7
ప్రమధపురిలో బస్ దిగింది విదుషి. చుట్టూ చూసి తను దిగింది ప్రమధపురిలో నేనా అని ఆశ్చర్యపోయింది. ఒక్క ఏడాదిలో అంతా మారిపోయింది ఊరు. బస్ స్టాప్ దగ్గిరలోనే ఒక మోస్తరు హోటళ్ళు మూడు కనిపించాయి. "ఇళా బ్రాహ్మణ భోజన హోటల్". "ఇళా బోరింగ్ అండ్ లాడ్జింగ్". "ఇలా విజిటేరియన్ అండ్ నాన్ విజిటేరియన్ హోటల్" ఇలా వున్నాయి వాటిపేర్లు. ఇదివరకు ఆ ప్రాంతమంతా వొట్టి బయలు, అక్కడ చిన్న చిన్న దుకాణాలు కూడా వున్నాయి. అన్నింటికీ ఇళ పేరు ఏదో ఒక విధంగా కలిపారు. చివరకు క్షవరశాల మీద కూడా "ఇళా క్షవరశాల" అని ఉంది. "ఈ కాలం వెర్రికి అంతులేదు" అనుకుంది బాధగా. ఇదివరకు ఆ ఊళ్ళో జట్కాలూ, రిక్షాలూ వుండేవి కావు. మోతుబరి రైతులు తమ సొంత బళ్ళమీద వెళ్ళేవారు. మిగిలినవాళ్ళు నడిచే వెళ్ళేవారు. ఊరంతా కలిసి రెండు కిలోమీటర్లుండేది కారు ఇదివరకు. ఇప్పుడు అడవి వరకూ పెరిగింది. చైతన్యదేవ్ యింటికి జట్కా మాట్లాడుకుని కూచుంది. ఊరు ఊరంతా మారింది. ఇదివరకు యోగానాథశాస్త్రి వుండే పూరిల్లు కూలగొట్టి డాబా యిల్లు కడుతున్నారు. శాస్త్రి స్వయంగా దగ్గిరుండి కట్టిస్తున్నాడు. అతడి ముఖంలో ఇదివరకులేని తేటతనం ఉత్సాహం కనిపిస్తున్నాయి. ఇదివరకు లేని కొత్త ఇళ్ళు చాలా లేచాయి. ఎప్పటికీ మారకుండా వున్నది జ్ఞానదేవ్ పెంకుటిల్లు మాత్రమే! విదుషి జట్కా దిగి ఇంట్లోకి వచ్చేసరికి జ్ఞానదేవ్ కొందరు కోయ యువకులతో ఏదో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ముఖాల్ని బట్టి వాళ్ళు చదువు విషయం కాక, మరేదో సీరియస్ విషయం డిస్కస్ చేస్తున్నట్లు అనిపించింది. విదుషిని చూసి వాళ్ళు గౌరవంగా లేచి నిలబడ్డారు. వాళ్ళలో ఎవరూ పాతకాలపు కోయ వేషాల్లో లేరు. ప్యాంట్లూ షర్టుల్లో వున్నారు. అందరూ చడువుకునవాళ్ళే. ఏడో క్లాసు నుంచి పదోక్లాసు వరకూ రకరకాల క్లాసుల్లో వున్నవాళ్ళు.
"ఇంత అకస్మాత్తుగా వచ్చావేమిటమ్మా" అడిగాడు జ్ఞానదేవ్.
"ఇంకా ముందు రావలసింది. ఇప్పటివరకూ వీలుపడలేదు. మొన్ననే థీసిస్ సబ్మిట్ చేశాను. నిన్న బయల్దేరాను."
"కంగ్రాట్స్"
"డిగ్రీ రానియ్యండి!"
"థీసిస్ సబ్మిట్ చేశాక అందులో నువ్వు... డిగ్రీ రాకపోవటం కూడానా!"
"థాంక్స్. ఆంటీ ఏరి?"
"కొత్త గుడికి వెళ్ళింది."
"కొత్త గుడి...!"
"ఇదివరకు దుర్గగుడి పాత గుడి. ఇప్పుడు ఇళ ఉన్న గుడి కొత్త గుడి."
