
"మంజరి విషయంలో మీకేమన్నా కొరతచేసి ఉంటే, ఈ రూపంలో దాన్ని తీర్చుకొన్నాననుకోండి. మామూలుగా మీకు యాభయ్ రూపాయలేగా రేటు! మళ్లా కలుసుకొందాం. మరి సెలవిప్పించండి!" అని శాస్త్రిగారిని సాగనంపాడు చలపతి.
చిత్రమేమిటంటే -ఆ ముహూర్తం కాదు సరిగదా, అలాంటివి మరో మూడు గడచినా, నవకళా చిత్రాలయంవారు పనిని ప్రారంభించలేక పోయారు. వారికి నచ్చిన కధను తారకం తయారుచెయ్యనే లేదు. శ్రీకాంత్ కధను, బేరంపెట్టి చూశాడు చలపతి, కానీ నాలుగు వేలకు ఆ కధను కొనడానికి, రామబ్రహ్మంగారికి ఇష్టం లేదు, మంజరిద్వారా వెంకటేశ్వర్లుకు చెప్పించుదామన్న ఆలోచన చలపతికి రాకపోలేదు. కానీ, వెంకటేశ్వర్లుగారి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు వాడుకోవడం, భావ్యం కాదనిపించింది. అదీగాక శ్రీకాంత్ దగ్గర తను కొన్న కధ - చాలామంచిది. దానికెప్పుడైనా మంచిధర పలుకుతుంది. అలవసువలకు దాన్ని వొదులుకోవడంలో అర్ధంలేదు.
ఒకచెంప రామబ్రహ్మంగారు, కధో కధో అంటూ లబలబలాడి పోతున్నాడు, వెంకటేశ్వర్లు గారు కూడా, ఈమాటను చాలాసార్లు అన్నాడు. "డబ్బేమో నీళ్ళవగా ఖర్చయిపోతున్నది. అందుకు ఎంతకాలమని వోపికపడతాడు? వాడు మఠం ఎత్తేద్దామంటున్నాడు ఈలోగా మనమేదో వొకటి చెయ్యకపోతే, వాణ్ణి ఆపడం నావల్లకాదు" అని తేల్చేశాడు వెంకటేశ్వర్లు.
మంజరి ప్రాణం, జివ్వుమని పోయింది. చలపతి, తన అంబులపొదిని విప్పి కూచున్నాడు.
"అయ్యా! నేనంటే మీకు కోపంగానీ, ఇంతవరకూ, ఏపనీ కాకపోవడానికి ఎవరు బాధ్యులంటారు? ఏదో వో దిక్కుమాలిన కధను తీసుకొని, బొమ్మలాగి అవతల పడేస్తామంటారా? రేపీపాటికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీరు లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. ఆడబ్బు తిరిగిరావాలా వద్దా? లాభాలసంగతి నాతో అనకండి - అయినప్పుడు మనం, కొంచెం భారీఎత్తునే ఆలోచించాలి. ఈ కాస్త ఖర్చుకే మనం జడుసుకొంటే - పిక్చర్ తియ్యనేలేము. నేనుమాత్రం ఊరికే కూచున్నానా? కాకి తిరిగినట్టు, కధకోసం తిరుగుతున్నానా లేదా?" అన్నాడు చలపతి.
వెంకటేశ్వర్లుతో ఇంతగట్టిగా చలపతి మాట్లాడతానని మంజరీ అనుకోలేదు. వాళ్ళిద్దరూ మాటా మాటా అనుకొంటారేమోనని కూడా మంజరి భయపడింది. దీనికితోడు ఇంకో అనుమానమేమిటంటే -కాకితిరిగినట్టు తిరిగినంత మాత్రాన "కధ" దొరుకుతుందా?
మంజరి ఆలోచనల్ని చిద్రంచేస్తూ వెంకటేశ్వర్లు, మాట్లాడసాగాడు.
"అయితే ఇప్పుడేం చేద్దాం!" అన్నాడతను, మంజరికేసి, తిరిగి సన్నగా కన్ను మలుపుతూ!
"నేను రెండుమూడు రోజుల్లో ఓ కవినీ పట్టుకొస్తానుండండీ అందరం కూచుని అప్పటికప్పుడే తాడో పేడో తేల్చేద్దాం!" అన్నాడు చలపతి.
ఈ మాటలు వెంకటేశ్వర్లు విన్నాదన్న నమ్మకం, చలపతికి కలగలేదు. మంజరీ, అతగాడూ, కలిసి నేత్రావధానం ప్రారంభించారు. ఈ అభినయానికి పర్యవసానం చలపతికి తెలుసు. అతను ఛటుక్కున లోపలికెళ్ళి రెండు మూడు నిమిషాలయ్యాక, "మంజరీ! నిన్న నేనిచ్చిన కాగితాలు ఎక్కడ పెట్టావోయ్?" అని కేకేశాడు.
నిన్నమీరు నాకేకాగితాలు ఇవ్వందే అన్నది మంజరి వసారాలోనించే!
"ఇచ్చాను, నీకు జ్ఞాపకంలేదేమో! ఓసారి వాటిని తీసివ్వు" అన్నాడు చలపతి ఈసారి కొంచెం కోపంగా.
"నాకు మీరివ్వనే లేదండీ!"
"అయితే, నేనే ఎక్కడో పెట్టి మరిచిపోయి ఉంటాను..... ఇలా రారాదూ, ఈ పెట్టెలో ఉన్నాయేమో చూద్దాం"
 "ఏం కాగితాలెండీ" అంటూ మంజరి లోపలికొచ్చింది" నిన్న మీరు కాగితాలెప్పుడిచ్చారు?"
"ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా మంజరీ! నిన్న లోపలికి రప్పించడానికే అలా అన్నాను. నేను పిలవగానే లోపలికి రావాలిగానీ, యక్ష ప్రశ్నలన్నీ వేస్తూ కూచుంటావేం?" అని రుస రుసలాడాడు చలపతి.
మంజరి, ఓసారి చలపతి కేసి చూసి తలవంచుకుంది.
"నీకేమన్నా అభ్యంతరమా?" అన్నాడు చలపతి.
ఆమాట బాణంలాగా తగిలింది మంజరికి చలపతిమీద, కోపమూ అసహ్యమూ కూడా కలిగాయి.
"అలాగేలెండి! అడిగి చూస్తాను" అన్నది మంజరి.
చలపతి ఏదో అనబోయాడు. కానీ అనలేదు. హడావుడిగా బట్టలేసుకొని, అంతకన్నా హడావిడిగా వెళ్ళిపోయాడు.
"నేనూ వెళ్ళొస్తానమ్మాయిగారూ!" అన్నది తాయారు, తలుపుపక్క నిలబడి.
"తొందరేం?"
"ఏదన్నాపనున్నదేమో వెళ్ళనివ్వరాదా మంజరీ!" అని ఓక్షణం ఆగి, సరే నవ్వా! వెళ్ళు - అని తాయారుతో చెప్పి. "మరి -ఆఫీసుకెడతాను" అన్నాడు వెంకటేశ్వర్లు.
తాయారు వెళ్ళిపోయింది.
మంజరి వచ్చేనవ్వును ఆపుకొంటున్నదానిలాగా "మరి - ఆఫీసుకు వెళ్ళాలిగా, బయలుదేరండి!" అన్నది మంజరి.
"నేనుండటం నీకు కష్టంగా ఉన్నదా?" అన్నాడు వెంకటేశ్వర్లు.
"ఆఁ" అన్నది మంజరి ఫక్కున నవ్వేసి. "మిమ్మల్ని నమ్మకూడదు మీరు మామూలు మనుషులు కారు..!"
"అబ్బబ్బా! నా ఆరోగ్యం ఏమీ బావోలేదు మంజరీ ఉత్తినే దాహమవుతూ వుంటుంది. నిన్న డాక్టర్నదిగితే, ఏవో పిల్స్ రాసిచ్చాడు...కాసిని మంచినీళ్ళు తెప్పించు" అన్నాడు చలపతి.
"పనిమనిషి కూడా వెళ్ళింది. ఇహ నేనే తీసుకురావాలి అంటూ లేచి రెండడుగులు వేసింది మంజరి.
అంతలోనే వెంకటేశ్వర్లు కూడా కుర్చీలోంచి లేచే పయత్నం చేస్తున్నాడు.
మంజరి వెనక్కు తిరిగింది ముసి ముసిగా నవ్వుతూ. "బాబూ మీకు నమస్కారం! మీరక్కన్నించీ కదలండి, కదిలారంటే నేను మంచినీళ్ళు తీసుకురాను!" అన్నది.
ఈమాట ఎంతబలంగా పనిచేసేది మంజరికి క్షుణ్ణంగా తెలుసు. ఈ బాణం వదలి ఫలితంకోసం ఓ క్షణం వెంకటేశ్వర్లు కేసి చూసిందావిడ. అతని కళ్ళు మిలమిలలాడ సాగాయి.
"నేను దయ్యాన్నా, భూతాన్నా మంజరీ!" అన్నాడు వెంకటేశ్వర్లు. కుర్చీలోంచి మెల్లగా లేస్తూ.
"రెండూనూ, అని మనసులో అనుకొన్నది మంజరి. తరవాత బుంగమూతి పెడుతూ, ఏమిటమ్మా ఆ మాటలు? నేను నవ్వుతా అన్నదానికి అంతలా కోపగించుకోవాలా? ఐతే ఇహ అనన్లెండి" ఆనంది మంజరి. రెండడుగులు లోపలికి వేస్తూ.
వెంకటేశ్వర్లు కూడా లోపలికొచ్చి, తలుపులు మూశాడు.
"మీరిలాంటి వెకిలివేషాలు నాదగ్గర వెయ్యకండి. మర్యాదగా వసారాలో కూచోండి. నేను మంచి నీళ్ళు తెచ్చిస్తాను."
ఈలోగా వెంకటేశ్వర్లు గడియ పెట్టడంకూడా పూర్తిచేసి మంజరి భుజంమీద చెయ్యివేశాడు. ఆవిడ విదిలించి పారేసింది.
"అంత కోపమేం!"
"నేను మాట్లాడటంకూడా చాతకానిదాన్ని, నన్ను ముట్టుకోకండి మరో అన్నది మంజరి, అతని చేతుల్నించి తప్పుకోవడానికి పెనుగులాడుతూ."
వెంకటేశ్వర్లు పెద్దగా నవ్వాడు.
"పిచ్చిదానా! ఈ చేతుల్లోంచి తప్పుకొందామని నీ ఉద్దేశం! అన్నాడు వెంకటేశ్వర్లు. మంజరి పెదవులకోసం వెదుకుతూ "ఏం దాచుకొన్నావోయ్ ఇక్కడ? వీటికోసం నా ప్రాణాలివ్వమన్నా ఇచ్చేస్తాను."
"వేటికోసం?" అన్నది మంజరి ఏమీ తెలియనిదానిలా.
వెంకటేశ్వర్లు చూపులు ఆవిడ భుజాల మధ్య తారాట్లాడాయి.
మంజరి సిగ్గుపడిపోయింది.
"అబ్బ! నన్ను వెళ్ళనివ్వండి - అందులోనూ వందకూడా వాడుతున్నామంటున్నారు....నన్ను మంచినీళ్ళు తీసుకురానివ్వరా ఏం?"
వెంకటేశ్వర్లు మాట్లాడలేదు.
"అందుకే మీరంటే భయం. ఇహ నా ప్రాణాలు తినేస్రారు....ఆయనేమో కొంపలంటుకుపోయినట్లు పరిగేడతారు. ఉన్న పని మనిషిని కాస్తా మీరు పంపించేశారు....ఇందుకేనన్నమాట!"
నేనంటే నీకు ఇస్తంలేదా మంజూ అన్నాడు వెంకటేశ్వర్లు.
"భగవంతుడు నాకు బలం ఇవ్వలేదుగానీ, ఇచ్చేవుంటే, మిమ్మల్ని కొరుక్కుతినేదాన్ని....అదిగో...ఆ పనే మీరు చెయ్యొద్దు....ముందు అక్కణ్నించి చెయ్యి తియ్యండి....అసలే నాకు చక్కలి గిలి...అయ్యో రామా!ఏం విరిచేస్తారండీ!"
వెంకటేశ్వర్లు పిచ్చికుక్కయి పోయాడు, అతన్ని ఇంకాస్సేపు ఏడిపించాలనిపించింది మంజరికి.
"ఉండండి చెబుతాను.....ఎవరో వస్తున్నట్లుగా ఉంది...."
వెంకటేశ్వర్లు గబాలున మంజరిని వొదిలి, మూలగా నుంచున్నాడు. మంజరి పకపకానవ్వుతూ, ఏం ధైర్యమండీ బాబూ మీది అన్నది అవును గానండి నేనిలా అడుగుతున్నానని, అనుకోకుండా ఉంటే-
"ఏమిటి?" అన్నాడు వెంకటేశ్వర్లు.
మంజరి అతనికెదురుగా నుంచుని, రెండు భుజాలమీద చేతులు వేసింది. సన్నగా నవ్వుతూ అతను మంజరి వీపువెనకగా చేతులు కలిపి దగ్గరగా తీసుకొన్నాడు.
"ఏమిటమ్మడూ అది?"
"నాకు సిగ్గుగా ఉంది బాబు! విన్నా మీరు ఎగతాళి పట్టిస్తారు. పోన్లెండి....ఏమీలేదు" అన్నది మంజరి.
