కానీ ఢిల్లీ సుల్తాన్ కు ఆ నిధిని దక్కనివ్వలేదు. అది ఏమైపోయిందో ఎవ్వరికీ తెలీదు... జైత్ సింగ్ రాజకుంటుంబం నాశనమయిపోయింది. జైసాల్మర్ కోట ముస్లిమ్ చేతుల్లో శిధిలమైపోయింది. ఆ శిధిలమైన కోటని దక్కించు కొనేందుకు మార్వార్ రాథోర్స్ ప్రయత్నించి, రావల్ జైస్వాల్ కుటుంబానికి చెందిన బట్టిరాజు చేతుల్లో మృతులయ్యారు. అప్పటికి ఆ రాజ్యంలో కోట్ల విలువచేసే నిధులుండేవి. వాటికోసం మక్కా నుంచి వచ్చిన ముస్లిమ్ యాత్రికులు ప్రయత్నించి విఫలమయ్యారు. అలా వచ్చిన వారిలో ఆగ్రా బేగమ్ కూడా వుంది. ఆమె ఒంటిమీద వజ్రాలతో అల్లిన అంగీ ఉండేదట. దానికోసం ఒక సాహసికుడు ఆమెని చంపేసాడట. సరిగ్గా అప్పుడే ఒక పచ్చలో మలిచిన బెల్ట్ బకిల్ కూడా లూటీ చేయబడిందట. అది హుమాయున్ కి చెందినదట. ఆ సంపద కోసం ఆజ్మీర్ కి చెందిన సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ ఎడారులగుండా జైసాల్వర్ కోటకు తన సైన్యంతో దండెత్తి వస్తున్నట్లు తెలుసుకున్న, రావల్ రాజు తన దగ్గరున్న అపార సంపదని నిధి రూపంలో ఎక్కడో రహస్య స్థలంలో పాతి పెట్టించాడట. ఆ నిధి దొరకకపోవడంతో రావల్ రాజుని సుల్తానులు చంపేసారు.
ఆ తరువాత కూడా జైసాల్మర్ సంపదలతో తులతూగేది.
సుల్తానులు, అరబ్బ్ తరుచూ భారతదేశం మీదకి సంపదకోసం దండయాత్రలు చేస్తూ పోవడంతో జైసాల్మర్ ఎడారి ప్రాంతం హిందువులకు, జైన్ వర్తకులకు, నగదు వర్తకులకు, చిత్రకారులకు వలస ప్రాంతముగా మారిపోయింది.
1570లో అక్బర్ చక్రవర్తి దృష్టి కూడా జైసాల్మర్ సంపదమీద పడింది.
1570 ప్రాంతంలో కూడా ఇరాక్, పర్షియా, అరేబియా, ఈజిప్ట్ దేశాలకు చెందిన వర్తకులు వర్తకం నిమిత్తం జైసాల్మర్ వచ్చి వజ్రాలు, పచ్చలు, రత్నాలు వంటి విలువైనవి ఇచ్చి సిల్క్ దుస్తులు, మషాలా దినుసులు, గంజాయి, నీలిమందు తీసుకెళ్ళేవారట.
జైసాల్మర్ మీద ఎందరు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎవరికీ ఏ నిధీ దొరకలేదు. ఎక్కడెక్కడి నుంచో జైసాల్మర్ కి విలువైన సంపదవచ్చేది తప్ప- అక్కడ రాజుల అప్రమత్తత వల్ల ఏమాత్రం సంపద అక్కడి నుండి తరలింపబడేది కాదు. గుప్తనిధుల రూపంలో సంపదని రహస్య స్థలంలో నిక్షిప్తం చేయటం జైసాల్మర్ రాజులు తరువాతే ఎవరైనా.
జైసాల్మర్ రాజుల నుంచే మన దక్షిణ భారతదేశపు రాజులు రహస్య నిధుల ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారని చెబుతుంటారు.
ముప్ఫయి ఏళ్ళ క్రితం అంతర్జాతీయ కుస్తీపోటీలు జరుగుతున్న ప్రాంతానికి జైసాల్మర్ ఎడారికోట చాలా దగ్గర. ప్రభుత్వం అప్పుడు అక్కడ నిధుల కోసం వేట ప్రారంభించింది... వరుసగా పదేళ్ళపాటు అన్వేషణ సాగింది... కానీ ఏ ఒక్క విలువైన ఆభరణమూ దొరకలేదు. కాగా చిత్రమయిన విషయం ఏమిటో తెలుసా? ఆ అన్వేషణలో పాల్గొన్న గవర్నమెంట్ అధికారులంతా ఎడారి ఇసుక తుఫానులో చిక్కుకుని రక్తం కక్కుకుని చచ్చిపోయారు. ఎక్కడైతే నిధి చిక్కించుకోవాలని ఢిల్లీ సుల్తాను తాలూకు మనుషులు ప్రయత్నించి ప్రాణాలు వదిలారో... అక్కడే వీళ్ళు కూడా చనిపోవటం చాలా ఆశ్చర్యం. దాంతో ఆ ప్రాంతములో నిధుల కోసం అన్వేషిస్తే ఆ నిధులు ప్రాణాలు బలిగొంటాయనే భయం ప్రజల్లో పాతుకుపోయింది. అప్పటి నుంచి అక్కడ నిధుల వేట ఆగిపోయింది.
ఆ ఎడారి ఇసుక లోతుల్లో ఎన్ని లక్షల కోట్ల నిధులు నిక్షిప్తమై ఉన్నాయో... అవిప్పటికీ అలాగే వున్నాయి..." ఆయాసంతో చెప్పలేక ఒకింతసేపు ఆగాడు ముత్యాలనాయుడు.
పామరుడిలా కనిపించే ముత్యాలనాయుడికి చరిత్ర గురించి అంతగా తెలిసి ఉంటుందని ఊహించని ఇందుమతీదేవి దిగ్భ్రాంతికి గురయింది.
జైసాల్వర్ నిధుల గురించి తెల్సుకోవడం ఆమెకు థ్రిల్లింగ్ గా ఉంది.
"INDIAN FORTS WERE THE MEASURE OF A MONARCH'S STRENGTH" స్వగతంలో అనుకుంది ఇందుమతీదేవి.
"అంటే ఏంటమ్మా?"
"భారతదేశపు కోటలు మనదేశ చక్రవర్తుల శక్తి సామర్ధ్యాలకు, దారుర్ద్యానికి కొలమానాలు..." చెప్పింది ఇందుమతి.
అవునన్నట్లుగా తలూపాడు ముత్యాలనాయుడు.
"IN THE CONSTANT STRUGGLE FOR POWET. FORTS AND FOR TIFIED SETTELEMENTS WERE A POTENT SYMBOL OF AUTHORITY..." తిరిగి అనుకుంది ఇందుమతి తనలో తనే ఎగ్సైటింగ్ గా.
నిధి వేట కోసం ఇందుమతీదేవిని సమాయత్తం చేయాలనే ఉద్దేశంతోటే- ఆ సందర్భంలో ఆమెలో ఉత్సాహం నింపాలనే, ముత్యాలనాయుడు అవన్నీ చెబుతున్నాడు.
అదింకా ఇందుమతికి తెలీదు.
తను చెప్పే వివరాలపట్ల ఇందుమతీదేవి కూడా ఆసక్తి చూపించడము చాలా ఆనందంగా ఉంది ముత్యాలనాయుడికి.
అసలెప్పటి నుంచో ముత్యాల నాయుడికి నిధి సంపాదించి ఆ రాజ కుటుంబాన్ని నిలబెట్టాలని వుంది. అందుకు ముందు ఉండవలసింది, ఆ విధికి వారసురాలైన ఇందుమతీదేవే లేదంటే బలి ఖాయం...
ఇందుమతీదేవి చదువు ముగించుకొని వచ్చేలోపే అతికష్టం మీద ఆ వివరాల్ని జ్ఞప్తికి తెచ్చుకుని వున్నాడు ముత్యాలనాయుడు.
"మీ పూర్వీకులు కూడా తమ వారసుల కోసం నిధినిక్షేపాలను రహస్యంగా గుప్తం చేసే ఉంటారు... ప్రయత్నం చేస్తే వాటిని పొందటం అసాధ్యం కాదు... నెమ్మదిగా అసలు విషయంలోకొచ్చాడు.
"మా పూర్వీకులా... నేను నమ్మను... అలా గుప్త నిధులను దాచిన పక్షంలో మా పరిస్థితి ఎందుకు ఇలా వుంటుంది. మా నాన్నగారికి ఏమాత్రం తెలిసి ఉండదా?"
"తెలుసమ్మా... కానీ వారికి జ్ఞాపకం లేదు... రెండు రోజుల నుంచి మా మధ్య ఇవే చర్చలు... నాన్నగారు శతవిధాలా జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. మీరు పూనుకుంటే ఫలితం సిద్ధిస్తుందని నా నమ్మకం...
ఇందుమతి పచార్లు చేస్తూ ఆలోచిస్తోంది.
"ఏంటీ... ఏదో దీర్ఘాలోచనలో వున్నారు" గదిలోకి ప్రవేశిస్తూ కౌశిక భూపతి అన్నారు.
"ఏం లేదు నాన్నగారూ... ముత్యాలు వింత వింత విషయాలు చెప్తుంటేనూ..." సాలోచనగా కౌశిక భూపతివైపు చూస్తూ అంది ఇందుమతి.
"మనం అనుకున్న విషయాలే... అమ్మాయిగారితో అన్నాను" చెప్పాడు ముత్యాలు.
"ఎప్పుడో, ఎక్కడో, ఎవరో దాచిన నిధినిక్షేపాల కోసం... ప్రయత్నించటం మన శక్తి సామర్ధ్యాలపైన మనకు నమ్మకం లేనప్పుడే, అలాంటి ఉచితంగా వచ్చే సొమ్ము కోసం ఆరాటపడతాం..." నెమ్మదిగా అంది ఇందుమతి.
"నీ విషయంలో నేను జాగ్రత్తపడలేకపోయానమ్మా. ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు, స్వంత చెల్లికి ఒక్క పూచికపుల్ల కూడా ఉంచకుండా అన్యాయం చేశారు. నా తెలివి తక్కువతనంవల్ల ఈవేళ నువ్వు చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది... నాకో నమ్మకం వుంది తల్లీ- ఆ సూర్యభగవానుడు మనకు అన్యాయం చెయ్యడు."
సరైన సమయంలో జాగ్రత్తపడకపోవటం తండ్రి అమాయకత్వం...
ఆస్థిలో భాగంగా, కోటను మాత్రమే వుంచాడు తండ్రి తనకోసం-
ఇద్దరు అన్నదమ్ములూ, చంద్రభూపతి, సూర్యభూపతి విలువైన ఖజానాను తరలించుకుపోయి ఢిల్లీలో ఒకరు, గోవాలో మరొకరు సెటిలయ్యారు.
"అమ్మా ఇందుమతీ... ఒక్కసారి మనం ఫూల్ బాగ్ ప్యాలెస్ కు వెళ్ళివద్దాం- ఏమంటారు రాజావారు" ముత్యాలనాయుడు అన్నాడు.
"ఫూల్ బాగ్ ప్యాలెస్ కా? ఇప్పుడు అక్కడ ఏం వుంది? పడిపోయిన స్తంభాలు, పెరిగిపోయిన పిచ్చిమొక్కలూ తప్పించి..." అన్నది ఇందుమతి అనాసక్తంగా.
"నిధి విషయం అక్కడ ఏమైనా ఆచూకీ లభిస్తుందేమోనని-"
"నిధి నిక్షేపాలు దొరుకుతాయని ముత్యాలుకు బాగా నమ్మకం ఉన్నట్లుగా వుంది" నవ్వుతూ అంది తండ్రితో ఇందుమతి.
"దొరుకుతాయమ్మా- నాకు ఆ నమ్మకం వుంది" అన్నాడు ముత్యాలనాయుడు.
"అంటే పాతబడిన భవనాలు అన్నీ తవ్వించమంటారా- బాగానే వుంది ఏదైనా ఉన్నట్లు ఆధారం వున్నా మనం ప్రయత్నించటం బాగుంటుంది" సంశయంగా అంది ఇందుమతి.
"ఆధారం దొరికితే పూనుకుంటారా అమ్మా?" చాలా ఉత్సాహంగా అడిగాడు ముత్యాలనాయుడు.
ఆ మాటకు తండ్రిగారివైపు చూసింది ఇందుమతి. కౌశిక భూపతి ఒకసారి ఇందుమతివైపూ, మరోసారి ముత్యాలువైపూ చూసి-
"ఉద్దరే దాత్మ నాత్మానం నాత్మాన మవసాదయేత్
ఆత్మైవ హ్యత్మన్ బన్దురాత్మైవ రిపురాత్మనః
ప్రతి మనిషీ, తన ఆత్మచేత తనను ఉద్ధరించుకోవాలి కానీ, తనను తను క్రిందకు తోసుకోకూడదు. తనకు తానే బంధువు. శత్రువు కూడా తన ఆత్మేనని తెల్సుకోవాలి. గీతాకారుడు అలా ఎందుకు అన్నాడో తెలుసా?
ప్రతి మనిషికీ ఇలాంటి సమయాలు వస్తాయని తెలుసు- క్లేశ సమయంలో చేసే ఆలోచనలకు పదునూ, విలువా ఎక్కువ వుంటుందని బాగా ఆలోచించు. ముత్యాలు చాలాకాలంగా నా చెవిలో పోరుతున్నాడు. నాలోని జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోతుంది. కానీ పూర్తిగా మరుపుకు రాలేదు, లోలోపల నాలో ఏదో ఆశ దివ్వెలా వెలుగుతోంది. తెలివైన దానివి- చదువుకున్న దానివి- పౌరుష ప్రతాపాల వంశానికి చెందిన దానివి- ఒక స్థిర నిశ్చయాన్ని నువ్వు ఏర్పరచుకుంటే సాధ్యం కాకపోదు. మన రాజవంశానికో నిధి వుంది. ఆ మాటకొస్తే మనదేశంలోని ప్రతి రాజవంశానికి నిధులుండేవి. ఈ విషయం మా ముత్తాతగారు నాకు చాలాసార్లు చెప్పారు. ఆ తరువాత మా తాతగారు కూడా అంటుండేవారు. అప్పుడు రాజ్యాలు పోలేదు. రాజులు పోలేదు. భోగభాగ్యాలతో తులతూగే వాడ్ని నేను. అందుకే అప్పట్లో మన నిధి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు రాలేదు.
"కాలం ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ మూలంగా వక్రించి, ఉన్నది పోగుట్టుకుంటానని నేనూహించలేదు. ఊహించి వుంటే నిధి గురించి మా ముత్తాతగార్నో- తాతగార్నో అడిగి తెలుసుకొనేవాడ్ని. మన నిధి కోసం కొందరు సాహసికులు ప్రయత్నించి విఫలమయ్యారని మా తాతగారు నాకు చెబుతుండేవారు. వాళ్ళు రక్తం కక్కుకు చచ్చారని కూడా చెప్పారు"
రాజావారు పూర్తిగా తనను సమర్ధించి, నిధి అన్వేషణ కోసం సమాయత్తం కమ్మని కూతురు ఇందుమతితో స్పష్టంగా చెప్పడం ముత్యాలునాయుడు ముఖంలో ఆనందం తొణికిసలాడింది.