Previous Page Next Page 
నిషా పేజి 13

    చాటలు అక్కడే ఉంచేసి పట్టుచీరా, రవికగుడ్డా పాల్ తిన్ కవర్లో పెట్టుకొని పరమేశ్వరి బయల్దేరుతుంటే అరుంధతమ్మ అంది "నేనూ వస్తాను ఆగవే!"

    అయిదారు నిమిషాల తరువాత ఇద్దరూ బయల్దేరారు.

    లోపల ఇంకా ముత్తయిదువులకి పసుపుకుంకుమలివ్వడం జరుగుతూనే వుంది.

    గదులన్నీ దాటి మెట్లు దిగుతున్నారు అరుంధతమ్మా, పరమేశ్వరీ,

    సరిగ్గా అప్పుడే.........

    రెండు రోజుల క్రితం వేటకి వెళ్ళిన మోహనవంశీ గారి జీపు ఆవరణలో ఆగింది.

    జీప్ హెడ్ లైట్ల కాంతిలో మెట్లు దిగివస్తున్న పరమేశ్వరి దేవలోకం నుండి దిగివస్తున్న అప్సర కాంతలా కనిపించింది. గోల్డ్ కలర్ పట్టుచీరలో సువర్ణసుందరిలా మెరిసిపోతున్న పదహారేళ్ళ అమ్మాయి! పేరంటం నుండి వస్తున్నట్టుగా కాళ్ళకి పచ్చటి పసుపు.......మెడకీ చేతులకీ నిండుగా అలదిన గంధపు పూత, తలనిండా పచ్చటి చేమంతులు.

    సంధ్యాసమయంలో పచ్చటి మల్లెపందిరి మీద అరవిడుతున్న మొగ్గలా ఉంది!

    మోహనవంశీ కళ్ళు చెదిరాయి. ఎక్కడ అందమైన స్త్రీ కనిపించినా ఆయన కళ్ళకి చెదిరే అలవాటుంది. ఎటువంటి ఘటమైనా పట్టుబట్టి రేకులు చిదిమే అలవాటుంది. మంచి రసిక పురుషుడని ఆయనకి ప్రఖ్యాతి వుంది.

    ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రకృతి కాంత పులకిస్తున్నట్లుగా వున్న చోట గుట్టల మధ్యన పాలరాతితో కట్టబడిన కృష్ణమహల్ అనే పేరున్న గెస్ట్ హౌస్ వుంది. ఆయన తెచ్చుకున్న ఆడవాళ్లను అక్కడే దించుతుంటాడు గానాబజానా, విందు వినోదాలు........నిరంతరం ఒక రసవాహినిలో తేలియాడుతూ వుంటాడు.

    రాజ్యలక్ష్మి వంటి సాధ్వికి అటువంటివాడు భర్తగా తగడని ఊరి జనం చెప్పుకుంటుంటారు.

    జీపు దిగి కళ్లు తిప్పకుండా ఇటే చూస్తున్న రాజాసాబ్ ని చూడగానే గుండె గుభేలుమంది అరుంధతమ్మకి. ఆమెకు తన గురించి భయపడే వయస్సెప్పుడో దాటిపోయింది పరమేశ్వరి గురించే భయం.

    "తల దించుకుని చప్పున పద. ఆ కళ్లు పాపిష్టివి" తుపాకీ చేతబట్టుకుని మెలిదిప్పిన మీసాలతో కండలు తిరిగినట్టున్న శరీరంతో తెల్లటి ముఖవర్చస్సుతో నిలువెత్తున నిలబడిన రాజాసాబ్ ని చూడగానే భయంతో పాలిపోయినట్లుగా అయింది పరమేశ్వరికి. చప్పున తల దించుకుని గబగబ నడవసాగింది.

    కోటగుమ్మం దాటుతూ కసిగా అంది అరుంధతమ్మ "ఆడవాళ్ళ శాపం తగిలి ఎప్పుడో దారుణమైన చావుచస్తాడు దుర్మార్గుడు"

    "ఇందాకే రాణీగారికి దీవెన ఇచ్చావు అమ్మమ్మా కలకాలం పసుపు కుంకుమలతో వర్ధిల్లమని. అదే నోట ఆమె భర్తచావుని కోరడం బాగాలేదు" అంది పరమేశ్వరి.

    "రాణిగారి పూజలు, నోములే ఈ దుష్టుడ్ని కాపాడుతున్నాయి. లేకపోతే ఏ వెటకో వెళ్లినప్పుడు క్రూరమృగం చేత చిక్కి చచ్చేవాడు"

    "నిజంగా ఆయన అంత చెడ్డవాడా అమ్మమ్మా?"

    "అమాయకంగా అడుగుతున్న పరమేశ్వరి కోటగుమ్మం దాటకముందే రాజాసాబ్ తన గురించి వాకబు చేయడం ప్రారంభించాడని ఎరుగదు.

    "ఎవర్రా ఈ అమ్మాయి?"

    రాజాసాబ్ అడగడం విని గతుక్కుమన్నాడు డ్రైవర్ సింగన్న రాజాసాబ్ ఏ ఆడదానివైపన్నా తేరిపార చూచాడంటే ఆమె అతడి కౌగిలిలో వచ్చి తీరాలనే అర్ధం. గెస్ట్ హౌస్ ని కళకళలాడించడంలో ప్రముఖ పాత్ర వహించే మనిషి సింగన్న. ఆయన ఏ ఆడదాన్ని కోరుకున్నా అవలీలగా తెచ్చిచ్చే సింగన్న ఈసారి భయపడ్డాడు. ఆ అమ్మాయి మన హయగ్రీవంగారి అమ్మాయి లలితా పరమేశ్వరి దొరవారు. ఈ సంవత్సరమే వివాహమైంది."

    "హయగ్రీవంగానీ, సుగ్రీవంగానీ.............కబురంపు మన గెస్ట్ హౌస్ కి రమ్మని" నిర్లక్ష్యంగా అన్నాడు మోహనవంశీ.

    "ఆస్థానపండితులవారి కూతురు. పైగా ఈమధ్యనే వివాహం జరిగింది. రభస అవుతుంది దొరవారూ"

    "రభసా? అహాహా! ఎవరా రభస చేసేది? నాముందు వచ్చి నోరు విప్పి మాట్లాడమను"

    నిజమే!

    ఆయన ధనబలం, మందిమార్బలం వున్న మనిషి, ఆయనకు వ్యతిరేకంగా ఎవరి నోరూ తెరుచుకోలేదు.

    "సంస్థానాలే పోయాయి. ఏదో ట్రెడిషన్ పేరుతో వారిని వారి వారి స్థానాల్లో వుంచి పోషిస్తున్నామేగానీ ఎవరి పాండిత్యం మనకు కావాలిప్పుడు, వారి పాండిత్యం వినే ఓపిక ఎవరికుంది?" ఎగతాళిగా నవ్వాడు మోహనవంశీ.

    తాంబూలాలు తీసుకుని వచ్చేస్తున్నారు పేరంటాళ్లు.

    ఆవరణలో ఆగిన జీపు, పక్కన నిలబడిన రాజాసాబ్ ని చూడగానే తలమీద పమిటలు వేసుకుని తలలు బాగా దించుకుని పరుగులాంటి నడకతో వెళ్లిపోసాగారు.

    హఠాత్తుగా చూస్తే రాజావారిపట్ల భయభక్తులు ప్రదర్శించడం అనుకోవచ్చుగానీ నీతిగల ఏ ఆడదీ ఆయన కంటపడాలని అనుకోకపోవడమే ఆ పరుగుకు కారణం.

    కానీ అప్పటికే వేటగాడి కళ్లకి లేడిపిల్ల కనిపించిందనీ, దాన్ని గురి చూస్తున్నాడనీ వాళ్లెరుగరు.

    పేరంటాల్లంతా వెళ్ళిపోయారు. చేయవలసిన పనులన్నీ ముగించి రాజ్యలక్ష్మితో వెళ్లొస్తానని చెప్పి పరమేశ్వరి పెట్టిపోయిన వాయినం చాటల్ని తీసుకు బయలుదేరింది తుంగభద్ర.

    ఆమె కోసమే చూస్తున్నాడు సింగన్న.

    "రాజాసాబ్ ఉప్పు తింటున్నందుకు ఆయన పాపంలో భాగం పంచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడూ అనిపించనిది ఇవాళ అనిపిస్తోంది తుంగభద్రా! ఈ కొలువు మానేసి వెళ్లిపోదామని"

 Previous Page Next Page