Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 39


    బుద్ధుడి గురించి తెలుసుకునేముందు ఆనాటి సామాజిక పరిస్థితి గురించి కొంత తెలుసుకోవాలి. వ్యవసాయం, చేతివృత్తులు, వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చాయి. పాత వర్ణవ్యవస్థని పోషించే వాళ్ళకు ఇది నచ్చలేదు. అందులో బ్రాహ్మణులలోనే గొప్పా, బీదా తారతమ్యాలేర్పడ్డాయి. పురోహిత వర్గం ఎలాగో నిలబడింది కాని, బీదవారు ఇతర వృత్తి పనుల్లోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి వర్గ సంఘర్షణ, బానిసల హృదయ విదారక పరిస్థితి గౌతముడిని బాగా బాధ పెట్టాయి. అందుకే వర్గవ్యవస్థని పూర్తిగా ఖండించాడు. యజ్ఞయాగాల పేరుతో చేసే పశుబలులని నిరసించాడు. వేదాలలో చెప్పిన ప్రతి విషయం నమ్మవలసిన అవసరం లేదని బోధించాడు. బుద్ధుడు చేసిన బోధ ఇది. 'ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ' లాంటి సమస్యలు చర్చిస్తూ జీవితం వృధాచేయవద్దు. చిత్త సంక్షోభానికి మూలం ప్రపంచంలో ఆవరించిన దుఃఖం. ఈ దుఃఖానికి కారణం కోరిక. కోరికను జయించడానికి 'అష్టాంగ మార్గం' వుపయోగించు. ఈ అష్టాంగ మార్గం తాలూకు నైతిక సూత్రాలు ఏమంటే సరియైన ఆలోచన, హక్కు, ఆదరణ, ఎవరికీ హాని కలిగించకుండా జీవించడం, అహింస లాంటివి, సామాన్య మానవుడు జీవితంలో ఆచరించాల్సిన నైతిక సూత్రాలను బుద్ధుడు స్పష్టంగా చెప్పాడు. ఆయన భగవంతుడికీ, ఆత్మకూ ప్రాముఖ్యం ఇవ్వలేదు. హిందూమతం ఆ రెండింటికీ ప్రాముఖ్యం యిచ్చింది. ఆత్మగుణాలని వివరించడం జరిగింది. కాని నిర్దిష్టమైన సూత్రాలని చెప్పి, వాటిని ఆచరణలో పెట్టాలని కఠినంగా చెప్పలేకపోయింది. దానివలననే ఈనాటికీ మన సమాజంలో పూజ పునస్కారాలకీ, దైవభక్తికి వున్న స్థానం, మనిషి నైతిక వర్తనకు సంబంధించిన నియమాల పట్ల లేకుండా పోయింది. భగవంతుడికీ, ఋజువర్తనకూ సంబంధం పెట్టి భక్తితోపాటు భగవంతుడి పట్ల భయాన్ని కూడా కొంత పెట్టగలిగి వుంటే సమాజం ఇంత కుళ్ళిపోయేది కాదని నా వుద్దేశ్యం" అన్నాను.

    "కాని ఆనాటి ప్రజలు ఇంత స్వార్థపూరితులు కాలేదే. సత్యం, ధర్మం అన్నీ పాటించారు. అయిదవ శతాబ్దంలో వచ్చి చైనీయుడు-ఫాహియాన్ 'హిందువులంతా సత్యసంధులే, ఇళ్ళకు తాళాలు కూడా వేసుకోరు. రుణపత్రాలు కూడా వ్రాసుకోరు' అని స్పష్టంగా వ్రాశాడు. అరియన్ అనే గ్రీకు దేశస్థుడు కూడా 'హిందువులు అసత్యం ఆడరు' అనే వ్రాశాడు. అంటే ఆ రోజుల్లో ధర్మాన్ని పాటించేవారని అర్ధం కదా" అన్నాడు రామారావు.

    "పాటించేవారు. కాదని నేనడంలేదు. కాని అవి నిలకడగా నిల్చిపోలేదు. దానికి కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను."

    "మీరన్నది నిజమే వెంకట్! ఏకేశ్వరోపాసన వదలి కోట్ల మంది దేవతలను సృష్టించుకున్నప్పుడే మనలో ఐకమత్యం పోయింది. అలాగే వర్ణవ్యవస్థా మనల్ని విడదీసింది. స్త్రీలనీ, శూద్రులనీ అణచివేయడంలో సామాజిక అసమానత ఏర్పడి పోయింది. వీటివల్ల తిరుగుబాటు, విప్లవం పుట్టక తప్పలేదు. మీరు చెప్పేది వింటుంటే నాకు భౌద్ధమతం బాగా నచ్చుతుంది" అన్నాడు మనోజ్.

    "మీరు మాంసాహారులా? శాఖాహారులా?" అడిగాను.

    "కులానికి బ్రాహ్మణుడిని. కాని ఆహారరీత్యా మాంసాహారిని. ఏం? ఎందుకలా అడిగారు?" అడిగాడు మనోజ్.మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించింది" అన్నాను.

    "మరేం లేదు. బౌద్ధం మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించింది" అన్నాను.

    "చచ్చాం. అదంటే నాకు చాలా ఇష్టం" అన్నాడు.

    "ఒకప్పుడు బ్రాహ్మణులు మాంసాహారులే. యజ్ఞాల్లో బలి పశువుల మాంసం తినడం, శ్రాద్ధకర్మలలో మాంసం విధిగా వండడం జరిగేది కదా" అడిగింది వందన.

    "అవును. అప్పుడవి తప్పనిసరి. ఈ రోజు చెట్లకు కూడా ప్రాణం వుందని తెలుసుకున్నాం. ఆ విధంగా కూరగాయలు తినడం పాపం అనుకోవాల్సి వస్తుంది. జైనమతస్థుల్లా క్రిమికీటకాల్ని కూడా చంపకుండా నడవాలనుకోవడం అతిశయోక్తి అవుతుంది. ఈ జనాభాలో ఆహారనియమాల్ని సడలించుకోవడం కష్టమే. కాకపోతే కొంతవరకు అరికట్టగలిగితే మంచిదని నా అభిప్రాయం."

    "అనుపమా! ఇవ్వాళ డిన్నర్ కి మెన్యూ ఏమిటి?" అడిగాడు మనోజ్.

    "నీ కిష్టమైన నాన్ వెజ్ అంతా వుందిలే" అంది నవ్వుతూ.

    "అయితే మనం టాపిక్ మార్చేస్తే బావుంటుందేమో?" అన్నాడు. అందరూ నవ్వేశారు.

    "ఇదే మనలో బలహీనత. మాటల్లో ఎంతవరకయినా వెళ్తాం. క్రియలో చూపించడానికి వెనకాడతాం" అన్నాడు రామారావు.

    "ఏదయినా కొంత సడలింపు అవసరమే రామూ! సంప్రదాయాన్ని మనం పూర్తిగా ఆచరించగలుగుతున్నామా? కొంత వరకయినా ఆచరిస్తే తృప్తికదా" అన్నాడు రామ్మోహన్.

    "నేననేది అదే. మతాలు వేరే. వాదాలు వేరే. కాని అన్నింటినించి మంచిని గ్రహించి కొత్తగా మానవతా దృక్పధం ఏర్పరచుకోవలసిన అవసరం వుందనిపిస్తోంది. ఉదయం గాయత్రిని జపించు రాత్రి చేసిన పాపాలు పోతాయి. సాయంకాలం సావిత్రీ జపం చేయి. పగలు చేసిన పాపాలు పోతాయి. గంగలో మునుగు పుష్కరస్నానంచేయి. ఎన్ని పాపాలు చేసినా నిష్కృతి లభిస్తుంది. అని నమ్మినంతకాలం మనిషికి పాపం చేయకూడదన్న ఆలోచన రాకపోవచ్చు" అన్నాడు మనోజ్.

    "ఇంతకీ మీరు భౌద్ధం తర్వాత మన తత్వశాస్త్రాన్ని గురించి చెప్పనేలేదు వెంకట్. అదికూడా చెప్పండి. తర్వాత భోజనాలు చేయవచ్చు" అంది అనుపమ.

    "మానవ మేధస్సుని ఉన్నత పదానికి తీసుకెళ్ళిన ఆలోచనా ధోరణులు కాలక్రమేణా పిడివాదంగా మారి సృజనాత్మక దృష్టి లోపించడంలో అంతరించిపోతున్నాయి. బౌద్ధతత్వం కూడా అలాగే అయింది. బుద్ధుడి తర్వాత అదే తత్వం విడిపోయి చివరకు పూజలు, కర్మకాండలు మొదలయ్యాయి. అలాగే మరొక భావం 'వైశేషకం' ఈ సూత్రాలను కణాదుడు రచించాడు. మన ఫిజిక్స్ కి పునాదదే. డెమోక్రటిస్ అణు సిద్ధాంతానికి దీనికి పోలికలున్నాయి. సృష్టికి మూలం అణువని వీళ్ళు ప్రతిపాదించారు. ఒక తత్వవేత్త చనిపోతుండగా. ఒకే వేదాంతి వెళ్ళి 'నీ ఆఖరు ఘడియల్లోనయినా పరబ్రహ్మని తలచుకో' అన్నాడుట. దానికతడు 'ప్రపంచానికి మూలం అణువు. కాబట్టి దాన్ని స్మరిస్తాను' అని 'పీలుః పీలుః' అంటే పరమాణువనర్థం... అనుకుంటూ చనిపోయాడట. ఈ సిద్ధాంతాలను బట్టే విజ్ఞానశాస్త్రంలో ఆనాడే మనదేశం పురోగమించిందని చెప్పుకుంటారు."

    "బౌద్ధ, జైనమతాల ప్రాచుర్యంలో హిందూ సంస్కృతి నాశనం అయిపోతోందన్న భయంతో జైమిని పూర్వమీమాంస సూత్రాలని ప్రకటించాడు. దీనితో తిరిగి వైదికకాండ, యజ్ఞాలు మొదలయ్యాయి. తరువాత కొన్ని వందల సంవత్సరాలు ఈ కర్మకాండలు నిరవధికంగా నిర్వహించబడ్డాయి. విష్ణుకుండిన రాజయిన మాధవవర్మ అశ్వమేధ, రాజసూయ, నరమేధ యాగాన్ని చేసినట్లు ఆంధ్రుల చరిత్రలో వుంది. యజ్ఞాలు చేయించే బ్రాహ్మణులకు అగ్రహారాలు విరివిగా యిచ్చేవారు. దీనితో బ్రాహ్మణులు తిరిగి ప్రోత్సహింపబడ్డారు. శంకరాచార్యుల కాలంవరకూ ఇదిలా కొనసాగింది. క్రీ. శ. 788 లో అద్వైతమతాన్ని స్థాపించే ముందు శంకరుడు మండనమిశ్రుడనే గొప్ప పూర్వమీమాంసా పండితుడిని ఓడించినట్లు శంకరుడి జీవితచరిత్రలో వుంది."

    "అంటే అద్వైతం యజ్ఞయాగాల్ని నిరసించిందా?" అడిగింది వందన.

    "అవును. అప్పటికి శైవమతం బాగా వ్యాప్తిలో వుంది. క్షుద్ర ఆచారాలతో దుర్గని పూజించే శాక్తేయం, వినాయకుడిని పూజించే గాణాపత్యం, శివుడిని కుక్క ఆకారంలో పూజించే మల్లాది మతం బాగా వ్యాప్తిలో వున్నాయి. సాంఖ్యులు ప్రకృతి- పురుషుడులో పురుషుడిగా శివుడిని పూజించేవారు. వింధ్యవాసిని పేరుతో దుర్గకు నరబలులు, జంతుబలులు కూడా జరిగేవి. వీటిని చూసి సహించలేక శంకరుడు అద్వైత మతాన్ని స్థాపించాడు. దీనికి రెండు ముఖ్య సూత్రాలున్నాయి. ఒకటి మతసంస్కరణ. రెండోది తాత్వికరంగంలో సంపూర్ణ భావవాద సిద్ధాంత ప్రచారం. జగత్తంతా మాయ, ప్రత్యగాత్మ. పరమాత్మ ఒకటే- 'తతత్వం ఆసి' అంటే 'అదే నీవై వున్నావు' అన్న వాక్యం అద్వైత్వానికి మూలం. ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. పునర్జన్మ వుండదు అని శంకరుడు సిద్ధాంతం."

    "కాని శంకరాచార్యుడి గురించి చాలా విమర్శలున్నాయని విన్నాను. కులతత్వాన్ని పోషించాడనీ, విగ్రహారాధనని సమర్ధించాడనీ అంటారు." 

    "నిజమే. శంకరుడికి ఒక హరిజనుడు జ్ఞానబోధ చేసినట్లు ఒక కథ విన్నాం. 'బ్రాహ్మణులు వస్తున్నారు. పక్కకు తప్పుకో' అన్నప్పుడు కుక్కను తీసుకెళుతున్న ఒక హరిజనుడు "అందరిలో వున్న ఆత్మ ఒకటే గదా" అన్న ప్రశ్నతో నిలదీశాడంటారు. అప్పుడు శంకరుడు అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి కులభేదాలు పాటించకూడదని వప్పుకుంటూనే 'కాని మనకంతటి సిద్ధి లభించలేదు. కాబట్టి లొలోకవ్యవహారానికి పట్టుబడి పాటించాల్సివుంటుంద'ని చెప్పాడు. అలాగే అనేక ఆలయాలను పునర్నిర్మాణం చేసి వుద్ధరించాడు కూడా. అంతేకాకుండా అనేకమంది బౌద్ధ జైనమునుల్ని చంపించి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాడనీ, శాక్తేయులను, గణపతులనూ చంపించి వేశాడని కూడా కథలున్నాయి. ఏమయినా అణగారిపోతున్న ఒక సంస్కృతిని పునరుద్దరించినవాడు శంకరాచార్యుడు. ఈయన అద్వైత భావాన్ని ఖండించినవారు మధ్వాచార్యుడు, రామానుజుడు. రామానుజుడి విశిష్టాద్వైతం, మధ్వాచార్యుడిది ద్వైతం. శంకరుడి మాయావాదాన్ని ఖండించి, తాత్విక చర్చలను నిరుత్సాహపరచి, భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు. ఆ సమయంలో ఇంకా అనేక సిద్ధాంతాలు, ధోరణులు కూడా తలెత్తాయి. ఆ రకంగా తిరిగి విగ్రహారాధన, పూజలు వృద్ధిలోకి వచ్చాయి. ఐక ఈ శతాబ్దంలో తిలక్, గాంధి కర్మవాదాన్ని ప్రబోధించారు. కాని భారతీయ పునరుజ్జీవనోద్యమ జనకుడు రాజా రామ్ మోహన్ రాయ్. ఈయన విగ్రహారాధన, కులవ్యవస్థ, సహగమనం లాంటి మూఢవిశ్వాసాల నన్నింటిని వ్యతిరేకించి, బ్రహ్మసమాజ మతాన్ని స్థాపించాడు. కాని వివేకానందుడు హిందూమతాన్నే సంస్కరించాలన్నాడు. అరవిందుడిది మరొక ధోరణి. ఏమైనా భారతదేశంలో తత్వశాస్త్రం కొత్త కొత్త ధోరణులకు, వాదాలకు లోనవుతూనే వుంది. అందుకే అంటాను- అదొక సజీవ విప్లవం. దాన్ని ఈనాటి సమాజానికి అనుగుణంగా మార్చుకోవడం మన చేతిలోనే వుంది." అంటూ ముగించాను. ఎంత చెప్పినా తరగని సబ్జెక్ట్ యిది. అవతలి వాళ్ళకు బోర్ కొట్టకుండా ఆసక్తిదాయకంగా చెప్పగలిగే శక్తి నాకులేదు.

