మగవారిలో కలిగే శారీరక బాధలకు కూడా విముక్తినిస్తుంది సెక్స్. సెక్స్ లో పాల్గొన్నప్పుడు పురుషులలో టేస్టోస్టిరోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.
దీనివల్ల సెక్స్ లో పాల్గొన్న తరువాత శరీరం ఎంతో హాయిగా వుంటుంది. అందుకే సెక్స్ తరువాత మగవాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. తలనొప్పితో బాధపడేవారు మనసును సెక్స్ మీదికి మళ్ళిస్తే, త్వరగా బాధనుంచి బయటపడగలుగుతారు. సెక్స్ లో పాల్గొనే సమయంలో శరీరం నుంచి విడుదలయ్యే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు బాధలను తగ్గిస్తాయి. సెక్స్ లో పాల్గొనటం వల్ల రక్తప్రసరణ మెదడుకు తగ్గి జననాంగాల ప్రాంతానికి పెరుగుతుంది. దీనివల్ల మెదడుకు తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
క్రమం తప్పక సెక్స్ లో పాల్గొనటం, పురుషుల ఆర్యోగానికే కాదు, స్త్రీల ఆరోగ్యానికి కూడా చాలా..... చాలా... అవసరం. వయసు మళ్ళిన మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు అధికమవుతుంటాయి. కారణం తగినంతగా వాళ్ళు సెక్స్ లో పాల్గొనకపోవటమే!"
సుష్మా ఫ్రాంక్లిన్ చెప్పింది వింటూ, దాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నంలో అక్కడ గుమిగూడిన స్టూడెంట్స్ అంతా శిలాప్రతిమల్లా బిగుసుకుపోయారు.
"టెక్ట్స్ బుక్స్ చదవటమే కాదు- జీవితాన్ని కూడా చదువుకోవాలి. నా జీవన విధానం కొందరికి నచ్చకపోవచ్చు..... ఆ కొందరు కాకుండా, మిగిలిపోయిన వారికి నచ్చవచ్చుగా......?"
"మనిషి జీవితం ఇలాగే వుండాలి అని, ఎక్కడా ఎప్పుడూ ఎవరూ నిర్ధేశించలేదు..... ఎవరికివారే, వారికి నచ్చిన పద్ధతిలో వారి జీవన విధానాన్నిస్థిరపరచుకోవాలి....." అని ఆమె వున్నచోటు నుంచి లేచి నిలబడింది.
అదే సమయంలో క్యాంటిన్ బయట బ్లూకలర్ మారుతీ ఆగింది. స్టీరింగ్ ముందు కూర్చున్న వ్యక్తిని చూడగానే నవ్వుతూ చెయ్యూపి-
"సీయూ..... ఫ్రెండ్స్! మిస్టర్ మధు..... రెండు నెలల తరువాత కాల్షీట్స్ ఇస్తాలే...." అంటూ వెళ్ళిపోయింది సుష్మ.
"ఏం చదువుతోంది?" బిత్తరపోతూ అడిగాడు మధు.
"బి.ఎ. ఆరేళ్ళ నుంచి..... పెద్ద ఫాస్ట్ లే! ఆ అమ్మాయిని నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే చాలు..... జీవితంలో ప్రేమకే కాదు, ప్రతి విషయానికీ పెట్టుబడే ముఖ్యం అని నీకు తెలిసిపోతుంది" చెప్పాడు రవి.
ఆలోచనల్లో పడ్డాడు మధు.
"జీవితం, ప్రేమ, సెక్స్, పెళ్ళి, శారీరక బలం, మానసిక ఆరోగ్యం, ప్రశాంతత పట్ల ప్రపంచ పరిశోధనా శాఖల్లో ఇన్ని ప్రయోగాలు జరుగుతున్నాయా? దీన్ని ఆధునిక జీవన విధానం అనుకోవాలా? లేక విచ్చలవిడితనం అనుకోవాలా? అదీ కాదనుకుంటే నేటి జనరేషన్ కొత్త ప్రపంచపు వాకిళ్ళు తెరిచి చూడాలనుకోవటం లేదా? ఏమీ అర్థం కాలేదు మధుకి. నేటితరం యువత చూడాల్సిన నిజాలు చాలా వున్నాయనిపించింది మధుకి.
