"అదిగో అది. నువ్వు తెచ్చింది".
"నేను తేవటమేమిటి? మనవరాలేమిటి? పాకెట్టేమిటి? చెవేమిటి? నేను మలేరియా డిపార్ట్ మెంట్ నుంచి వచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగాను. మీరు లోపలికి వెళ్ళి ఏదో పాకెట్టు పట్టుకొచ్చారు. ఎర్రగా కనబడితే ఆవకాయ ముక్కేమో అనుకున్నాను. ఇది చెవా? ఎంత పనిచేశారు. మలేరియా డిపార్టుమెంట్ వాళ్ళకి కేవలం మీ ఆరోగ్యం ఎలా వుందో చెపితే చాలండీ. అంగాంగాలు తీసుకొచ్చి చూపించనక్కర్లేదు". నవ్వింది.
శివరామయ్య బిత్తరపోయి చూడసాగాడు. అంతలో ఆమె మొహం కఠినంగా మారింది. "నన్ను అరెస్టుచేసి ఏమి నిరూపించగలవు శివరామయ్యా నువ్వు! పుచ్చిపోయిన న్యాయ వ్యవస్థలో తుప్పుపట్టిన బోల్టులాటి నువ్వు, నీలాటి కుళ్ళిపోయిన వాళ్ళున్న ఈ సమాజంలో ఆటవిక న్యాయమే సరి అయినది. అడవిలో నేరనిరూపణలూ, న్యాయశాస్త్రపు గొడుగు క్రింద నీలాటి త్రాస్టులు తలదాచుకోవటాలు వుండవు. తప్పుకి శిక్ష మాత్రమే ఉంటుంది. ఈ దేశానికిప్పుడు కావలసింది ఆ ఆటవిక న్యాయమే! ప్రభుత్వపు బ్యూరోక్రసీని అడ్డుగా పెట్టుకుని ఇన్నాళ్ళూ తప్పించుకుంటూ వచ్చావు. ఈ రోజున నీ అదృష్టం బావోలేక మా బారిన పడ్డావు. మా దగ్గర ఎంక్వయిరీలూ, సస్పెన్షనులూ ఇవేవీ వుండవు. ప్రాణాలు తీయటమే... ఎంత తొందరగ నీ తప్పు ఒప్పుకుంటే అంతమంచిది! ఇంకొద్ది క్షణాలు ఆలస్యమవుతే మా రాబోట్ నీ మనవరాలి ముక్కు తీసుకొస్తాడు. ఆ తరువాత మా సింహం తల తీసుకొస్తాడు... ఈ విషయంలో మాకు ఏ విధమైన దయాదాక్షిణ్యమూ లేదు. ఒప్పుకుంటావా లేదా ఏదో ఒకటి తొందరగా చెప్పు. ఒప్పుకోకపోతే ఈ రోజు నీ మనవరాల్ని, రేపు నీ మనవడిని!! నీ జీవితం నరకప్రాయం అవక తప్పదు..."
"ఒప్పుకుంటున్నాను-" హీనమైన కంఠంతో అన్నాడు శివరామయ్య.
"గుడ్" అంటూ లేచింది. అతడి నెక్కించుకుని ఆమె కారు పురోహితన్ ఆఫీసుకి వెళ్ళటం కోసం బయల్దేరుతున్న సమయానికి, శివరామయ్య మనవరాలు లోపలికి పరిగెత్తుకువచ్చి "అమ్మమ్మా తాతయ్య ఎక్కడికి వెళ్తున్నాడు" అని అడుగుతోంది. పోలీసు క్వార్టర్స్ కి ఇటువైపు అప్పటి వరకూ కార్లో చాక్లెట్లిచ్చి కూర్చోబెట్టుకున్న సింహం, వాణీ కారు కదలటం చూసి పాపని వదిలి పెట్టేశాడు.
* * *
బల్ల మీద కొచ్చిపడిన కవర్ ని చూసి తలెత్తిచూశాడు విజయ్.
అతడు ఎదుటి కుర్చీలో కూర్చుంటూ "నీ ఆర్డర్ విజయ్! తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటూ" అన్నాడు. విజయ్ కళ్ళలో లిప్త మాత్రం ఆనందం కనబడింది. చప్పున కవరు అందుకుని చింపి ఆర్డరు చదివాడు. చదివి "రొయ్యల గూడెమా" అన్నాడు.
"అవును. ఇక్కడ ఉంచటానికి కుదరదట. తాత్కాలికంగా అక్కడికి ట్రాన్స్ ఫర్ చేశారు. ...విజయ్! ఆర్ యు నాట్ హాపీ?"
"హాపీ... యస్... యస్... ఐయామ్ హాపీ.... నీకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిన బాధ్యత నా మీద వుంది కదూ... థాంక్స్... థాంక్యూ!"
అతడి మొహం ఎర్రబడింది. "నువ్వు అంత వెటకారంగా మాట్లాడక్కరలేదు విజయ్" అన్నాడు.
"ఇందులో వెటకారం ఏమీలేదు. ఈరోజు నువ్వీ ఆర్డరు తెచ్చి వుండకపోతే రేపటినుంచి పస్తులే నాపని. కానీ... కానీ- మూడు రోజుల్లో కావాలనుకున్న వ్యక్తిని సస్పెండ్ చేయించటం- రెండ్రోజుల్లో తిరిగి ఆర్డరు తెప్పించటం, అదీ పోస్ట్ లో కాకుండా చేసినవాడే తెచ్చియివ్వగలగటం. నాకు మతిపోతూంది. పిచ్చెక్కిపోతూంది"
"ఇంకా పిచ్చెక్కాలి, నీలాటి నిజాయితీపరులకీ, తెలివైన వాళ్ళకీ ఇంకా పిచ్చెక్కాలి విజయ్. వడ్డునపడ్డ చేపల్లా వాళ్ళు గిలగిలలాడితేగానీ నేను కోరుకున్న పని పూర్తికాదు. ఈ రెడ్ టేపిజం మారదు! నీ విషయమే తీసుకో. మేమే కల్పించుకోకపోతే ఆ శివరామయ్య హాయిగా వుండేవాడు. రక్తమూ, తుపాకీ, హంటర్- కావలసినవి ఇవే విజయ్! లేకపోతే జనం మాట వినరు. స్వయంగా ఈ హత్యచేశానని మీ నాన్న చెప్పినా ఏమీ చేయలేని చట్టం! ఈ చట్టపు పరిరక్షుడిగ నువ్వూ ఏమీచేయలేవు. అది కూడా నేనే చేస్తాను చూస్తూ వుండు".
"ఎలా చేస్తావ్?"
"చూస్తావుగా" అంటూ లేచి తలుపు దగ్గిరగా వెళ్ళి ఆగి, "మాలాటి వాళ్ళు మామూలు పనులు నిరాటంకంగా చేసుకునే భద్రత కల్పిస్తూ ఈ వ్యవస్థని రక్షిస్తున్నాననే గొప్ప ఆత్మ సంతృప్తితో బ్రతుకుతున్న ఓ పోలీసు ఇన్ స్పెక్టర్!- థాంక్యూ. నీ ఆత్మవంచన చెక్కు చెదరనంత కాలం మాకేం పర్వాలేదు" అని వెళ్ళిపోయాడు.
8
దేశపు రాజకీయాలు రోజు రోజుకీ అథోగతికి వెళ్ళసాగాయి. ముఖ్యంగా రాష్ట్రాలు - కేంద్రం మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాష్ట్ర అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకునేవారు ఎక్కువ అవసాగారు. రాష్ట్రంలో జరిగిన ప్రతీ దానికీ కేంద్రాన్ని నిందించటం అలవాటయిపోయింది. దీనివల్ల తాత్కాలికంగా లాభం చేకూరినా, ప్రజలకి రాష్ట్రం వేరు, దేశం వేరు అన్న భావం ఏర్పడసాగింది.
ప్రజల్లో ఇంకా కేంద్రంపట్ల పూర్తిగా విశ్వాసం పోలేదని ప్రధానమంత్రికి తెలుసు! దేశాన్ని ఏలగలిగేది తన పార్టీయే అన్న నమ్మకం ఉంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సాగదీసి అవసరమైన షేపులోకి తెచ్చుకోవాలి. ప్రధానమంత్రి సహచరులతో రహస్య సమాలోచనలు జరిపారి. ఇంకోలా చేస్తే...
ప్రతీ ఓటరుకీ రెండు ఓట్లు వుంటాయి. ఒక దానితో సెనెట్ మెంబర్ ని రెండో దానితో ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాలి. అలా చేస్తే ఓటర్లు సెనెట్ మెంబర్ గా తమ ప్రాంతీయ వ్యక్తిని ఎన్నుకున్నా, రెండో ఓటు తప్పకుండా "నేషనల్ ఫిగర్" కే వేస్తారు. కేవలం ఒక వ్యక్తికే ఆ నేషనల్ ఫిగర్ ఇమేజ్ వుంది. ఆ వ్యక్తి-
ప్రధానమంత్రి!!!
ఈ మార్చిన దాని ప్రకారం దేశాన్ని ప్రెసిడెంట్ ఏలతాడు. ప్రస్తుత ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ షిప్పు రావటం ఖాయం. దేశపు సర్వాధికారాలు చేతిలో వుంటాయి. ప్రస్తుత పార్లమెంట్ పద్ధతి కొనసాగితే మాత్రం తిరిగి ప్రధానమంత్రి అవటం అనుమానమే.
ఆ రాత్రే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ని కలుసుకున్నారు.
వైమానిక, నౌకా, కల్బలాల సైన్యాధికారులు అవసరమైతే రంగంలోకి దూకటానికి తమ సహకారం ప్రకటించారు. కానీ అంత అవసరం రాలేదు. పార్లమెంటులో పార్టీ బలం సరిగ్గా సరిపోయింది. ప్రతిపక్షాల సభ్యులు దాదాపు పిచ్చెక్కిపోయారు. అయినా ఏం చెయ్యగలరు? పార్లమెంటు రద్దయింది.
భారతదేశపు ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థని కాన్సిల్ చేస్తూ ఇక నుంచీ ప్రెసిడెంట్ తరహా పాలనలో దేశం నడుస్తుందనీ, దాని ఎన్నికలు త్వరలో జరుగుతాయనీ రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. నవంబరు 16వ తారీఖు రాత్రి ఎనిమిదింటికి భారత రాజ్యాంగాన్ని చారిత్రాత్మకమైన మార్పుతో తిరగ వ్రాయటం జరిగింది.