    "చాలా బాగా చెప్పారండి. నిజంగా వీటిలో మాకు చాలా విషయాలు తెలియవు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలను గమనించి, చదువుకున్న కొద్దిపాటి చరిత్రను అన్వయించుకుని ఏవో నిర్ణయాలు తీసుకునేకంటే, ఇలా చరిత్రను చదివి, సమాజ పరిణామాన్ని స్టడీ చేసి అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. నిజంగా చాలా చాలా థాంక్స్" అన్నాడు మనోజ్.

    "బుద్ధుడి క్రియాశీల దృక్పథం అదే. గతంనించి వర్తమానం ఉద్భవించినట్లే, వర్తమానంనుండి భవిష్యత్తు ఉద్భవిస్తుంది. గతంలోని కార్యఫలితాలను వర్తమానంలో అనుభవిస్తున్నట్లు వర్తమానంలోని కార్యాల ఫలితాలను భవిష్యత్తులో అనుభవించవలసి వస్తుంది. వర్తమానములో భవిష్యత్తు బీజాలు వున్నాయి. కనుక మనం వర్తమానం గురించి శ్రద్ధ వహించాలి. అది మన కర్తవ్యం. నేను మీకు చెప్పింది చాలా తక్కువ. మీరు తత్వశాస్త్రం గురించి తెలుసుకోవాలంటే చాలా చదవాలి మనోజ్."

    "తప్పకుండా మనం మళ్ళీ కలిసినప్పుడు నా అభిప్రాయాలు మీరు వింటారు" అన్నాడతను.

    చర్చ ముగించుకుని భోజనాలకు లేచాం. నా మనసులో మాట చెప్పడానికి భోజనాల తర్వాత అవకాశం వచ్చింది.

    "అనుపమా! 'థాంక్స్' చెప్పుకునే అలవాటు మనలో లేదు. కాని ఈ రోజు నీకు కృతజ్ఞతలు చెప్పకుండా వుండలేకపోతున్నాను. డిన్నర్ గురించి కాదు. వెంకట్ ని మాకు పరిచయం చేసినందుకు" అన్నాడు ప్రొఫెసర్ రామారావు.

    "థాంక్స్ చెప్పకండి. నాకొక సలహా కావాలి. అదివ్వండి చాలు" అన్నాను.

    "ఏ విషయంలో? చెప్పండి" అన్నాడాయన.

    "నేను వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకున్నాను. అదీగాక గత ఇరవై ఏళ్ళుగా కూడబెట్టిన డబ్బుంది. దీంతో నా ఈ భావాలకు అనుగుణంగా ఈనాటి సమాజానికి అవసరమయ్యే విధంగా ఏమయినా చేయాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం, సలహా కూడా కావాలి."

    "తప్పకుండా ఆలోచించి చెప్తాం" అందరూ మాట ఇచ్చారు.

    మళ్ళీ వారం మా ఇంట్లో కలవాలని నిర్ణయించుకున్నాం.

    ఆ రాత్రి నా డైరీ తీసి వ్రాయడం మొదలుపెట్టాను.