"పవర్ పేట జంక్షన్ లోనే మన ఆఫీసు...... సాయంత్రంరా. నువ్వెక్కడుంటున్నావ్?" అడిగాడు రవి.
చెప్పాడు మధు.
"అయ్యబాబోయ్ - ఇన్ సెక్యూరిటీ మాస్టారింట్లోనా? అదెలా కుదిరింది?" జాలిగా మధుకేసి చూస్తూ అడిగాడు రవి.
మధు అర్థంకాక రవికేసి చూస్తూ వుండిపోయాడు.
"ఇంటికి తాళం వేసి, పదడుగులు వెళ్ళి, వెనకకు తిరిగివచ్చిమ్ పాతికసార్లు తాళం పట్టి లాగిచూస్తాడు. పది రూపాయల జేబులో పెట్టుకునిమ్ వున్నాయా, పోయాయా అని వందసార్లు జేబు తడిమి చూసుకుంటాడు. ఆ మాస్టారు ఇప్పటికే నాలుగొందల అద్దె ఇళ్ళు మారివుంటారు. ఎందుకో తెలుసా? కిటికీల్ని లోపల్నుంచి వేసి, బయటికొచ్చి అవి పడ్డాయో లేదో అని పాతికసార్లు ఎగిరెగిరి తన్నితే, కిటికీలు బద్దలైపోయి ఇంటి ఓనర్స్ బతుకు బజారైపోయి, ఖాళీ చేయించేశారు.
అట్లాంటి అభద్రతా భావమే పెట్టుబడిగా బతికే ఆ మాస్టారి ఇంట్లో వుంటున్నావా? నీకిదేం ఖర్మ?" మరింత జాలిగా మధుకేసి చూస్తూ అడిగాడు రవి.
"ఆ మాస్టారు మా నాన్నకి బాగా తెలుసులే" చెప్పాడు మధు లోపల చింతిస్తూ.
పదినిముషాల్లో అందరూ విడిపోయారు.
మధ్యాహ్నం క్లాసులు లేకపోవడంతో ఇంటికొచ్చేశాడు మధు.
తన రూమ్ లో కెళ్ళిపోయి, తలుపేసుకుని సూట్ కేసు తెరిచాడు.
* * *
ప్రేమ అనే పదానికి తన జీవితంలో చాలా సంబంధం వుందనుకున్నాడు మధు.
దాదాపు పదేళ్ళక్రితం విడిపోయిన ప్రేమ , చిన్నప్పుడు తనతో ఆడుకున్న ప్రేమ గుర్తుకొచ్చింది.
ప్రేమ తండ్రి బిజినెస్ మన్. ఆ సందర్భంగా ఏదో వూరునుంచి ఈ వూరొచ్చారు ప్రేమ వాళ్ళ కుటుంబం. రెండేళ్ళ తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు చదువుకోసం తను పట్నం వచ్చేశాడు.
"ప్రేమావాళ్ళు ఎక్కడికెళ్ళిపోయారు?" ఒకసారి సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళమ్మను అడిగాడు మధు.
"వ్యాపారస్తులు ఒకేచోట ఎలా వుంటారు? ఎందుకట?" ప్రశ్నించింది వాళ్ళమ్మ.
"ప్రేమ గురించి....."
"ఇప్పుడా పిల్ల ఎందుకట..... పెళ్ళయిపోయుంటుంది. ఇద్దరు ముగ్గురు పిల్లల తల్లయిపోయుంటుంది."
'పెళ్ళయిపోయి వుంటుందా?' ప్రేమ గురించి ఆసక్తి తగ్గిపోవడానికి తల్లి అన్న మాటలు కూడా ఒక కారణం అయ్యాయి.
మధు ఆలోచనల్లో ప్రేమ గురించిన వూహలు మాత్రం తగ్గిపోయాయి. అయినా వాటి తాలూకూ సాంద్రత తగ్గలేదు."
కానీ అప్పుడెప్పుడో దాచుకున్న చిన్ననాటి ప్రేమ ఫోటోను మాత్రం భద్రంగా దాచుకున్నాడు.
'ప్రేమని తను అప్పుడే ప్రేమించాడా?'
అప్పట్లో ప్రేమపై తనకున్న భావం కేవలం స్నేహంతోటే ముగిసిపోయిందా?
తల్లిగానీ, తండ్రిగానీ ఎవరి దృష్టీ ఆ ఫోటోమీద పడకుండా ఆ ఫోటో పాడైపోకుండా దాయడం చాలా కష్టమైపోయింది మధుకి.
అయినా ఆ ఫోటో బూడిదరంగులోకి మారిపోయింది.
సగం చిరిగినా ఫోటోలో ప్రేమ..... చిన్ననాటి రెండు జడల ప్రేమ.
తన ఫోటోను ప్రేమ ఇలాగే, తనలాగే అభిమానంగా దాచుకుంటుందా? ఎందుకు దాచుకుంటుంది?
పెళ్ళయిపొతే, పూర్తిగా తనని మరిచిపోయే వుండివుంటుంది.
అసలు ప్రేమ ఇప్పుడెక్కడుందో! ఇండియాలోనే వుందా? ఏ ఆమెరికాలో వుందో? అనుకొంటూ సగభాగం చిరిగిన ఆ ఫోటోవేపే చూస్తూ చాలాసేపు గడిపేశాడు.
తర్వాత ఫోటోను డైరీ సెకండ్ కవర్లో పెట్టి, మళ్ళీ సూట్ కేసులో దాచేశాడు.
* * *
నిద్ర రావడం లేదు.
ఇప్పుడు మధు జ్ఞాపకాల నిండా ప్రేమ గురించిన ఆలోచనలే.
'తనని ఎవరైనా ప్రేమిస్తారా?
ప్రేమిస్తే, ఆ ప్రేమకు పెట్టుబడి ఏమిటి?"
సుష్మా ఫ్రాంక్లిన్ చెప్పిన విషయాలు ఆమె కల్పించినవి కావు. కానీ ట్రూలవ్ కి మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు కారణమవుతాయంటే నమ్మలేకపోతున్నాడు తను.
'వాంఛ ఒక్క నిముషంలో చల్లారే చిన్నవేడి. ప్రేమ జీవితాన్నంతా వెలిగించే విద్యుచ్ఛక్తి' అని చలం చెప్పిన మాటలకి అర్థం లేదా?
వింటున్నదీ చూస్తున్నదీ ప్రతిదీ అర్థమైనట్లే అనిపించి అవగాహనకి అందకుండా పోతోంది. ఈ వయసులో ఇలాంటి సందిగ్ధత ఎవరికైనా తప్పదేమో? చేసేది మంచైనా చెడైనా తను కోరుకునే సుఖాన్ని తను సొంతం చేసుకొంటున్న సుష్మ ధైర్యాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోయాడు మధు.
ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు మధు.
* * *
ఆరోజు బ్రహ్మకు హాలీడే. వీణ వాయించీ, వాయించీ సరస్వతీ దేవికి కూడా విసుగొచ్చింది. అభ్యంతర మందిరం చాలా విశాలంగా వుంది. అగరొత్తుల ఘుమఘుమలతో, సువాసన భరితంగా, మనోహ్లాదంగా వుంది. బ్రహ్మా, సరస్వతీ ఇద్దరూ అష్టాచెమ్మా ఆట ఆడుతున్నారు. మధ్య మధ్యలో ఒకరిమీద ఒకరు జోకులేసుకుంటున్నారు. అకస్మాత్తుగా ఏదో జ్ఞాపకానికి వచ్చింది సరస్వతికి.
"పతిదేవా...... ఇంతకు పూర్వం అద్భుతమైన సౌందర్యరాశుల్ని సృష్టించి, భూలోకవాసుల్ని చేసేవారు. ఈ మధ్య సౌందర్యం జోలికే వెళ్ళకుండా, మామూలుగానే సృష్టిస్తున్నారేమిటి?" అడిగింది సరస్వతి.
బ్రహ్మ తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు.
"ఆ చిరునవ్వుకు అర్థం ఏమిటో నాకు బోధపడడం లేదు. విడమర్చి చెప్పొచ్చు గదా" నిష్ఠూరంగా అంది సర్వస్వతీదేవి.
