సాహితి వూపిరి బిగపట్టింది. అతను నిజంగా పొగుడుతున్నాడో, లేదో తెలీదుగానీ....పరమహంస పెదాలు ఆవేశంతో వణకటం స్పష్టంగా కనిపిస్తోంది.
"మీరెంతో విశాల హృదయంతో ఈ ఇంటి బాధ్యత తీసుకున్నారు. ప్రతి లక్ష్మివారం లక్ష్మీపూజ చేయించటమే కాక, పరమపదించిన మీ స్నేహితుడి కూతురికి కాబోయే అల్లుడిని కూడా ముందుగా చూసి ఇంటర్వ్యూ చేసే బాధ్యత కూడా తీసుకున్నారంటే అది మీ గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ విషయమై మీ రెండో భార్యగారయిన రాజ్యలక్ష్మిగారి ఈర్ష్యాసూయల్ని కూడా మీరు లెక్క చేయకూడదు. ఉన్నతభావాల్ని సంఘం ఎప్పుడూ అర్ధం చేసుకోలేదు కదా! అలా అర్ధం చేసుకోలేక మీ మొదటి భార్యగారు విడాకులు తీసుకుని చచ్చిపోయారు. ఈ విధంగానే మీ పనిమనిషిచేత కూడా మీరు లక్ష్మీపూజ చేయించబోతే, ఆ లేబర్ కాలనీ వాళ్ళు మిమ్మల్ని అపార్ధం చేసుకుని తన్నబోయారు...."
సాహితికి రెండు చేతుల్తో చప్పట్లు కొట్టాలనిపించింది.
పరమహంస కుర్చీలోంచి లేచాడు. అతని కళ్ళలోంచి విస్ఫులింగాలు రాలుతున్నాయి.
భరద్వాజ మాత్రం తాపీగా కుర్చీలో కూర్చునే అన్నాడు - "నేనన్నాను. గుణశేఖరా.... ఆయన భగవత్ స్వరూపుడు. సురాపానం కూడా భగవంతుని కోసమే చేస్తాడు. ఈ ప్రపంచంలో మనకు తెలిసీ నలుగురు ఆడవాళ్ళ కష్టాల్ని తనమీద వేసుకున్నాడు. అటువంటి ప్రేమశీలియొక్క కరుణా కటాక్షాన్ని పొందటంకోసం వెళ్ళగానే కాళ్ళకి నమస్కారం చేయి-ఆయన సంతోషిస్తాడు అని. వినలేదు!"
"గెటౌట్" అని అరిచాడు పరమహంస ఆవేశంతో వూగిపోతూ.
సాహితికి దిగంతాల్లో ఎగురుతున్నంత ఆనందం కలిగింది. ఇన్నాళ్టికి పరమహంసని ఎదిరించే ఒక వ్యక్తి కనపడ్డాడు! పరమహంసకన్నా నాజూగ్గా, తన మాటల్తో కన్విన్స్ చేస్తున్నట్టు నటిస్తూనే దెబ్బ కొడుతున్నాడు!! అంతేకాదు.....మొట్టమొదటిసారి పరమహంస ఆవేశపడుతున్నాడు!!!
ఆమెకు ఆశ్చర్యం కూడా వేసింది. తనలో పరమహంస మీద ఇంత కసి వుందా?
"వెళ్ళండి - తక్షణం వెళ్ళిపోండి."
"మరి మా గుణశేఖరుడు మీకు నచ్చాడో లేదో చెప్పలేదు."
"ఇంకొక్క క్షణముంటే పోలీసుల్ని పిలవాల్సొస్తుంది" అనరిచాడు. అతనంత పెద్దగా అరవటం అదే మొదటిసారి.
నిర్మల "ఏమండీ" అంది.
భరద్వాజ నవ్వేడు. "పోలీసులూ, కేసులూ ధైర్యస్తుల్ని భయపెట్టవు. పోలీసులొస్తే మొత్తం మే కథంతా బయటకొస్తుంది. మీరు చేసిన పనులకు బహుశా కోర్టు మిమ్మల్నేమీ చేయకపోవచ్చు. ఈ నిర్మలగారితోసహా మీ ఆడ భక్తులు రేపు కోర్టులో మీరసలు వాళ్ళచేత లక్ష్మీపూజే చేయించలేదని సాక్ష్యం చెప్పవచ్చు. కానీ నాకు మాత్రం మంచి సబ్జెక్ట్ దొరికింది. చాలామంది పాఠకులకు అసలు మీలాంటివారు వుంటారా అన్నంత అనుమానం కలిగేలా ఈ నిజాలన్నీ వ్రాస్తాను. వెళ్లొస్తాము."
