"శ్వేత గురించి ఇలా మాట్లాడ్డంలో నా ఉద్దేశం నీకు జరగాల్సిన పెళ్ళి గురించి గుర్తుచేయాలని కాదు వశిష్టా! నువ్వింకా గతంలో నిన్ను మోసంచేసిన ఏకాంతని మరిచిపోలేదని నేను అర్ధంచేసుకోగలను. ఆ గాయం పచ్చిదనంతో నువ్వు ఇప్పటికే నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నావని ఊహించగలను. అయినాగాని శ్వేత ఈ ఇంటి కోడలు కావడం రేపైనా తప్పదని నీకు మాత్రమేగాక మీ అమ్మకీ తెలిసిన విషయమేగా అందుకే రాజేష్ గురించి మీ అమ్మతో చెప్పగానే చాలా రియాక్టయింది. నా కోడలికింత అవమానం జరగటమా అంటూ ఆందోళన ప్రకటించింది."
నిజానికి ఇంత దారుణంగా లక్ష్మి రియాక్ట్ కాలేదుకాని భర్త తన గురించి అలా మాట్లాడుతుంటే నిజమా కాదా అని ఆలోచించటానికి బదులు రియాక్టయ్యే వుంటానని తీర్మానించేసుకుంది.
"అయితే ఒకటి మాత్రం నిజం...."సవ్యసాచి వేదాంతిలా అన్నారు అణువంత బాధని గొంతులో ధ్వనింపచేస్తూ "గూండాలు అలా కాలేజీలో అడుగుపెట్టి రాజేష్ ని లాక్కుపోవడం చట్టరీత్యా నేరం ఆ విషయం నేను హోంమినిస్టరుకి తెలియచేసి బలంగా ఖండించాను కూడా...శ్వేత నాకు కాబోయే కోడలైనాగాని జరిగింది జరగాల్సింది కాకపోయినా గాని అలా గూండాయిజంతో సమస్యని పరిష్కరించాలనుకోవడం నేను సహించలేనిదని తెగేసి చెప్పాను. దానికాయన బాధపడలేదు... సుందర చైతన్యానందగారు చెప్పిన సనాతన స్రవంతిని ఉటంకించారు. 'అజ్ఞానే నావృతం జ్ఞానంతేవా మహ్విన్తి జాంతవః' అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అయిదవ అధ్యాయంలో యేమన్నారో సూర్నారాయణగారి నోటివెంట వినగానే అసలు జీవులు మోహం చెంది తమ పరిధుల్నిదాటి ప్రవర్తించడానికి వారిని చుట్టిన అజ్ఞానమే కారణమా అన్న మీమాంసలో పడ్డాను. రాజేష్ కూడా అలాంటి మోహంతోనే అమ్మాయిల వెంట పడడం నిజమైతే మరి శరీరానికి శిక్ష అవసరమే అని నమ్మాను. అయినా అసలు సూర్నారాయణగారు దండించారే తప్ప ఆత్మహత్య చేసుకోమని ప్రోత్సహించలేదుగా... హత్యగాని, హత్యకి ప్రేరేపించడంగాని చట్టరీత్యా నేరమవుతుంది తప్ప దండించడం కాదుగా. దండించకుండా ఆయన రాజేష్ ని అరెస్ట్ చేయించి వుంటే కాలేజీ నుంచి డిబార్ అయ్యేవాడు. జైలుశిక్షతో భవిష్యత్తు అంతా నాశనం చేసుకునేవాడు. అది కాకూడదనేగా ఆయన మందలించి వదిలింది."
"ఆయన మందలించి వదిలిపెట్టలేదు డాడీ" తండ్రి తాత్వికమైన ఉపదేశాల్ని అర్దోక్తిగా ఖండిస్తూ అన్నాడు వశిష్ట. "రాజేష్ ని శారీరకంగా హింసించడమేగాక మీరు చాలా గొప్పవాడని చెప్పే రాజారాంగార్నీ బ్రూటల్ గా చావగొట్టారు....అప్పుడది శిక్షార్హమైన నేరమేగా?"
"అలా అయితే నేరస్థుడినుంచి నిజం రాబట్టాలని మనం ఉపయోగించే థర్డ్ డిగ్రీ ట్రీట్ మెంటూ నేరమే. ఆ లెక్కన మనలో సగంమంది ఈపాటికి జైలుకి వెళ్ళాలి వశిష్టా" ప్రశాంతంగా నవ్వాడు సవ్యసాచి... "నిజమే... అంత బ్రూటల్ గా ప్రవర్తించాల్సింది కాదు. కానీ శ్వేతంటే హోంమినిస్టరుగారి ఒక్కగానొక్కకూతురు. పైగా నీకు కాబోయే భార్య."
ఇప్పటికి చాలాసార్లు ఈ ఆలోచన వ్యక్తం చేసిన సవ్యసాచి ఈ రోజు నాలుగైదుసార్లు అదే విషయాన్ని చర్చించడంతో వినటానికి మనస్కరించనట్టు వేగంగా గదిలోకి వెళ్ళబోయాడు.
"వశిష్టా"
సవ్యసాచి పిలుపుతో టక్కున ఆగాడు.
"నేను చెప్పిందంతా నువ్వు నమ్మాల్సిన అగత్యం లేదు... నువ్వు కూడా మొత్తం ఇన్వెస్టిగేట్ చెయ్యి"
శ్వేతనీ, ప్రిన్సిపాల్ నీ అప్పటికే అతను కలిసి చాలా ఆరాతీసినట్టు తెలిసిన సవ్యసాచి ఇంకా ఎఫెక్టివ్ గా తన అభిమానాన్ని ప్రదర్శించాడు.
