రాంపండు లీలలు..!

                                                         రాంపండు లీలలు
ఆ వేళ పొద్దున్న అనంతం నిద్రలేచేటప్పటికీ రాపండు సిద్ధం.
తమ వంశ మర్యాదల గురించి అనంతానికీ చాలా గర్వం. ఏ వేళ వచ్చినా అతిథిని కష్టపెట్టకూడదని అతని పెద్దలు చెప్పారుట. కానీ వీటిక్కూడా వేళా, పాళా ఉన్నాయనీ, అని చెప్పడం పెద్దలు మరిచారని అనంత్ నమ్మకం, లంచ్ టైముకి వచ్చి బుర్ర తింటే ఓ దారి. డిన్నర్ టైముకి మరో దారి. కానీ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ వేళకే దిగడి దుఃఖగాధలు వినిపించడం అతిథులు చేయవలసిన పని కాదని అనంత్ సిద్ధాంతం.
“ చూడు తండ్రీ, నీ హృదయం బద్దలు కావడమో, ముక్కలు కావడమో, బద్దలయి ముక్కలు  కావడమో, ముక్కలై బద్దలై ముక్కలు కావడమో జరిగింది. ఒప్పుకున్నా! అంత మాత్రం చేత ఇలా తెల్లారకుండా””” .. “
రాంపండు కి అహం పొడుచుకు వచ్చింది. “ సులోచన వ్యవహారం గురించి మాట్లాడటానికి రాలేదు నేను.”
“హమ్మయ్య" అంటూ అనంత్ ఇడ్లీ ప్లేట్ ముందుకు లాక్కున్నాడు.
“గతం మర్చిపోవాలి. అదే మనిషి చేయగలిగేది". రాంపండు ఫిలాసఫించాడు.
“ రైట్, రైట్". ఇడ్లీ నోట్లో కుక్కుకుంటూ తలూపాడు అనంత్.
“ నా గుండె హృదయాంతరాల దాకా గాయపడింది. అయినా పట్టించుకోకు".
“...కోను" ఇప్పుడు సాంబారు స్టేజి సాగుతుంది.
“మరిచిపో. మనసులోంచి తుడిచెయ్".
ఆ పాటికి అనంత్ మూతి తుడుచుకోవడం అయిపోయింది. “ఒరే నువ్వాసొద ఆపి, వేరేది మొదలెడతావా? నన్ను మళ్ళీ నిద్రకుపక్రమించమంటావా?”
రాంపండుకి భయం వేసింది. అనంత్ నిద్రపోతే అంతే సంగతులని. అసలే అతని పేరు అనంత శయనం. గబాగబా తన ప్లాను చెప్పేశాడు.
రాంపండుకున్న వ్యసనాలు రెండే రెండు. ఒకటి ప్రేమలో పడటం, రెండోది జూదం, రకరకాలుగా ఉంటుంది. గుర్రప్పందెం, కవిత్వప్పందెం... ఈ సారి స్కూలు ఆటల పోటీల పందెం. వేంవరం లో ఉన్న హై స్కూలు వార్షికోత్సవం సందర్భంగా ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఊళ్ళో చీమ చిటుక్కుమనే ముందు కూడా ఎన్ని సార్లు చిటుక్కు మంటుందో చెప్పాలని, పందాలని కట్టాలని సిద్ధంగా ఉన్న గుంపొకటి ఉంది. వాళ్ళను పెట్టుకుని నాలుగు డబ్బులు సంపాదిద్దామని రాంపండు అయిడియా, పెట్టుబడి కావాలంటే అనంత్ దగ్గరికి రావాల్సిందే!
కానీ ఈసారి అనంత్ ఓ పట్టాన మెత్తబడలేదు. అచలపతినడిగి చెప్తానన్నాడు.

విషయం చెప్పగానే అతను గడగడా అప్పజెప్పేశాడు.
 “సర్. ఈ స్కూలు ఫంక్షన్ ఆటల పోటీల మీద పందాలు కాయడం అనాదిగా సాగుతున్నట్లు నాకు తెలియవచ్చింది. అందువల్ల గణాంకాల వివరాలు తేలికగానే లభ్యమవుతున్నాయి. 15 రకాల ఈవెంట్స్ లో సాధారణంగా ఫేవరెట్స్ యే ఎప్పుడూ గెలుస్తూ వస్తున్నారు. అందువల్ల వాళ్ళమీద పందెం కట్టించుకుని మనం సాధించబోయేది పెద్దగా ఏదీ లేదు. ఎవరూ ఊహించని విధంగా కొత్త క్యాండిడేట్ ను, అంటే గుర్రప్పందాల భాషలో డార్క్ హార్స్ ను పోటీలో ప్రవేశపెట్టినప్పుడే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంది సర్".
రాంపండు ఎగిరి గంతేశాడు. “ అలాటి కాండిడేట్ నాకు ఒకళ్ళు తెలుసు " మదర్స్ సాక్ రేస్' అని స్కూలు పిల్లల తల్లులు గోనుసంచులు తొడుక్కుని పరిగెడతారు చూడు - ప్రతీ ఏడాది దాంట్లో ప్రైజు కొట్టేసేది సుశీలమ్మే, అందరూ ఆవిడ మీదే పందెం కడతారు. కానీ నాకో ఆవిడ తెలుసు విశాలాక్షి!  ఈ సారి గెలుపు ఆవిడదే ఎవరూ ఊహించని డార్క్ హార్స్!”
“ఆవిడ నీకెలా తెలుసు?” అడిగాడు అనంతం. రాంపండు తన ప్రేమ పరిధిని వివాహితలకు కూడా విస్తరిస్తున్నాడా అన్న అనుమానంతో.
“ మొన్న కవిత్వప్పందాల కేసులో డబ్బు పోయిందిగా! ఇంకో కుర్రాడెవరైనా దొరికితే ప్రైవేట్ చెబుదామని బుజ్జిని అడిగి చూశా. తన క్లాసుమేటే ఓ కుర్రాడున్నాడంటే వాడికీ చెప్పనారంభించా, వాళ్ళ అమ్మగారే విశాలాక్షి.."
"మొత్తానికి ప్రైవేట్ మాస్టారుగా స్థిరపడి పోతున్నావన్నమాట.."
"అధిక ప్రసంగం ఆపు. ఈవిడ విషయం విను. ఈ విశాలాక్షి రోజూ కాఫీ ఇవ్వడానికి వచ్చి తెగ కబుర్లు చెబుతుందిలే. ఈ ఊరికి కొత్తగా వచ్చారట. ఇంతకుముందున్న ఊళ్ళో స్కూలు వార్షికోత్సవాలలో పేరెంట్స్ పాల్గొనే ఆటల పోటీల్లో ప్రైజులన్నీ ఈవిడవేనట. ముఖ్యంగా ఈ గోనెసంచుల పోటీల్లో ఫస్టు ప్రైజు ఎప్పుడూ ఈవిడదేనట..'
" ఈ అనంత్ కు ఇంతకంటే ఎక్కువ చెప్పనక్కర లేదు. తక్కిన వాళ్ళెవరైనా అయితే అర్థం చేసుకోలేరేమో కానీ అనంత్ సూక్ష్మగ్రాహి నువ్వు చెప్పేదేమిటంటే విశాలాక్షి సామార్థ్యం గురించి ఊళ్ళో వాళ్లకి అవగాహన లేదు కాబట్టి షీ ఈజ్ యే డార్క్ హార్స్."
"మీరు పరిస్థితిని సరిగ్గా అంచనా వేశారు సర్. అలాగే ప్రజలు ఎరగని ఒక అజ్ఞాత హీరో పరుగుపందాలలో గెలిచే శక్తియుక్తులు ఉన్నవాడు నాకు తెలుసు సర్." అన్నాడు అచలపతి.
