పాపం పంచి ఇచ్చిన ఇంద్రుడు

 

త్వష్ట అనే ప్రజాపతి కి సర్వ విజ్ఞాన పరుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి మూడు తలలు. విశ్వరూపుడు ఒక నోట సురాపానము, ఒక నోట సోమపానమును చేయును. మూడవ నోటితో అన్నము తినెను. దేవతలు అతనికి గురువు స్థానం కల్పించిరి. ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు.

అయితే విశ్వరూపుడు రాక్షసులకు కూడా యజ్ఞభాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలలు ఖండించాడు. గురువు స్థానం ఉన్న విశ్వరూపున్ని పైగా నారాయణ కవచం ఉపదేశించిన సర్వ శ్రేష్ఠున్ని చంపి ఇంద్రుడు బ్రహ్మ హత్యాదోషం మూటగట్టుకున్నాడు. ఆ హత్యాదోషాన్ని ఒక యేడు భరించగలిగాడు. ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు, భూమికి ఒక వరం ఇస్తాడు. ఎంత గొయ్యి అయినా పూడి తిరిగి యధా రూపం సంతరించుకునేట్లు వరం ఇచ్చి ప్రతిగా తన పాపాన్ని నాలుగవ వంతు భూమికి ఇస్తాడు. ఇంకా ఆ పాపాన్ని భరించలేక ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రం అయినా తిరిగి పవిత్రం అయ్యేట్లు నీటికి వరం ఇచ్చి ఇంకో నాలుగవ వంతు పాపాన్ని ఇస్తాడు. అలాగే చెట్లకు కూడా ఒక వరం ఇస్తాడు. ఎన్ని సార్లు కొట్టివేసినా తిరిగి చిగురించేలా వరం ఇస్తాడు. అలా ఇంకో నాలుగవ వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు. స్త్రీలకు కామ సుఖాలతో పాటు సంతానము కలుగునట్లు వరం ఇచ్చి నాలుగవ వంతు పాపాన్ని స్త్రీలకు పంచిస్తాడు.

అలా ఇంద్రుడు ఆ బ్రహ్మ హత్యాదోషం నుంచి విముక్తి పొందుతాడు. ఇంద్రుడి బ్రహ్మ హత్యాదోషం చేత కలిగిన పాపాన్ని పంచుకోవడం చేత భూమికి చవిటి నేలలు, నీటికి నురగలు, చెట్లకు జిగురు, స్త్రీలకు రజస్సు ఈ దోషము వలనే కలుగుతున్నాయి.

◆ వజ్రాయుధం పుట్టుక
◆ వృత్తాసుర వధ

విశ్వరూపుని ఇంద్రుడు చంపుటచేత త్వష్టకు పుత్రశోకము గలిగెను. దానిని సహింపలేక అతడు ఇంద్రుని జంపు కొడుకు పుట్టవలెనని యజ్ఞము చేసెను. యజ్ఞాకుండములోనుండి భయంకరరూపముతో రాక్షసుడు ఒక్కడు పుట్టెను. వాడే వృత్రుడు. బ్రహ్మనుగూర్చి తపముచేసి వరములొంది లోకకంటకుడై ప్రవర్తించుచుండెను. దేవతలు అతనిపైకి యుద్ధమునకు రాగా వారి నందరను వృత్రుడు ఓడించెను. ఇంద్రుడు యుద్ధము చేయుచుండగా అతని చేతి ఆయధము జారిపడెను. వృత్రుడు ఇంద్రునితో, “ ఆయుధము లేని వానిని, పారిపోవు వానిని నేను చంపను పొమ్మ” ని విడిచిపెట్టెను.

దేవతలందరూ శ్రీహరిని ప్రార్ధింపగా ఆయన “ దధీచి మహామునిని అతని వెన్నుముక్క నడుగుడు. ఆయన దాత. ఇచ్చును. దానితో విశ్వకర్మ ఇంద్రునికి ఆయుధము చేసి ఇచ్చెను. దానితో వృత్రుని ఇంద్రుడు చంపును” అని చెప్పెను.

దేవతలట్లే దధీచి నడిగిరి. ఆయన అది దేవకార్యమని గ్రహించి “ నేను యోగశక్తితో ప్రాణము విడుతును. నా ఎముకలు మీరు తీసికొను” అని యోగమార్గమున శరీరము చాలించెను. విశ్వకర్మ ఆయన వెన్నుముక్కతో వజ్రాయుధము చేసి ఇంద్రునికి ఇచ్చెను. దేవతలు ఉత్సాహముతో వృత్రుని పైకి దండయాత్ర చేసిరి. ఆ మహాయుద్ధములో వృత్రుడు ఐరావతముతోను, వజ్రాయుధముతోను గూడా ఇంద్రుని మ్రింగి వేసెను. ఇంద్రుడు అతని కడుపు చీల్చి చంపి బయిటకి వచ్చెను. అలా వృత్తున్ని ఇంద్రుడు చంపేస్తాడు. అయితే తిరిగి బ్రహ్మ హత్యదోషం ఇంద్రుడి అంటుకుంది. అయితే మునులు ఇంద్రునితో అశ్వమేధ యాగం చేయించి పాప విముక్తి చేశారు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories