Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 4


    "పోరా బాబూ, త్వరగా! ఎలా తెప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నానింతసేపూ" అన్నాడు కార్డు డిస్ కార్డు చేసి.
    ఆ ముక్క అందుకుని, "షో!" అంది ఇందిర.
    "నాది కౌంట్!" అని వందరూపాయల నోటు ఇచ్చాడు చంద్రం. ఇరవై రూపాయలు తిరిగి ఇచ్చింది ఇందిర.
    కత్తెర వేసి ముక్కలు పంచింది ఇందిర.
    నోరు పెగలటంలేదు రమణకి. ఎండనుపడి రావటంవల్ల, వచ్చాక చూచిన, చూస్తున్న సంఘటనలవల్ల అతని గొంతు తడారి పోతూంది. 'ఒక్కక్షణంలో ఎనభై రూపాయలు' అనుకున్నాడు మనస్సులో.
    ముక్కలు అందుకుని, "ఇంకా వెళ్ళలేదా, రమణా?" అన్నాడు చంద్రం.
    "చంద్రం !"
    కఠినంగా వెలువడింది రమణ వాక్కు.
    వింతగా చూశాడు చంద్రం.
    "ఇంటికి వెళదాం. రా."
    "ఎందుకు ?"
    "నీతో మాటాడాలి."
    "ఏమిటి?"
    "అత్యవసరంగా మాటాడాలి."
    "డబ్బు విషయమా? అయితే అమ్మతో మాట్లాడు."
    "కాదు. నీ విషయమే."
    "నా విషయమా?" ఆశ్చర్యపోయాడతను. "ఇదిగో" రమణా! ఎండనుపడిరావటం వలన నీ మనస్సు కులాసాగా లేనట్టుంది. ఏమిటలా చిర్రుబుర్రు లాడుతున్నావ్? ఎవరితో నయినా తగాదాపడ్డావా?
    "ఉహు! నీతోనే పనుంది, రా."
    అసహనంగా ఇందిరవేపు చూసి "రమణా? ఎంత అర్జెంటు పని అయినా ఇప్పుడు రాలేను.
    సాయంకాలం కానీ, రాత్రికానీ మాటాడదాంలే" అన్నాడు విసుగ్గా.
    'ఆ మాటలకి నవ్వింది ఇందిర. ఆ నవ్వులో 'ఇతనికి నీవు సంజాయిషీ చెప్పుకోవాలా! అన్న హేళన కనిపించింది చంద్రానికి. ఆ నవ్వులో 'నీవు పనిమనిషివి, మేం యజమానులం, వెళ్ళు. మమ్మల్ని బలవంతం చేసే హక్కు నీకు లేదుపో' అన్నట్టుగా అనిపించింది రమణకి. అది ఇద్దరికీ కంటకంగానే అనిపించింది.
    "చంద్రం! చెపుతూంటే నీకుకాదూ? రా."
    "రమణా! అధిక ప్రసంగం మాని వెళ్ళిపో" అన్నాడు పేకముక్కలు క్రిందవేసి డబ్బు ఇందిర వేపు విసిరి తిరిగి ముక్కలు కలుపుతూ చంద్రం_ అంతకంటే ఇక తీవ్రంగా అనలేక పోయాడతను.
    "చంద్రం! నీ కిష్టం లేకపోయినా చెపుతున్నాను. నా వెంటరా. ఇలాంటి వాళ్ళతో కలిసి తిరిగితే ఇల్లూ ఒళ్ళూ చెడిపోతుంది. పరువు మరియాదా మంట కలుస్తాయి. నలుగురిలో తలవంపులు వస్తాయి. రా! నీకు ఇంతకంటే చెప్పలేను."
    "ఇప్పటికే చాలా చెప్పావ్. నీ హద్దుల్లో నీవు ఉండటం మంచిది ఎక్కడున్నానో, ఎలా ఉన్నానో కూడా గ్రహించుకోలేని నీవు నాకు నీతులు చెప్పక్కర్లేదు. వెళ్ళు."
