ఋష్యశృంగుడి వివాహం ఎలా జరిగింది?

పూర్వకాలములో విభణక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరకు వెళ్ళగా, అక్కడ విహరిస్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుండి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక మగ శిశువునకు జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ నేర్పించాడు. కాని ఆ ఋష్యశృంగుడికి లోకము తెలీకుండా పెంచాడు. ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. 

ఆ అంగరాజ్యాన్ని రోమపాదుడు పరిపాలించేవాడు. రోమపాదుడు ధర్మం తప్పడం వలన ఆ రాజ్యములో వర్షాలు పడడం మానేశాయి. దేశములో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు కాని మన దేశములో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, ఋష్యశృంగుడిని తీసుకురావడం మావలన కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఇంద్రియార్డై: అభిమతైః నరచిత్త ప్రమాథిఖి ఋష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు.

ఆ వేశ్యలకి విభణకుడి మీద ఉన్న భయం వలన, వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపునకు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వారు కూడా పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభఙ్ఞకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమమునుండి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరుసటిరోజు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి వారు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు ఇదీ ఋష్యశృంగుడి కథ.

◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories