Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 25


    వాటిని చూడగానే అతడి వెన్నులో చలి ప్రాంభమైంది. మొహాన్ని జేబు రుమాల్తో కప్పుకుని జనంలో కలిసిపోయి వణుకుతున్న కాళ్ళతో బయటకు వచ్చాడు. అదృష్టవశాత్తూ ఇంటివరకూ మూడోకంటికి కనపడకుండా రాగలిగాడు. ఇంటి తలుపులు తాళం వేసి వున్నాయి.

    వసంత్ దాదా మనుష్యులు తన ఇంటిదగ్గర వేచి వుంటారని అతడు వూహించాడు. క్షణాల్లో ఎంత ఫాస్ట్ గా  పనులు నిర్వహించగలరో అతడు వాళ్ళతో వున్నప్పుడు గమనించాడు. తను ఏ ట్రైన్లో దిగిందీ, ఏ కంపార్ట్ మెంట్ లో ప్రయాణం సాగించిందీ కూడా వారీ పాటికి తెలుసుకుని వుంటారని అతడు భావించాడు. ఆ విషయం నిజమే! మొత్తం  నగరంలో వున్న దాదా దళాలన్నీ అతడికోసం జల్లెడ వేసి వెతుకుతున్నాయి.

    అతడికిప్పుడు ఒకటే కోరిక.

    చచ్చిపోయే ముందు తన పిల్లల్ని ఒక్కసారి చూసుకోవాలని! అందుకే వీధి మొదట్లో పాడుపడిన గోడ వెనుక నిలబడి అలా చూస్తున్నాడు. మరి కాస్త  చీకటి పడ్డాక పక్కింట్లో అడిగితే తన పిల్లల సంగతి ఏమైనా చెపుతారేమో అని ఆశ అతడిది.

    అంతకు ముందు చాలా రోజుల్నుంచీ నిద్ర లేదేమో, అతడు అలాగే ఆ చెత్తకుప్పల వెనుక నిద్రపోయాడు. మెలకువ వచ్చేసరికి బాగా చీకటి పడింది. మొహం చాటుచేసుకుని తనింటివైపు వెళ్ళాడు. ఇంకా తాళం వేసే వుంది.

    వెనుక వైపు నించి వెళ్ళి పక్కింటి పెరటి తలుపు కొట్టాడు.

    రెండు నిముషాల తరువాత వాళ్ళు తలుపు తీశారు. తన పిల్లల సంగతి అతడు అడిగాడు. క్రితం రోజు ప్రొద్దున ఎవరో కార్లో వచ్చి వాళ్ళని  తీసుకు వెళ్ళారని చెప్పారు. విష్ణుశర్మ నెత్తిన పిడుగుపడ్డట్టయింది.

    తను బొంబాయిలో తప్పించుకున్న అయిదు నిముషాల్లో, ఇక్కడ తన పిల్లల కిడ్నాపింగ్ జరిగిందీ అంటే- వసంత్ దాదా మెరుపుకన్నా ఎంత వేగంగా పనులు చేయించగలడో అతడికి ఆ క్షణం అనుభవపూర్వకంగా  తెలిసింది.

    అతడికిక చావు ధైర్యం వచ్చింది. మరణించే ముందు ఒక మంచిపని చేద్దామన్న ఆలోచన కల్గింది.

    అక్కణ్ణుంచి వెళ్ళి పార్కులో మున్సిపాలిటీ లైటు క్రింద కూర్చుని మొత్తం జరిగినదంతా వ్రాసాడు. తనెలా వసంత్ దాదా చేతిలో పడిందీ, సలీంశంకర్ ని జపాన్ వురికంబం నుంచి రక్షించడానికి తనని ఎలా వాళ్ళు ఎన్నుకున్నదీ- ఆ  ప్లానూ, అంతా వివరంగా మూడు పేజీల్లో వ్రాసాడు. వాటిని మూడు కాపీలు తీశాడు. ఒకటి పోలీస్ స్టేషన్ లోనూ, మరొకటి పోలీస్ కమీషనర్ కీ, మూడోది ముఖ్యమంత్రికి పంపాలని అతడి వుద్దేశ్యం.

    అతడు మొదట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు

    అంతవరకూ అతి జాగ్రత్తగా  ప్రవర్తిస్తూ వచ్చిన విష్ణుశర్మ ఈ చివరి క్షణంలో తప్పతడుగు వేసాడు. తన ఇల్లు వున్న జ్యూరిస్ డిక్షన్ లోని పోలీస్ స్టేషన్ లోకే అడుగు పెట్టడం అతడు చేసిన తప్పు.

    అక్కడకూడా దాదా అనుచరులు వుంటారన్న విషయం ఆలోచించలేదు. అతడెలా చాటుగా ఇప్పటివరకూ వున్నాడో, అలాగే మాఫియా అతడికోసం ఆ చీకటిలో మాటు వేసి వుంది. పిల్లలు తప్పిపోయిన  విషయమై అతడు అక్కడికి  వస్తాడని వారు వూహించారు.

    పోలీసు స్టేషన్ లోకి ప్రవేశించబోతూ వుండగా అకస్మాత్తుగాఅతడి మీద  టార్చిలైటు వెలుతురు పడింది. అతడు లోపలికి పరుగెత్తబోయాడు. ఒక జీపు చూపుకున్నా  వేగంగా  రివ్వున వచ్చింది. అ వేగాన్ని సెంట్రీ కూడా గుర్తించలేకపోయాడు. ఏం జరగబోతుందో వూహించే లోపులో జీపులోంచి ఒక స్టెన్ గన్ బయటకి వచ్చింది. ఆ ఆవరణంతా దాని చప్పుళ్ళతో దద్దరిల్లిపోయింది. మొదటి మెట్టు ఎక్కబోతూండగా మొదటి గుండు అతడి మెడలో గుచ్చుకుంది. రక్తపు మడుగులో అతడు కూలిపోయాడు.

    చప్పుళ్ళు విని లోపల్నుంచి సబ్ - ఇన్ స్పెక్టర్ సిబ్బంది పరిగెత్తుకు వచ్చే లోపులో జీపు అదృశ్యమైంది.

   
   
                                                       *    *    *


    ఉత్పలకి నిద్ర పట్టటం లేదు. పదకొండింటి వరకూ డ్యూటీ అయినా అంత  రాత్రిపూట ఇంటికి వెళ్ళటం ఎందుకని ఆస్పత్రిలోనే పడుకుంటూ వుంటుంది. నైట్ డ్యూటీలకు ఆమె ఇంట్లో మొదట్లో కాస్త అభ్యంతరం తెలిపినా తరువాత వప్పుకున్నారు. ఉత్పలకి ఒకరిద్దరు నర్సులు బాగా స్నేహితులయ్యారు. రోజులు తొందరగా గడిచి పోసాగాయి.

    ఆ రోజు మాత్రం ఆమె మంచి మూడ్ లో లేదు. ఆ సాయంత్రమే పోలీసులు అనూషని అరెస్ట్ చేసింది! ఉత్పల సరాసరి స్టాక్ హొం ఆఫీసు నుంచి ఆస్పత్రిలో వచ్చేసింది. ఆ సాయంత్రమంతా ఆమె అనూష ఆలోచన్లతోనే గడిపింది.

    రాత్రి దాదాపు పదకొండు దాటాక- బయట కలకలం వినిపించి ఆమె మగత నిద్రలోంచి మేల్కొంది. ఇద్దరు పోలీసులు, ఇనస్పెక్టరూ హడావిడిగా లోపలికి రావటం గమనించింది.

    "ఏం జరిగింది" అని పక్కనున్న సిస్టర్ ని ప్రశ్నించింది.

    "ఎవర్నో పోలీసుస్టేషన్ మెట్ల మీద కాల్చేసారట. తీసుకొచ్చారు" అంది.

    ఇటువంటి కేసులన్నీ సాధారణంగా ప్రభుత్వాసుపత్రికి వెళతాయి. కానీ ఆ పోలీసు స్టేషన్ లోని సబ్- ఇనస్పెక్టరు యువకుడు పక్కనే వున్న హరనాధ ఆస్పత్రికి తీసుకొచ్చాడు.

    ఉత్పల గబగబా వరండాలోకి వచ్చింది.

    అప్పటికే ఆపరేషన్ ఏర్పాటు మొదలైంది. హరనాధరావు పేషెంట్ శరీరంలోని గుళ్ళు తీసే ప్రయత్నంలో నిమగ్నమై వున్నాడు. విష్ణుశర్మ శరీరంలోని కొస ప్రాణం కొట్టుకుంటూంది. ఇంకా మత్తు ఇవ్వలేదు.

    అదే సమయానికి వసంత్ దాదా కోపంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడి మొహం ఆవేశంలో కందగడ్డలా ఇవ్వలేదు.

    అదే సమయానికి వసంత్ దాదా కోపంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడి మొహం ఆవేశంలో కందగడ్డలా వుంది.

    విష్ణుశర్మ పూర్తిగా మరణించలేదన్న విషయం అతడికప్పుడే తెలిసింది. కోపంతో చిందులు తొక్కుతున్నాడు. సలీంశంకర్ వైపు తిరిగి, ఆ "సబ్- ఇన్ స్పెక్టర్ ఎవడో నీకు తెలీదా?" అని అడిగాడు.

    "ఊహూ-కొత్తగా వచ్చాడట".

    దాదా ఒక నిర్ణయానికి వచ్చినట్టు శంకర్ వైపు తిరిగాడు. "నీ అనుచరుల్లో కెల్లా మంచివాడిని ఆ ఆస్పత్రికి పంపు. విష్ణుశర్మ మరణ వాజ్ఞ్మూలం ఇవ్వకుండా చనిపోయాడో లేదో ముందు తెలుసుకోవాలి! ఒక వేళ అతడు అలాంటిదేదైనా ఇచ్చివుంటే ఆ రహస్యం తెలిసిన వాడెవడైనా సరే ఈ భూమ్మీద వుండకూడదు. ఎంత రక్తపాతం జరిగినా సరే- మన కెక్కువ టైమ్ లేదు. క్విక్-" అన్నాడు.

    సలీంశంకర్ బయటకు పరుగెత్తాడు. మరు నిముషం కారు స్టార్టయిన శబ్దం వినపడింది.


                                                     *    *    *

    ఉత్పలకి రక్తాన్ని చూసి ఓర్చుకునే శక్తి ఇంకా రాలేదు. దూరంగా వుండే కావలసినవి అందిస్తూంది.

    విష్ణుశర్మ శరీరం చుట్టూ పచ్చటి గుడ్డ  కప్పబడి వుంది. ఆపరేషన్ ఇంకా మొదలవలేదు. అతడి నుంచి విడదీసిన బట్టలు ఒక మూలగా వున్నాయి. వాటి నిండా రక్తం అంటివుంది. ఆపరేషన్ ధియేటర్ పక్కనే మరోగది వుంది. ఆమె బట్టల్ని తీసుకుని ఆ గదిలో పడేసింది. అలా పడేస్తూ వుండగా అందులోంచి కాగితాలు క్రింద పడ్డాయి. విష్ణుశర్మ లోపలి వస్త్రాల్లో దాచుకున్నట్టున్నాడు వాటిని.

    వాటిని పక్కన పెట్టబోతూ యధాలాపంగా చూసింది. "నేను మరణిస్తే" అని వుంది వాటి మీద. ఆమె ఉలిక్కిపడింది.

    లోపల గదిలో అందరూ తమతమ పన్లలో వున్నారు.

    ఆమె గబగబా బయట గదిలోకి వెళ్ళి ఇనస్పెక్టర్ కి ఆ కాగితాల్ని ఇచ్చింది. ముందే వాటిని గమనించనందుకు అతడు నాలిక్కర్చుకున్నాడు.

    అతడు వాటిని చదువుతూ వుండగా ఆమె కూడా ఒక కాపీని చదివింది. చదవటం పూర్తయ్యేసరికి ఆమె చేతులు వణకసాగాయి. ఈ లోపులో ఇనస్పెక్టర్ కూడా చదవటం పూర్తిచేసాడు. అతడి మొహంలో ఉద్వేగం కొట్టిచ్చినట్టు కనబడుతూంది. "ఈ దెబ్బతో ఒక అండర్ వరల్డ్ రాకెట్  పునాదుల్తో సహా కదిలిపోతుంది" నుకున్నాడు స్వగతంగా.

    దాదా ఏం చేసేదీ- అనుచరుల సంగతీ - కార్లమీద పువ్వు- జపాను విషయం సలీంశంకర్ ని రక్షించే విధానం -అంతా వివరంగా  వ్రాసి వుంది అందులో.

    సబ్ -  ఇనస్పెక్టర్ ఏదో అనబోతూ వుండగా లోపల్నుంచి కబురొచ్చింది. విష్ణుశర్మకి తెలివొచ్చిందనీ-ఆఖరి క్షణాల్లో వున్నాడనీ!

    అతడు లోపలికి వెళ్ళాడు.

    అదే సమయానికి బైట కారు ఆగింది. చీకట్లో నలుగురు వ్యక్తులు దిగారు. గాలికన్నా వేగంగా లోపలికి ప్రవేశించారు.

    ఆస్పత్రి సిబ్బంది అంతా కకావికలుగా పరుగెత్తారు.

    మరుక్షణం మిషన్ గన్ చప్పుళ్ళు వినపడ్డాయి.

    ఆ నిముషం రియల్ మాఫియా స్వరూపం విశ్వరూపమై తాండవం చేసింది. ఉత్పల బిల్లిలా గోడకి హత్తుకుపోయింది.

    ఎంత వేగంగా వచ్చారో -అంత వేగంగా వెళ్ళిపోయారు వచ్చినవాళ్ళు ఆర్తనాదాలూ-హాహాకారాలు-

    అందరితో పాటు ఆమె కూడా ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళింది. అక్కడి దృశ్యం చూసి కళ్ళు తిరిగి పడిపోయింది.

    హరనాధరావు, పోలీసు సబ్ ఇన్ స్పెక్టరు-నర్సులు-విష్ణుశర్మ-అందరి శవాలూ చెల్లాచెదురుగా పడివున్నాయి.

    పారే రక్తం మీద విష్ణుశర్మ ఆఖరి ఉత్తరం కాపీ తడిసి, తేలిపోతోంది. ఒక  నిజం శాశ్వతంగా సమాధి అయిపొయింది.

    కేవలం ఉత్పల మెదడులో మాత్రం అది సజీవంగా వుంది.


                                        15


     రాత్రి దాదాపు పన్నెండు కావస్తూ వుండగా వసంత్ దాదా, సలీంశంకర్ లకు విష్ణుశర్మ మరణం గురించి తెలిసింది. అతడితో పాటు సబ్- ఇన్ స్పెక్టర్ తో సహా మరో నలుగురైదుగురు మరణించారని తెలియగానే ఈ విషయం పట్ల భవిష్యత్ పరిణామాలు ఎలా వుంటాయని ఆలోచించాడు. రేపీ వార్త పేపర్లో రాగానే, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువవుతున్నాయని ప్రతిపక్షాలు సభలు, ఊరేగింపులు, బంద్ చేయటం- ప్రభుత్వం దీని పట్ల చాలా అలజడి (చెందినట్టు నటించటం) దటం, ఒక ఆర్నెల్ల తరువాత ప్రజలు మర్చిపోయారనుకున్నాక ప్రభుత్వమూ, ప్రతిపక్షాలూ కూడా దీన్ని మర్చిపోవటం మామూలే.

     వసంత్ దాదా ఆలోచిస్తున్నది దీని గురించి కాదు.

    విష్ణుశర్మ మరణానికీ, తనకీ వున్న సంబంధాన్ని పోలీసులు ఎంతవరకూ కనుక్కోగలరా అని!

    అయిదు నిముషాలు అతడు దీర్ఘంగా ఆలోచించాడు. ఏ రుజువులూ దొరకవని నిశ్చయం కలిగాక సంతృప్తి చెందాడు. ఈ లోపులో సలీం శంకర్ ఆస్పత్రి దగ్గరకు వెళ్ళి పని ముగించుకు వచ్చిన వాహనం తాలూకు నెంబర్ ప్లేట్లు మార్చటం పూర్తి చేసుకొని వచ్చాడు.

    ఇద్దరూ కొంచెం సేపు భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించుకున్నారు.

    విష్ణుశర్మని అలా నడిబజార్లో చంపడం దాదాకి ఇష్టం లేదు. 1982 వరకూ దేశంలోని మాఫియా గ్రూపులు విరివిగా వీధి పోరాటాలూ, మూకుమ్మడి హత్యలూ చేసుకోనేవి. కానీ ఇలా పబ్లిగ్గా గ్రూపులు దెబ్బలాడుకోవటం వలన, చంపుకోవటం వలన, ప్రజల దృష్టి, పోలీసుల దృష్టీ అనవసరంగా తమ మీద పడుతుందని ఈ గ్రూపులు గ్రహించాయి. తమ తమ సామ్రాజ్యపు ఎల్లలు దాటకుండా జాగ్రత్తపడ్డాయి. దీని వల్ల శాంతి భద్రతలు నెలకొన్నాయి! అయితే ఈ శ్మశాన నిశ్శబ్ధపు అడుగు నుంచి మాఫియా తన కార్యక్రమల్ని మరింత చురుగ్గా జరుపుకుంటుందని సామాన్య ప్రజలు గుర్తించలేకపోయారు..

 Previous Page Next Page