రన్ వే మీద గింగుర్లు కొట్టి, ఆకాశంలోకి దూసుకెళ్ళిపోయిన విమానంలా- భానోజీరావు వ్యాపారం వామనపాదం విస్తరించింది.
దానికి ఆకాశమే హద్దు! రైజ్ అండ్ రైజ్..... నో రైజ్ అండ్ ఫాలో....
క్లోజ్ సర్కిల్స్ లో భానోజీరావు అప్పుడప్పుడంటుంటాడు.
"నా ప్రోడక్ట్ ని ఎప్పటికయినా చంద్రమండలానీ ఎక్స్ పోర్ట్ చేస్తాను. చూడండి."
ఎప్పుడో అవసరమైతేనే తప్ప తండ్రి దగ్గరకు రాదు లేఖిని.
"ఏమ్మా... రా...." ఆప్యాయంగా పిలిచాడు లేఖినిని భానోజీరావు.
నెమ్మదిగా నడుచుకుంటూ లోనికొచ్చిందామె.
మొఘల్ రాకుమారిలా వుంది లేఖిని.
"కూర్చో.... హరిశ్చంద్రుడేడి...." కూతురు కళ్ళవేపు సూటిగా చూస్తూ అడిగాడాయన.
హరిశ్చంద్రుడు భానోజీరావు తండ్రి పేరు. ఆ పేరే మనవడికి పెట్టాడాయన.
వాణ్ని చూస్తున్నప్పుడల్లా తండ్రి గుర్తుకొస్తాడు భానోజీరావుకి.
తండ్రి నుంచే కష్టాన్ని నేర్చుకున్నాడాయన. ఉన్న రవ్వంత ఆస్థిని అంచెలంచెలుగా పెంచడానికి తండ్రి ఎంత కష్టపడ్డాడో భానోజీరావుకి బాగా తెలుసు.
ఒకసారి ఏడేళ్ళు వర్షాల్లేవు.
తీవ్రమైన క్షామం.
మెతుకు మెతుకునీ ఏరుకుని తినాల్సిన పరిస్థితి.
ఎంత మధనపడ్డాడో తండ్రి, ఎంత బాధపడ్డాడో తండ్రి, ఎన్ని కన్నీళ్ళని దిగమింగాడో తండ్రి!
లాభంలేదు- ఓ నిశ్చయానికొచ్చాడు.
బాగా బతికిన వూళ్ళో, తలదించుకుని బతకలేక, పక్క ఊరెళ్ళాడు.
చిన్న కాకా హోటల్ ప్రారంబించాడు.
బంధువులందరూ హోటల్ పెట్టినందుకు తిట్టారు. అన్నం అమ్ముకోవడం ఇంటా వంటా లేదురా అన్నారు. అందరూ దూరంగా జరిగిపోయారు.
తండ్రి నిశ్చయంలో మార్పు లేదు.
కాకా హోటల్, పెద్ద కాఫీ హోటల్ అయింది. కాఫీ హోటల్, పెద్ద మీల్స్ హోటల్ అయింది.
చేతిలో డిగ్రీతో ఉద్యోగం చెయ్యాలా, వ్యాపారం చెయ్యాలా అన్న సందిగ్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు-
"ఒరేయ్ భానూ..... ఉద్యోగం చేస్తావా చెయ్యి, వ్యాపారం చేస్తావా చెయ్యి..... ఏం చేసినా ఎవ్వరూ చెయ్యలేనిది నువ్వు చెయ్యాలి. నువ్వు వ్యాపారం ప్రారంభిస్తావా... ప్రారంభించు. ఏ వ్యాపారం చెయ్యాలో అలోచించుకో. దాహంగా వున్నవాడికి మన దగ్గర పాలున్నాయి కదాని....పాలు ఇవ్వగూడదు....వాడికి అవసరం నీళ్ళు. అక్కడ నీళ్ళమ్ము. చలికాలంలో విసనకర్రల బిజినెస్ చెయ్యకూడదు... చలికాలంలో దుప్పట్ల బిజినెస్ చెయ్యి బాగుపడతావ్."
తండ్రి చెప్పిన మాటని అక్షరాలా ఆచరిస్తూ వచ్చాడు భానోజీరావు.
మొట్టమొదట బిజినెస్ కి పెట్టుబడి తండ్రిచ్చిందే!
ఆ తర్వాత తండ్రినెప్పుడూ డబ్బడగలేదు.
హోటల్ వ్యాపారం చేసి, నలుగురికీ అన్నం పెట్టిన తండ్రి, ఆకలితో చచ్చిపోవడమే జీవితంలో విషాదం.
నోటి క్యాన్సర్ వచ్చి మంచం మీదున్న సమయంలో-
"ఒరేయ్- భానూ.... చూశావా- నాకా తిండంటే ఇష్టం. ఆ తిండే తినకుండా చేశాడు భగవంతుడు- ఒరేయ్- నాకాకలేస్తోందిరా....ఆకలేస్తోంది. రా... అన్నం పెట్టమని చెప్పరా.... ఒరేయ్ భానూ.... భానూ....."
అందుకే ఒక్కగానొక్క మనవడంటే ఇష్టం భానోజీరావుకి.
"ఉదయం రాజమండ్రి నుంచి ఫోనొచ్చింది. అత్తయ్యకు వంట్లో బాగులేదట. ఆయన కూడా వూళ్ళో లేరు. మీరు వెళ్ళమంటే వెళ్లొస్తాను" నెమ్మదిగా చెప్పింది లేఖిని.
"అమ్మను కూడా తీసికెళ్ళు" అదే సమయంలో భానుమతి కూడా అక్కడ కొచ్చింది.
"నువ్వు కూడా వెళ్ళు"
"నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆ మాట చెప్దామనే వచ్చాను" అందావిడ.
"హలో" ఫోన్ మోగడంతో భానుమతి బైటకెళ్ళింది.
"మధు కేంప్ కెళ్ళాడా?"
మధుకుమార్ లేఖిని భర్త. లేఖినికి పెళ్ళి చేశాక వాళ్ళిద్దర్నీ తన దగ్గరే వుంచుకున్నాడు భానోజీరావు. జింఖానా కంపెనీలో లేఖినితోపాటు మధుకుమార్ ఒక డైరెక్టర్.
ఒక మనిషి అంచెలంచెలుగా ఎదగాలన్నది భానోజీరావు సిద్దాంతము.
అందుకే మధుకుమార్ ని కూడా ప్లాంట్ సూపర్వైజర్ గా మాత్రమే వుంచాడు.
జింఖానా కంపెనీకి మానేజింగ్ డైరెక్టర్ కావాలని మధుకుమార్ ఆశ- తాపత్రయమూను.
చాలాసార్లు పరోక్షంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు మధుకుమార్.
లేఖిని ద్వారా కూడా చెప్పించాడు.
ఎవర్ని ఎక్కడుంచాలో భానోజీరావుకు బాగా తెలుసు.
అయినవాన్నీ, అనుభవం లేనివాన్నీ, తన పాతికేళ్ళ వ్యాపార పథంలో ఎప్పుడూ అందలం ఎక్కించలేదాయన.
"ప్రమోషన్ నేనివ్వకూడదు- నువ్వు తీసుకోవాలి- దానికి నువ్వు కష్టపడగలగాలి- అదే గుర్తింపు తెస్తుంది."
తన ఉద్యోగులతో అనే మాట అది!
అందుకే మధుకుమార్ మనస్తత్వాన్ని బాగా అంచనా వేయగల్గాడు భానోజీరావు.
అవతలివాడి కనురెప్ప కదిలితే, వాడి మనసులో ఏ ఆలోచన ఉందో యిట్టే చెప్పగలడు భానోజీరావు.
ఒక గోల్ ని చేరడానికి ఎన్నో దారులుంటాయి.... ఏ దారిలో ఆ గోల్ ని చేరడమో తెల్సుకోవడంలోనే మనిషి అభివృద్ధి వుంటుంది.
అడ్డదారిలో శిఖరాగ్రానికి చేరేవాడికి ఎప్పుడైనా పతనం చేరువలోనే వుంటుంది. అది తెల్సుకోవాలి మనిషి.
వెళ్లేదారి గమనించేవాడే, అదే దారంట హాయిగా తిరగగలుగుతాడు.
చిన్న చిన్న చెమట బిందువులతో సంతరించిణ విశాలమైన సముద్రం భానోజీరావు నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం.
దానికి ఏనాడో ఒకనాడు-
చక్రవర్తిని అవుతానని కలలుగనే వ్యక్తి మధుకుమార్.
భానోజీరావు తనకా పదవి యివ్వకపోతే, ఆయన చేతుల్లోంచి ఎలా లాక్కోవాలో, అందుకు ఎలాంటి పథకాలు వెయ్యాలో తెల్సినవాడు మధుకుమార్.
టైమ్-
దేనికైనా టైమ్ కావాలి.
అందుకు వెయిట్ చేస్తున్నాడు మధుకుమార్.
కానీ -
తను నిర్మిస్తున్న 'ఎంపైర్' మీద ఎవర్ని కూర్చోబెట్టాలో భానోజీరావుకి బాగా తెలుసు.
తన శ్రమ, తన తెలివితేటలు, తన మేధస్సు, తన ఐక్యూ, తన చురుకుదనం, తన సున్నితత్వం.
శత్రువుని చెండాడేటప్పుడు తన కఠినత్వం-
వీటన్నిటికీ మించి-
ఎడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్-
పరిపాలనా సామర్ధ్యం-
ఎవరికున్నాయో భానోజీరావు గుర్తించగలిగాడు.
డేగచూపు, ఉడుంపట్టు, పాము కుబుసంలోని మెత్తదానం వ్యాపార వేత్తకు కావాల్సిన, వుండాల్సిన ప్రధమ లక్షణం.
ఎన్నో వడపోతల తర్వాత-
ది గ్రేట్ జింఖానా సామ్రాజ్యానికి చక్రవర్తిని ఎంపిక చేశాడు భానోజీరావు.
ఆ ఎంపిక విషయం ఎవరికీ తెలీదు.
ఆఖరికి భార్య భానుమతికి కూడా.
ఆ వ్యక్తి-
భానావుజీరావు రెండో కూతురు.
లండన్ లో ఎం.బి.ఎ. పూర్తిచేసి, ఆరునెలల క్రితం ఇండియా తిరిగొచ్చింది.
అదే సమయంలో-
ఎంతో కాన్ఫిడెన్స్ తో మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసిన జింఖానా థౌజండ్ కారు, అనుకున్న మేరకు సక్సెస్ కాలేదు.