Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 22

 
    "....ఆ డైరీలన్నీ ఎక్కడ ఉన్నాయో మంగళ్ సింగ్ కి - అదే బృహస్పతికి తెలిసే వుంటుంది. ఒక్క ఫోటో చాలు- తీహార్ జైల్లో మన ముగ్గురినీ...."

    దబ్బున శబ్దం వినపడింది. రాంభరత్ సోఫాలోంచి కింద తివాచీ మీద పడిపోయాడు. అతడి స్థూలకాయం అచేతనమైంది. రాజకీయాల్లో సహచరులు పడిపోతే పక్కవారు పైకెత్తరు. సంకల్పనాధ్ అతడి గురించి పట్టించుకోకుండా ఆలోచనలో పడ్డాడు. హరిస్వామి అన్నిటికన్నా పెద్ద ప్రమాదం గురించి ఆఖరుగా చెప్పాడు.

    "నీ తోక ఎలా కత్తిరించాలా అని ప్రధాని ఆలోచిస్తున్నాడని సి.బి.ఐ. చీఫ్ చెప్పాడు కదా! ఇప్పుడు ఇంతకన్నా మంచి అవకాశం దొరుకుతుందంటావా?"

    "డైరీ.... సింగ్ డైరీ...." అంటూ స్పృహలేని స్థితిలో గొణుగుతున్నాడు. కార్పెట్ మీద పడి వున్న ఆర్.బి.ఎల్. భరత్. అతడి గొణుగుడు తప్ప గదంతా నిశ్శబ్దంగా ఉంది.

    ఒకప్పటి ఛంబల్ వాలీ బందిపోటూ, ప్రస్తుత కేంద్రమంత్రీ.... గాఢ ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడు.

    అలా రెండు నిముషాలు గడిచాయి. భరత్ లేచి అతి ప్రయాస మీద తిరిగి సోఫాలో కూర్చున్నాడు. అప్పటికి ఒక నిర్ణయానికి వచ్చినట్టు సంకల్పనాధ్ రే లేచి నిలబడ్డాడు. "నేను వెళ్ళొస్తాను."

    "అదేమిటీ? మన సమస్య ఏం చేద్దాం?"

    "చెయ్యడానికి ఏం లేదు. అసలు ఇదంతా మనం అనవసరంగా ఇంతసేపు చర్చించాం! గత జన్మలు ఉంటాయి అన్న విషయం మీద వచ్చిన చర్చ ఇది. దీన్నంతా నేను నమ్మనని ముందే చెప్పాను. అనవసరంగా ఏదేదో ఊహించుకుని మీరు భయపడుతున్నారు" అన్నాడు సంకల్పనాధ్.

    "ఇదంతా కల్పితం కాదని నిరూపణ అయితే?...." అంటున్న హరిస్వామి మాటలని మధ్యలో ఆపుచేసి, "....అవదని నమ్ముతున్నాను కాబట్టి నేనిక దీనిగురించి ఆలోచించ దల్చుకోలేదు. వెళ్ళొస్తాను" అని గుమ్మంవరకూ నడిచి, ఆగి, వెనక్కి తిరిగి, "....ఇదిగో, ఇప్పుడే చెపుతున్నాను. అనవసరమైన భయాలతో మీ గోతులు మీరే తవ్వుకోకండి. అసలు ఈ విషయం ఇక బహిరంగంగా చర్చించడం కూడా ప్రమాదకరం. అలా చర్చిస్తే మీ విషయం మీరే బయట పెట్టుకున్నట్టు అవుతుంది. ఇదిగో భరత్! మనం కొంతకాలం పాటు తరచూ కలుసుకోవడం కూడా మంచిది కాదు. గుర్తుంచుకో. ఎవరైనా మన సంభాషణ టేప్ చేసినా బాగోదు. అందుకే ఈ చర్చ ఇంక వద్దంటున్నాను" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

    అతడు వెళ్ళినవైపే ఇద్దరూ చూస్తుండిపోయారు.

    "నిజంగానే పునర్జన్మలు లేవంటావా?"

    "ఉన్నాయి. మనం ప్రమాదానికి ఎంత చేరువలో ఉన్నామో ఆ మూర్ఖుడికి అర్ధం కావడంలేదు."

    "మరిప్పుడేం చేద్దాం?"

    "నేను ఆ ఊరెళ్ళి బృహస్పతిని కలుసుకుంటాను. సంకల్పనాధ్ చెప్పినట్టు ఇదంతా బోగస్ వ్యవహారమే అయితే ఆ బృహస్పతిగాడు నన్ను గుర్తుపట్టలేడు. అలా కాకుండా నిజంగా అతడు మన మంగళ్ సింగ్ అయితే మనమీద అతడికి శత్రుత్వం ఏముంటుంది? ఎంత కాదనుకున్నా మనందరం ఒకప్పుడు సహచరులం కదా!"

    "కానీ అతడేదో ప్రజలకి సేవ చెయ్యాలని...."

    హరిస్వామి నవ్వాడు. "అతడు కావాలనుకుంటే మనమే అతడికి సహాయం చేస్తాం. ఈ హరిస్వామి గతంలో ఒకరిద్దరిని ప్రధానులని చేసాడన్న విషయం మర్చిపోకు."

    "ఒకవేళ అతను మనకి ఎదురు తిరిగితే?"

    "అప్పుడిక అతడు ఉండడు. గత రెండు జన్మలూ గుర్తు పెట్టుకోవడం కోసం మూడో జన్మ ఎత్తుతాడు."

    చాలాసేపటి తర్వాత రాంభగవాన్ భరత్ నవ్వాడు. "నిజమే సుమా! నాకింత ఆలోచన రాలేదు. అనవసరంగా కంగారు పడ్డాను."

    "ప్రమాదం రాగానే కంగారుపడడం మానవ సహజం. తొందరగా ఆ కంగారునుంచి బయటపడి గలగడం విజ్ఞుల లక్షణం." అంటూ విజయానికో మెట్టు చెప్పి అక్కడినుంచి కదిలాడు హరిస్వామి. అతడు వెళ్ళిపోయిన కొంచెం సేపటివరకూ రాంభరత్ అలాగే కూర్చుండి ఉండిపోయాడు. హరిస్వామి చెప్పిన ఆఖరి వాక్యం (తొందరగా కంగారు నుంచి బయటపడగలగడం విజ్ఞుల లక్షణం) అతడి చెవుల్లో మారుమోగసాగింది.

    ఊహించని ప్రమాదం తెలియగానే రాంభరత్ కంగారు పడిన మాట వాస్తవమే! అయితే అది తాత్కాలికమైనది. ఎంతయినా ఓ రాజకీయ నాయకుడతడు. ఢక్కా మొక్కీలు తిన్నవాడు. అందుకే తొందరలోనే తేరుకున్నాడు. ప్రధానమంత్రి అవ్వాలన్న కోరిక అతడికుంది. ఆ విషయం ప్రస్తుత ప్రధానికి కూడా తెలుసు. ఈ నేపథ్యంలో తమ ముగ్గురి మధ్యా అంతకుముందే జరిగిన సంభాషణలో మరో రెండు పాయింట్స్ కూడా అతడి దృష్టినుంచి దాటిపోలేదు.

    ఒకటి : ప్రధానమంత్రి తనమీదా, సంకల్పనాధ్ మీదా ఏదో ఒక కేసుపెట్టి తమ రాజకీయ జీవితానికి తెర దించాలనుకున్నాడు. ఈ విషయం బృహస్పతికి తెలిస్తే ఆ డైరీలు ఆయనకే అందజేయొచ్చు. తాము యిచ్చే డబ్బుకన్నా ప్రధానమంత్రి ఇవ్వగలిగేది నిశ్చయంగా ఆకర్షణీయమైనదయి ఉంటుంది. ఈ చర్యల వల్ల అతడికీ, ప్రధానికీ ప్రజల్లో పలుకుబడి కూడా హెచ్చుతుంది. ఇంతటి అవకాశాన్ని బృహస్పతి వదులుకోడు.