    చంద్రం! మనం చిన్ననాటి నుంచి ఒక్కలా పెరిగాం. నీవు యజమాని కొడుకువి, నేను పాలేరు కొడుకుని అని మనస్సులో ఏనాడూ అనిపించలేదు. కలిసి తిరిగాం. కలిసి పెరిగాం. కలిసి చదువుకున్నాం, కలిసి తిన్నాం. మహానుభావులైన మీ నాన్నగారి ఆదరణా, అన్నపూర్ణలాంటి అమ్మగారి ఆపేక్షా మనల్నిలా చేశాయి. అందుకే ఏనాడూ మనమధ్య అంతరాలు రాలేదు.
    "అది మా పొరపాటేమో ననిపిస్తుంది ఇప్పుడు. ఏదిమంచో, ఏది చెడో తెలియని స్థితిలో ఉన్నానా నేను? నీకంటే రెండేళ్ళు పెద్దవాడిని. నాకు తెలియదా ఒప్పూ, తప్పూ? చంద్రం! వెళ్ళిపో. నాకు కోపం తెప్పించకు. మాటజారితే కష్టం పెదవిదాటితే పెన్నదాటుతుందంటారు."
    "నన్ను తిట్టినా కొట్టినా కసిరినా విసిరినా నాకేం ఫరవాలేదు. నీవు నా మిత్రుడివి, నా దై వానివి. నా యజమానివి. నా ఆత్మబంధువువి. నీవు ఇలాంటి ఆకర్షణలోపడి డబ్బు పోగొట్టుకోవడం నేను చూడలేను. ఊళ్ళో పోరంబోకువాళ్ళు నీ గురించి చెడుగా మాటాడుకోవటం నే వినలేను"
    క్షణకాలం చంద్రం మౌనం వహించాడు.
    "వీళ్ళంతా జలగలు. నీలాటివాళ్ళ రక్తాన్ని పీల్చే వీళ్ళిలా బలిసి అందంగా తయారయ్యారు. వీళ్ళని చేరనివ్వకూడదు."
    "రమణా! ఇప్పుడు నాకున్న ఆస్తల్లా నేను సక్రమంగా సంపాదించానా? నా తండ్రో, నా తాతో, నా ముత్తాతో సంపాదించిన ఆస్థి ఇది. వాళ్ళందరి రక్తమాంసాల్ని ఇలా ధనంగా, తోటలుగా, దొడ్లుగా మార్చారో మనకేం తెలుసు? అందుకే ధనవంతుల్ని గురించి, ధనాన్ని గురించి లోతుగా చర్చించకూడదు."
    "చంద్రం !"
    "రమణా! ఈ జీవితం ఉండేది ఆనందించటానికి, అనుభవించటానికి, అంతే. ఆనందం ఖరీదు, అనుభవం ఖరీదు ఇచ్చుకో గలిగిన వాళ్ళకే అవి దక్కుతాయి. డబ్బు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. అది ఒక్కచోటనే చేరితే కంపు కొడుతుంది. ఆ వాసనని బట్టి మనుషులు రకరకాలుగా అనుకుంటారు, వీళ్లు ఈ ఇందిరలాంటివాళ్ళు - మనకి ఆనందాన్ని అమృతంలా పంచుతున్నారు. దాని ఖరీదు వాళ్ళకిస్తున్నాం మనం. ఇందులో తప్పేముంది? నీవూ కూలీగా కష్టపడి కూలీ తీసుకోవటంలే? ఇదీ అంతే!"
    "బాగా చెప్పావ్ చంద్రం! నా కళ్ళఎదుట ఒక్క క్షణంలో వందరూపాయలు ఇచ్చావ్ ఈమెకి. ఏ కూలీకయినా ఇలా ఇచ్చావా?"
    నవ్వాడు చంద్రం.
    "బాగుంది రమణా నీ వాదన. వ్యక్తినిబట్టి కాక శక్తిసామర్ధ్యాలని బట్టి పే చేస్తారు ఎవరయినా అయినా నా డబ్బు విషయంలో నీకెందుకింత తపన?"
    "నీవు చెడిపోతావని."
    "చెడిపోవడం, బాగుపడటం - వీటి కాట్టే తేడాలేదనుకుంటాను నా దృష్టిలో. ఏమిటి చెడిపోవట మంటే?"
