ఈ ఆలోచన వచ్చాక ఇక ఆమెకి ఒక ఇబ్బంది మాత్రమే మిగిలిపోయింది. మరణానికి ముందు ఖైదీ భావాలు ఎలా వుంటాయి అన్నది.
రేప్రోద్దున చచ్చిపోతాననగా ఈ రోజు రాత్రంతా ఖైదీ దేనిగురించి ఆలోచిస్తాడు?
ఆమె ఊహకి అందలేదు.
అంతలో మరో ఆలోచన వచ్చింది. ఆఖరి నిమిషంలో ఉరి తప్పిపోయిన ఖైదీని పట్టుకుని అతడిని ఇంటర్వ్యూ చేసి, అది పట్నాయక్ ఇంటర్వ్యూగా వేస్తే? (పట్నాయక్ ఎలాగో రేపటికి చచ్చిపోతాడు కాబట్టి ఈ ఇంటర్వ్యూ తనది కాదని అనలేడు). తను చేస్తున్నది తప్పుకూడా కాదు. ఆప్ట్రాల్ పట్నాయక్ మరణం మీద ప్రజల సానుభూతి కోసమే ఇదంతా చేస్తూంది. ఈ ఆలోచన రాగానే ఆమె హుషారుగా కుర్చీలోంచి లేచి ఫోన్ దగ్గిరకి నడిచింది.
క్రమక్రమంగా తనెటువంటి భయంకరమైన సాలెగూడులోకి ఇరుక్కో బోతూందో ఆమెకి తెలియటంలేదు.
ఫోన్ చెయ్యబోయేముందు ఆమె మరొకసారి తను చెయ్యబోతున్న దానిలో ఏ రిస్క్ అయినా వుందేమో అని ఆలోచించి, అటువంటిదేమీ లేదని సంతృప్తిపడింది. ఆ తర్వాత డయల్చేసింది. అట్నుంచి "హలో" అని వినిపించింది.
"ఎవరూ? చిరంజీవిగారా?"
"ఎస్."
"నేను ఆంధ్రశోభ ఆఫీసునుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వైజయంతి. మీ దగ్గర్నుంచి కొంచెం ఇన్ ఫర్మేషన్ కావాలి."
"ఏ రకమైన ఇన్ ఫర్మేషన్?"
"వెల్....." అని ఆమె ఒక్కక్షణం తటపటాయించి, "నేను వచ్చి స్వయంగా మాట్లాడితే బావుంటుందని అనుకుంటున్నాను" అంది.
"సరే, అయితే సాయంత్రం రండి. ఆరింటికి....." అని టైమ్ యిచ్చి, ఫోన్ పెట్టెయ్యబోయాడు. ఆమె కంగారుపడి, "ఆగండి, ఒక్కక్షణం. ఇది చాలా అర్జెంటు. నాకు ఎక్కువ సమయం కూడా అక్కరలేదు. అరంగట చాలు" అంది.
"నేనిప్పుడుకోర్టుకి వెళుతున్నాను" అన్నాడతడు సంశయస్తూ.
"పోనీ మీరు రమ్మంటే కోర్టుకి వస్తాను."
అతడు కొద్దిగా ఆలోచించి "వద్దులెండి. ఇంటికే రండి. కానీ తొందరగా రండి" అన్నాడు. "అయిదు నిమిషాల్లో వస్తున్నాను" అని ఫోన్ పెట్టేసింది.
ఆమె తన మోపెడ్ మీద అతడి ఇల్లు చేరేసరికి సూర్యుడు దాదాపు నడినెత్తి మీదకి వస్తున్నాడు. తొందర తొందరగా ఈ ఇన్ ఫర్మేషన్ తీసుకొనిమ్ వ్యాసం వ్రాసి, కంపోజు చేయించి, ప్రింటింగ్ కి ఇవ్వాలి. టైమ్ చాలా తక్కువ. ఇంత తక్కువ టైమ్ లో ఇదంతా అవగలదా అని ఆమె భయపడింది. అన్నిటికన్నా ముందు అసలు చిరంజీవి తను అడిగిన డానికి వప్పుకుంటాడా, లేదా అన్నది ప్రశ్న.
ఆమె వెళ్ళేసరికి అతడు ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాక "చెప్పండి మీకేం కావాలి?" అని అడిగాడు.
ఆమెకి ఎలా ప్రారంభించారో తెలియలేదు.
"రేపు..... రేపు పట్నాయక్ అనే వ్యక్తిని ఉరి తీస్తున్నారు" అంది ప్రారంభసూచకంగా.
"అవును. పేపరులో చదివాను. అతడి తరుపున వాదించాలంటే..... ఈ ఆఖరి క్షణంలో కష్టం."
"ఉహు, నేనందుకు రాలేదు."
"మరి?"
"మీరు కొంతకాలం డెత్ సెల్ లో వున్నారు. ఉరికి దాదాపు పది నిమిషాల దూరం వరకూ వెళ్ళారు."
చిరంజీవి నవ్వి, "అవును. ఉరి రద్దుకోసం" అన్నాడు. ఇంతలో ట్రేలో రెండు కాఫీలు వచ్చాయి.
"నా మిసెస్! అర్చన, డాక్టర్ అర్చన."
"హల్లో."
"హల్లో" అని కాఫీ కప్పు అందుకుంటూ "థాంక్స్" అంది వైజయంతి ఆమెకి డైరెక్టుగా సంభాషణలోకి వెళ్ళటం ఇష్టం లేకపోయింది. వచ్చిన పని చెప్పి అవతలివ్యక్తిని ఒప్పించటం అంత సులభమైన విషయమేమీ కాదు. అందుకే సంభాషణ మరో రకంగా ప్రారంభించింది. "ఎంతవరకు వచ్చింది మీ ఉరిశిక్ష రద్దు ప్రయత్నం?"
"సెక్షన్ 320ని కాదుగానీ, 303 ఇకమీద చెల్లదని సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఇచ్చింది. జడ్జీలందరూ దీనికి యునానిమస్ గా ఓటు వెయ్యటం మాకెంతో ఉత్సాహానిచ్చింది. ఐ మీన 'మేము' అంటే ఉరి శిక్ష రద్దుకోసం ప్రయత్నించే వాళ్ళం......" అన్నాడు.
"అవును. ఇది జరిగి ఇంకా పదిరోజులు కూడా కాలేదనుకుంటాను కదూ! మొన్నే పేపరులో (8 ఏప్రిల్ -1983) చదివాను. భారత న్యాయశాస్త్రంలో 1860 నుంచీ వస్తూన్న 303 సెక్షన్ ఇక చెల్లదనీ, యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తూన్న వ్యక్తి ఎవరన్నా హత్య చేస్తే అతడికి తప్పనిసరిగా ఉరిశిక్ష వెయ్యాలన్న రూలు ఇకనుంచీ వుండదనీ జడ్జిమెంటు ఇచ్చారు. సెక్షన్ 303 అధ్యాయం ముగిసిపోయింది కాబట్టి తొందరలోనే 302 కూడా మారుతుందని ఆశిద్దాం. అలాగే జరిగినప్పుడు మాత్రం మీరు మా అందరికీ పార్టీ ఇవ్వాలి"
చిరంజీవి ఆమెవైపు అభినందిస్తున్నట్టు చూసి, "మీరు లా చదివారా?" అడిగాడు.
"మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు తెలుసుకోవడం కోసం ఆ సబ్జెక్ట్సు అన్నీ చదువుకోనక్కరాలేదని నా ఉద్దేశ్యం" అంది. నిజానికి ఆమెకి చిరంజీవిని కలుసుకోవాలనే ఆలోచన రాగానే, అతడి కిష్టమయిన సబ్జెక్టు గురించి చదివింది. అందుకే అతని దగ్గిరకు రావటానికి పది నిముషాలు ఆలస్యం అయింది. ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ పైకి తీసుకొస్తాయి. విలేఖర్లకి వుండవలసిన మూడో లక్షణం ఇది.
అతడు సోఫాలో మరింత రిలాక్స్ డ్ గా కూర్చుంటూ "చెప్పండి ఏమిటి విషయం?" అని అడిగాడు.
ఆమె తన పేపరు తరుపున ఇంటర్వ్యూ కోసం జైలుకి వెళ్ళటం, పట్నాయక్ సగం ఇంటర్వ్యూ ఇచ్చాక ఆవేశపడటం, ఇంటర్వ్యూ సగంలో ఆగిపోవటం- లాటి వివరాలన్నీ చెప్పింది. చెప్పి అన్నది, "మాకు కావాల్సింది ఒక ఖైదీ జీవితపు ఆఖరి క్షణాల్లో అతడి మనో సంచలనం గురించిన వివరాలు. నిజానికి వాటిని వూహించి మేమే వ్రాయొచ్చు. అది నాకిష్టంలేదు. కొంత బేస్ వుంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం. అందుకోసమే మీ దగ్గిరకి వచ్చాను. ఒకవేపు ఉరికి ఏర్పాట్లు జరుగుతూ వుంటే, మరోవేపు మీ మానసిక భావాలు ఎలా ఉన్నాయో కాస్త చెప్తే డానికి మరికాస్త మసాలా మేము జల్లి, దాన్ని పట్నాయక్ కి అన్వయించి వ్రాస్తాం. అతడు సగం చెప్పిన ఇంటర్వ్యూ పూర్తిచేస్తే- ఆఫ్ కోర్స్ మీ సహాయ సహకారాల్తో మా ఆశయం నెరవేరినట్టే" అంటూ నవ్వేసింది.
చిరంజీవి కూడా నవ్వేసి, "బాగానే ఉంది మీ ఆలోచన" అన్నాడు.
ఆమె ఆశగా "మరి చెప్తారా" అని ముందుకు వంగింది.
"చావుకు ముందు మిగతా ఖైదీల మానసిక స్థితి నాకు తెలియదు గానీ, నాడి మాత్రం చాలా చిత్రమైన స్థితి. ఇంతవరకూ ఎవరికీ చెప్పలేదు దాన్ని."
"ఏమిటా చిత్రమైన స్థితి?"
"ఉరికంబం ఎక్కాలా, సెల్ నుంచి బయటకు తవ్వబడివున్న సొరంగం గుండా బయటకు పారిపోవాలా అన్నది"
ఆమె అదిరిపడి- "ఏమిటి మీరంటున్నది" అన్నది విస్మయం నిండిన స్వరంతో. ఆ గది గిర్రున తిరుగుతూన్నట్టు అనిపించింది.
అతడు ఆ రాత్రిని గుర్తు తెచ్చుకుంటూన్నట్టు కళ్ళు మూసుకుని అన్నాడు. "ఉరి తీయవలసిన తేది కన్ ఫర్మ్ కాగానే విడిగా మరో సెల్ కి మారుస్తారు. మొదటిరోజు రాత్రి సెల్ లో గట్టుమీద వెల్లకిలా పడుకుని ఏదో ఆలోచిస్తూంటే అకస్మాత్తుగా నా దృష్టి పై కప్పు మీద పడింది. కిటికీలోంచి పడే వెన్నెల్లో సన్నటి అక్షరాలూ స్పష్టంగా కనబడసాగేయి. ఏమిటా అని లేచి చూశాను. ఇదే సెల్ లో నా క్రితం ఖైదీ వ్రాసిన అక్షరాలూ అవి. 'కుడివైపు రాతి పలకని తొలగిస్తే, ఒక సొరంగం కనబడుతుంది. ఈ రోజు వరకూ దాన్ని తవ్వుతూనే వున్నాను, అని వ్రాసి వుంది. నేను వూహించని సంఘటన అది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక రాతిపలకని తొలగించి చూశాను. చాలా దూరం వరకూ వుందా తవ్వకం. నా ముందు ఆ సెల్ లో వున్న ఖైదీ ఎవరో పాపం, జీవించటం కోసం చివరి రాత్రివరకూ ప్రయత్నించి చివరికి ఉరికంబం ఎక్కాడన్నమాట. తరువాత వచ్చే ఖైదీకోసం ఈ ఉత్తరాన్ని రాతిపాలక మీద వ్రాసి ఆ రహస్యాన్ని మాత్రం కడుపులో దాచుకుని చచ్చిపోయాడు. నేను మాత్రం డానికి అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. నా కెలాగో ఆఖరి క్షణంలో ఉరి తప్పిపోతుందని తెలుసు కాబట్టి ఆ విషయం మర్చిపోయాను. ఆఖరిక్షణంలో అంతా ఇక అదే జ్ఞాపకం వచ్చింది. కానీ, ధైర్యం చేయలేకపోయాను టైమ్ కూడా సరిపోదు అప్పటికి" అంటూ నవ్వి "కావాలంటే ఈ విషయం వ్రాసుకోండి. గొప్ప సెన్సేషన్ అవుతుంది చావుకు ముందంతా నేనీ సొరంగం గురించి ఆలోచించాను......" అని, కానీ నా పేరు బైటకు రానీయవద్దు"
తెల్లబడిన మొహంతో అవాక్కయి ఆమె అతడినే చూస్తూ వుండిపోయింది. ఆమె మెదడులో తరంగాల్లాటి ఆలోచనలు హమ్మని వినిపిస్తున్నాయి.
కాని ఆమె ఆలోచిస్తున్నది వేరు.
పట్నాయక్ చచ్చిపోయి, ఈ సొరంగం గురించి వ్రాస్తే అందులో గొప్ప ఏముంది? 'ఈ సొరంగం గురించి అతడికి తెలిస్తే, పూర్తిగా తవ్వేసి అందులోంచే పారిపోయేవాడు కదా!' అన్న అనుమానం ఏ మాత్రం ఇంగితజ్ఞానం వున్న పాఠకుడికైనా వస్తుంది!! ఖైదీ చచ్చిపోయాక సోరంగానికి విలువ ఏమీ వుండదు.
ఖైదీ తప్పించుకుంటేనే వుంటుంది.
ఈ ఆలోచన రాగానే ఆమెకి పరిసరాలు మరిచి ఎగ్జయిట్ మెంట్ తో ఎగిరి గంతెయ్యాలని అని పించింది.
పట్నాయక్ తప్పించుకుని, అతడెలా తప్పించుకున్నాడో తెలియక పోలీసులు తబ్బిబ్బు అవుతుంటే- ఆ సొరంగం విషయాన్ని(వీలైతే ఫోటోల్తో సహా) ప్రచురిస్తే?
అది సెన్సేషన్!
అప్పుడే మిగతా పత్రికలకీ, ఆంధ్రశోభకీ తేడా పాఠకులకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
సహజంగా ఉత్సాహవంతురాలైన ఆ అమ్మాయి ఈ ఆలోచన రాగానే చివుక్కున కుర్చీలోంచి లేచి మరి ఆలస్యం చెయ్యకుండా, అతడికి కృతజ్ఞతలుచెప్పి మోపెడ్ దగ్గరికి దాదాపు పరుగెత్తుకుంటూ వెళ్ళింది.
ఆమె జైలు చేరుకునేసరికి పావుగంట పట్టింది. అయితే ఆమె అనుక్కున్నంత సులభంగా పని అవలేదు. జైలరు అభ్యంతరం చెప్పాడు. "గంట క్రితమే కదా వచ్చి వెళ్ళారు. మళ్లీ ఏమిటి?" అన్నాడు.
"ఐయామ్ సారీ అండీ. కొన్ని ప్రశ్నలు అడగటం మర్చిపోయాను" అంది.
"ఐయామ్ ఆల్సో సారీ. ఒకసారి ఇచ్చిన అనుమతి పత్రం మీద ఒకేసారి పంపుతాం" అని నిక్కచ్చిగా అన్నాడు. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. జైలర్ చాలా స్ట్రిక్టుగా కనబడ్డాడు. ఆమె హతాశురాలై కుర్చీలోంచి లేచి బయటికి వచ్చేసింది.
కానీ అంత తొందరగా ఆమె వదిలి పెట్టదలచుకోలేదు. అలా వదిలిపెడితే విలేఖరి ఎలా అవుతుంది? జైలు ఆఫీసు బయటకొచ్చి హెడ్ ని అడిగింది- "జైలరుగారు ఎంతసేపు డ్యూటీ?" అని. అతడు టైము చెప్పాడు.
ఇంకా ఒక గంట.
ఆ గంటా ఆమె ముళ్ళమీదున్నట్టు గడిపింది. అంటే ఖాళీగా ఏమీ లేదు. ఇంటికి వెళ్ళి టేప్ రికార్డర్ తెచ్చుకుంది. దానికో అరగంట పట్టింది, మిగతా అరగంటా జైలు బయటే దూరంగా గేటుని చూస్తూ గడిపింది. జైలరు వెళ్ళిపోగానే ఏమీ ఎరగనట్లు ప్రవేశించింది. డిప్యూటీ వున్నాడు లోపల. అతడు వయసు మీరినవాడు. యువకులకన్నా వయసుమీరిన వాడిని హాండిల్ చెయ్యటం సులభం అని ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది. అమితారోగ్య ప్రదమైన చిరునవ్వుతో "నమస్కారమండీ" అంది.