"చెప్పొచ్చు.... చెప్తాను విను. నేను సృష్టించడం, సదరు అమ్మాయి అందగత్తె కావడం, ఆ అమ్మాయి కోసం విష్ణువు మరో అవతారం ఎత్తి ఆమెను వివాహం చేసుకోవడం, ఇదేగదా ఇంతకాలం - ఎంతోకాలంగా జరుగుతూ వస్తోంది. ఎందుకొచ్చిన గొడవ చెప్పు" అన్నాడాయన.
"మరొక అవతారమెత్తే ఓపిక ఆయనకు కూడా లేదుగానీ, నా ముచ్చట కోసం కొత్త సహస్రాబ్ధి చివర అద్భుతమైన సౌందర్యరాశుల్ని సృష్టించవచ్చు గదా" అభ్యర్ధనగా అంది సరస్వతీదేవి.
"సౌందర్యరాశుల్నా! వద్దు...... వద్దు..... భూలోకంలో సౌందర్యరాశులు అనకూడదు. ఏలన అంటే, వారు ఏడాదికి ఒకరికే 'మిస్ యూనివర్స్' బిరుదునిస్తారు. అందుచేత నేను సృష్టించినచో ఒకే అమ్మాయిని సృష్టించవలయును" సాలోచనగా అన్నాడు బ్రహ్మ.
"అయితే ఒక సౌందర్యవతినే సృష్టించండి."
"అలాగే సృష్టిస్తాను. ఏమిస్తావ్?" అడిగాడు చతుర్ముఖుడు.
"ఏమివ్వటమేంటి?" సరస్వతీదేవి ఆశ్చర్యంగా అడిగింది.
"ఆ మధ్య భూగోళంలోని ఇండియాకు వెళ్ళానులే...... అక్కాడ ఏ పని చెయ్యడానికైనా ఏమిస్తావ్? ఏమి తెస్తావ్? అంటూ డబ్బుకు సంబంధించిన మాటే వినిపిస్తోంది. భార్గవ రాముడికి పదునైన గొడ్డలిచ్చి, భారతదేశంలోని రాయకీయ నాయకుల్నీ, ప్రభుత్వోద్యోగుల్నీ, గూండాల్నీ ఓ చూపు చూడమని చెప్పాలనిపించింది......." అన్నాడు బ్రహ్మ ఆవేశంగా. తను భారతదేశంలో చూసిన అవినీతినీ అలసత్యాన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ.
"నన్ను కూడా ఆ డబ్బే లంచంగా ఇవ్వమంటారా మీ సృష్టికి?"
"అవును...... ఎందుకంటే, నేను నీ కోరిక మీదట సృష్టించే అందాల రాశి కూడా ఆ డబ్బు కారణంగానే ఇబ్బంది పడుతుంది కనుక."
"లేదు. ఇబ్బంది పడదు."
"కాదు సరస్వతీ..... "ధనం వాఛా ప్రేరితం' ఈనాటి మానవ సమాజం 'బైద మనీ, ఆఫ్ ద మనీ, ఫర్ మనీ.....' యూనో?"
"ఏమిటీ? మీకీ అప్రాచ్య భాష వస్తోంది?"
"నాగరికత..... చెప్పానుగా, భూగోళం వెళ్ళొచ్చిన విషయం."
"అందుకేనా - ఆ జీన్స్ కూడా మోసుకొచ్చారు? మన ఈశ్వరుడు మరిదిగారికి కోదా తేవాల్సింది.... సరిపోవును" నవ్వుతూ అంది బ్రహ్మముఖి.
ఆ మాటను వినిపించుకోలేదు బ్రహ్మ.
ఆత్మ చింతాక్రాంతుడైపోయాడు. వెంటనే భటులకు ఏవేవో ఆజ్ఞల్ని జారీ చేశాడు. దేవలోకంలోంచి లేత గంధపు ముక్కల్ని అరగదీసి తెచ్చిన గంధాన్నీ, లావణ్యానికి సోగసునిచ్చే చందనం. కుంకుమపువ్వు, దేహానికి బంగారు కాంతినిచ్చే ధవళ మూలికలూ, వజ్రభస్మం తదితర సామగ్రినంతా ఒక పక్క పెట్టుకుని గంధంతో ఒక అందమయిన ఆకారాన్ని తయారుచేశాడు. దానికి చందనం, కుంకుమ పువ్వుల్ని అద్దాడు. ధవళ మూలికలతో ఆపాదమస్తకపు కొలతల్ని తీర్చిదిద్డాడు.