    విసుగ్గా చూశాడు రమణ.
    "ఒక్క గంటలో ఒక వెయ్యి, ఒక్క రోజులో కొన్ని వేలు- ఇలా అయితే ఎంత డబ్బూ చాలదు. పొలమూ తోట అన్నీ ఈవిడ పాలవుతాయి."
    "ఆ మాట కొస్తే ఈ తోట ఈ బంగళా ఈ అమ్మాయి పేరుతో రాసేశానెప్పుడో. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది."
    నిర్ఘాంతపోయిన రమణ కొన్ని క్షణాలు తేరుకోలేక పోయాడు.
    "చంద్రం!" పూడుకుపోతోన్న గొంతుకతో అరిచాడు. తర్వాత తేరుకుని "ఎంతపని చేశావు చంద్రం! ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఎంత బాధపడతారో ఊహించావా? కళ్ళలో వత్తులు వేసుకుని నిన్ను కాపాడుతూన్న నీవు చేజారిపోతూనే ఉన్నావ్. ఇలాంటి బజారు ముండలకి..."
    అతనిమాట పూర్తి కాకుండానే రమణా! హద్దుమీరి మాట్లాడకు. ఇదంతా నా మనఃపూర్వకంగా చేస్తున్నదే. ఇందులో ఎవరి బాధలకి దుఃఖాలకి తావులేదు. అంతా నా ఇష్టం నా రాజ్యం. వెళ్ళు ఇంక విసిగించకు." అన్నాడు కోపంగా చంద్రం.
    రమణ ముఖంమాడిపోయింది.
    మరేమీ జవాబు చెప్పకుండా. రెట్టించకుండా తలవంచుకొని వెళ్ళిపోయాడు.
    మనస్సు గాయపడిన చంద్రం తర్వాత కులాసాగా గడపలేకపోయాడు. వెంటనే ఇందిరని ఇంటికి పంపించి తనలా ఇంటి ముఖం పట్టాడు.
    రమణ వెంటనే వచ్చిన చంద్రాన్ని చూసి. "నీవు పొలంవేపు వెళ్ళావా?" అని అడిగిన మాణిక్యమ్మకి "ఊ" అని జవాబు చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు చంద్రం.
    ఆ సమాధానం విన్న రమణ తనలో తను నిర్లిప్తంగా నవ్వుకున్నాడు.


                                              *    *    *


    ఆ సంఘటన జరిగిన నెలరోజుల తర్వాత రామాపురం నుంచి పరంధామయ్య తన కూతుర్ని చంద్రాని కిస్తానని వచ్చాడు. పరంధామయ్య కూడా ఆ ప్రాంతంలో మోతుబరి ఆసామిగా పేరుపొందాడు. ఒకసారి ఎమ్. ఎల్. ఎ. గా పోటీ చేసి గెలిచి ఇండిపెండెంటుగా రాజకీయాల్లో ఏదీ సాధించలేమని, అధికార పక్ష సభ్యులకి తప్ప అసెంబ్లీలో విలువ లేదని గ్రహించి, అధికార పక్షంలో చేరి పాలనాధికార కాంక్ష ఉందని అనిపించుకోలేక, అనధికార పక్షంలో చేరి విమర్శలకి గురి కాలేక స్వతంత్రుడి గానే ఉండి తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నాడు.
    పంచాయితీ రాజ్య వ్యవస్థ ఏర్పడ్డాక సమితి ప్రెసిడెంటుగా పోటీ చేయమని అందరూ బలవంతం చేసినా ఆయన అంగీకరించలేదు. పార్టీలకీ, పదవులకీ అతీతుడయిన రాజకీయ వ్యక్తిగా నిరూపించుకున్నారాయన. ఆ ఊళ్ళోవాళ్ళు పరోక్షంగా ఆయన్ని తిరిగి రాజకీయాల్లో దింపాలని ఆయన ఏకైక పుత్రుడిని ఆ ఊరి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటామనగా తీవ్రంగా నిరశించారాయన. అందుకు పరంధామయ్య కుమారుడు సురేష్ కూడా సంతోషించాడు.

 Previous Page Next Page