    రెండు : తను తలుచుకుంటే ఎవరినైనా ప్రధానమంత్రిని చేయగలనని హరిస్వామి అన్నాడు. ఆ డైరీలు, ఫోటోలూ తిరిగి ఇచ్చెయ్యడానికి బృహస్పతి "ప్రధాని పదవి" ని బేరం పెడితే ఏమవుతుంది? హరిస్వామి తప్పకుండా ఒప్పుకుంటాడు. తను జైలుకి వెళ్ళకుండా ఉండడం అతనికి ముఖ్యం. తన స్వార్ధం తాను ముందు చూసుకోవడమే కదా- రాజకీయం అంటే! 

    ఈ రెండు పాయింట్లూ ఆలోచించిన తర్వాత ఈ వ్యవహారాన్ని తనే డీల్ చెయ్యదలుచుకున్నాడు రాంభరత్.

    ఒకసారి ఆ ఆలోచన వచ్చాక ఇంక ఆలస్యం చేయదల్చుకోలేదు. హరిస్వామి సూచించినట్లు ఇందులో రాజీమార్గం అసలు లాభం లేదు. బృహస్పతితో వ్యవహారం ఎప్పటికయినా ప్రమాదకరమే!

    ఆ విధంగా ఆలోచిస్తూ అతడు బల్లమీదున్న పేపర్లు తీసి పరిశీలించాడు.

    రెండవ పేజీలో వుంది 'మంగళ్ సింగ్ పునర్జన్మ' వార్త. అందులోనే బృహస్పతి ఫోటో కూడా వుంది.

    అది చూసి షాక్ తగిలినట్టు నిశ్చేష్టుడయ్యాడు.

    చూడగానే అతడు బృహస్పతిని గుర్తుపట్టాడు.

    మీటింగ్ లో తన గురించి అవాకులూ, చెవాకులూ పేలింది ఇతడే!

    ఆ తర్వాత తన కార్యకర్తల్ని పంపించి విధ్వంసం చేసింది ఇతడి ఇంటినే!!

    ఆ విషయం ఫిర్యాదు చేయడానికి వస్తే తను కొట్టిందికూడా ఇతడినే!!!

    రాంభరత్ సాలోచనగా పేపర్లో పడిన ఫోటోవైపు దృష్టి సారించాడు. ఇప్పుడేం చేయాలో అతడికి పూర్తిగా అర్ధమైంది. రాజీ ప్రసక్తి లేదు.

    అవును. ఎటువంటి పరిస్థితిలోనూ బృహస్పతి రాజీకి ఒప్పుకోడు. ఒకవేళ హరిస్వామి చూపించిన ఆశకీ, ప్రలోభపెట్టిన రాజకీయ పదవికీ ఒప్పుకున్నా- ఆ తర్వాత తనని చూడగానే ఈ డీల్ కి ఒప్పుకోడు. గతజన్మ తాలూకు పాత స్నేహం ఏదయినా వున్నా అది తన ప్రస్తుత చర్యలతో పూర్తిగా పోయి వుంటుంది.

    ఇక ఆలస్యం చేయలేదు రాంభరత్. ఎవరికో ఫోన్ చేసాడు. సరిగ్గా పావుగంట తర్వాత ఒక వ్యక్తి అక్కడికి ప్రవేశించాడు. ఆరడుగుల ఎత్తూ, బలమైన కండలూ, నిర్లక్ష్యంగా పెరిగిన గడ్డం- అతడి పేరు దావూద్ హర్షద్.

    దావూద్ హర్షద్ పేరు తెలియని వాళ్ళు ఢిల్లీలో సాధారణంగా ఎవరూ ఉండరు. దాదాపు ప్రతి రాజకీయ నాయకుడికీ అతడి అవసరం ఉంటుంది. బొంబాయి అల్లర్లకీ, విస్ఫోటనాలకీ అతడే కారణమని దాదాపు అందరికీ తెలుసు. అయినా అతడిని ఎవరూ ఏమీ చేయలేరు.... చెయ్యరు కూడా!

    దావూద్ హర్షద్ కి ఒక మతం అంటూ లేదు. దేనినీ సపోర్ట్ చేయడు. ఢిల్లీలో సిక్కుల్ని ఊచకోత కొయ్యాలన్నా, బొంబాయిలో ముస్లింలమీద మారణకాండ సాగించాలన్నా, కాశ్మీర్ లో హిందువులపై దౌర్జన్యం చేయాలన్నా నాయకులు అతడి సహాయాన్నే తీసుకుంటారు.

    ఇప్పుడు రాంభరత్ అతడిని పిలిపించింది అటువంటి సహాయం కోసమే! క్లుప్తంగా అతడికి విషయం చెప్పాడు. అయితే చంబల్ వాలీ గురించీ, పునర్జన్మ గురించీ ప్రస్తావించలేదు.

    దావూద్ హర్షద్ కి అలాంటి విషయాలు అనవసరం కూడా!

    బాబ్రీ మసీదు కూలిపోగానే ఒక నాయకుడు పిల్చి, బాంబేలో బాంబులు పెట్టమన్నాడు. పెట్టాడు.

    ఇందిరాగాంధీ మరణించగానే ఒక నాయకుడు పిల్చి, సిక్కుల్ని నిర్వీర్యుల్ని చేయమన్నాడు. చేసాడు.

    చెప్పింది చేయడమే అతడికి తెలుసు.

    "వెంటనే ఆ ఊరు వెళ్ళు. అతడి పేరు బృహస్పతి. పక్కనే ఓ బాబా కూడా ఉంటాడు. ఇద్దరినీ పైకి పంపించు. ఎల్లుండి కల్లా ఇది జరిగిపోవాలి."

    దావూద్ తలూపి "అరగంటలో మనుష్యుల్ని పంపిస్తాను" అన్నాడు.

    "కాదు, నువ్వే వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సంకల్పనాధ్ కి కూడా ఇందులో సంబంధం వుంది."

    సంకల్పనాధ్ పేరు వినబడేసరికి దావూద్ విస్మయంగా చూసాడు. నిజానికి అతడు సంకల్పనాధ్ కుడిభుజం. "ఈ విషయం నాధ్ జీకి తెలుసా?" అనడిగాడు.
   
    "తెలుసు. ఇప్పటివరకూ ఆయన ఇక్కడే వున్నాడు."

    దావూద్ లేచి "సరే అయితే! నేను వెళతాను. ఎల్లుండికల్లా తిరిగి వస్తాను" అని వెళ్ళబోతూ ఆగి "....మా మేనల్లుడిమీద మర్డర్ కేసు కోర్టులో కొట్టేసారు. ఇప్పుడు ఫ్రీగా బైటికి వచ్చాడు. సంకల్పనాధ్ జీతో వాడి గురించి చెప్పాను. మీరు కూడా ఓ మాట సాయం చేయాలి...." అన్నాడు.
   
    "ఏం చెయ్యాలి?"

    "ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీగా వుంది కదా! ఆ పోస్టులో వాడిని వెయ్యమని చెప్పాను. మీరు గుర్తుచెయ్యండి" అని అక్కడినుంచి కదిలాడు.

    క్లుప్తమైన సంభాషణలకి విశాలమైన అర్థాలుంటాయి.

    అవి నాయకులకే అర్ధమవుతాయి. వినాయకులు పాలు తాగుతారు. నాయకులు రక్తం తాగుతారు.


                                                     12


    హరికెన్ లాంతరు మినుకు మినుకుమని వెలుగుతోంది. నిద్రలోంచి అకస్మాత్తుగా మెలకువ వచ్చిన ప్రశాంత నివాళి ఏదో రోదన ధ్వని విని పక్కమీద లేచి కూచుంది. కింద చాపమీద కూచుని గోడకి తల పెట్టుకుని ఏడుస్తోంది నాయనమ్మ. ప్రశాంత నివాళి చప్పున ఆమె దగ్గరికి వెళ్ళింది.

    "ఏమైంది నాయనమ్మా?"

    "మధ్యాహ్నం వాళ్ళొచ్చారు."

    "ఎవరు?"

    "పెళ్ళికొడుకు తండ్రి."

 Previous Page Next Page