"ప్రతి ఏడాది ప్రకాష్ అనే కుర్రాడేగా హాట్ ఫేవరేట్.." అని అడ్డు వచ్చాడు రాంపండు.
"అవును సర్. కానీ అతని కంటే వేగంగా పరిగెత్తగలడు. ఈ ఇంట్లో పనిచేసే సుబ్బు అనే కుర్రవాడు." అన్నాడు అచలపతి.
"ఆచలపతీ, నువ్వు ఈ ఇంట్లోకి వస్తూనే చాలా సమాచారం సేకరించావు. ఒప్పుకున్నా కానీ. ఆ సుబ్బుగాడు నాకు ఇంతప్పటి నుండి తెలుసు. వాడి ఒళ్ళే వాడు మోసుకోలేడు. పైగా ఇది  స్కూల్ పిల్లలకి. వాడికీ చదువుకీ ఆమడ దూరం." అన్నాడు అనంత్ సాధికారికంగా.
"కానీ.. సుబ్బు ఇటీవలే నైట్ స్కూల్ లో చదువుతున్న సంగతి మీదాకా వచ్చి ఉండదు సర్. ఒళ్ళు విషయంలో మీతో నేను ఏకీభవిస్తున్నా అవసరం వచ్చినప్పుడు అతను చూపే లాఘవం మీరు ఊహించను కూడా ఊహించలేరని చెప్తున్నా," అన్నాడు అచలపతి. హితోపదేశం చేసే స్టయిల్లో.
"కానీ ఆ అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది? మనకు అతని కళ చూసే అవకాశం ఎలా కలుగుతుంది? కళ్ళతో చూడందే ఆ లడ్డూగాడి మీద పైసా కూడా పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా లేను." అని తేల్చి చెప్పాడు అనంత్.
"ఆ అవకాశం, అవసరం ఇప్పుడే కలిగించవచ్చు సర్. మీరొక రూపాయి ఇస్తే సుబ్బుకి లంచం పెట్టి వంటాయన మెల్లకన్ను మీద కామెంట్ చేయమంటాను. వంటాయన తన మెల్లకన్ను గురించి కాస్త  సెన్సిటివ్ గా ఫీలవుతాడు. ఒక్కమాట అని చూస్తే చాలు, తరిమి, తరిమి, తంతాడు. అప్పుడు ప్రాణ రక్షణ కోసం సుబ్బు పెట్టే పరుగులు, ఇదిగో మీరీ కిటికీలోంచి చూడవచ్చు.."
పదినిమిషాలలోనే అనంత్ కోసం ఆ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం, అంత భారీ శరీరాన్ని వేసుకుని పరుగులు పెట్టడం చూడటం సంభవించింది. "నా దగ్గర ఉన్న ఆఖరి చిల్లిగవ్వ కూడా ఈ సుబ్బుగాడి మీద పెట్టుబడి పెట్టడానికి సంశయించను." అని అనంత్ గంభీరంగా ప్రకటించడం కూడా జరిగింది.
ఆ తరువాత వారం రోజుల్లో చాలా సంఘటనలు జరిగాయి. సుబ్బు ఆటలపోటీల్లో పేరు ఇవ్వడం, దానిమీద చాలా మంది జోకులు వేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా ఆవేశంలో వాడి అసలు ప్రజ్ఞ గురించి గొప్పలు చెప్పవద్దని రాంపండుకి వార్నింగు ఇవ్వడం జరిగింది. రాంపండు కూడా ఇది తన జీవన్మరణ సమస్య కాబట్టి సుబ్బుగాడిని చాలా జాగ్రత్తగా, అంటే అవీ, ఇవీ తిని ఆరోగ్యం పాడు చేసుకోకుండా, మరీ తిని ఇంకా లావెక్కకుండా, వాడు పరుగెత్తే దృశ్యం ఎవరి కంటా పడకుండా చూసుకున్నాడు. కానీ భూషణం కంటబడకుండా ఉండాలని రాంపండు ప్రార్థిస్తుండగానే  ఆ అనర్థం జరిగింది.
భూషణం అనంత్, రాంపండు గ్రూపుకి పోటీ సిండికేటు నడుపుతున్నాడు. ప్రతీసారి గెలిచే ప్రకాష్ ను, తక్కిన వాళ్ళను నమ్ముకునే అతను పందాలు ఒప్పుకుంటున్నాడు .
సుబ్బు పరుగెడుతున్న దృశ్యం అతని కంట పడినట్లు కళ వచ్సినప్పుడల్లా రాంపండు ఉలిక్కి పడి లేచి అన్నాథ్ దగ్గరికి పరుగులు పెడుతున్నాడు. అనంత్ రక్షరేకు కట్టించి ఇచ్చినా రాంపండు కళ నిజమయి కూచుంది.
ఆ వేళ రాంపండు సబ్బును దొంగతనంగా ఊరు బయటికి తీసుకువెళ్ళి రన్నింగు ప్రాక్టీసు చేస్యించి వస్తూ ఉంటే సినిమాహాలు దగ్గర భూషణం కనబడ్డాడు. మర్యాదకి అతన్ని హాలు క్యంతీనుకి పిలిచి టీ ఇప్పిస్తుంటే తుంటరితనానికి మారుపేరైన సుబ్బు భూషణం మోటారు సైకిలు ఎక్కి స్టార్టు చేయడం, రయ్యిన ముందుకు తీసుకెళ్ళి పడేయడం జరిగింది. భూషణం కంగారుగా బయటకు వచ్చి చూసి సుబ్బుకి రెండు తగిలించబోయాడు. దాంతో ఆపత్సమయాల్లో ఆదుకునే పరుగు కళను ఆశ్రయించాడు.    
సబ్బును పరుగుపెడుతుండగా చూసిన భూషణం నోరు అలాగే తెరిచి ఉంచేశాడు. మోటారు సైకిలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోలేదు. వీడిని తక్కువ అంచనా వేసి తను చేసిన పొరబాటు ఏమిటో  తెలిసి వచ్చింది. సుబ్బు మీద పెట్టుబడి పెట్టిన అనంత్ గ్రూపు ఇస్తోకు ముక్క ఎవరో  తెలిసిపోయింది.
దాని ఫలితమే మర్నాడు స్కూలు అసెంబ్లీలో అతను చేసిన కుట్ర, ఈ లోగా రాపండు సుబ్బు పరుగును చూసిన భూషణం హావభావాలను యాక్షన్ తో సహా వర్ణించి చెప్పడంతో శతృవు అలర్ట్ అయిపోయిన విషయం అనంత్ గ్రూపుకి తెలిసిపోయింది. ఇంకో డార్క్ హార్స్ లేకపోతే సిండికేట్ మునిగిపోవడం ఖాయం అనుకుంటుండగానే అచలపతి దాచుకున్న ఇంకో పేకముక్క బయటకు తీశాడు.
"సర్, చిన్నపిల్లల లెమన్ అండ్ స్పూన్ పందెం గురించి మీకు తెలుసుగా..  నోట్లో చెంచా పెట్టుకుని దాంట్లో నిమ్మకాయ పెట్టుకుని ఎవరు వేగంగా నడిస్తే వాళ్లకి ప్రైజు ఇస్తారు.. దాంట్లో.."
"తెలుసులేవయ్యా, ప్రతీసారి ఆ పిలకజడ సుమతికేగా ప్రైజు. దాంట్లో మనకేమీ ఛాన్సు లేదు. ఆ
స్టాటిస్టిక్స్  అన్నీ ముందే స్టడీ చేసి పడేశాను". అన్నాడు అనంత్ విసుగ్గా.
"సర్, మీరు కాస్త ఓపిగ్గా వినాలి. మన తోటమాలి కూతురు వెంకటలక్ష్మి కూడా దాంట్లో పాల్గొంటుంది. ఆమెకు చాన్సు ఉందని నా ఉద్దేశం. " అన్నాడు అచలపతి తొణక్కుండా.
"ఎలా,ఎలా..? అన్నాడు రాంపండు ఆతృతగా. అతనికి ఇది రోటీ, కపడా ప్రశ్న. ఈ పందాలలో ఓడిపోతే జీవితాంతం అల్లరి కుర్రాళ్ళకు ట్యూషన్లు చెప్పుకు బతకవలసి వస్తుందని అతని భయం.
"నాకు తోటమాలి స్వయంగా చెప్పాడు సర్. రోజూ సాయంత్రం గిన్నె నిండా అంబలి వెంకటలక్ష్మి పట్టుకొస్తుందట. ఒక్క చుక్క కూడా ఒలకదట. అంత స్టడీ హేండూ ఉన్న ఆపిల్ల ఈ పందెంలో ఈజీగా గెలుస్తుంది."  అచలపతి ధీమాగా చెప్పాడు.
"రైరో, అయితే వెంకటలక్ష్మి మీద పందాలు ఒప్పుకో" అని ఆర్డరేశాడు అనంతం. కానీ రాంపండుకి ధైర్యం చిక్కలేదు." ఒద్దురా, ఇంకా పెట్టుబడి అంటే భయం వేస్తోంది" అంటూ లబలబలాడాడు. ..స్కూలు ఫంక్షన్ రెండు రోజులుందనగా భూషణం వేసిన ట్రిక్ ఫలించింది. ఆ వేళ స్కూలు అసెంబ్లీలో ప్రార్థన జరుగుతుండగా ఉన్నట్టుండి సుబ్బు కెవ్వున అరిచాడు. పిల్లలంతా ముందు ఉలిక్కిపడి, తర్వాత పకపక నవ్వారు. హెడ్ మాష్టారు పరంధామయ్య గారికి ఒళ్ళు మండిపోయింది. ఇలాంటి చిలిపి చేష్టలు సుబ్బు ఇంతకు ముందు చాలా చేశాడు. కానీ ఇదే అన్నిటికీ హైలైట్. చరచర వాడి దగ్గరికి నడిచేడు బెత్తం పట్టుకుని.
"ఏరా, తోకతిప్పిన పందిలా ఏమిట్రా ఆ అరుపు, నిలువునా చీరేస్తాను జాగ్రత్త!"
సుబ్బు పాపం ఎప్పట్లా కొంటెగా నవ్వడం లేదు. భయంతో వణుకుతున్నాడు. చొక్క విదిలించుకుని చూసుకుంటున్నాడు.
"ఏం జరిగిందిరా అంట్ల వెధవా! ఏమిటా నాటకాలు?" పరంధామయ్య గారు గావుకేక పెట్టాడు.
"పు..పురుగండి. ఎవరో నా చొక్కాలో పడేశారండి. నాకు పురుగులంటే తెలుసుకదండీ.." అంటూ ఏడుపుమొహం పెట్టాడు సుబ్బు.
పరంధామయ్య కరగలేదు. "వెధవ్వేషాలు ఆపు. ఎన్నిసార్లు చెప్పినా నీ అల్లరి తగ్గలేదు. నీ పని ఇలా కాదు. నువ్వు ఆటలపోటీల్లో పేరిచ్చావు కదూ, నిన్ను తీసేశాను ఫో. దిక్కున్న చోట చెప్పుకో. హన్నా! తుంటరితనం మరీ పెరిగిపోయింది. ఒకసారి ఇలా చేస్తే తప్ప నీకు బుద్ధి రాదు. లేకపోతే నిన్ను చూసి మిగాతా వాళ్ళు తగలడతారు.
