"ఏం కావాలమ్మా" అంటూ అవసరమైనదానికన్నా ఎక్కువ ఇంటరెస్టు చూపిస్తూ అడిగాడా ముసలాడు.
తనని తాను పరిచయం చేసుకుంటూ "గంటక్రితమే నేను పట్నాయక్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నానండి" అంది అత్యంత మర్యాద నిండిన కంఠంతో.
అన్యమనస్కంగా "వూఁ, అయితే-" అన్నాడు అతడు, అతడి చూపు తన మెడక్రింద అనాచ్చాదనుంచి కదలక పోవడాన్ని ఆమె గమనించింది. ముందుకు వంగి, "నేనో తప్పు చేశానండీ, ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు టేప్ రికార్డ్ చేయాలన్న విషయం నాకు తెలీదు. కొత్తగా ఉద్యోగంలో చేరాను. రికార్డ్ చెయ్యకుండా ఇలా వ్రాసుకుని వెళ్ళే సరికి మా ఎడిటర్ బాగా తిట్టాడు" అంది. జాలిగా మొహం పెట్టి -ఇక ఉద్యోగం పోవటమే తరువాయి అన్నట్టు.
"అయ్యో! ఎంత పని జరిగిందమ్మా" అన్నాడు- అతడు ఫైల్లో ఆమెకిచ్చిన అనుమతిపత్రం కోసం వెతుకుతూ.
"మిమ్మల్ని ఎలాగో బ్రతిమాలి ఇంకో ఇంటర్వ్యూ తీసుకుంటానని మా ఎడిటర్ గారితో చెప్పి వచ్చాను. ఇప్పుడు మీరు కాదంటే నా పని ఇరకాటంలో పడిపోతుంది ప్లీజ్."
"దాన్దేముందమ్మా- ఆ టైమ్ పక్కనే ఇది వేసేస్తే సరి" అంటూ అతడు జైలు గడియారం చూసి టైమువేసి, లేచి- "పదమ్మా" అన్నాడు.
ఆమె గుండెలో రాయి పడింది, ఈ ముసలాడు పక్కనుంటే తన పని కష్టమవుతుంది. అయితే ఆమె అదృష్టం బావుంది సెల్ దగ్గరికొచ్చాక అతడు సెంట్రీతో "ఇదిగో , శర్మా. చూడవోయ్. పట్నాయక్ దగ్గర ఈమె ఇంటర్వ్యూ తీసుకుంటుందట" అని చెప్పి గ్రౌండ్ లోకి వెళ్ళాడు. ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.
విష్ణుశర్మ గూట్లోంచి రిజిష్టరు తీసి ఆమె దగ్గిర సంతకం తీసుకుని టైమ్ వేసి, పట్నాయక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆమె ముందు అనుకున్నట్టే, పట్నాయక్ ఆమెను చూసి తిరిగి రంకెలు వేస్తూ "మళ్ళీఎందుకొచ్చావ్?" అని అరవసాగాడు. ఇది వూహించిందే కాబట్టి ఆమె సెంట్రీకన్నా నాలుగు అడుగుఅలు ముందు అతడి దగ్గరికి చేరుకొని కంఠం తగ్గించి, "ఆవేశపడకండి. మీరు కలలో కూడా వూహించలేని ఒక విషయం చెప్పడం కోసం వచ్చాను" అంది. అంతకన్నా ఎక్కువ మాట్లాడటానికి ఆమెకు టైమ్ దొరకలేదు. ఈ లోపులో వెనుకనుంచి సెంట్రీ వచ్చాడు.
ఎంతైనా అతడో సైంటిస్టు. తెలివైనవాడు. వెంటనే అతడిలో మార్పు వచ్చింది. వైజయంతి, తను ఇచ్చిన హింట్ ను అతడు గ్రహించినందుకు సంతోషించి, టేప్ ఆన్ చేసింది.
"మిస్టర్ పట్నయక్! నేను ఆంధ్రశోభ పత్రికనుంచి వచ్చాను. మీతో ఇంటర్వ్యూ కోసం...."
"అడగండి చెప్తాను."
"మీరు రామన్ ని హత్య చేశారా?"
"......చేశాను."
"ఒక సాటి మనిషిని హత్య చేయటం దారుణం అని మీరు భావించడం లేదా?"
"జీవితం మొత్తం ధారపోసి నేను కనుక్కున్న ట్రూబ్ టెల్లర్ తనదని అతననటం అంతకన్నా దారణం".
ఆమె సెంట్రీ వైపు తిరిగి "కొద్దిగా మంచినీళ్ళు 'మీ గ్లాసు' తో ఇస్తావా?" అని అడిగింది. ఆమె హఠాత్తుగా అలా అడిగేసరికి సెంట్రీ విస్తుబోయి తమాయించుకుని, "తప్పకుండా" అని వెళ్ళాడు.
సాలిటరీ సెల్స్ చుట్టూ విశాలమైన ప్రదేశం. అది దాటితే జైలు ఆఫీసూ వున్నాయి. సెంట్రీ మెట్టు దిగగానే వైజయంతి చటుక్కున వంగి టేప్ రికార్డర్ ఆఫ్ చేసి "మీతో ఒక ముఖ్య విషయం చెప్పడానికి వచ్చాను" అంది కాన్ స్పీక్యువన్ గా.
"అటువంటి దేమిటో వుంటుందని వూహించాను. ఏమిటి?" అన్నాడు. ఆమె తనకు తెలిసిన విషయాన్ని వివరించి చెప్పింది. రాతిపలక తొలగిస్తే వచ్చే సొరంగం గురంచీ, అతడి ముందు ఆ సెల్ లో వున్న ఖైదీ దాన్ని చివరివరకూ తవ్వి ఆఖరిలో టైములేక మానెయ్యటం గురించీ, తొందర తొందరగా.....కానీ వివరంగా, అతడికి అనుమానాలేవీ రాకుండా చెప్పింది. అతడికి అర్థంకాక ప్రశ్నలు వెయ్యటం మొదలుపెడితే ఈ లోపులో టైమ్ కాస్తా అయిపోతుంది. అతడుకూడా ఆమె చెప్తున్నంతసేపూ జాగ్రత్తగా విన్నాడు. ఆమె చెప్పటం పూర్తికాగానే లోపలికి వెళ్ళి రాతిపలకను చూసి వచ్చి, "థాంక్స్" అన్నాడు. ఆమె అతడినే ఎగ్జయిట్ మెంట్ తో చూడసాగింది. అతడి మొహంలో మాత్రం ఏ భావాలూ లేవు. "థాంక్స్.... నా కోర్కె ఒకటి మిగలిపోయింది. అది తీర్చుకోవడానికి సాయం చేశావు! నీకు నా కృతజ్ఞతలు" అన్నాడు. అతడు మాట్లాడుతూ వుండగానే కెమేరాతో ఆమె ఆ రాతిపలకని చకచకా ఫోటోలు తీసింది.
ఈ లోపులో సెంట్రీ రావడం చూసి ఆమె చప్పున టేప్ ఆన్ చేసి చాలా గంభీరంగా సంభాషణ కొనసాగించింది.
"ట్రూత్ టెల్లర్ కనుక్కున్నది మీరే అనుకుందాం. దాన్ని అతడు తనది అని ఇంటర్వ్యూలో అన్నాడే అనుకుందాం. అయితే హత్య చెయ్యటమేనా?"
లేకపోతే ఏం చెయ్యాలి? నేను ఇంకో పత్రికకి ఇంటర్వ్యూ ఇవ్వాలా? అప్పుడు రెండు పత్రికల్నీ మేం ఇద్దరం పోషించినట్టు అవుతుంది." సెంట్రీ మంచినీళ్ళతో రాగానే అతడూ ముందు టాఫిక్ లోకి వెళ్లిపోవటం గమనించి ఆమె సంతోషించి, తరువాత ప్రశ్న వేసింది.
"మీ ఆఖరి కోర్కె ఏమిటి?"
"ఆంధ్రశోభ పత్రికలో రేపటి నా వ్యాసం చూడడం."
సెంట్రీతో సహా వైజయంతి కూడా నవ్వేసింది. ఇంటర్వ్యూ హుషారుగా సాగిపోయింది. ఇంటర్వ్యూ పూర్తిచేసి ఆమె లేస్తూ, "చాలా థాంక్స్ మీరు చెప్పిన ప్రతీ మాటా ఆంధ్రశోభ పత్రిక పాఠకులకు అందిస్తాము. మీకు మా సానుభూతి కూడా! మీలాంటి గొప్ప సైంటిస్ట్ ని కోల్పోతున్నందుకు మాకు చాలా విచారంగా వుంది...." అని సెంట్రీ చూడకుండా నవ్వింది. అతడికి చేతులు జోడించి "వెళ్ళి వస్తాను" అని నమస్కారం చేసి బయటికి వచ్చింది.
సెంట్రీ దగ్గరున్న రిజిష్టరులో సంతకం చేసేసి టేపు పట్టుకుని అంధ్రశోభ ఆఫీసుకి ఆఘమేఘాలమీద వచ్చేసింది.
తను సాధించింది తక్కువ విజయమేమీకాదు అని ఆమెకు తెలుసు. ఈ విషయం అంతా స్వామినాయుడికి తెలిస్తే అతడు చాలా సంతోషిస్తాడు.
ఆమె అనుకున్నట్టే జరిగింది.
ఆమె స్వామినాయుడి ఛాంబర్ లోకి ప్రవేశించి అతడు కూర్చోమనకుండానే కుర్చీ లాక్కొన్ని కూర్చుని చెప్పటం ప్రారంభించింది. తను మొదట ఎలాగో పట్నాయక్ ని కన్విన్స్ చేసి ఇంటర్వ్యూ ప్రారంభించటం, మధ్యలో అతడు రెచ్చిపోవటం ఇంటర్వ్యూ నిరాకరించటం, తనకి చిరంజీవి దగ్గిరకి వెళ్ళాలానే ఆలోచన రావటం, అక్కడి కెళ్ళాక అతడు జైల్లో సొరంగం గురించి చెప్పటం......తాను మళ్ళీ పట్నాయక్ కి ఆ విషయం చెప్పటం.....ఇదంతా వివరించింది.
మొదట్లో మామూలుగా వింటున్న వాడల్లా ఆమె ఆవిషయంలోకి వెళ్ళగానే ముందుకు వంగాడు స్వామినాయుడు. ప్రళయం వచ్చిన మామూలుగా వుండే అతడి మొహం, ఒక అనూహ్యమైన విషయం వింటున్నట్టు మారిపోయింది. కళ్ళు సన్నవయ్యాయి. చుట్ట ఆష్ ట్రేలో అలాగే వెలుగుతూంది. దాని సంగతే మర్చిపోయాడు.....అయితే స్వామినాయుడి మనసులో ఏముందో తెలుసుకోగలగటం అంత సులభం కాదు.
ఆమె చెప్పడం పూర్తిచెయ్యగానే అతడు ఒకే ఒక మాట అన్నాడు "కంగ్రాచ్యులేషన్స్ అమ్మాయ్" అని.
అతనుపడిన కష్టాన్ని, తను తీసుకున్న స్పాంటేనియస్ నిర్ణయాల్నీ అతను గుర్తించినందుకు ఆమె సంతోషించింది. చిన్న పిల్ల ఒక అద్భుతాన్ని చూడబోయే ముందు ఏ రకమైన ఉత్సాహాన్ని అనుభావిస్తుందో అదే రకమైన ఉత్సాహాన్ని ఆమె పొందుతూంది.
చాలాసేపు అతడు మౌనంగా వున్నాడు.
ఆ తరువాత సాలోచనగా అన్నాడు.
"మనం ఈ సొరంగం తాలూకు ఫోటో మాత్రం వేయ కూడదు. అలా వేస్తే, అంత రాత్రికి రాత్రే ఫోటో ఎలా వచ్చింది అని అడుగుతారు. సొరంగం సంగతి మాత్రం పూర్తి వివరాలతో రాయొచ్చు. మన ఇన్ఫ్ ర్మెంట్ (ప్రతి పత్రిక్కీ ఇన్ఫ్ ర్మెంట్ వుంటాడు- వివరాలు అందించటానికి) ఈ వివరాలు ఇచ్చాడని చెప్పవచ్చు. అయినా మనకి ఈ తప్పించుకుపోవటం అన్నన్యూసే చాలు మిగతా పత్రికకన్నా ఒకరోజు ముందే ఈ వార్త ప్రచురించగలం. ఎందుకంటే వార్త రావటం కన్నా ముందే, మనం ఈ మాటర్ కంపోజు చేసి పెట్టుకుంటాం కాబట్టి....."
వైజయంతి అతడివైపు ఎడ్మైంగ్ గా చూసింది.
అందుకే అతడు స్వామినాయుడయ్యాడు!
తరువాత పనులు తొందర తొందరగా జరిగిపోయాయి.
ఈ విషయం ఎక్కువమందికి తెలియటం బావోదని స్వామినాయుడు అనటంవల్ల, మొత్తం బాధ్యత అంతా తన భుజాలమీద వేసుకుంది.
రేపు ఉరి తీస్తారనగా, ఖైదీని తడవ తడవకి వచ్చి చూస్తూ వుంటాడు అధికారి. అందువల్ల సొరంగం నుంచి ఆ సమయానికి బయటికి వచ్చి కనబడుతూ వుండాలి. చిరంజీవి చెప్పిన లెక్కప్రకారం తవ్వకం పూర్తిఅవడానికి ఇంకా గంట పడుతుంది. అంటే దాదాపు మూడు విడతదలుగా తవ్వకం సాగించాలి. పదకొండింటికి అతడు పని ప్రారంభిస్తానన్నాడు. కాబట్టి ఒంటిగంటకి అతడు బయటపడతాడు. ఈ విషయం దాదాపు పావుగంటలో జైలంతా పాకిపోతుంది. ఒంటి గంటన్నరకి తమకి ఈ వార్తా వచ్చినా చాలు మాటరు మొత్తం ప్రింటింగ్ కి పంపెయ్యొచ్చు. మిగతా పత్రికల విలేఖర్లకు తెల్లవారేవరకూ ఈ వార్తా తెలియదు.
అంతలో ఆమెకు మరో ఆలోచన వచ్చింది.
పట్నాయక్ ని ఉరి తీసివేసిన తాలూకు వార్త ధృవీకరణ కాకముందే ప్రచురిద్దామా అన్న ఆలోచన అది.
ప్రజలకు ఎలాగూ పేపరు ఏడింటికే వెళుతుంది కాబట్టి తెల్లవారి ఉరి గురించి అప్పుడే వార్త పేపరులోకి వచ్చేసిందా అని చాలామందికి అనుమానం రాదు. ఈ ఆలోచన బాగానే వుందికానీ పొరపాటున ఆఖరి క్షణం పట్నాయక్ ఉరి రద్దయితే ప్రజలు దుమ్మెత్తిపోస్తారు. అది ఎధిక్స్ కూడా కాదు.
గడియారం మూడు కొడుతూ వుండగా ఆమె మళ్ళీ జైలుకి ఫోన్ చేసింది. ఇంటరెస్టు పనికిరాదు" అని పెట్టేసింది.
ఆమెకి మరేం చెయ్యాలో తోచలేదు. ఇంత ఓటమిని ఆమె ఎప్పుడూ ఎదుర్కోలేదు.
మొత్తం పట్నాయక్ గురించిన వార్తా ఏదీ లేకుండా తెల్లవారే పేపరు ప్రింటింగ్ కి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున ఉరితీస్తూంటే జైలు బయట నాలుగున్నర నుంచే ప్రజలూ, విలేఖరులూ గుమిగూడతారని తెలుసు. దానికి తాను వెళ్ళనక్కర్లేదు. మామూలు విలేఖరి ఎవరు వెళ్ళినా ఫర్లేదు. చచ్చిపోయే ముందు ఏమన్నాడో.ధైర్యం ఉన్నాడా లేదా- వగైరా నానన్సెన్సికల్ వార్తలు సేకరించటానికి తప్ప ఇంకెందుకూ పనికిరాదు-అలా వెళ్ళటం.
ఆమెకు నిద్ర ముంచుకు వస్తూంది.
అదీగాక మరుసటిరోజు స్వామినాయుడి మొహం చూడాలంటేనే సిగ్గుగా వుంది. అతడు తన మీద ఎంతో నమ్మకం ఉంచి అన్నీ తనకు అప్పజెప్పాడు. చివరికి, వార్తా రావడం కన్నా ముందే కంపోజింగ్ కూడా చేయించాడు. అటువంటి నమ్మకాన్ని తాను కూలదోసింది.
ఆమె లేచి ఇంటికి వెళ్ళిపోవటానికి ఆయత్తమయింది. అప్పుడొక వార్తా ఫ్లాష్ అయి, ఎండిన అడవిలో దావానలంలా ఆఫీసు నలువైపులా గప్పున వ్యాపించింది. ఒక్కసారిగా ఆఫీసంతా గగ్గోలాయి పోయింది. పోలీసుస్టేషను నుంచి మామూలుగా వార్తలందించే ఇన్ఫ్ ర్మెంట్ ఈసారి ఆంధ్రశోభ పత్రిక్కి మరింత వేగంగా, మరింత కంగారుతో ఈ వార్త అందించేడు.
తన స్వగృహంలో తెల్లవారుఝామున మూడింటికి స్వామినాయుడు దారుణంగా హత్య చేయబడ్డాడని, శరీరంలో అయిదు కత్తి పోట్లతో అక్కడికక్కడే మరణించాడని!
ఆ షాక్ నుంచి తేరుకోవటానికి ఆమెకి చాలాసేపు పట్టింది.
మనసంతా మొద్దుబారినట్టు అయిపోయింది. ఏమి ఆలోచించటానికీ తోచలేదు. ఆమెకి స్వామినాయుడు అంతగా తెలీదు. ఒక యజమానిగా మాత్రమే నాలుగుసార్లు కలుసుకుంది. ఇదిగో ఈ పట్నాయక్ వ్యవహారంలోనే రెండు మూడుసార్లు కలువవలసి వచ్చింది. మామూలుగా అయితే అతడి మరణం ఆమెని బాధ పెట్టకపోవును. కానీ పట్నయాకే ఈ హత్యా చేసేడని ఆమెకి అనిపిస్తూంది. పట్నాయాక్ తప్పించుకోకపోయివుంటే స్వామినాయుడు మరణించి ఉండేవాడు కాదు. ఒక రకంగా తనే ఈ హత్యకు కారణం! ఈ ఆలోచనే ఆమెని బాగా బాధపెట్టేది........భయపెట్టేది.
ఈ రోజు ప్రొద్దున్న ఏడింటికి అధికార పూర్వకంగా పట్నాయక్ తప్పించుకుపోయిన సంగతి జైలు అధికారులుధృవీకరించారు. అప్పటివరకు ఈ వార్తని నొక్కిపెట్టి శతవిధాల పట్నాయక్ ని పట్టుకోవటానికి ప్రయత్నించారు వాళ్ళు. స్వామినాయుడు హత్య వార్తా, పట్నాయాక్ తప్పించుకుపోయిన వార్త దాదాపు ఒకేసారి వచ్చినయ్.
ఈ రెండింటికీ సంబంధం వున్నదని తెలిసిన ఒకే ఒక వ్యక్తి వైజయంతి. మొట్టమొదటి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు అతడన్న మాటలు, "నా దొక్కటే కోర్కె- ఒకర్ని చంపటం" అన్న మాటలు ఆమె మర్చిపోలేదు. కానీ పట్నాయకే స్వామినాయుడిని హత్యచేసి వుంటాడని ఆమెతోపాటూ భావించిన ఇంకో వ్యక్తి కూడా ఒకరున్నారు.
అతడు జార్జి.
ఇన్ స్పెక్టర్ జార్జి.
* * *
ఒక గొప్ప వ్యక్తి మరణిస్తే ఆ రంగంలో పని స్తంభించి పోతుందనీ, అస్తవ్యస్తం అవుతుందనీ అనుకుంటారు గానీ అటువంటిదేమీ జరగదు.