తెలుగురాష్ట్రాలలో పంచారామాల వైభవం!!
శైవ క్షేత్రాలు ఎంత ప్రసిద్ధి చెందినవో అందరికీ తెలిసినవే. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో పంచారామాలు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. స్కంధపురాణం ప్రకారం పంచారామాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయం గురించి ఒక వివరణ ఉంది.
పూర్వం.. తారకాసురుడు అనే రాక్షసుడు, శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు. అలా ఆత్మలింగాన్ని తన సొంతం చేసుకున్న గర్వంతో అతను దేవతలను అనేక రకాలుగా హింసలకు గురిచేయగా, దేవతలు అంతా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి తారకాసురుడు చేస్తున్న పనుల గురించి చెప్పి కాపాడమని ప్రార్ధించగా, 'శివపార్వతుల' వల్ల కలిగిన కొడుకు "కుమారస్వామి" వల్లనే తారకాసురుని మరణం సాధ్యమవుతుందని చెప్పి కుమారస్వామిని యుద్ధానికి పంపుతారు. యుద్ధములో కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేధిస్తేనే అతనికి మరణం కలుగుతుందని గ్రహించి ఆ లింగమును చేధిస్తాడు. దీనితో తారకాసురుడు మరణిస్తాడు.
ఆ లింగాన్ని చేధిoచే సమయంల్లో ఆ ఆ త్మలింగము వేరై, ముక్కలుగా మరి ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆయా ప్రదేశాలలో, దేవతలు లింగాలుగా లింగ ప్రతిష్ఠ చేశారు. ఆ విధంగా ఈ అయిదు క్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. ఈ పంచారామాలు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి.
1. దాక్షారామము :
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని "భీమేశ్వరుడు" అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది.
ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి ఉంది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని భీమేశ్వర పురాణంలో ఉంది. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి ఎంతో కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2. అమరారామము :
పంచారామల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరమునందు వెలసింది. ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.
అమరేశ్వరుడైన ఇంద్రుడు చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి ఉంది.
3. క్షీరారామము :
క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ఇక్కడ శివుడిని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది. శివుడు తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. క్రమంగా క్షీరపురి కాస్తా పాలకొల్లుగా మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో తొమ్మిది గోపురాలుతో కట్టబడింది.
4. సోమారామము :
పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్ల దూరంలో గల గునిపూడిలో ఉంది. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి తెలుపు రంగులోకి చేరుతుంది. ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు. చంద్రుని వల్ల ప్రతిష్ఠించ బడినది కాబట్టి దీనికి సోమారామము అని పేరు వచ్చింది.
5. కుమారభీమారామము :
పంచారామాల్లో చివరిది, 5వది అయిన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడే ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది. ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
కార్తీకమాసం సందర్బంగా ఈ పంచారామాల్లో శివుడికి పూజలు, అభిషేకాలు ఎంతో గొప్పగా జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో దేవుడి దర్శనానికి వస్తుంటారు. కాబట్టి వీలైనవారు ఈ మాసంలో పంచారామాల్లో కొలువైన పరమేశ్వరుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం. పరమేశ్వరుడి కృపకు పాత్రులయ్యే అవకాశం లభిస్తుంది కూడా.
◆ వెంకటేష్ పువ్వాడ