"ఏమిటి సాబ్?" అన్నాడు రాంభరోసే నోరెళ్ళబెట్టి.
"ఆ ఇంటికి ముందు వాకిలీ, వెనక వాకిలీ రాత్రింబగళ్ళూ తెరిచే వుంచాలి"
"ఎందుకు సాబ్?"
"మరి ట్రాఫిక్ వెళ్ళొద్దూ? పొరబాట్న నట్టనడిరోడ్డు మీదే ఇల్లు కట్టేశాడు సర్దార్జీ!" అన్నాడు ఉత్తమ్ సింగ్.
తను నవ్వాడు.
కానీ రాంభరోసే మాత్రం తికమకగా చూసి "అట్ల నిజంగ ...." అని అనేలోగానే అతని నోరు రెండు చేతులతోనూ గట్టిగా మూసేశాడు ఉత్తమ్.
తర్వాత తనతో అన్నాడు-
"అరెయార్! అక్కడ ఫస్టు తారీఖు దాకా వుండు! ఖుడీ జీతం ఇస్తుందా మంచిది. లేకపోతే, మొహం వాచేటట్లు తిట్టి మరీ వచ్చేసెయ్! మేమున్నాం! నీకేం భయంలేదు!" అని_
ఫస్టు వచ్చేలోగానే వచ్చేసింది థర్డ్ వరల్డ్ వార్ లాంటిది.
తనకీ, నిర్జాకీ మధ్య!
* * * *
అఖిల్ కూర్చుని వున్న ఫైవ్ స్టార్ హోటల్ లాబీలో ఒక్కసారిగా కలకలం వినబడింది.
ఆలోచనల్లోంచి బయటపడి తలెత్తి చూశాడు అఖిల్.
వెంటనే అతని మొహంలో ఆశ్చర్యం కనబడింది.
హైదరాబాద్ వెళ్తున్న తమ విమానాన్ని ఆకాశంలోనే వెనక్కి తిప్పి తీసుకొచ్చి ఢిల్లీలో దింపేసిన పైలెట్ నిస్పిగ్గుగా, నిర్భయంగా, నిస్సంకోచంగా హోటల్ లోకి ప్రవేశిస్తున్నాడు. అతని పక్కనే అతని భుజంమీద వాలిపోయినట్లు ఆనుకుని వయ్యారంగా నడుస్తూ వస్తోంది ఎయిర్ హోస్టెస్. రంగేళీరాజా లాగా వున్నాడు పైలెట్. అనారోగ్యపు ఛాయలు ఏవీ అతని మొహంలో కనబడడంలేదు.
తనకి అనారోగ్యమనే సాకుతో ప్రయాణీకులందరినీ ఇబ్బంది పెట్టేసిన ఆ పైలెట్ పూలరంగడిలా ఎయిర్ హోస్టెస్ ని వెంట బెట్టుకుని బార్ వైపు నడుస్తూ పోవడంతో అక్కడ వున్న ప్రయాణీకులందరికీ వళ్ళు భగ్గున మండినట్లయ్యింది.
అక్కడున్న అందరి అక్కసునీ ప్రదర్శించే ప్రతినిధిలాగా చరచరా పైలెట్ దగ్గరకు వెళ్ళిపోయింది డాక్టర్ సుధ. పైలెట్ ని ఎగాదిగా చూసి వాడిగా అంది_
"సో! నీకు వంట్లో బాగా లేకపోవడం అంతా ఉత్తది. మేనేజ్ మెంట్ తో ఏదో గిల్లికజ్జాలు పెట్టుకున్నారు మీ పైలెట్లు. అందుకని విమానాలని వెనక్కి తెచ్చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీ పైలెట్లు. మీ ఈ బ్లాక్ మెయిలింగ్ కి బలి అయిపోతోంది పాసెంజర్స్ అని గ్రహించావా నువ్వు?"
పైలెట్ మొహం ఎర్రబడిపోయింది. అతను, పక్కనే వున్న ఎయిర్ హోస్టెస్ దహించేసేటట్లు చూసింది సుధని.
"మిస్! సభ్యత మరచిపోకండి" అన్నాడు పైలెట్ పదునుగా.
అతని మాటని సగంలోనే కట్ చేస్తూ అంది సుధ-
"ఫిజికల్లీ యూ ఆర్ ఫర్ ఫెక్ట్ లీ ఆల్ రైట్. నీకేం రోగంలేదు. ఒకవేళ వుందని నువ్వు అనుకుంటూ ఉంటే నన్ను చెక్ చెయ్యనివ్వు! ఐయామ్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్!"
పెడసరంగా అన్నాడు పైలెట్ -
"నలభై గంటలలోపు సిక్ నెస్ అయితే మెడికల్ టెస్టూ, మెడికల్ సర్టిఫికెటూ అవేవీ అక్కర్లేదని మా కార్పొరేషన్ అంటోంది. కందకు లేని దురద కత్తిపీటకు వుండడం మంచిది కాదు మిస్!"
"కానీ నీ వల్ల ప్రయాణికులు అవస్థలపాలయి పోతున్నారు. అని ఇంకా కేర్ లెస్ గా గొంతుపెట్టి మళ్ళీ అంది డాక్టర్ సుధ-
"మీ పైలెట్లు బ్లాక్ మెయిలింగ్ గురించి నాకు బాగా తెలుసు. చీటికీ మాటికీ మేనేజ్ మెంట్ తో తగువు పెట్టుకోవడమూ, బ్లాక్ మెయిలింగ్ చెయ్యడమూను! మీ టాక్టిక్ట్స్ ఏమిటో తెలుసా? విమానాన్ని లాండ్ చేసే ముందు ఏదో ఒక వంక పెట్టుకుని ఆకాశంలోనే అనవసరంగా ఐదారు చక్కర్లు కొట్టడం. అలా గంటసేపు అనవసరంగా విమానాన్ని గాలిలో గనక ఉంచగలిగితే రెండువేల ఐదువందల కిలోల ప్యూయెల్ వేస్టుగా తగలబడి పోతుంది. అందుకే మీరంటే మేనేజ్ మెంట్ కి టెర్రర్."
పైలెట్ ఏదో అనబోయాడు.
అతన్ని మళ్ళీ కట్ చేస్తూ గొంతు పెంచింది సుధ.
"మిస్టర్ పైలెట్. నువ్వు చేస్తున్నదేమిటో తెలుసా? ఇది స్ట్రయిక్ కాదు. గూండాయిజమ్. ప్యూర్ అండ్ సింపుల్ దట్సాల్. బజారు రౌడీలా గ్యాంగ్ స్టర్సూ ఉంటారే వాళ్ళ దౌర్జన్యానికి, నీ సున్నితమైన దౌర్జన్యానికి ఎఫెక్టులో పెద్ద తేడా లేదు" అని ఓరగా అఖిల్ వైపు చూసింది డాక్టర్ సుధ. అతనివేపు చూస్తూనే మళ్ళీ అంది-
"నీకున్న బలాన్ని బలహీనులమీద ప్రయోగించి పబ్బం గడుపుకోవడం నీలాంటి గూండాలకి మాగ్జిమమ్ పనిష్ మెంట్ ఇస్తేనేగానీ."
అప్పుడు హఠాత్తుగా అర్ధమయ్యింది అఖిల్ కి.
ఆ పైలెట్ ని అడ్డం పెట్టుకుని అన్యాపదేశంగా తనని తిడుతోంది ఈ అమ్మాయి.
తనా! తను గ్యాంగ్ స్టరా? తను గూండానా?
తనని గాడిదా అని పిలిచినా భరిస్తాడేమో కానీ, గూండా అంటే మాత్రం రక్తం సలసలా మరిగిపోతుంది.
చటుక్కున లేచాడు అఖిల్. మరుక్షణంలో డాక్టర్ ముందు ఉన్నాడు అతను. అతని నాలుక అతని కంట్రోల్ లో లేకుండా మాట్లాడేయడానికి రెడీగా వుంది.
అఖిల్ తనదగ్గిరికి రావడం చూసి అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కి వేసింది సుధ. అయినా కూడా బింకం వదలకుండా అన్న మాటనే రెట్టించి మళ్ళీ అనడం మొదలుపెట్టింది.
"యా! నువ్వు గూండావి. కాసిని ఓవర్ టైం డబ్బులకోసం నువ్వేం చేస్తావో తెలుసా? సాయంత్రం ఏడు, ఎనిమిది గంటల మధ్య లాండ్ కావలసిన ఫ్లయిట్ ని ఎప్పుడు ఆలస్యం చేస్తావు. ఆ టైంలో ఫ్లయిట్ లేటయితే బాగా ఓవర్ టైం కలసివస్తుంది నీకు. పైసాకోసం పాకులాడుతూ నువ్వు రిఫైన్ డ్ రౌడీయిజం ప్రదర్శిస్తూ వుంటే...."
ఆమె మాటలకి అభ్యంతర పెట్టడానికి బలహీనమైన ప్రయత్నాలు చేస్తున్నాడు పైలెట్. కానీ గట్టిగా ఎదురుతిరిగి మాట్లాడే సాహసం మాత్రం చెయ్యలేకపోతున్నాడు. ఎదురు తిరిగితే పాసింజర్స్ అందరూ కలిసి తనని ఉతికేసేట్లు వున్నారు.
"మాబ్ సైకాలజీ" ఎలా వుంటుందో పైలెట్ కి బాగా తెలుసు. పదిమంది ఉన్నా ఆ పదిమంది మనకెందుకులే అని ఊరికే ఉండిపోతారు.
కానీ పదిమందిలో ఒకళ్ళు తిరగబడితే ఆ పదిమందీ ఒక్కటవుతారు.
ఇప్పుడూ అలాగే జరిగేట్టు వుంది.
డాక్టర్ సుధ తిరగబడేసరికి పాసింజర్స్ అంతా ఆమెను సమర్ధించడానికి రెడీగా వున్నారు.
ఒక్క అఖిల్ తప్ప.
డాక్టర్ సుధ అన్న ప్రతి మాటనీ తనకే అన్వయించుకుని ఉడికిపోతున్నాడు అఖిల్. సుధ అంటున్న మాటల్లో సగం అఖిల్ ని ఉద్దేశించే అని చెప్పకపోవడం కూడా తప్పే అవుతుంది.
ఆమె పరోక్షంగా తనని నిందిస్తున్నా, ప్రత్యక్షంగా పైలెట్ నే తిడుతోంది కాబట్టి తను కూడా పైలెట్ పరంగానే చెప్పడం మొదలుపెట్టాడు అఖిల్.
"చెట్టు తాలూకు వేళ్ళే కుళ్ళిపోతున్నప్పుడు ఆ చెట్టుకి కుక్కమూతి పిందెలు కాశాయని తిట్టుకోవడం ఎందుకు? పైలెట్లని అంటే ఏం లాభం! పైలెట్లనీ, మేనేజ్ మెంట్ నీ, ప్రజలనీ, పార్లమెంట్ నీ, అందరినీ అన్నిటినీ భష్టు పట్టిస్తున్న రాజకీయవేత్తలని ఏమీ అనవేం?"
తను ఆమెని ఏకవచన ప్రయోగం చేస్తున్నానని అతనికి తట్టలేదు. అది కేవలం అసంకల్పిత ప్రతీకార చర్య. అంతే!
ఉవ్వెత్తున కోపం వచ్చింది సుధకి.
"ఏమిటి నువ్వనేది?" అంది రాష్ గా.
"నువ్వెంత" అన్నట్లు.
అతన్ని ఆపాదమస్తకం చూస్తూంటే సహజంగానే సీరియస్ గా వుండే ఆమె మొహం ఆ సమయంలో మరింత సీరియస్ గా అయిపోయింది.
నిర్లక్ష్యంగా ఆమెని చూస్తూ అన్నాడు అఖిల్ -
"ఈ దేశంలో ఎక్కడ ఏ పాపిష్టి పని జరగనీ దాని వెనుక విధిగా ఒక రాజకీయ నాయకుడు వుంటాడు. ఇండియన్ ఎయిర్ లైన్స్ సంగతే చెప్తా! దానికి అడుగడుగునా రాజకీయ రాక్షసులు అడ్డు తగులుతూనే వుంటారు. ఢిల్లీ గ్వాలియర్ ఫ్లయిట్ ఉంది. దాన్లో ఏదో రోజు పదిమంది కంటె ఎక్కువ పాసింజర్లు వుండరు. ఢిల్లీ - రాయ్ పూర్ ఫ్లయిట్ వుంది. ఎలెక్షన్ టైంలో తప్ప యాభై మంది పాసింజర్లు ఎక్కినరోజు వుండదు. కానీ ఆ ఫ్లయిట్ ఎందుకు నడుపుతున్నారూ? అక్కడి రాజకీయవేత్తల ప్రజర్ వల్ల! పదిమందితో విమానం వెళ్తే ఎంత నష్టం! ఎ 320 ఎయిర్ బస్సూ, బోయింగ్ 347 విమానమూ వున్నాయి. అవి మాగ్జిమమ్ లోడ్ తో, పూర్తి కెపాసిటీ పాసింజర్స్ తో కనీసం గంటసేపు లేదా ఆరొందల నాటి కల్ మైళ్ళు ప్రయాణం చేస్తేనేగానీ ఖర్చు గిట్టుబాటు కాదు. కానీ పదీపరకా ప్రయాణికులతో విమానాలు తిరువనంతపురానికో, మదురై, ట్రిచ్చిక వెళ్తూనే వున్నాయి. కారణం ఏమిటంటావ్?
రాజకీయాలు?
రాజకీయనేత్తలకి ఇంకో ఉదాహరణ పార్లమెంటు మెంబర్లు ప్రజా సంక్షేమం మర్చిపోయిన పార్లమెంటు మెంబర్లు ఏం చేస్తున్నారని అడగవేం? ప్రతి పార్లమెంటు మెంబరుకి పదహారు ఇండియన్ ఎయిర్ లైన్స్ పాసులు దొరుకుతాయి. అదీగాక పార్లమెంటు సభలు జరుగుతున్నప్పుడు వాళ్ళ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం ఉచితం.
ఒక మెంబరు పార్లమెంటుకు ఎన్నిక అయ్యాక ఢిల్లీలో ఎన్.డి.ఎమ్.సి. ఏరియాలో కనుక క్వార్టర్లు అలాట్ అయ్యేటట్లు చేసుకోగలిగితే ఇంక ఆజన్మాంతం ఖాళీ చేయనక్కరలేదు.
పార్లమెంటు మెంబరుకి ప్రతినెలా ఐదువేలా ఐదొందల క్యాష్ గా ముడుతుంది. ఇదీగాక నెలకి పాతికవేల నుంచి రెండు లక్షల రూపాయలదాకా అద్దె వుండే క్వార్టర్లు కోరుకుతాయి. కేంద్రంలో ఒక మాజీ మంత్రి ఉన్నాడు. ఇప్పటిదాకా ఆయన ఇంటి అద్దె బకాయి పాతిక లక్షల రూపాయలు. అయినా ఆయన ఇంకా తను ఉంటున్న బంగళాని ఖాళీ చేయలేదు. ఇంకో రాజాగారు కొన్నాళ్ళక్రితం మంత్రిగా వుండేవారు. ఆయన పాతికేళ్ళ నుంచి ఒక గవర్నమెంటు బంగళాలో వుంటున్నాడు. చివరికి ఆయన కనీసము పార్లమెంటు మెంబరుగా లేని రోజుల్లో కూడా.