"ఏమిటి? ఇళ కోసం బతికి ఉండగానే గుడి కూడా కట్టేశారా!"
"ఇంకా అంతవరకూ రాలేదు. ఇళ తెల్లవారు జామున నడుచుకుంటూ ఏ కొండదేవత దగ్గరకి వచ్చిందో, ఆ దేవతకి పెద్ద గుడి కట్టారు. గుడి ఆవరణలోనే ఇళకోసం ప్రత్యేకం ఒక ఇల్లు కట్టించారు. ఇళ కుటుంబం అక్కడే ఉంటోంది."
"నామాలయ్యలో ఇంత ఔదార్యం ఉందా?"
"ఔదార్యం కాదు. పెట్టుబడి పాపం ఆ అమాయకురాలిని పణంగా పెట్టి లక్ష లార్జిస్తున్నాడు నామాలయ్య."
"దేవుడు కూడా వ్యాపారమయిపోయాడు."
"అన్ని వ్యాపారాల్లో పెద్ద వ్యాపారం. ఒక్కొక్క బాబా ఆశ్రమం చూడు. లిటరల్ గా బొందిలో స్వర్గమే! స్వర్గాన్ని తలదన్నే భోగభూమి!" నిట్టూర్చింది విదుషి.
* * * *
కొత్తగుడి ఆవరణలో అడుగుపెట్టగానే అనుకుంది విదుషి. "ఇది దివ్యస్థలం అయిపోయింద"ని. గాంభీర్యమూ, పవిత్రతా ఆ వాతావరణంలో ఉన్నాయని కాదు. అవి మచ్చుకైనా లేవు. దోపిడీ జరుగుతోంది. రకరకాల రూపాలలో భక్తిని ఆయుధంగా వాడుకుంటూ.
"అమ్మగారూ! రండి ఇళాదేవి తాయెత్తు"
"ఇలా రండి. ఇళాదేవి బొమ్మలున్న రాగిబిళ్ళ."
"ఇలా రండి! ఇళాదేవి బొమ్మ ఉన్న రాగి ఉంగరం."
"ఇలా రండి! ఇళాదేవి పోతపోసిన వెండి బొమ్మ."
"ఇలా రండి! ఇళాదేవి ధ్యానంలో ఉన్న ఫోటోలు" అటూ ఇటూ వరసగా పేర్చిన దుకాణాల్లోంచి. ఇలా రండి! "ఇలా రండి" కేకలు చెవులో చిల్లులు పొడిచి, తలలు పగలగొడ్తున్నాయి. ఈ కేకలకు తోడు "అమ్మా బిచ్చం! ఒక పదిపైసలు పారేసి పుణ్యం చేసుకోండి" అంటూ బిచ్చగాళ్ళ కృత్రిమమైన ఏడుపు గొంతులు. వాటికి తాళంలాగ అల్యూమినియం గిన్నెల్లో డబ్బులు గలగలలాడిస్తున్నారు. ఇంతకుముందు చాలామంది పుణ్యం చేసుకున్నారు. "త్వరగా స్వర్గంలో మీ సీటు రిజర్వు చేసుకోండి" అని హెచ్చరిస్తున్నట్లు. అందరూ కాళ్ళూ చేతులూ అన్నీ సవ్యంగా ఉన్నవాళ్ళే! బిచ్చం పడేస్తే పుణ్యం వస్తుందనుకొనే భక్తుల బలహీనతని వీళ్ళిలా క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళకి పని చూపించినా చెయ్యరు. సోంబేరులుగా అడుక్కోవటమే బాగుంటుంది. వీళ్ళే సాయంత్రానికల్లా షోగ్గా తయారై సినిమాహాల్లోకి వచ్చి కూచుంటారు.
ముందుకు నడుస్తోన్న కొద్దీ మనసు ప్రశాంతం కావటానికి బదులు చీదర చీదర అయిపోసాగింది. దేవాలయంలోకి వెళ్తున్నట్లు అనిపించలేదు. ఏదో మురికి కూపంలోకి ప్రవేశిస్తున్నట్లు ఉంది. గుడి సింహద్వారం దగ్గరకి రాగానే గుండె గుభిల్లుమంది. సింహద్వారానికి రెండువైపులా వ్యాఘ్రవాహని, మహిషాసురమర్ధని చిత్రాలు. చిత్రకారుడెవడో అతిభయంకరంగా కొట్టొచ్చేలా ఉన్న రక్తవర్ణాలు ఉపయోగించి చిత్రించాడు అతి సామాన్యుడి లాగ ఉన్నాడు. దుర్గ చాలా ఉగ్రంగా చూస్తోంది. కింద ఉన్న మహిషాసురుణ్ని కాదు ఎదురుగా లోపలికి రాబోతున్న భక్తులని! చాలా అసంకల్పితంగా చిత్రకారుడు నిజాన్ని చెప్తున్నాడు. ఈ చిత్రంలో నిజంగా దేవత అంటూ ఉంటే, ఇంత మూఢత్వాన్ని సహించదని.
లోపలికి అడుగుపెట్టింది. మురికి అంగవస్త్రాలు చుట్టుకున్న పురోహితులు ప్రసాదాల పొట్లాలు అమ్ముతున్నారు. క్యూ సిస్టమ్ లేదు. ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ కుమ్ముకుంటూ ఎగబడి కొనుక్కుంటున్నారు. ప్రసాదాలు దుర్గ అనబడే కొండరాయి ఉన్న గర్భగుడికి కొద్ది దూరంలో ఒక ఇల్లుంది. ఇళ ఉండేది అందులోనే అని ఊహించింది విదుషి. ముందుగా కొండదేవతని చూడాలనుకుంది. అక్కడ మాత్రం క్యూ ఉంది. అది మధ్యలో పగిలి విచ్చుకున్న కొండరాయి. పై భాగం చిన్నదిగా పోను పోను సన్నగా ఉంది. అన్ని రాతి కొండలకీ ఉన్నట్లే! లోపల నుంచి ఏదో హోరు వినిపిస్తోంది. బహుశా అది కొండ గర్భంలో ఎక్కడో ఉరుకుతున్న జలధార కావచ్చు. కాలం తాకిడికి కొండరాయి విచ్చుకుంది గనుక శబ్దం వినిపిస్తోంది. అదే జనం మహత్తు అనుకుంటున్నారు. కొండరాయిలో పగులు దేవత నోరుగా భావిస్తున్నారు. కొండదేవత ఇప్పుడు నాగరికుల దేవత అయిపోయింది. దుర్గ అవతారాల్లో ఒక అవతారం! నాగరికులు అతి గడుసుగా ఏ దేవుణ్నైనా ఏ దేవతనైనా తమ దేవుళ్ళతో కలిపేసుకోగలరు. బ్రాహ్మణ పూజారి దుర్గా సహస్రనామాలు చదువుతోంటే, కొందరు భక్తులు పాలు, పానకాలు సమర్పించుకుని, పూజారి వాటిని ఆ బిలంలో పోస్తోంటే చూసి తరించి పోతున్నారు. ఆ పానకాలకీ, పాలకీ బదులుగా స్వర్గంలో తమకు లభించబోయే సౌఖ్యాలు నెమరు వేసుకుంటున్నారు. ఈ లోకంలో ఫలించబోయే ఆశలు తలుచుకుంటున్నారు. మనసు ఎక్కడెక్కడ తిరుగుతున్నా చేతులు మాత్రం జోడించి ఉన్నాయి. చూసింది చాలనుకుని ఆ భక్త బృందం మధ్య నుంచి బయటపడి ఆ ఆవరణలోనే ఉన్న ఇంటికి వెళ్ళింది. చిన్న ఇల్లు. పొందికగా ఉంది కాంపౌండ్ ఉంది. అక్కడ వరసగా బెంచీలు ఉన్నాయి, ఇళ దర్శనం కోసం వచ్చిన భక్తులు కూచోవటానికి కాబోలు మూసి ఉన్న తలుపు తట్టింది. "ఇది దేవి విశ్రాంతి సమయం. ఇప్పుడెవర్నీ చూడరు" లోపలి నుంచి సమాధానం వినిపించింది ఆ గొంతు అచ్యుతమ్మది.