వాళ్ళు వెళ్ళిపోగానే సాహితి ఆ గదిలో కొచ్చింది. "డామిట్స్! వాళ్ళని ముప్పతిప్పలు పెడతాను- ఇదే నా శాపం" అరుస్తున్నాడు.
సాహితి తల్లివైపు చూసింది. ఆమె ఏడుస్తోంది.
తమ ఇంటి గురించి ఇంతవరకూ ఎవరికీ తెలీదనుకుంది. ఇంత సులభంగా తెలుసుకోవచ్చని ఇప్పుడే తెలిసింది. ఆమెకు బాధ కలుగలేదు. ప్రపంచమంతా తెలియాలని అనిపిస్తోంది.
* * *
ఈ సంఘటన సాహితిమీద గొప్ప ప్రభావాన్ని చూపించింది. 'పరమహంస కూడా మామూలు మనిషే. అతన్నెదిరించవచ్చు' అన్న భావంలో తెగింపు తెచ్చింది. అయితే అది "మంచి" వైపు కాదు. నిర్లక్ష్యభావం, తన కుటుంబాన్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారన్న ఆత్మన్యూనతా భావం, తల్లంటే అగౌరవం పెరిగాయి. ఆ రోజు రాత్రి ఆమె తన నోట్ బుక్ లో వ్రాసుకుంది.
"నాకు ప్రేమ కావాలి. నిస్వార్ధమైన ప్రేమ కోసం నా మనసు తపించిపోతూంది. నాకెవరూ లేరు" అని.
కొన్ని రోజులకి ఆమె మార్కుల ప్రోగ్రెస్ షీట్ వచ్చింది. నిర్మల అదిచూసి వణికిపోయింది. సాహితికి ఎందులోనూ ఇరవై కన్నా ఎక్కువ మార్కులు రాలేదు.
"ఏమిటిది?" అడిగింది.
"మార్కులు" నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది సాహితి.
"తెలుసు ఒకప్పుడు ఫస్టు ర్యాంకు వచ్చేది. ఇలా తయారయ్యావేం?"
"ఇంట్లో మీ సరసాలు చూడలేక."
నిర్మలకి కూతురు మాటలు అర్ధం కాలేదు. అర్ధమవ్వగానే జేవురించిన మొహంతో లాగిపెట్టి చెంపమీద కొట్టింది.
జీవితంలో అదే మొదటిసారి చెంపదెబ్బ తినటం!
తన గదిలోకెళ్ళి పడుకుంది సాహితి. ఏడుపు రాలేదు. నిర్మల కూడా వచ్చి మాట్లాడలేదు.
ఆ రాత్రి పరమహంస వచ్చాడు. తల్లి ఏం చెప్పిందో ఏమో, గదిలోకి వచ్చి అనునయించాడు. "నేను నిన్ను అర్ధం చేసుకోగలనమ్మా మార్కులకేముంది? ఒకసారి వస్తాయి. మరొకసారి రావు. అమ్మకు చెపుతాలే" అన్నాడు.
సాహితికి అతడిమీద కోపం మర్చిపోయి అతడి చేతుల్లో తలదాచుకుని ఏడవసాగింది. ఆ అమ్మాయి వయసెంతని? కాస్త ఓదార్పుకి కరిగిపోయింది.
"రామ్మా భోంచేద్దువుగానీ...."
ఆమె కదల్లేదు.
"నువ్వు చేయకపోతే నేనూ చేయను. అంతేకాదు. ఇంకో నిమిషంలో నువ్వు లేవకపోతే, వారం రోజులపాటు భోజనం చేయనని లక్ష్మిదేవిమీద ప్రమాణం చేస్తున్నాను."
అతడన్నంత పనీ చేస్తాడని తెలిసి సాహితి లేచింది. అతనామెని పొదివి పట్టుకొని గదిలోంచి తీసుకెళ్ళసాగాడు.
గడప దాటుతూ వుండగా ఆమె గుర్తించింది.
తండ్రి మరణించినప్పుడు ఈ విధంగా తల్లిని...."సరిగ్గా యీ భంగిమలోనే పట్టుకుని తోడు తీసుకు వెళ్ళాడని! ఆమె వ.....ణి....కి....పోయింది.
ఆ మరుసటిరోజు స్నేహితురాలితో కలిసి వెళ్ళి మొదటిసారి 'గంజాయి' రుచి చూసింది సాహితి.
ఆనందం కోసం కాదు.....కసితో!!!
2
సాహితికి మొదట అదేమీ రుచించలేదు. కడుపులో తిప్పింది. రెండోసారి కాస్త బాగా వున్నట్లనిపించింది. స్నేహితురాలు ఆమెవైపు ఉత్సుకతతో చూస్తోంది. తను కనుక్కున్న ఆనందం, పక్కవాడి కెలాంటి సంతోషం యిస్తుందో చూడాలన్న కుతూహలంతో కూడిన ఉత్సాహం అది.
"బావుంది" అంది సాహితి.... "నాకు బాధలేమీ గుర్తురావటం లేదు. గాలిలో తేలిపోతున్నట్లుంది. నీకు నా థ్యాంక్సెలా చెప్పుకోను?"
స్నేహితురాలు గర్వంగా నవ్వింది.
కొంచెంసేపు హాయిగా వున్నమాట నిజమేగానీ, ఇంటికొచ్చి పడుకున్నాక చాలా చికాకుగా అనిపించింది. గుండెల్లో మంట, నిద్ర రాకపోవటం, ఇంకా 'గంజా' కావాలనిపించటంతో అటూ ఇటూ చాలాసేపు దొర్లింది. ఆ తరువాత పుస్తకం తీసుకుని చదవటానికి ప్రయత్నించింది ఏకాగ్రత కుదరలేదు. ఇంకో డోసు గంజా వుంటే బావుండన్న భావన. నోట్ బుక్ లో వ్రాసుకుంది - గంజా గురించి.
"నాకేదో కావాలనిపిస్తుంది. అది లేకుండా నేను బ్రతకలేను. ఈ రాత్రి నాకేం కావాలో తెలిస్తే అమ్మ బ్రతుకుతుందా?"
ఆ రాత్రి చాలాసేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది.
ఆ మరుసటిరోజు ఆమె కాలేజీకి వెళ్ళాక, ఏదో పనిమీద పరమహంస ఆమె గదిలో కెళ్ళాడు. నోట్ బుక్ లో కాగితాలు గాలికి, రెప రెప లాడుతూ కనిపించాయి.
తీసి చదివాడు (ఇది ఒంటరితనం గురించి)
"నాకు ప్రేమ కావాలి. నిస్వార్ధమైన ప్రేమ కోసం నా మనసు తపించిపోతుంది. నాకెవరూ లేరు."
పేజీ తిప్పాడు. (ఇది గంజా గురించి)
"నాకేదో కావాలనిపిస్తుంది. అది లేకుండా నేను బ్రతకలేను. ఈ రాత్రి నాకేం కావాలో తెలిస్తే అమ్మ బ్రతుకుతుందా?"
పరమహంస భ్రుకుటి ముడిపడింది. దేవుడు తనకీ విషయం యింతకాలం చెప్పనందుకు బాధపడ్డాడు. రెండూ తన గురించే అనుకున్నాడు.
* * *
"నాకు బాగా తెలిసినవాళ్ళు, చాలా మంచి కుటుంబం. అందరూ బాగా చుదువుకున్నవాళ్ళు, సంస్కారవంతులు. అబ్బాయి లాయరు బావుంటాడు. సాహితికి మంచి జోడు. పోయినసారి వచ్చినప్పుడు ఇలా మా చెల్లెలు కూతురుంది, అంటూ అన్ని వివరాలూ చెప్పాను. అబ్బాయి ఏదో పెళ్ళిలో సాహితిని చూశాడట. నచ్చిందని చెప్పాడు. ఇంట్లోవాళ్ళు అబ్బాయి ఇష్టాన్ని కాదనరు. నువ్వుకూడా సరేనంటే రమ్మంటాను. సాహితి ఇష్టపడితే వెంటనే ముహూర్తాలు పెట్టుకోవచ్చు" నిర్మల అన్నయ్య ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు.