బాగా శ్రమ పడిన దానిలా ఎంతో అలసటగా ఉంది. భళ్ళున తెలవారే వరకూ రవికి నిద్ర రాలేదు. చివరికి నిద్రపోకుండానే లేచిపోయాడు.
కళ్ళు తెరవగానే అతని కంటికి కనిపించింది. బల్లమీద ఉన్న కొత్త వస్తువు. దగ్గిరిగా వెళ్ళి చూశాడు. టెలిస్కోప్! ఇంపోర్టెడ్ ది. దానిని చుట్టి ఒక చిన్న కాగితం!
టు,
డా. రవి,
విత్ బెస్ట్ విషెస్.
అని టైప్ చేసిన అక్షరాలూ! కింద సంతకం లేదు.
దానిని చూడగానే స్ఫురించింది రవికి. దాని అప్పటి అవసరం!
గుహ ఎడమచేతి వైపు ద్వారం మీద తోరణాలుగా చెక్కిన దానిలో ప్రత్యేక శిల్పాలను జాగ్రత్తగా పరిశీలించటానికి ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుంది.
ఈ అవసరం గుర్తించి దీనిని ఇక్కడ పెట్టిన వారెవరు? ఇంత ఖరీదైన టెలిస్కోప్ సంపాదించగలిగిన వారెవరు?
ఎవరికీ తెలియకుండా టెంట్ లో ఎలా పెట్టగలిగారు? ఇదంతా నిజంగా తనకు సహాయపడటానికా? లేక తనను ఏదైనా ప్రమాదంలోకి తొయ్యటానికా?
టెలిస్కోప్ చాలా శక్తివంతమైనది. తోరణాల మధ్య ఉన్న శిల్పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మొదటిది! పొడుగాటి గెడ్డంతో-నడి నెత్తిన జటాజూటంతో యజ్ఞోపనీతంతో, మోకాళ్ళ పైకి గోచీ పోసికట్టిన పంచె కట్టుతో ఒక ముని. శిల్పి ఎంతటి ప్రతిభావంతుడో కాని, అంత చిన్న శిల్పాలలో కూడా హావభావాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
ముని చాలా కోపంగా ఉన్నాడు. అతడి రెండు చేతులలోనూ రెండు కోతులున్నాయి. ఆ కోతులకి లంగోటీలున్నాయి. మెడలో నగలున్నాయి. ఆ ముని అటు పక్కనా, ఇటు పక్కనా ఇద్దరు ఆడవాళ్ళున్నారు. ఓ స్త్రీ వయసులో పెద్దది, మరొకటి చిన్నది. ఆ భేదం స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తపడ్డాడు శిల్పి.
వయసులో పెద్దదయిన స్త్రీ ముఖంలో దైన్యభావం ఉంది. మునికి చేతులు జోడించి నమస్కరిస్తోంది. చిన్న పిల్ల ముఖంలో భయం ఉంది. ఊరికే చూస్తోంది.
అప్పటికప్పుడే డ్రాయింగ్ పేపర్ మీద ఆ శిల్పం స్కెచ్ గీసుకున్నాడు రవి.
రెండవది: కైలాస పర్వతం మీద ఉమాశంకరులు! శంకరుడి ఊర్వుపై కూర్చుని ఉంది ఉమాదేవి. ఆది దంపతుల కభిముఖంగా ఒక పొట్టివాడు. పెద్ద పొట్ట, బూరి బుగ్గలు, చేతిలో మూట, ఒక కన్ను గుడ్డిది. రెండో కన్ను పార్వతీదేవిని చూస్తోంది.
ఆ శిల్పం కూడా స్కెచ్ గీసుకున్నాడు.
తోరణాల మధ్య భాగంలో ఇవే శిల్పాలు మళ్ళీ మళ్ళీ చెక్కాడు శిల్పి. కొన్ని శిల్పాలలో మునికి ఎదురుగా సముద్రం ఉంది.
రవి చూసిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా టెలిస్కోప్ లోంచి చూశారు. చిత్రంగా రవి దగ్గిరున్న టెలిస్కోప్ చూసి కూడా ఎవరూ ఏ విధమైన వ్యాఖ్యానం చెయ్యలేదు. అనిల మాత్రం "మీ వెంట టెలిస్కోప్ తేవటం చాలా మంచి పని చేశారు" అంది.
ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు.
సాధారణంగా దేవాలయాల గోడల మీద పురాణగాధలు చెక్కుతారు శిల్పాలుగా. భారత భాగవత రామాయణాలతో పరిచయం ఉన్న ఎవరికయినా ఆ కథలు తేలిగ్గానే అర్థమవుతాయి. ఎల్లోరా గుహలలో రావణుడు కైలాస పర్వతం ఎత్తుతున్న శిల్పం వుంది. ఆ సందర్భంలో ఆ పర్వతం మీద ఉన్న మిగిలిన దేవతలు భయభ్రాంతులు చాలా స్పష్టంగా చెక్కాడు శిల్పి.
"ఈ శిల్పాలలో ఏముందీ? ప్రత్యేకించి వీటిని చూడమని ఎందుకు చెప్పింది విలసిత?" విసుగ్గా అన్నాడు విష్ణు.
అతడి మాటలలో రెండో భాగం రవిని ఆలోచనలో పడేసింది.
ప్రత్యేకించి విలసిత తమ దృష్టిలోకి తెచ్చినప్పుడు తప్ప ఈ శిల్పాలు తాము గమనించలేదు. సాధారణంగా ఎవరూ గమనించలేదు.
విలసిత ఈ శిల్పాల విషయం తన దృష్టిలోకి తేవటమూ, వెనువెంటనే టెలిస్కోప్ తన టేబుల్ మీదకు రావటమూ...
అసంభవం? విలసిత టెలిస్కోప్ తన టేబుల్ మీదకు తెచ్చే అవకాశం లేదు. ఆవిడ జీప్ లో వెళ్ళిపోయాక మళ్ళీ రాలేదు. అదీగాక ఆ పెట్టిన వాళ్ళెవరో కాని, తమకు ఏమాత్రం తెలీకుండా అతి చాకచక్యంతో పెట్టారు. అంత రహస్యంగా పెట్టవలసిన అవసరం విష్ణుకి లేదు.
అనిల? జెన్నిఫర్? ప్రకాశం?
వీళ్ళకి మాత్రం రహస్యంగా పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది?
"ఈ శిల్పాలు ఏవో పురాణ గాధలకి సంబంధించినవి. రిఫర్ చేసి తెలుసుకోవాలి?" చెప్పాడు రవి.
"ఆ పురాణ గాధలు నాకు తెలుసు" ఊరిస్తున్నట్లుగా అంది అనిల.
"తెలిస్తే చెప్పండి?"
"చెప్తే నాకు ఏమిస్తారు?"
"నేనా? ఏమివ్వగలను?"
"మీరూ, విష్ణుగారు కలిసి ఇయ్యగలరు. ఈ ఎక్స్ కవేషన్స్ పూర్తయ్యేవరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ నన్ను పంపించెయ్యకూడదు. ప్రతికూల పరిస్థితులేదురయినా సరే."
రవి విష్ణువంక చూశాడు.
"అలాగే పంపించం! ఆ పురాణగాధలేవో చెప్పండి!" ఏమాత్రం సందేహించకుండా అనేశాడు విష్ణు. మంత్రుల్లాగా వాగ్దానాలివ్వటంలో అతనికి జంకూ గొంకూ వుండదు. ఎందుకంటే మంత్రుల్లాగే వాటిని అమలుపరచవలసి వుంటుందని అతడెప్పుడూ ఆలోచించడు.
"మీ సంగతి చెప్పండి?" ప్రత్యేకించి రవి నుద్దేశించి అంది అనిల.
"మీ ఇష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్నెవరూ ఎక్కడికీ తీసుకెళ్ళలేరు. అలాంటిది జరక్కుండా నా శాయశక్తులా అడ్డుపడతాను" చాలా సిన్సియర్ గా అన్నాడు రవి.
"థాంక్యూ! కానీ, మీ మాట నిలబెట్టుకోవాలంటే ఈ రెండు గ్రామాల ప్రజలతోనూ సాన్నిహిత్యం పెంచుకోవాలి. వాళ్ళ విశ్వాసం సంపాదించుకోవాలి. అది మీకు ఇష్టమేనా?"
విష్ణు ఏదో అభ్యంతరం చెప్పబోయాడు. రవి అతడి మాటలు లక్ష్యపెట్టకుండా "ఇష్టమే?" అన్నాడు.
"థాంక్యూ! నేను ఎందుకిలా అడిగానో మరోసారి వివరంగా చెప్తాను. ఇప్పుడు శిల్పాల గురించి... మొదటిది వాలి సుగ్రీవుల కథ. విక్రమాధిత్యుడు ఈ శిల్పంలో వున్న కథ వాల్నీకి రామాయణంలోది కాదు. విచిత్ర రామాయంలోది. ఆ ముని గౌతముడు ఆ స్త్రీ అహల్య-ఆ చిన్నపిల్ల అంజని, వాలి సుగ్రీవులిద్దరూ అహల్య కొడుకులు."
రవి అడ్డుపడ్డాడు "వాట్ నాన్సెన్స్! వాలి సుగ్రేవులు అహల్య కొడుకులేమిటి?"
"ముందే చెప్పాను-ఈ కథ వాల్మీకి రామాయణంలోది కాదు విచిత్ర రామాయణంలోది!"
"అవును. పేరుకు తగ్గట్టే ఆ గ్రంథంలో రామాయణ గాధలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకి శూర్పణఖ సీత వేషం వేసుకుని రాముడి దగ్గరకు బయలుదేరటం, అదే సమయంలో రావణుడు రాముడి వేషంతో సీత కోసం బయలుదేరటం, సీత అనుకుని ఆ వేషంలో ఉన్న తన చెల్లెల్నే ఎత్తుకుపోవటం... వగైరా...అయితే, నా సందేహం. ఈ విచిత్ర రామాయణం శాతవాహనుల కాలం నాటికే వచ్చిందా అని?"
"తెలీదు. ఒకవేళ ఇవన్నీ జానపద గేయాలలో ప్రచారంలో ఉన్న గాధలు కావచ్చు. పురాణ కథలకి జానపదులు చాలా చిత్ర విచిత్ర కల్పనలు చేస్తారు. ఆ కల్పనలన్నీ వారి జీవన సరళిని లేదా ఆనాటి సామాజిక రీతులని ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఉదాహరణకి గౌతముడు కామధేనువు చుట్టూ ప్రదక్షిణంచేసి లోకాలన్నీ చుట్టివచ్చిన ఫలితం పొందాడని పురాణాలలో ఉంటే, జానపదుల గేయాలలో గౌతముడు తాను లోకాలన్నీ చుట్టివచ్చినట్లు కామధేనువు చేత దొంగ సాక్ష్యం చెప్పించాడని ఉంది. ఇంద్రుడూ సూర్యుడూ లోకాలన్నీ చుట్టివచ్చి అహల్యని పొందలేకపోయారు. గౌతముడు అహల్యని పెళ్ళి చేసుకున్నాక, వాళ్ళిద్దరూ ఆమెని చెరిచారు. ఇదికూడా జానపద గేయాలలోదే! బహుశః జానపద గేయాల విషయాలే. తరువాత విచిత్ర రామాయణం లాంటి పుస్తకాలుగా అవతారమెత్తాయేమో? మొత్తం మీద విచిత్ర రామాయణం ప్రకారం ఈ కథ ఇది."