ముందు అనుకున్నట్టే ప్రధానమంత్రి ఒక కాండేట్ గా పోటీకి నిలబడ్డాడు. ప్రతిపక్షాలన్నీ కలిసి, తమలో నేషనల్ ఇమేజ్ వున్న వ్యక్తిని ఏకైక అభ్యర్థిగా నిలబెట్టటానికి నిర్ణయించుకున్నాయి. ప్రధానమంత్రికి ఎదురుగా నిల్చోగల అటువంటి వ్యక్తి ఒకరే -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి !
దేశం దృష్టి అంతా వీళ్ళిద్దరి మీదే కేంద్రీకృతమయింది. నామినేషన్ లు వేసే ఆఖరి రోజు యింకా రెండు నెలలు వుందనగానే పావులూ సిద్ధమయ్యాయి. ఈ పరమపదసోపానంలో దేశపు అత్యున్నత స్థానం ఎవరు అధిరోహిస్తారో కాలమే నిర్ణయించాలి. వాళ్ళిద్దరేనా... మూడోవాడు ఇంకెవరైనానా?
* * *
దేశం గగ్గోలెత్తిపోయింది!
అన్న వాక్యానికి అర్థం లేదు. కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ వాతావరణం సృష్టిస్తారు అంతే!
ప్రధానమంత్రి రాజ్యాన్ని మార్చి, రాష్ట్రపతి తరహా ఎన్నికలు దేశంలో జరుగుతాయని ప్రకటించినపుడు దేశం గగ్గోలెత్తిపోయింది. చిత్రమేమిటంతే ప్రజల్లో తొంభై శాతానికి రాష్ట్రపతి తరహా పాలనకీ, ప్రధానమంత్రి తరహా పాలనకీ తేడా తెలీదు. అయినా ఆవేశపడిపోయారు. దీనికి కారణం అప్పటి వరకూ పదవిలో వున్న ఎమ్మెల్యేలు.
ఒక సాధారణ ఎమ్మెల్యే తన అయిదు సంవత్సరాల కాలంలో ఎనిమిది పది లక్షల కన్నా యెక్కువ సంపాదించలేడు. ('సాధారణ' అంటే ఏ కార్పొరేషను పదవీ, కమీషను అధ్యక్ష పదవీ లేకపోవటం అన్నమాట) అటువంటి ఎమ్మెల్యే - చిన్న జంపు చేస్తే 'పది' లక్షల దాకా లభిస్తుంది. అంతకన్నా ముఖ్యమైన లాభం ఏమిటంటే, అప్పటి వరకూ అనామకంగా వున్నవాడు హఠాత్తుగా వెలుగులోకి వస్తాడు. అతడి "బలం" వల్ల మెజారిటీ సంపాదించింది కాబట్టి పార్టీలో అతడికి "విలువ" ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యేగా తాను పదవిలో ఉన్న మిగతా కాలంలో ముప్పై లక్షలు సులభంగా సంపాదించవచ్చు.
కొన్ని లక్షలమంది ప్రజలకు ప్రతినిధిగా వెళ్ళి అక్కడికి వెళ్ళాక తన స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకున్నా అయిదు సంవత్సరాలు ఏమీ చేయలేని వ్యవస్థ మనది! ఏమి రాజ్యాంగం ఇది?
* * *
"ఏం చేద్దాం మనం?" అని అడిగింది వాణి.
"ఏమిటి ఏం చెయ్యటం?"
"మనం ఇలా ఖాళీగా వుండలేం. ఏదో ఒక వర్గాన్ని సపోర్టుచెయ్యాలి-"
"ఎవర్ని చేద్దాం?"
ఆమె సమాధానం చెప్పలేదు. ఆఖరి నిర్ణయం అతడిదే అనీ, కేవలం మాట వరసకే తనని అలా అడిగాడనీ ఆమెకి తెలుసు.
అంతలో అతడన్నాడు- "ప్రధానమంత్రి రేపు దేశాధ్యక్షుడు అవుతే దేశంలో మరింత లంచగొండితనం, నిరంకుశత్వం ప్రబలిపోతుంది. పోనీ ప్రతిపక్షపు కాండేట్ ని ఎన్నుకుందామా అంటే అతడికి స్టేచర్ లేదు. ఎవర్ని ఎన్నుకుందాం?"
ఆమె నవ్వింది- "మనమే ఇంత ఆలోచిస్తూ ఉంటే ప్రజలు ఎంత కష్టపడాలో పాపం! వారికున్న ఆప్షను చాలా చిన్నది".
"ఆలోచించేటంత కష్టపడేవారా ఈ ప్రజలు? అలా ఆలోచించేవారయితే యెప్పుడో ఈ సిస్టమ్ ని మార్చేవారు!"
"మొత్తం ప్రజాస్వామ్యాన్నే వ్యతిరేకిస్తున్నారా మీరు?"
ఎన్నడూ సాధారణంగా ఆవేశపడని అతడు ఆ మాటలకి విపరీతంగా ఆవేశపడి పెద్ద గొంతుతో అన్నాడు.... "ప్రజాస్వామ్యం-!!! ఏం ప్రజాస్వామ్యం ఇది? అడవిలో బలమైన జంతువులు బలహీనమైన జంతువుల్ని చంపుతాయి. జనారణ్యంలో తెలివైనవాడు తెలివితక్కువవాడిని దోచుకుంటాడు. దేశాన్ని జనారణ్యంగా మార్చిందీ వ్యవస్థే. ఈ వ్యవస్థలో తెలివైన ఎమ్మెల్యేలని తప్పుపట్టి ఏం లాభం? తను పెట్టిన పెట్టుబడికి తన అయిదు సంవత్సరాల కాలంలో కొంత 'లాభం' సంపాదించాలనుకుంటే అందులో తప్పేముంది? ఆకలితో వున్న వాడిముందు పంచభక్ష పరమాన్నాలు పెడితే ఎవరూరుకుంటారు? ఈ ప్రజా ప్రతినిధులూ అంతే. తప్పంతా ప్రజలది. నేనన్నానే... విజయవాడ నుంచి రామవరప్పాడు వరకూ ప్రయాణిస్తూ శుష్క రాజకీయాలు చర్చిస్తారు అని- ఆ ప్రజలది!"
"కానీ అన్నిటికన్నా ఈ రకం రాజ్యపాలనే మంచిదంటారు"
"మంచిదే... కానీ యెవరికి? తమకి కావల్సిందేదో తాము తెలుసుకొని దాన్ని సాధించటం కోసం ప్రయత్నించే వాళ్ళకి... అంతేకానీ వేడివున్నంతసేపూ ఆవేశపడి, అది తగ్గగానే చల్లారిపోయే వాళ్ళకి కాదు....
"రాజకీయం మన జీవితాల్లో ఒక భాగం మాత్రమే. దీని గురించి ఇంత అలోచించటం అనవసరం".
"కాదు" అన్నాడు అతడు అది తన నిశ్చయాభిప్రాయంగా. "ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశపు యువతమీద ఆధారపడి ఉంటుంది. మనకి కేవలం వందమైళ్ళ దూరాన ఉత్తరాన వున్న దేశం, దాదాపు మన వాతావరణం, మన శీతోష్ణస్థితి ఉన్న దేశం- మనకన్నా శారీరకంగా బలహీనులున్న దేశం- ఆ దేశపు క్రీడాకారులు ఒలింపిక్స్ లో అన్ని పతకాలు సాధించగలిగారంటే... మొహం చూసుకోవటానికైనా మనకి ఒకటికూడా రాలేదంటే-"
"దానిక్కారణం-" ఆమె మాటలు పూర్తికాలేదు.
"...కారణం నిశ్చయంగా ఈ దేశపు రాజకీయ పరిస్థితులే! ఆ దేశంలో అక్కడ యువత 'వ్యక్తి ఆరాధన'లో మునిగిపోదు. ముఖ్యమంత్రి విదేశాల్నుంచి వస్తే డోళ్ళూ డప్పులూ పట్టుకుని విమానాశ్రయానికి వెళ్ళదు. ఒలింపిక్స్, సంస్కృతి, న్యూక్లియర్ బాంబ్ ఇలాంటివాటి గురించి ఆలోచిస్తుంది. అక్కడ పార్టీ చీఫ్ కూడా మిగతా అందరు ఆఫీసర్లలాగే తన వాహనంలో మామూలుగా ఆఫీసుకు వస్తాడు..."
"కమ్యూనిజమ్ ని సపోర్టు చేస్తున్నారా మీరు?"
"నేను మాట్లాడేది ఎకనామిక్స్ గురించి కాదు. పోలిటిక్స్ గురించి-" అన్నాడు అతడు. "ఒక కొరడా కావాలి! మన దేశాన్ని కేవలం ఒక కొరడాయే ప్రగతిపథం వైపు నడిపించగలదు".
"ఇంతకీ మనం యెవర్ని సపోర్టు చేద్దామో చెప్పలేదు. వంకాచెక్కా రామ్మూర్తి ప్రధానమంత్రి వైపు వున్నాడు. లోహియా ముఖ్యమంత్రి వైపు వున్నాడు. మీ తండ్రిగారు తటస్థంగా, ఎవరు నెగ్గితే వాళ్ళవైపు వున్నట్టు ప్రకటించే ఆలోచనలో వున్నాడు".
అంతా వింటూన్న సింహం- ఆశ్చర్యంగా.... "రామ్మూర్తి ప్రధానమంత్రి వేపు ఎప్పుడు వెళ్ళాడు?" అని అడిగాడు.
దానికి సమాధానం వాణి చెప్పింది.