అతనోసారి మంజరి కళ్ళల్లోకి మొత్తగాచూసి, "ఎంతబావుంటాయి మంజూ నీకళ్ళు?" అంటూవాటిని మెల్లగా ముద్దు పెట్టుకొన్నాడు.
"ఇలా నన్ను రెచ్చగొట్టి చంపుతారు. ఆనక నేనేమన్నా చేస్తే చేశావంటారు....ఏమో బాబూ! ఏ ముహూర్తాన నన్ను మాయచేసి వలలో వేసుకొన్నారోగానీ, నాకు నిద్రాహారాలు లేకుండా చేశారు.... మీరూ, మీ ఆఫీసుపనులూ, ఏగంగలో నన్నా దూకండి కనీసం రోజు కొక్కసారన్నా మీరునాకు కనిపించాలి. లేదా కారు పంపండి నేనన్నా మీ కోసం వస్తాను" అన్నది మంజరి.
"ఎందుకమ్మా నేనంటే అంత వెర్రి వ్యామోహం నీకు?" అన్నాడతను.
"ఎందుకా?" అని ఓ నిమిషంపాటు ఆలోచించింది మంజరి తరవాత తల అడ్డంగా తిప్పుతూ, కింది పెదవిని కొరుక్కొంటూ "ఏమో! నాకు తెలీదు నేను చెప్పలేను...మీరు నన్నేంచేశారో చెప్పరూ?"
వెంకటేశ్వర్లు ఆమె చెక్కిళ్ళను సున్నితంగా నిమిరాడు.
"నాకోసారి హంపీ చూడాలని ఉన్నది. హంపీలో పూర్వపు రాజుల మేడలు ఉన్నాయిటగా!"
"అవునట చాలామంది వెడుతూ ఉంటారు...మనమూ వెడదామంటావా?"
"మనమూ - అంటే మీరూ నేనూ మాత్రమే వెళ్ళాలి. ఈ పాడు సజ్జునంతా వెంట తీసుకురాకండి. మనిద్దరమే వెళ్ళి ఓ రాత్రల్లా అక్కడ ఉండి తిరిగివద్దాం....అయితే ఆ సీసాలు మాత్రం తీసుకురాకండి" ఆన్నది మంజరి.
"అలాంటిచోట మందు" లేకపోతే మజాయే ఉండదు మంజరీ! ఈసారి వెరైటీ మారుద్దాం....అలాగే! ఎప్పుడు పోదాం?"
"మీ ఇష్టం! నేనెప్పుడూ రెడీయే" అన్నది.
"ఇప్పుడు కూడానా?" అన్నాడు వెంకటేశ్వర్లు మెల్లిగా ఆమె చెవిలో.
"అబ్బబ్బా! మనిషి కనిపిస్తే మీరు బ్రతకనివ్వరు. ఏం చంపుకు తింటారండీ! అన్నది మంజరి!"
వెంకటేశ్వర్లు అన్నంతపనీ చేశాడు.
అతను చెప్పులు తొడుక్కొంటున్నాడు. మంజరి గోళ్ళతో జుత్తు సరిచేసుకొంటూ "చిన్నమాట" అన్నది.
"అబ్బబ్బా! ఏం ప్రాణాలు తీస్తావు మంజరీ! అందుకే నువ్వంటే భయం!" అంటూ లోపలికొచ్చాడు. "ఏమిటి?"
"గుంటూరునించి మా చెల్లెలు ఉత్తరం రాసింది. దానికేమో ఇబ్బందులొచ్చి పడ్డాయిట. రెండు వేలుంటే సర్దమన్నది. ఇంకో మూడుమాసాల్లో వారికి రావలసిన డబ్బు వస్తుందిట. మన మేమన్నా పంపడానికి వీలుపడుతుందంటారా?" ఆనంది మంజరి.
"చూద్దాం!" అన్నాడతను.
"అలాగనకండి. ఇంకెక్కడా వీలుపడకనే అది నాకురాసింది. కావాలంటే మీరు తరువాత చెల్లుబెట్టుకొందురుగానీ! ఖర్చురాసి ఇప్పించండి!"
"సరే! సాయంత్రం నేను చలపతికిచ్చి పంపుతాను"
"కొంప ముంచారు. ఈ సంగతి ఆయనదాకా వెళ్ళనివ్వకండి. అతనికా ఉత్తరం వచ్చినట్లే తెలీదు.... మీరే స్వయంగారండి. కాసేపు సరదాగా కూచుని మాట్లాడుకొందాం"
"నేనొస్తే ఉత్తినే కూచోలేను." అన్నాడు వెంకటేశ్వర్లు నవ్వుతూ. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra