Home » Dr. dasaradhi rangacharya » Sukla Yajurveda Samhitha


    అలా కొట్టిన కట్టెను యజ్ఞ  వాటికకు చేర్చాలి. అందుకు బండి కావాలి. బండి చేసే దారు శిల్పి - వడ్రంగి కావాలి. వాటికి కట్టే పశువులు, వాటి పోషణ, శిక్షణ నిచ్చేవారు కావాలి.

    యజ్ఞకుండం, సమిధలకు ఇంత పరిశ్రమ అవసరం అయింది.

    యజ్ఞకుండంలో అగ్ని రగల్చాలి. ఆహుతులకు నేయి అంటే - గోవు, వాటి పోషణ, పాలు పెరుగు, పెరుగు చిలకడం, వెన్నతీయడం, వెన్న కరిగించడం- అప్పుడు కాని ఘృతం రాదు.

    యజ్ఞం చేయడానికి హోతలు కావాలి. హోతలను సిద్ధం చేయడానికి గురుకులాలు, వాటి నిర్వహణ  జరగాలి. వేదం తెలిసిన గురువులు కావాలి. ఆసక్తిగా నేర్చుకునే శిష్యులు కావాలి.

    ఇదంతా అగ్నికుండం వరకే. యజ్ఞానికి ఇంకా అనేకం కావాలి. యజ్ఞం జరిగే చోట విద్వత్సభలు జరుగుతాయి. చర్చలు, గోష్ఠులు, మీమాంసలు, తర్కాలు పర్యవసానంగా శాస్త్రాలు! నేటి సెమినార్లు, కమిటీలు యజ్ఞ సభలనుండి నేర్చినవే!

    ఇలా చెపుతూ పోతే ఒక గ్రంథం అవుతుంది. కాని యజ్ఞం మానవజాతికి - భారతీయులకు మాత్రం కాదు - అనేకం నేర్పింది.

    1. మానవుడు వ్యక్తిగా జీవింపలేడు. అతడు బతకడానికి సంఘం, సమాజం కావాలి.

    2. మనిషి బతకాలంటే కలిసి ఉండాలి. అంతేకాదు, కలిసి పనిచేయాలి.

    3. ఏ ఒక్కడూ అన్ని పనులూ చేయలేడు. శ్రమ విభజన జరగాలి.

    4. సమాజానికి విద్య, నైపుణ్యం అవసరం. బోధన ఉత్పత్తిసాగాలి.

    5. ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవాలి. అవసరం అయినంతే వాడుకోవాలి.

    6. వ్యక్తి క్షేమం మాత్రం కాదు. సమాజ క్షేమం, సంఘ క్షేమం, విశ్వ శ్రేయస్సు, మానవ కళ్యాణం కొరకు పనిచేయాలి.

    మనం తినే ఒక మెతుకు, త్రాగే నీటి బొట్టు కోసం ఎన్నో యజ్ఞాలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతుంటాయి. వేదం ఇంత మంది శ్రమకు కర్త అయింది. గుర్తించింది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది. ఎందుకంటే దాన్ని వృధా చేయరాదు. ప్రతి అన్నం ముద్దకు, గుటికెడు నీటికి, ఒక బట్ట పీలికకు ఎంతో కథ ఉంది!

    'యజ్ఞం' అంటే అగ్నికుండం, ఆహుతులు, హవిస్సులు, హోతలు మాత్రమే కాదు. ఇవి సంకేతాలు మాత్రమే! మానవ కళ్యాణం కోసం జరిగే ప్రతి బృహత్కార్యమూ యజ్ఞం అవుతుంది. దానికి కుండం, సమిధలు, అగ్ని, ఘృతం, హోత అక్కర లేదు! మానవ కళ్యాణం, విశ్వ శ్రేయస్సు ముఖ్యం,

    అహంకారంతోనూ, దర్పంతోనూ, దంభంతోనూ, ధనార్జన కోసం చేసే యజ్ఞం యజ్ఞం అనిపించుకోదు.

    యజ్ఞం -హింస

    యజ్ఞ యాగాదుల్లో పశుహింస విధించబడింది. హయమేధం, అజమేధం, ఇలాంటి యజ్ఞాలు.

    పాశ్చాత్య విద్వాంసులు, వేదంలో మహత్తమ విషయాలను వదిలి - కేవలం యజ్ఞాల్లోని పశుహింస ఆధారంగా 'వేదం ఆర్యుల ఆటవిక జీవనం' అని నిశ్చయించారు. అంతే  కాదు భారతీయ మేధావులతో నమ్మింపచేశారు.

    పాశ్చాత్య విద్వాంసులు వేదాన్ని అధ్యయనం చేశారు. కొంతవరకు వారి పరిథిలో అర్థం చేసుకున్నారు. వారు చేసిన కువ్యాఖ్యలు, తెలియక చేసినవి అవుతే అర్థం చేసికోవచ్చు. మన్నించనూ వచ్చు. కాని, వారు అలా చేయలేదు. భారతీయులు బానిసలు, వారు ప్రభువులు, బానిసలు తమకన్న కొంచెపువారు కావాలి. అలాంటి భావం వారిలో కలగాలి. అందుకు ఒక వ్యూహాత్మకంగా భారత సంస్కృతి మీద దాడి చేశారు. భారత మేధావులను నమ్మించారు. యూనివర్సిటీ విద్య మాత్రం నేర్చినవారు ఈనాటికీ పాశ్చాత్య వాదాన్నే ప్రగతి వాదంగా నమ్ముతున్నారు.

    భారతదేశానికి స్వాతంత్ర్యం అనేది వచ్చి అర్ధ శతాబ్దం దాటిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు అధికారానికి వచ్చాయి. కాని ఏ ఒక్కరూ భారతీయ సంస్కృతి గురించి కనీసం ఆలోచించలేదు. ఎవరికి వారు తమ శక్తి వంచన లేకుండా పాశ్చాత్య సంస్కృతికి దాసోహం అన్నారు. ఈ దేశంలో - ప్రస్తుతం -ఏదీ స్వదేశీ మిగల్లేదు. T.V ఆధారంగా పాశ్చాత్య సాంస్కృతిక దాడులు - Cultural Invasions సాగుతున్నాయి. కనీసం అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరగడం లేదు. పిల్లలూ, యువత టీవీని దేవుని వలె విశ్వసిస్తున్నారు. వారికి 'ఇండియా' అంటే తప్ప 'భారతం' అంటే అర్థం కావటం లేదు!

    వేదంలో పాశ్చాత్యులు ఈనాటికీ కనీ, వినీ ఎరుగని అంశాలున్నాయి. వీటిని విడిచి కేవలం జంతు వధ మీదనే ఆధారపడి వేదాన్ని అపఖ్యాతి పాలు చేయటం ఎందుకు? అంతర్గత ప్రణాళిక ప్రకారం భారత ధర్మాన్నీ, భారత తాత్వికతను కించ పరచడం ప్రధాన ఉద్దేశ్యం.

    పాశ్చాత్యుల ఆహారమే - నేటికీ - గొడ్డు మాంసం- Beef. పంది మాంసం pork  అందుకు వారు ప్రతి రోజు లక్షలాది పశువులను వధిస్తున్నారు. పశువధ మాత్రమే ఆటవికం అవుతే వారు తమను అత్యంత నాగరకులం అని ప్రకటించుకోవడం బూటకం! వారు వాస్తవికంగా నేటికీ ఆటవికులే!

    కాని అది సరియైన నిర్ణయం కాదు. ఆహారపు అలవాట్లు మాత్రం ఒక నాగరకత కాదు అందుకు ఇంకా ఎన్నో కారణం అవుతాయి.

    భారతీయులు వేదకాలంలో మాంసాహారులు. అనంతర కాలంలో వారు శాకాహార ప్రాశస్త్యం గుర్తించారు. పాశ్చాత్యులు ఇంకా గుర్తించాల్సి ఉంది.

    వేదకాలంలో స్వంతానికి కాక్ సంఘానికి ఉపయోగపడినపుడు యజ్ఞంలో పశువధ చేశారు. ఆహారం కోసం జంతువును వధించడం తప్పదు. దానిని దేవతలకు అర్పించి భుజించడం ఒక విశేషం. యజ్ఞం ఆ విశిష్టతను సంతరించుకుంది.

    వధ వేరు - బలి వేరు

    యజ్ఞంలో జంతువును వధించడం కాదు, బలి ఇవ్వడం జరిగింది. బలి అంటే త్యాగం. దేవతలు మనకు అనేక ఉపకారాలు చేస్తున్నారు. వారికి ప్రత్యుపకారం అసాధ్యం. లాంఛనంగా వారికి ఏదైనా అర్పించాలి అనిపిస్తుంది. ఏమి అర్పించగలం? లాంఛనంగా జంతువును అర్పిస్తాం.

    తన ఆహారానికి చంపడానికీ, దేవతకు అర్పించడానికి, బలి ఇవ్వడానికీ చాలా అంతరం ఉంది. వధించడం తన కోసం. బలి కృతజ్ఞతా పూర్వకం!

    వేదంలో 'స్వాహా' అనే పదం వస్తుంది. ఇది సుమారు 'అంకితం' , 'అర్పణం' అనే అర్థంలో వస్తుంది.

    "భూపతయే స్వాహా - భువన పతయే స్వాహా భూతానాం పతయే స్వాహా"

    భూమి స్వామికి అర్పణ. లోకముల స్వామికి అర్పణ. ప్రాణుల స్వామికి అర్పణ.

    ఏమి అర్పించాలి?

    'స్వాహా' అనే పదంలో స్వ + ఆ+ హా  అనే అక్షరాలున్నాయి. 'స్వ' తనకున్న + ఆ సాంతం + హా అర్పిస్తున్నాను అని అర్థం.

    తనకు ఉన్నది సాంతం అంటే ఆత్మ. దానిని అర్పించడం ఆత్మార్పణం అవుతుంది.

    అందరూ ఆత్మార్పణం చేయలేరు.  అందరూ ఆత్మార్పణం చేస్తే సమాజం  నిలువదు. కాబట్టి ఆత్మార్పణానికి ప్రత్యామ్నాయంగా జంతుబలి.

    సకల ప్రాణులతో మమేకం కావడం స్వాహా అవుతుంది. సకలమూ తానే అనుకోవడం ఆత్మవత్సర్వ భూతాని స్వాహా అవుతుంది. సర్వంఖల్విదం బ్రహ్మ, తనలో భగవంతుని దర్శించడం 'అహం బ్రహ్మస్మి' అనుకోవడం స్వాహా అవుతుంది.

    పాశ్చాత్యులు 'స్వాహా' అంతస్తును - మరొక సహస్రాబ్ది తరువాత సహితం అందుకొనజాలరు. గురివింద తన క్రింది నలుపును గుర్తించజాలదు.

    'బలి' ఒక్క వేదానికీ, ఒక్క భారత ధర్మానికి మాత్రం సీమితం కాదు. భారత జాతి, జంతుబలికి బదులు - కొబ్బరి కాయ  సమర్పించుకునే ఉన్నత దశకు వచ్చింది. నారికేళంలో హింసలేదు. రక్తం బదులు నీరు ప్రవహిస్తుంది.

    'బైబిల్' లో అబ్రహం - తన ఏకైక పుత్రుడు - ఇసాక్ ను బలి సమర్పించబోయే వృత్తాంతం ఉంది.

    Chapter 22
   
    "9. And they came to the place which God had told him of; and Abraham built - an altar there, and laid the wood inorder, and bound Issac his son, and laid him on the altar upon the wood.

    10. And Abraham stretched forth his hand, and took the knife to slay his son.

    11. And the Angel of the Lord called unto him out of heaven, and said, Abraham, Abraham : and he said Here am I.

    12. And he said, lay not thine hand upon  the lad, neither do thou any thing unto him.....

    13. And Abraham lifteup his eyes, and looked, and behold behind him a ram, and offered him up for a burnt offering in the stead of his son"

    భగవంతుడు అబ్రహం కొడుకును బలికోరాడు. అబ్రహం కొడుకును బలి ఇవ్వదలచాడు, కట్టి ఎత్తాడు, ఇంతలో ఆకాశవాణి పలికింది.

    "నీ భక్తికి మెచ్చాం. కొడుకును బలి ఇవ్వొద్దు"

    అప్పుడు అబ్రహంకు గొర్రె కనిపించింది. దాన్ని బలిఇచ్చారు. Old Testament నంతా ఖురాను నమ్ముతుంది. ఈ సందర్భంగానే ముస్లిములు 'బక్రీదు' పండుగ జరుపుకుంటారు.

    ఇలాంటి కథే శివభక్తులకు సంబంధించింది ఉన్నది. శ్రీయాళుడు తన పుత్రుని వధించి జంగమదేవరగా ఉన్న శివునికి అర్పిస్తాడు.

    క్రైస్తవులు, ముసల్మానులకు నరబలి ఆచారంగా ఉండింది. అబ్రహం నరబలి మాన్పించాడు. అజ బలిని ప్రారంభించాడు. గొప్ప సంస్కర్త. అందుకే అతని పేరు బైబిలు, ఖుర్, అను  లకు ఎక్కింది. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు నరబలి మాన్పించిన వృత్తాంతం ఉంది.
     శునశ్శేపుని కథ
    అంబరీషుడు అయోధ్యను పాలించాడు. అతడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఇంద్రుడు యజ్ఞ పశువును దొంగిలించాడు. పురోహితులు దొంగిలించబడిన పశువు బదులు నరపశువు కావాలన్నారు.

    అంబరీషుడు నరపశువు కోసం వెదుకుతూ సాగాడు. ఎన్నో లక్షల ఆవులు ఇస్తానన్నా ఎవడూ బాలుని అమ్మలేదు. రాజుకు ఎంత పరిమిత అధికారం ఉండేదో ఇందు వల్ల అర్థం అవుతుంది. భారత దేశ చరిత్రలో రాజు పరిపాలకుడు మాత్రమే శాసకుడు కాడు.

    అంబరీషుడు 'ఋచీకుడు' అనే ఋషి దగ్గరకు వెళ్ళాడు. ఋచీకునికి ముగ్గరు పుత్రులు. పెద్దవాణ్ణి ఇవ్వనన్నాడు తండ్రి. చిన్నవాణ్ణి ఇవ్వనన్నది తల్లి. మధ్య వాడు శునశ్శేఫుడు. తాను తండ్రికీ, తల్లికీ  పనికిరాని వాడను అనుకున్నాడు. అంబరీషునికి అమ్ముడు పోయాడు!

    సందేశం గ్రహించండి. పిల్లలు ఇద్దరే ఉండాలి. అందరికీ ఇద్దరు పిల్లలే ఉన్నట్లున్నారు. అందుకే ఎవరూ అమ్మలేదు. ఇంత స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం కుటుంబ నియంత్రణకు వాడుకొనవచ్చును కదా! మన ప్రభుత్వాలకు 'స్వాములు" పాశ్చాత్యులు. భారత ఇతిహాసాలను విననోల్లరు!

    అంబరీషుడు శునశ్శేఫుని తీసికొని బయల్దేరాడు. పుష్కర తీర్థం చేరాడు. అక్కడ విశ్వామిత్రుని ఆశ్రమం ఉంది. విశ్వామిత్రుడు శునశ్శేఫుని మేనమామ. శునశ్శేఫుడు విశ్వామిత్రుని వడిలో పడి ఏడ్చాడు. తన గోడు వినిపించాడు. తనను రక్షించమని కోరాడు. విశ్వామిత్రుని వడిలో పడి ఏడ్చాడు. తన గోడు వినిపించాడు. తనను రక్షించమని కోరాడు. విశ్వమిత్రని వడిలో పడి ఏడ్చేడు. తన గోడు వినిపించాడు. తనను రక్షించమని కోరాడు. విశ్వామిత్రుని హృదయం ద్రవించింది. విశ్వామిత్రుడు తన కొడుకులను పిలిచాడు. శునశ్శేఫుని స్థానంలో అంబరీషుని వెంట వెళ్ళమన్నాడు. వారు ఎవరూ బలి కావడానికి అంగీకరించలేదు. కుక్క మాంసం తినే చండాలురు కావాలని స్వంత పుత్రులను శపించాడు! ఇది విశ్వామిత్రుని స్పందన!! అబ్రహం పుత్రుడు ఇసాక్, శ్రీయాళుని పుత్రుడు, ఋచీకుని పుత్రుడు శునశ్శేఫుడు తండ్రుల ఆజ్ఞను పాలించారు. మానవ స్వభావానికి యుగాలతో నిమిత్తం లేదనేది సందేశం.

    విశ్వామిత్రుడు అంబరీషుని యజ్ఞం సఫలం కావాలనుకున్నాడు. శునశ్శేఫుని రక్షించాలనీ అనుకున్నాడు. అందుకు తగినట్లు ఇంద్రునకు ప్రీతి కలుగు రెండు గాథలు రచించాడు. అవి శునశ్శేఫునికి ఉపదేశించాడు. అంబరీషుడు శునశ్శేఫునితో అయోధ్య చేరాడు. యజ్ఞం చేశాడు. యూపానికి శునశ్శేఫుని కట్టాడు. శునశ్శేఫుడు తన మామ ఉపదేశించిన - ఇంద్ర సంబంధ గాథలు చదివాడు.

    ఇంద్రుడు గాథలకు ప్రసన్నుడైనాడు.
   
    పశుబలి లేకుండానే అంబరీషునికి యజ్ఞఫలం కలిగించాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra