Previous Page Next Page 
యుగాంతం పేజి 20

   

    ప్రతీ చిన్న విషయాన్నీ గోరంతలు కొండంతలు చేసి సర్క్యులేషన్ పెంచుకునే ఒక తెలుగు దినపత్రిక ప్రళయం రకరకాల వార్తలో పేపరంతా నింపింది. పవిత్రమైన హెడ్డింగులు.....దానికింద చిత్రమైన వార్తలు.
   
                                            భగవంతుడే శరణ్యం
   
    -రోజులు గడిచేకొద్దీ మృత్యువు ముంచుకొస్తున్నదని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గుండెబలం లేనివాళ్ళు రోజూ చస్తూ బ్రతుకుతున్నారు.
   
    ఇంకోచోట ఇంకొ వార్త.
   
                                             రామనామతారకం
   
    -ఈ రోజునుంచీ పది రోజులపాటూ రామనామాన్ని జపించిన వాళ్ళని ఆ నక్షత్రం ఏమీ చేయలేదని భగవతార్ చెప్పారు. పూనాకు చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త ఎ.ఇ.ఐ.యస్. అన్న అక్షరాలు తమ పేర్లో వుంటే మరణం తప్పదని పేర్కొన్నారు.
   
    ప్రధానికి నవ్వొచ్చింది. పై నాల్గు అక్షరాలలో ఏదో ఒకటి లేకుండా ఎలా వుంటుంది? అయినా ఈ పత్రికలకి బుద్దిలేదు. ప్రజలు అసలే భయభ్రాంతుల్తో వుంటే ఈ వార్త లేమిటి?
   
    వీళ్ళ మొరాలిటీ ఏమైంది?
   
    అసలు తనే తప్పు చేశాడు. పదిరోజుల క్రితమే ఆర్డినెన్స్ ద్వారా ఈ పత్రికల్ని కంట్రోలు చెయ్యవలసినది.
   
    ఇప్పుడనుకొని ఏం లాభం?
   
    జగదీష్ చాలా వర్రీడ్ గా- ఆందోళనగా కనిపిస్తున్నాడు.
   
    వాళ్ళు ప్రెసిడెంటు నివాసస్థలానికి చేరుకునేసరికి ఎనిమిదయింది. అప్పటికే అక్కడ మిగతా వాళ్ళున్నారు. ఐదు ఏరియాల లెఫ్టెనెంట్ జనరల్స్ (ఆర్మీ), చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్, మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ - అందరికంటే పైన- సుప్రీమ్ కమేండర్ ఆఫ్ ది ఆర్మ్ డ్ ఫోర్సెస్- ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు చేరుకోగానే సమావేశం మొదలైంది. సమస్య చాలా చిన్నది, కానీ ఫలితాలు ఊహించలేనటువంటివి.
   
    సైన్యంలో చాలామంది తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అధీ సమస్య.
   
    ఈ కొద్దిరోజులూ తమ తమ భార్యాపిల్లల్తో గడిపి - చావును సకుటుంబంగా ఆహ్వానించాలనుకుంటున్నారు.
   
    ఆ హాల్లో వున్న వారందరి మొహాలూ గంభీరంగా వున్నాయి. చాలాసేపు ఎవరి ఆలోచనలో వాళ్ళుండి ఎవరూ మాట్లాడలేదు. సైనికులు క్రమశిక్షణకి అలవాటుపడినవారు కాబట్టి - తమ కోర్కెని పై అధికారులకి విన్నవించుకున్నారు. కొన్నిదేశాల్లో అప్పుడే సైన్యంలో అలజడి మొదలవటం- చాలామంది 'కనబడకుండా' పోవటం జరిగింది.
   
    చర్చ చాలాసేపు జరిగింది.
   
    ఈ ముందు పదిరోజులూ ఎలా వుంటుందో తెలీదు. ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో తెలీదు. అలా అని సైన్యాన్ని 'బలవంతంగా' ఆపలేం......మొత్తానికి ఓ నిర్ణయం జరిగింది.
    
    కెప్టెన్ లెవల్ నుంచీ పైన వున్న అధికారులు మాత్రం వుండాలి. మిగతావారు ఆగష్టు పన్నెండునుంచీ వెళ్ళిపోవచ్చు.
   
    రాత్రి పదింటికి సమావేశం ముగిసింది.
   
    ఇక్కడ ఇది ముగుస్తున్న సమయంలో....
   
    ప్రపంచం :
   
    లిబియా రాజధాని ట్రిపోలీలో ఒక రహస్య సమావేశం జరిగింది. ఇరాన్, సిరియా, యమెన్, సూడాన్, జోర్డాన్ ప్రధాన మంత్రులు అందులో పాల్గొన్నారు.
   
    ఇంతమంది ఒకచోట కూడేరంటే, దానికి గమ్యం ఒక్కటే. ఇజ్రేల్. ఇజ్రయేల్ అనగానే గుర్తొచ్చేది జరూసలేం. జరూసలేంలోనే క్రీస్తు మరణించాడు.
   
    "జెరూసలేం" అంటే "శాంతినిలయం" అని అర్ధం. కానీ అదేం చిత్రమో? ఆ నగరంలో "శాంతి" అన్న పేరే వినపడదు. క్రీస్తు మరణించిన యాభై సంవత్సరాల తరువాత రోమన్లు దానిని సర్వనాశనం చేసేరు. దాదాపు 10 లక్షలమంది యూదుల్ని నిర్ధాక్షిణ్యంగా చంపేరు. మూడంతస్తుల భవనాల మీదనుంచి పసిపిల్లల్ని రోడ్లమీదకు విసిరేసేరు. జెరూసలేంలోకి యూదుల ప్రవేశం నిషేధించబడినది.
   
    ఇది జరిగిన పందొమ్మిదివందల సంవత్సరాల తరువాత అంటే 1948లో ఇజ్రేల్ కి విముక్తి లభించింది. ఈ మధ్యకాలంలో ఆ నగరం నలభై ఆరు దండయాత్రలకి గురి అయింది.
   
    ప్రవక్త మహమ్మద్ స్వర్గానికి వెళ్ళింది ఇక్కన్నుంచేనని మహమ్మదీయుల నమ్మిక, మక్కామదీనాల తర్వాత ముస్లిమ్ లకు ఇదే పవిత్ర స్థలం. అయితే క్రీస్తుని శిలువ వేసింది కూడా ఇక్కడే. అందుకు క్రైస్తవులకి యిది "దేవుడు తన పేరు వ్రాసిన నగరం" అయింది 1948లో బ్రిటీషు వలన రాజ్యంనుంచి ఇజ్రేల్ స్వాతంత్ర్యాన్ని పొందిన కొన్ని గంటల్లోనే చుట్టూవున్న ఎనిమిది అరబ్బు రాజ్యాలు మూకుమ్మడిగా దండెత్తి దాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూసి, ఓడిపోయాయి.
   
    యూదుల గుడి-ముస్లిమ్ ల మసీదూ వున్న 'డూమ్ ఆఫ్ ది రాక్' భూమీద మనుషులున్నంతవరకూ సమస్యగానే వుంటుందని మేధావుల అంచనా!
   
                                                                      *    *    *
   
    కమేండర్ ఇన్ చీఫ్ సూడాన్-"ఈ ఆఖరి రోజుల్లో జెరూసలేంని జయించాకపోతే దేవుడు క్షమించడ"ని అన్నారు. ఈజిప్టు ప్రెసిడెంట్ ఒకే ఒకమాట అన్నాడు. "ఇజ్రేల్ ని సముద్రంలోకి తోసెయ్యాలి. త్రో ఇట్ ఇన్ టు ది నీ-"
   
    అందరూ హర్షధ్వానాలు చేసేరు.
   
    అయిదు నిముషాల అనంతరం ఒక తీర్మానం చెయ్యబడింది.
   
    "ప్రపంచపు ఆఖరిరోజుని 'సెలబ్రేట్' చేసుకోవటానికి మేమంతా జెరూసలేంలో కల్సుకొంటాం- అని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జెరూసలేంని దక్కించుకోవటానికి, మా పవిత్ర స్థలాన్ని ఆఖరి రోజుల్లోనూ మా అధీనంలో వుంచుకోవటానికి ప్రాణాలైనా అర్పిస్తాం. యుద్దాన్ని ప్రకటిస్తున్నాము."
   
    ప్రతి ఒక్కరూ ప్రమాణం చేసేరు.
   
    ప్రపంచపు రాజకీయాలు ఇలా మారుతూ వుంటే, ఇంకోవైపు సాంఘికమైన మార్పు ఇంకోలా వుంది. మత్తుమందు మనిషిని మానసికంగా బలహీనుడ్ని చేస్తుంది. అమెరికాలో దాదాపు కోటిన్నర మంది అలవాటుపడిన వారున్నారని అంచనా. ప్రపంచం అంతమవబోతుందనగా అది మూడు కోట్లకి పెరిగింది. మార్జువానా, హెరాయిన్ ల ధర రెండింతలైంది.
   
    చావు కలిగించే భయాన్ని మత్తులో పోగొట్టుకోవడం మనిషికి సులభంగా కనిపించింది.
   
    మరోవైపు భూమి పేలిపోయినా పర్వతాల ఉపరిభాగం సురక్షితం అనే నమ్మకాన్ని కొంతమంది శాస్త్రజ్ఞులు వ్యక్తం చేసేరు. ఆ మాటలమీద నమ్మకం వున్నవాళ్ళు పదిరోజులకు సరిపడా ఆహార పదార్ధాల్ని మూట కట్టుకొని కాంచనగంగ, మకాలు, మౌంట్ బ్లాంక్, ఆల్ఫ్స్ పర్వతాల మీదకు వెళ్ళిపోయారు. అయితే, ప్రపంచంలో ఎత్తయిన ఈ పర్వతాలు ఆ తర్వాత రెండు రోజుల్లోనే పేలిపోయేయి. వెళ్ళిన వాళ్ళు సజీవసమాధి అయిపోయేరు-నిశ్శబ్దంగా - మిగతా ప్రపంచానికి గుర్తులు కూడా మిగల్చకుండా.....
   
    ఆగష్టు పన్నెండు   
   
    ప్రొఫెసర్ ఆనందమార్గం తన ఇంట్లో గదిలో కూర్చొని వున్నాడు. అతడి ముందు కప్పులో టీ డికాక్షన్ వుంది. అది చల్లారిపోయి రెండు గంటలయింది. దాన్ని గురించి పట్టించుకోకుండా ఆలోచిస్తున్నాడు. దాదాపు డెబ్బై రెండు గంటల్నుంచీ ఒకటే ఆలోచన.
   
    పదిహేడో తారీఖు పదకొండు గంటలా - పన్నెండు నిముషాలకి మూడు సెకన్లపాటు భూమిని ఆ నక్షత్ర ఆకర్షణ నుంచి తప్పించటం ఎలా?
   
    ప్రొఫెసర్ ముందో కాగితం వుంది. దాన్నే చాలాసేపటి నుంచీ పరీక్షిస్తున్నాడు.
   
    ఇంతలో తలుపు చప్పుడైంది.
   
    రమణ!
   
    "ఆఫీసు కెళ్ళ లేదా?" అడిగాడు.
   
    రమణ క్షణం విస్తుపోయి సర్దుకున్నాడు. మతిలేని ప్రొఫెసర్ మాటి మాటికీ తన పేరు సార్ధకం చేసుకుంటూ వుంటాడు.
   
    "మీరు బయటికొచ్చి ఎన్ని రోజులయింది?"

 Previous Page Next Page