సిద్ధార్థ అతడి మొహంలోకి పరిశీలనగా చూసేడు.
మంగళసూత్రం కట్టటానికి కొన్ని నిముషాలు ముందు ఎందుకో అతడివైపు దృష్టి సారించినప్పుడు రాకేష్ చూపుడు వేలుకి సూది గుచ్చుకోవటం అతడి కంటబడింది. రక్తం కారటం చూశాడు. పెళ్ళి సామాన్లు సర్దుతున్నప్పుడు ఏదైనా ముళ్ళు గుచ్చుకుందేమో తీస్తున్నాడేమో అనుకున్నాడు. ఇప్పుడు రాకేష్ చెప్పిన సమాధానం దానికి వ్యతిరేకంగా వుంది. ఇంకెవరైనా అయితే దాన్ని అక్కడితో వదిలేసి మర్చిపోయేవారే. కానీ సిద్ధార్థ అలాకాదు.
పసిఫిక్ మహా సముద్రాంతర్భాగపు పర్వత స్థాణువుల అంచుల్లో, పాకుడుపట్టిన రాళ్ళమధ్య, ఆ సముద్రజలాల్లో ఒక జాతి చేపలు నివసిస్తూ వుంటాయి. వాటిని "ఈస్టర్స్" అంటారు. ఆకుపచ్చ మొక్కల్ని తింటూ అక్కడే పడి నిద్రపోతూ వుంటాయి. చాలా చిన్న చేపలు. ఎక్కువగా కదలవు. ఈదవు. చాలా నిస్తేజంగా వుంటాయి.
కానీ ఒక్కసారి ఎవరన్నా వాటిని కదిపితే అవి రెచ్చిపోతాయి. వేల్ నుంచీ షార్క్ వరకూ ఎంత పెద్ద చేపతోనైనా పోరాడి అటో ఇటో తేల్చుకుంటాయి. మళ్ళీ పోరాటం అయిపోగానే మామూలుగా అయిపోతాయి.
తన ముందు అతి సామాన్యంగా, మామూలుగా, ఏ ప్రత్యేకతాలేనట్టు వున్న సిద్ధార్థ కళ్ళల్లో..... తనని పరిశీలించే చూపులో.... ఈస్టర్ చేపకున్న లక్షణం వుందనీ, అది అవసరమొచ్చినప్పుడు ఆకాశం కూలినా భయపడదనీ, ఏ ఎత్తుకన్నా ఎగురుతుందనీ తెలియని రాకేష్, పని పూర్తయిన ఆనందంతో కరచాలనం పూర్తిచేసి, అక్కణ్ణుంచి కదిలాడు.
10
గదిలో అగరొత్తులు పెట్టటానికి వెళ్ళిన ముసలి నౌకరు గొంతులోంచి కీచుమని సన్నని ధ్వని బయల్వెడలింది.
దారాలతో, పందిరి మంచం చుట్టూ కట్టిన మల్లెపూల వరుసల వెనగ్గా! తెల్లటి పక్కమీద- ఒక పిల్లి చచ్చి పడివుంది. దుప్పటిమీద రక్తం చిందింది. ప్రాణంపోయే ముందు చాలాసేపు కొట్టుకున్నట్టు దుప్పటి చెదిరివుంది.
రెండు నిముషాల్లో నలుగురూ అక్కడికి చేరారు.
పాలకోసం బల్ల ఎక్కినా పిల్లి గ్లాసు పడేసింది. పగిలిన గ్లాసు మీద కాలు జారి పడటంతో గాజుముక్క మెడలో దిగిపోయింది. అక్కణ్ణుంచి మరణ యాతనతో అది గెంతుతూ పక్కమీద చివరి శ్వాస వదిలింది.
అందరికన్నా ముందు తేరుకున్నది భవానీశంకరం. వెంట వెంటనే నౌకర్లకు ఆజ్ఞలు జారీచేశాడు. దుప్పటి మార్చమనీ, పరుపు మార్చమనీ!... ఇంతలో పెళ్ళి చేసిన పురోహితుడు ఆయన దగ్గరగా వెళ్ళి "ఒకసారి యిలా వస్తారా" అని పక్కకి తీసుకువెళ్ళాడు.
"ఇది అపశకునం. ఇప్పుడొద్దు".
"గది మార్చమంటారా?"
"గదే కాదు. సమయం కూడా యిది వద్దు. మరో నాలుగు రోజుల తరువాత చూసుకుందాం".
ఆయన ఆందోళనగా, "ఇది అంత అపశకున మంటారా?" అని అడిగాడు.
"ఎందుకైనా మంచిదని చెపుతున్నాను".
"కానీ గౌరికి ఈ విషయం ఎలా చెపుతాం? ఈ విషయం తనకి తెలియటం నాకు ఇష్టంలేదు".
"ఆ సంగతి నేను చూసుకుంటాను మావయ్యా" పక్క నుంచి వినబడిన మాటలకి యిద్దరూ అటు చూశారు. రాకేష్ వున్నాడక్కడ. "విషయం చెప్పకుండా గౌరిని వప్పించే బాధ్యత నాకు వదిలిపెట్టు-" అని. అతడు కేదారగౌరి దగ్గిరకు వెళ్ళాడు.
"నేను నీకు ప్రజంటేషన్ ఏమీఇవ్వలేదు. ఆ విషయం అడగవేం?"
"ప్రజంటేషనేమిటి?"
"వివాహ సందర్భంలో బహుమతి".
"నువ్వు నాకివ్వటం ఏమిటి?"
"అవున్లే, అంత డబ్బు నా దగ్గిరేది?"
ఆమె నొచ్చుకుంటూ "ఛా, నా ఉద్దేశ్యం అది కాదు బావా! అయినా బహుమహి ఏదీ అని అడిగి తీసుకుంటారా ఏమిటి ఎవరైనా" అంది విషయాన్ని తేలికపరుస్తూ.
అతడు దగ్గిరగా వెళ్ళి "నాకో ఆలోచన వచ్చింది" అన్నాడు.
ఆమె ఏమిటన్నట్టు చూసింది.
"నేనా స్టూడెంట్ ని. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఏమీలేదు. మావయ్యని అడిగితే ఇస్తాడు. నీ కూతురి పెళ్ళికి ఏదైనా ఇవ్వాలి, కాస్త డబ్బు సర్దు మావయ్యా! అంటే బావోదు, నేనే సంపాదించాలి. ఎలా.... అందుకే ఆలోచించసాగాను. మీ వివాహం జరుగుతున్నప్పుడు నాకు హఠాత్తుగా ఆలోచన వచ్చింది".
ఆమె నవ్వి "ఏమిటి బావా అది" అడిగింది.
"డబ్బు అయితే సంపాదించలేను గానీ, కష్టపడగలను కదా. మీ మొదటి రాత్రి నేనే అరేంజి చేస్తే ఎలా వుంటుంది? ఐమీన్...నేనే పూలు కోసి వగైరా..."
ఆమె మొహం ఎర్రబడింది.
"మావయ్య ముందు మిమ్మల్ని సిమ్లా పంపిద్దామనుకున్నాడు. అంతకన్నా మన తోట బావుంటుందన్నాను. ఆగు- వెళ్ళిపోకు.... ఇప్పుడు నీ పెళ్ళికి ప్రజంటేషన్ గా స్వీకరించు. పోతే నాకు నాలుగురోజులు టైమివ్వు. అన్ని ఏర్పాట్లూ అయిన తరువాత ఇప్పుడు వాయిదా వేశామంటే తన కూతురు ఏమనుకుంటుందో అని మావయ్య...."
"ఛా... పో బావా".
"అయితే నీ కిష్టమేగా?"
ఏమీ సమాధానం చెప్పలేక ఆమె తల తిప్పుకుంది సిగ్గుతో.
"థాంక్యూ" అని అతడు వెళ్ళిపోయాడు.
ఆమె కళ్ళు ఆర్ద్రమయ్యాయి. తను పెళ్ళి చేసుకోకపోయినా తనమీద అతడి అభిమానం నశించనందుకు. నేను డబ్బుతో ఏమీ కొని ఇవ్వలేను. నార్రోజులు టైమివ్వు. తోటలో మీ మొదటి రాత్రి స్వయంగా నా చేతుల్తో ఏర్పాటు చేసి, అలంకరిస్తాను.
అతడు వెళ్ళిన వైపే చూస్తూ "ఎంత మంచివాడివి నువ్వు" అనుకుంది.
రాకేష్ వెళ్ళేసరికి భవానీశంకరం వాళ్ళు అక్కడే వున్నారు.
"చెప్పాను, నవ్వుకుంది" అన్నాడు.
ఆయన తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు.
"కానీ నాల్రోజుల తరువాత ఇక్కడ కాదు. మన తోటలో అరేంజి చేస్తామన్నాను" అన్నాడు సమస్య సులభంగా తేలిపోయిన ఆనందంతో. దాన్ని పట్టించుకోకుండా "దానికేముంది...." అంటూ బయటకు నడిచాడాయన. వెనుకే రాకేష్, మిగతా వాళ్ళూ వెళ్ళిపోయారు.
సిద్ధార్థ ఒక్కడే మిగిలాడు.
ఒకసారి పరిశీలనగా బల్లవైపు చూశాడు.
పిల్లి.... ఎటువంటి జాగాలోనైనా అవలీలగా నడవగలిగే జంతువు... కేవలం పాలమీద కాలేసి పడటం... అందులోనూ అది పడగానే మెడలో గాజు గుచ్చుకోవటం- అది నేలమీద నుంచి ఎగిరి పక్కమీదకు దూకటం... అక్కడ చావడం...
అంతా ఎందుకో ఎక్కడో నమ్మశక్యం కానటువంటి ఫీలింగ్ ని కలగచేసింది.
* * * *
కారు వచ్చి తోటలో ఆగింది.
సిద్ధార్థ దిగాడు. పక్కనే కేదారగౌరి!
రాకేష్ కారు స్విచ్ ఆపలేదు. "గుడ్ నైట్..." అన్నాడు. "-అండ్ ఆల్ ది బెస్ట్".
దుమ్ము రేపుకుంటూ కారు వెళ్ళిపోయింది.
వాళ్ళిద్దరే మిగిలారు. అంత హఠాత్తుగా ఇద్దరే మిగిలిపోవటంతో ఇద్దరికీ వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. గౌరీ కయితే, అంత ఆరుబయట తోటలోనూ నుదుటన చెమటలు పోస్తున్నాయి. ఆమె స్థితి గమనించాడు సిద్ధార్థా. "కొంచెం సేపు లోపల కూర్చుందామా" అని అడిగాడు. ఆమె స్పష్టంగా తలూపింది.
పంప్ రూమ్ పక్కనే మరొక గెస్ట్ రూమ్ లాంటిది వుంది. ఇద్దరూ మెట్లెక్కారు. దానికి తాళం వేసి వుంది.
ఇద్దరూ అప్రయత్నంగా మొహమొహాలు చూసుకున్నారు.
రాకేష్ దాని తాళం ఇవ్వటం మర్చిపోయాడు.
విసుగ్గా సిద్ధార్థ మెట్లు దిగాడు. కేదారగౌరి అతడిని అనుసరించింది. పంప్ రూమ్ పక్కనే చిన్న నీటి కాలువ వుంది. దాన్ని దాటి ఇద్దరూ వెనుకవైపు వచ్చారు. అక్కడ దృశ్యం చూసి వాళ్ళు విస్మయంతో నోట మాటరాక కొన్ని క్షణాలపాటు అలానే వుండిపోయారు.
భూమికి రెండు అడుగుల ఎత్తుగా ఒక మంచెలాటిది వుంది. అన్నీ పూలే. స్థంభాలకీ, మధ్యలోనూ, చుట్టూ బోర్డరు- రకరకాల రంగులలో, బంతి, చామంతి, మల్లె, సన్నజాజి, ఆ ఋతువుల్లో దొరికేవీ, దొరకనివీ, ఎక్కడెక్కడి నుంచో తెప్పించినవి....
అసలా దృశ్యమే ఎంతో మనోహరంగా వుంది.
చిరుగాలి తెమ్మెరకి గులాబిపూలు కదులుతున్నాయి. రేకులు అలవోకగా ఎగిరి క్రిందికి రాలుతున్నాయి. పక్క మధ్యలో హార్ట్ షేపులో అమర్చిన మల్లెపూల మీదనుంచి వచ్చే గాలి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
అప్పటివరకూ వున్న విసుగుని ఎవరో చేత్తో తీసేసినట్టు పోగా, సిద్దార్థ చిరునవ్వుతో గౌరివైపు చూశాడు. ఆ ఆర్చి అందాలని కళ్ళప్పగించి చూస్తున్న గౌరి, అతడి చూపులోని వేరే అర్ధాన్ని గమనించి సిగ్గుతో తల వంచుకుంది. సిద్ధార్థ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక అనిర్వచనీయమైన భావం ఆమె వళ్ళంతా పాకింది. అది పూర్తిగా సిగ్గు కూడా కాదు. కోర్కెకూడా కాదు. కుర్రవాళ్ళలో కోర్కె బాంబ్ లాగా బ్లాస్ట్ అవుతుంది. అమ్మాయిల్లో కోర్కె పురుషుడు నిద్ర లేపేవరకూ అలాగే వుండిపోతుంది. కానీ ప్రస్తుతం వీటన్నిటికన్నా అతీతమైన ఫీలింగ్ ఈ క్షణం ఆమెకి కలిగింది. మిగతా ఎవరైనా అయితే ఆ క్షణం అయోమయంలో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. జరిగినదేదీ గుర్తులేనంత కొత్తదనంతో మైకంలో పడిపోయేవారు. కానీ ఆమె ఆ అనుభూతి తాలూకు ప్రతీ క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదిస్తూంది.
అలా ఆమెని తీర్చిదిద్దింది ఆమె తండ్రి.
పద్దెనిమిదో శతాబ్దపు మనిషి ఎక్కువగా 'నమ్మకానికి' ప్రాధాన్యత ఇచ్చాడు. పంతొమ్మిదో శతాబ్దంలో ఒక ప్లానింగ్ పద్ధతిలో తన జీవితాన్ని మరింత ఆనందభరితం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అలాంటి ప్రయత్నాల్లో 'సెక్స్ ఎడ్యుకేషన్' ఒకటి. పిల్లల్ని, ఆడవాళ్ళనీ చీకటి ప్రపంచంలో వుంచి, సెక్స్ గురించి తెలుసుకోకుండా ఆపటంద్వారా నైతిక ధర్మానికి న్యాయం చేకూరుస్తున్నామనే భ్రమలో వున్న పెద్దవాళ్ళు తమ అభిప్రాయం మార్చుకోవటం ద్వారా మానవజాతికి గొప్ప న్యాయం చేకూర్చారు.
మనిషి ఆలోచనలో క్రమక్రమంగా మార్పు రాసాగింది. అలా వచ్చిన మొదటి వరుసలో ఆమె తండ్రి వున్నాడు.
ఏదో వుందన్న కుతూహలం కన్నా, ఇదే వున్నది అన్న విజ్ఞానం 14-20 వయసుకి సాయంచేస్తుంది అని గ్రహించిన మనుష్యులు వాళ్ళు.
ఏ సమాజంలోనైనా మనిషి మరింత ప్రొడక్టివ్ గా పనిచేయకపోవటానికి కారణం ఆ మనిషి పార్ట్నర్ నుంచి సరియైన అనందం రాకపోవటమే అనీ, ఆ పార్ట్నర్ అలా ఆనందం యివ్వలేకపోవటానికి కారణం చిన్నతనం నుంచీ ఆ విషయంపట్ల అవగాహన (ఎవేర్ నెస్) లేకపోవటం, ఎపిటైట్ లేకపోవటం, తెలియపర్చకుండా నొక్కిపట్టి వుంచిన పరిస్థితులు... ఇవే అని మనిషి గ్రహించటానికి క్రీస్తు పుట్టాక 1990 సంవత్సరాలు కావల్సి వచ్చాయి.