    "ఇరవై ఏళ్ళుగా నాకేం కావాలో నాకే తెలియకుండా బ్రతికాను. ఈ రోజు అర్ధం అయింది. మనిషి జడుడైనంతకాలం ఎంత సుఖమయ జీవితమైనా వ్యర్ధమవుతుందని, మనిషిలో చైతన్యానికి పునాది ఆలోచన. అది నిక్షిప్తంగా వున్నంతకాలం నిష్ప్రయోజనమే అవుతుంది. భావతరంగాలను బంధిస్తే అది అంతర్మధనం సాగిస్తాయి. జ్ఞానం పదిమందితో పంచుకుంటేనే పెరిగే అమూల్య సంపద. హృదయ గవాక్షపు రెక్కల్ని పూర్తిగా తెరిచి ఈ రోజు గుండె తేలిక పరుచుకున్నాను. ఐక నాకు కలలు రావు. వచ్చినా కలత పెట్టవు."


                   *    *    *    *


    "అన్వేషణ" ప్రాంగణంలో కూర్చున్నాను. అయిదునుంచి పదిహేనేళ్ళ బాలబాలికలు నవ్వుల పువ్వులతో మైదానంలో ఆడుకుంటున్నారు. వాళ్ళలో నా దీపికను చూసుకుంటున్నాను.

    నా "అన్వేషణ" మొదలై ఆరు నెలలయింది.

    ఆ రోజు మా ఇంట్లో మిత్రబృందం అందరం సమావేశం అయి ఈ 'అన్వేషణ' కు అంకురార్పణ చేశాం. మరో ఆరు నెలల తర్వాత దీన్ని ప్రారంభించాం.

    పెద్దవాళ్ళతో వాదనలు అనవసరం. పిల్లలలో మన భావాలను పంచిపెడదాం. వాళ్ళను ఏ 'వాదానికీ' లొంగమని శాసించవద్దు. 'అన్వేషణ' వాళ్ళే కొనసాగించేలా ప్రయత్నం చేద్దాం. పదిశాతం అయినా 'ఆలోచన' తో ఇక్కడినుంచి బయటకు వెళితే చాలు. మానవత్వమనే కొత్త మతానికి పునాది వేస్తారు.

    దాదాపు అయిదు వందలమంది బాలబాలికలు. వాళ్ళలో మామూలు చదువే కాకుండా భారతీయ తత్వశాస్త్రపు ప్రాథమిక సూత్రాలు వివరిస్తున్నాం. వాళ్ళకు అభిప్రాయాలు కలిగించడం, వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించి పెంపొందిస్తాం. నెలకోసారి కొందరు పెద్దల్ని ఆహ్వానించి వాళ్ళతో బహిరంగ చర్చలు జరుపుతాం. పెద్ద పిల్లలందరూ దానికి శ్రోతలవుతారు.

    అనుపమ తన నివాసాన్ని 'అన్వేషణ'కు మార్చుకుంది. సహాయ, రాధాకృష్ణ హోంలలో మా సేవ కొనసాగుతూనే వుంది.

    ఇది దీర్ఘకాలిక పథకం. భగవద్గీతలో చెప్పిన 'నిష్కామకర్మ' మా ధ్యేయం. చేతనయిన శ్రమ చేస్తాం. అది ఒక యజ్ఞంలా చేస్తాం. ఫలితంకోసం ఆశించం. మా 'అన్వేషణ' నిరంతర వాహిని.

    బెల్ మ్రోగింది. పిల్లలందరూ వచ్చి నిశ్శబ్దంగా వరుసక్రమాల్లో నిలబడ్డారు. తీచర్లందరూ ఒక పక్క నిలబడ్డారు.

    అందరం కలిసి ప్రార్థన మొదలుపెట్టాం.

    అసతోమా సద్గమయా
    తమసోమా జ్యోతిర్గమయా
    మృత్యోర్మా అమృతంగమయా.

                                        * THE END *

 Previous Page Next Page