Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 27

    "ఊఁ" అన్నాడు సాగర్.
    "ఈ పెళ్ళికిముందు మనంకొన్ని నిజాలు  ఒప్పుకోవడమే మంచిది....."
    "ఏమిటవి?"
    "వున్ను నన్ను శాస్త్రవిరుద్దంగా పెళ్ళిచేసుకుంటానంటున్నావు అంత మాత్రాన నీ పెళ్ళి శాస్త్రయుక్తంగా జరగదని  నేననుకోవడంలేదు. ఎటొచ్చీ ఈ పెళ్ళికి  నేను. ఆ పెళ్ళికి అరవింద!" అంది నిర్మల.
    సాగర్ తెల్లబోయి- "అరవింద నీకు తెలుసా?" అన్నాడు.
    "అన్ని తెలుసునాకు. నీకు నా శరీరంమీదనేతప్ప మనసుమీద మోజులేదన్న నిజం కూడా తెలుసు....."
    "తెలిసీ ఇక్కడి కెందుకువచ్చావ్?" కంగారుగా అన్నాడు సాగర్.
    "చెబుతాను. సావధానంగా విను...." అంది నిర్మల.
    "నాకో మామయ్యున్నాడు. పేరు రమణయ్య. వాడు అసహాయస్ధితినిచూసి నన్ను చెరచాలనుకున్నాడు. తరిమితరిమి నన్ను పట్టుకున్నాడు. అప్పుడు  నా సవతితల్లే నన్ను రక్షించింది. ఆ తర్వాత పదేళ్ళ కొడుకున్న ఓ పెద్ద మనిషి  త్రినాధరావున్నాడు. వచ్చేనెలలో ఆయనకూ నాకూ పెళ్ళి . ఆ పెద్దమనిషి  పెళ్ళికాకుండానే నాతో పెళ్ళాంతో మాట్లాడినట్లు  మాట్లాడాడు. ఇంకొకడు చంచల్రావు. నేను పరమదౌర్భాగ్యస్ధితిలో  ఉద్దరించడానికి వచ్చినట్లు మాట్లాడి- నాకింక వేరేగతి ఏదీలేదనట్లు చేయిపట్టుకున్నాడు. ఇప్పుడునువ్వు ....నీ గదికి పిలిపించుకుని శరీరాలకలయికే పెళ్ళి అంటున్నావు...." అని ఆగి- "అయినా నేను నీ  గదికి ఎందుకొచ్చానో తెలుసా?" అంది నిర్మల సాగర్ మాట్లాడలేదు.
    "సాగర్ - నేను  నిన్ను ప్రేమిస్తున్నాను....." అంది నిర్మల - "నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావని ముందనుకున్నాను. కానీ కాదనిఆలస్యంగాతెలిసింది"
    "నా గురించి నీ కెవరు చెప్పారు?"
    "అవన్నీ ఇప్పుడడిగి మంచి సమయాన్ని పాడుచేయకు. నేను నీ అభీష్ఠానికనుగుణంగానే యిక్కడకు వచ్చాను...." అంది నిర్మల.
    ""నేను నమ్మను...." అన్నాడు సాగర్.
    "నీ గదిలో మల్లెలు నలిగినప్పుడు నమ్ముతావుకదా!" అంది నిర్మల సాగర్ కి ఏమనాలో తెలియడంలేదు- "నేను మోసగాడిని నయవంచకుణ్ణి. ఈ విషయం తెలిసుండీ ఎందుకు వచ్చావు?"
    "ఎందుకోచెప్పనా?" అంది నిర్మల.. "జీవితంలో ఎంతో  కష్టపడ్డాను. పడుతున్నాను. ఎందరికో యవచ్చక్తి ఉపయోగించి సేవలు చేస్తున్నాను. కానీ నా కెప్పుడు తిట్లూ, శాపనార్ధాలే!  ఒక చిన్న సానుభూతి  వాక్యంకోసం పరితపించిపోతున్నాను. మా వీధిలోనే  చాముండి అని ఒకావిడుంది. ఆమెకు నేనంటే  ఎంతో సానుభూతి. కానీ ఎవరికైనా ఒంటరిగావున్నపుడు నన్ను  వచ్చి పలకరించాలంటే భయం. మా అమ్మ వాళ్ళను తిట్టి నా జీవితాన్ని  మరింత నరకం చేస్తుంది. నేను  కోరుకున్న సానుభూతి వాక్యం- నువ్వొచ్చే దాకా  నాకు లభించలేదు. నువ్వు నాతో పరిచయం పెంపొందించుకోంటూంటే  నాకు నీపై నమ్మకం పెరుగలేదు. కానీ నీ మాటలు నాకు నచ్చాయి. అది అబద్దమేకావచ్చు మోసమేకాచ్చు. నేను కోరుకున్న తీయనిమాటలు నీనుండి లభించాయి. ఇంతవరకూ అందరూ నానుంచి ఏదో ఒకటి పొందారు. నాకేమీ ఇవ్వలేదు. నీనుంచి నేను మరపురాని అనుభూతి పొందాను. అందుకు ప్రతి ఫలంగా నేనేమివ్వగలను? నిజం చెబుతున్నాను సాగర్! ఒక్కరాత్రి నీవు నా కోసం ఇడ్లి తెచ్చావు. ఒకరోజు నాకు  రుచికరమైన భోజనం పెట్టడమేకాక- నేను నిద్రపోతూంటే నా పనులు నువ్వు చేశావు ఒకరోజు నాకిష్టమైన బట్టలు నాకు కట్టబెట్టి నా పనులు నువ్వు చేశావు. ఆ మూడురోజులూ  నా జీవితంలో మరువలేనివి. ఒక తీయనిమాటకోసం పరితపించిపోతున్న నాకు - ఒక్కటి కాదు- ఎన్నో తీయనిమాటలు  చెప్పావు. అటువంటి నీవు మోసగాడివే అయినా సరే- నీకు నా సర్వస్వం అర్పించుకోవాలని ఇక్కడకు వచ్చాను. జీవితాంతం మరపురాని విధంగా నిన్ను సేవించుకోవాలన్న నా కోర్కె ఎలాగూ తీరేది కాదు. కనీసం ఈ ఒక్కరోజుకు మనస్పూర్తిగా నన్నునీకు ఆర్పించుకోనీ..... ఆ తర్వాత నేను నిన్ను మోసగాడివని నిందించను. అన్యాయం చేశావని తప్పుపట్టాను....."
    సాగర్ తెల్లబోయి ఆమెవంక చూశాడు.
    "సాగర్!" అది నిర్మల మళ్ళీ "నేనుమనస్పూర్తిగా నీగదికి వచ్చాను. మళ్ళీమళ్ళీ మనం కలుసుకునే అవకాశముంటుందోలేదో నాకు తెలియదుఅందుకే ఈరోజు చెప్పగలిగినన్ని తీయనిమాటలు చెప్పు....." సాగర్ సమస్యపువ్వులా విడిపోయింది. తెలియకుండా మోసగించాలని తాననుకుంటే- తెలిసి మోసపోతానంటోందామె. తనామెను మోసంచేయగలడా?
    "సెంటిమెంటు....." అంటున్నాడు చంచల్రావు.
    "నో సెంటి మెంట్స్!" అన్నాడుతను.
    నిర్మల అందంగా మెరిసిపోతోంది. అమాయకంగా వెలిగిపోతోంది మనస్పూర్తిగా ఆహ్వానిస్తోంది. మరిచిపోతే బాధపడనంటోంది.
    "సెంటిమెంటు...."చంచల్రావు.
    "నోసెంటిమెంట్స్...." సాగర్.
    "నిర్మల....ఒకతీయనిమాట కోసం- జీవితానికి సరిపడ్డ తీయని అనుభూతినిస్తానని వచ్చింది. అరవింద..... తననమ్మకానికి బూజువులక్కర్లేదని చంచల్రావుని ఛీకొట్టిపింపింది. తానునిర్మలను దగ్గరగా తీసుకుంటే.....ఒకరికి కాదు....ఇద్దరికి అన్యాయం జరుగుతుంది. కనీసం  ఇద్దరిలో ఒకరికైనా తను న్యాయం  చేకూర్చుగలిగితే- ఆ అమ్మాయిల నమ్మకానికీ, తనవ్యక్తిత్వానికీ కూడా న్యాయం జరుగుతుంది.
    "సెంటిమెంటు...."మళ్ళీ చంచల్రావు.
    ఈసారి సాగర్ నించి బదులు రావడంలేదు.
    "మాట్లాడు సాగర్!" అంది నిర్మల.
    సాగర్-పెదవి కదిపాడు. మాటరాలేదు ఆలోచిస్తున్నాడతడు. ఈ ప్రపంచంలో అన్యాయం తప్పనిసరి. మోసంచేయని వాడంటూ ఎవడూలేడు. తాను- అరవిందను పెళ్ళి చేసుకుంటానని ఒట్టేశాడు. మరేస్త్రీతోనూ సంబంధం పెట్టుకోనని ఒట్టేయలేదు. అందువల్ల ఇప్పుడు నిర్మలతో కలిస్తేతప్పుకాదు. నిర్మలకు తనగురించి అంతాతెలుసు ఆమె అతడికి  ప్రతిఫలమివ్వద్దని వచ్చింది. ఆవిధంగా  కూడా  నిర్మలతోకలిస్తే తప్పుకాదు. సాగర్ ఆలోచిస్తున్నాడు. అతడి ఆలోచననిండా ఒక్కటేపదం.... ఒక తీయనిమాట....ఒక తీయనిమాట....ఒకతీయనిమాటకు- శీలాన్ని పరమపవిత్రంగా ప్రాణానికి మిన్నగాఎంచే ఒక యువతి- తన శీలాన్ని కోల్పోవడానికి  సిద్దపడింది. డబ్బుకు బహుమతులకు మించిన ప్రభావం తీయనిమాటకుంది. అయితే  అందరి విషయంలోనూ ఇది  నిజంకాదు శీతలదేశంవారికి ఎండసుఖం అనిపిస్తుంది. మండు టెండల్లో మసిలే వారికి చలిసుఖం  అనిపిస్తుంది.
    నిర్మల పరితపిస్తున్నది ఓక్తీయని మాటకోసం! ఆమెకోసం రోజుకొక్క తీయనిమాట చెప్పగలిగితే..... తనజీవితమెంత అద్భుతంగా ఉంటుందో సాగర్ కి తెలియకపోలేదు. కానీ తనను పూర్తిగా నమ్మిన అరవింద....
    సాగర్ త్వరగా  ఒకనిర్ణయానికి వచ్చాడు.
    "నిర్మలా! వెళ్ళిపో....నిన్నింటివద్ద దిగాబెడతాను....."
    "ఏం?" అంది నిర్మల.
    "నీవంటి అపురూప యువతిని పెళ్ళిచేసుకునే పద్ధతి యిదికాదు. నా ఆలోచనలకు నేనే సిగ్గుపడుతున్నాను....." అన్నాడు సాగర్.
    నిర్మల వెంటనే  "నాకు తెలుసుసాగర్! మోసం నీశరీరానికిసరిపడదు" అంది సంతోషంగా
    "నీకిప్పుడు సంతోషంగా ఉందా?" అన్నాడు సాగర్.
    "నేనారాదించే మనిషి నిజంగా వున్నతుడైతే సంతోషం నాకు కాక వేరెవ్వరికుంటుంది?" అంది నిర్మల.
    సాగర్ ఇంకేమి మాట్లాడలేదు ఆరోజు ఒకరినొకరు తాకకుండానే నిర్మల, సాగర్ విడిపోయారు. ఆతర్వాత వారంరోజులకు అరవిందకు జ్వరం వచ్చింది.
                 ___అయిపోయింది___ 

 Previous Page Next Page