Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 15


    "ఏమైందే?" ఆ గుంపులోకి చొరబడి అడుగుతుంది.

    "మీ మనవరాలు ఇందుమతి కనబడడంలేదట" ఎవరో ముత్తైదువ గొంతు పెంచి చెబుతుంది.

    అప్పుడు ఏమౌతుంది అమ్మమ్మ?

    గుండాగి చచ్చిపోవచ్చు. స్పృహతప్పి పడిపోవచ్చు. 'ఇందూ' అని అరుస్తూ ఫిట్స్ వచ్చి అల్లాడిపోవచ్చు. పక్షవాతం వచ్చి కాలు చెయ్యీ పడిపోవచ్చు.

    కాలూ చెయ్యీ పడిపోయిన తల్లినీ, ఎవరితోనో లేచిపోయిన కూతుర్నీ తలుచుకుంటూ అమ్మ యమ యాతన పడుతుంది.

    అయినా ఇవన్నీ ఆలోచించకూడదు. ప్రతిదాన్నీ భూతద్దంలోంచి చూడకూడదు. ఇవన్నీ తన ఊహలేగానీ నిజాలు కావు. రెండు రోజులకి అందరూ సర్దుకుంటారు. తన సంసారం బావుందని తెలియగానే అమ్మ వెదుక్కుంటూ వస్తుంది. అమ్మమ్మ దూరం నుంచే ఆశీర్వదిస్తుంది. కాబట్టి భయపడవలసిందిగానీ, బాధపడవలసిందిగానీ ఏమీలేదు.

    ఇందుమతి అలా కొంత బలాన్ని పుంజుకుంది. మరో పదినిముషాలకి బయల్దేరడానికి మానసికంగా సిద్ధపడుతోంది. కాలం తాబేలు మీద ఎక్కి లోక సంచారం చేస్తున్నట్టుంది. క్షణాలు గంటల్లోకి సాగుతున్నట్టు అనిపిస్తుంది.

    ఇంతకీ భరణి ఇంటినుంచి బయల్దేరాడా?

    వెళ్ళి చూడాలనిపించింది. కానీ ఒక్కసారి తప్ప ఆమె చిత్ర ఇంటికి వెళ్ళలేదు.

    ఆ ఒక్కసారి ఎప్పుడంటే రాత్రి భరణి ముఖంమీద తలుపులేసిన రెండోరోజు.

    త్రికోణం ప్యాకెట్ ను నెల్లూరు నుంచి తెప్పించానని చెప్పినా ఇందుమతి ఒప్పుకోకపోవడంతో అతను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు.

    మరుసటిరోజు ఉదయంగానీ సాయంకాలంగానీ అతను కనబడలేదు. ఏమైపోయాడో తెలియక ఇందుమతి గట్టునపడ్డ చేపపిల్లలా అయిపోయింది.

    ఇక రెండోరోజు నిలవలేకపోయింది. ఎలాగైనా అతనికి కనిపించి, అతని అలకను పోగొట్టాలని మనసు పీకుతోంది. కానీ ఏమీ కారణం లేకుండా చిత్ర ఇంటికి ఎలా వెళ్ళడం?

    అలా ఆలోచిస్తుంటే ఓ ఐడియా తట్టింది. దీపావళి పండక్కి శతరూప ఆమెకి ఓ చీర తెచ్చింది. తెలుపులో నీలంపూలున్న కోటా చీర అది. పెట్టెలోంచి దాన్ని తీసుకుని బయల్దేరింది.

    సాయంకాలం కావడంతో వీధులన్నీ సంధ్యకాంతి ప్రవహిస్తున్న కాలువల్లా వున్నాయి. పురుషులు ఆ కాలువల్లో పయనిస్తున్న తెరచాప పడవల్లా వున్నారు. స్త్రీలైతే నదిలో సాగుతున్న కార్తీకదీపపు ప్రమిదల్లా కనిపిస్తున్నారు. కానీ ఇందుమతి మాత్రం ఇవేమీ గమనిస్తున్నట్లు లేదు. ఆమె ధ్యాసంతా భరణి మీదే.

    చిత్ర ఇంటికి ఏ జంకూగొంకూలేకుండా వెళ్ళింది.

    లోపల ఎవరూ వున్న అలికిడి లేదు, నిశ్శబ్దం తనకోసం ఆ ఇల్లు కట్టుకున్నట్టుంది.

    "చిత్ర పెద్దమ్మా - చిత్ర పెద్దమ్మా" అని రెండుసార్లు పిలిచింది.

    చిత్రకూ, ఆమెకూ ఎలాంటి బంధుత్వం లేకపోయినా వరసలు పెట్టి పిలుచుకోవడం పల్లెటూర్లలో అలవాటు. వరసలు ఎలా పుట్టాయో తెలియదు. అవి తరతరాలుగా అలా కొనసాగుతుంటాయి.

    పెరట్లో వున్న చిత్ర హాల్లోకి వచ్చింది.

    "ఏమిటి విశేషాలు? ఇలా వచ్చావ్? అని అడిగింది ఆమె ఇందుమతిని చూసి ఆశ్చర్యపోతూ.

    "ఇప్పుడే ఎవరో సైకిల్లో చీరలు తెస్తే అమ్మమ్మ ఇది నా కోసం కొన్నది. బావుందో లేదో నీకు చూపించాలని" అని చేతిలోని చీరను ఆమె చేతుల్లో పెట్టింది.

    కొత్తబట్టలు కొంటే ఆ కొన్న ఆమె ఇలా ఇంటింటికి వెళ్ళి చూపించడం రివాజు. అందుకే చిత్రక్కూడా డౌట్ రాదనుకుంది.

    చీరను అటూ ఇటూ తిప్పి "చీర బావుంది. పైట మరీ బావుంది" అంది చిత్ర.

    భరణి ఎక్కడా కనిపించలేదు.

    ఆమె చూపులు పక్కనున్న గదుల్లో వెతుకుతున్నాయిగానీ లాభంలేకుండా పోయింది.

    చివరికి అక్కణ్ణుంచి బయల్దేరి వస్తుండగా గేటు దగ్గర భరణి కనిపించాడు. ఎక్కడికో వెళ్ళి అప్పుడే తిరిగి వస్తున్నాడు.

    గేటు వేస్తున్నట్టు ఆగి "రెండు రోజులబట్టి నల్లపూసై పోయావు. రాత్రికి అంకాళమ్మ రావిచెట్టు దగ్గరికి వచ్చెయ్" అని ఒక్క గెంతులో వీధిలోకి వచ్చింది.

 Previous Page Next Page