"ఒకవేళ పోలీస్ లెవరైనా రాజేష్ మీద ఈవ్ టీజింగ్ విషయంలో ఫాల్స్ కేసెస్ పెట్టివుంటే అదిగాని నువ్వు నిరూపించగలిగితే..." క్షణం ఆగి అన్నారాయన "జరిగిన పొరపాటుకి నేనే బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను."
ఒక సిటీ కమీషనరు తలచుకుంటే ఎవర్నయినా ఎలాంటి కేసులోనైనా ఇరికించొచ్చని తెలీనంత అమాయకుడేం కాదు వశిష్ట.
అయినా తండ్రి మాటల్ని విశ్వసించకుండా వుండలేకపోయాడు.
ఆశ్రిత చెప్పినదే కాకా రాజేష్ చివరగా రాసిన ఉత్తరం చూసి వుండడంతో ఎక్కడో ఏదో 'గేప్' వుందని గ్రహించినా ఖచ్చితంగా అదేమిటో అర్ధంకాలేదు అతనికి.
స్వతహాగా పదునుగా ఆలోచించగలిగే వశిష్ట ఇక్కడ ఇలాంటి సందిగ్ధంలో మిగిలిపోవడానికి కారణం ఒక్కటే.
చెప్పింది, అతడ్ని మభ్యపెట్టింది పోలీస్ కమీషనర్... అంతకుమించి అతడి తండ్రి.
* * *
"సో..." రెస్టారెంట్ లో తనకు అభిముఖంగా కూర్చున్న వశిష్టతో అంది ఆశ్రిత... "నా తమ్ముడి విషయంలో మీరు న్యాయం చేయలేనంటారు"
ఆమె గొంతులో ఆవేశం లేదు. ఆందోళన లేదు. ఇంతకుమించి న్యాయం ఆశించడం అన్యాయం అన్నంత ప్రశాంతంగా అంది... నిజానికి అది ప్రశాంతత కూడా కాదు... న్యాయ చరిత్ర గుహాంతరాలలో చారికలుగా మిగిలిన ఎన్నో సత్యాలు ఆమె కళ్ళముందు కదులుతుంటే నిర్వేదంగా తన భావాన్ని వ్యక్తం చేసింది.
ఆమె మనసుని అర్ధంచేసుకోలేనంత అవివేకి కాదు వశిష్ట.
"నేనూ నమ్మలేకపోతున్నాను మిస్ ఆశ్రితా! అసలు చనిపోయిన వ్యక్తి గురించి నీచంగా మాట్లాడేటంత సంస్కారహీనుడ్ని కాదు నేను. పోలీస్ రికార్డ్సు పర్సనల్ గా చూశాను. అంతకుముందే శ్వేతనీ, ప్రిన్సిపాల్ నీ కలుసుకున్నాను"
"రికార్డ్సు అన్నవి బ్లాక్ అండ్ వైట్ లో వున్నంత మాత్రాన అన్నీ నిజాలు కావు వశిష్టా! రికార్డెడ్ మేటర్ నిజమే అయితే ఎందరో మేధావుల ఆలోచనల్తో రూపుదిద్దుకున్న రాజ్యాంగం కూడా ఖచ్చితంగా ఈ దేశంలోని ప్రతి మనిషికీ న్యాయం చేయగలగాలి. కాని అది కూడా నిస్సహాయంగా ఎమెండ్ మెంట్స్ కి గురవుతుంది. ఏదో ఒరగబెట్టాలని కాదు, అధికారంలో వున్న వ్యక్తులకి అనుకూలంగా రావాల్సిన మార్పులకోసం... ఇలా అంటున్నందుకు నన్ను ఓ సూడో ఇంటలెక్చ్యువల్ గా మీరనుకున్నా నాకు అభ్యంతరంలేదు. కాని ఇది నిజం...ఓ మామూలు అనుమానం మీద ఈ దేశంలోని ఏ వ్యక్తినైనా ఇంటరాగేట్ చేసే అవకాశం పోలీస్ డిపార్టుమెంటుకి వుందన్న రికార్డెడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆధారంగా మీరు సులభంగా ఓ వ్యక్తిని కస్టడీలోకి తీసుకోగలరు. అతడు నిజంగా నేరస్థుడన్న ఆధారం లేకపోయినా, ఆధారం కోసం అతడ్ని టార్చర్ చేసి, అవసరమయితే ఆ టార్చర్ లో లాకప్ డెత్ దాకా మీరు దూసుకుపోగలరు. కాని అదే పలుకుబడిగల వ్యక్తో, పదవిలో వున్న మంత్రో అయితే ఆధారాలు స్పష్టంగా వున్నా వెంటనే మీరు చర్య తీసుకోరు. ఫార్మాలిటీస్ పేరిట తాత్సారం చేస్తారు.
పై అధికారుల ఆదేశాల కోసం వెయిట్ చేయడమో, లేకపోతే ఖచ్చితమైన సాక్ష్యం లేదనే నెపంతోనో ఇన్వెస్టిగేషన్ ని ఆదిలోనే సమాధి చేస్తారు. మరి రాజ్యాంగం కూడా రికార్డు చేయబడినదే అయినప్పుడు...రాజ్యాంగ రీత్యా న్యాయం ఈ దేశంలో ప్రతి పౌరుడికీ ఒకటే అని ఫండమెంటల్ రైట్స్ సూచించేటప్పుడు పలుకుబడిగల వ్యక్తుల విషయంలో అది బలహీనమెలా అవుతుంది? వ్యక్తుల ప్రమేయంతోనేగా? అసలు ఈ నక్సలిజమ్, టెర్రరిజమ్ పేరిట కొందరు వ్యక్తులు ప్రభుత్వంపై దండయాత్ర జరపటానికి కారణాలు ఇవేగా వశిష్టా?"