పరుగు పందెంలోంచి తీసేసినందుకు సుబ్బు బాధపడ్డాడో లేదో తెలియదు గానీ వాణ్ణి అనుక్షణం కనిపెట్టుకు తిరుగుతున్న రాంపండు మాత్రం గొల్లుమన్నాడు. పైగా సుబ్బు పక్కన నిలబడ్డ మోహన్ కి అసెంబ్లీ అయిపోయిన తర్వాత భూషణం ఐస్ క్రీం ఇప్పిస్తూ కనబడటంతో కుట్ర మొత్తం అర్థమయి రాంపండు మరింత గొల్లుమన్నాడు. పైగా వెంటనే వచ్చి సిండికేట్ దగ్గర మొత్తుకున్నాడు.
"ఒరేయ్,అనంతూ, ఆ భూషణం గాడు మోహన్ అనే కుర్రాడికి లంచం పెట్టి సుబ్బుగాడిని పోటీలోంచి తప్పించేశాడురా. అయినా ఆ సుబ్బుగాడిలాంటి రాలుగాయి కుర్రాడికి పురుగులంటే అంత భయమేమిట్రా? అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తూ ఉంటూ ఈ మోహన్ గాడు సుబ్బుగాడి చొక్కాలో ఓ పురుగు పడేయడం, వీడు కెవ్వుమని గుండెలవిసేలా అరవడం.. అంతా మన ఖర్మానికి వచ్చిందనుకో.."
అనంత్ ఓదార్చాడు. "అచలపతి ఉన్నాడుగా ఏదో ఒకటి చూస్తాడులే. ఎవిరిథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు. ఇలాంటి మోసాలు ఉంటాయనే వెంకటలక్ష్మిని రంగంలోకి దించాం. నువ్వు చెప్పిన విశాలాక్షి ఎలాగూ ఉంది. ఊరికే కంగారు పడకు."
'ఏమోరా, నీకయితే ఇది వినోదం కానీ, నాకు లైఫ్ అండ్ డెత్ కొశ్చన్. ఒక్కోసారి విసుగేసి ఆ భూషణం గాడితో చేతులు కలిపేద్దామా అనిపిస్తుంది. మొన్న ఆఫర్ ఇచ్చాడు కూడా.."
"అలాంటి పిచ్చిపని చేయకు. అఫ్ కోర్స్. నీకు కావాలంటే సిండికేట్ లోంచి బయటకు వెళ్ళిపోతానంటే నేను అభ్యంతర పెట్టను. కానీ అచలపతి ఉన్నాడుగా.. పెట్టుబడి కూడా పెట్టాడు... ఏదోలా చక్రం అడ్డు వేస్తాడులే.."
రాంపండు అప్పటికి శాంతించాడు కానీ ఫంక్షన్ రోజున వెంకటలక్ష్మిని చూడగానే నీరుకారిపోయాడు. ఆ రోజు కాసేపటిలో పోటీలు ప్రారంభమవుతాయనగా ఓ పదేళ్ళ పిల్ల అనంత్, రాపండుల దగ్గరికి వచ్చింది. వస్తూనే రాంపండుని చిరకాలంగా ఎరుగున్నట్టు లాటరీలో తనకు బహుమతిగా వచ్చిన బొమ్మ గురించి మాట్లాడ్డం మొదలుపెట్టింది.
"మరేమో, నా బొమ్మ లేదూ, దానికి బంగారూ అని పేరు పెట్టానులే. దాన్ని రోజు రాత్రి నా పక్కలో పడుకోబెట్టుకుని.. అస్సలు ఏడవదులే. చాలా మంచింది. మరేమో, పొద్దున్నేలేపి, స్నానం చేయించి.."
అసలే చికాగ్గా ఉన్నాడేమో రాంపండు " చాల్లే సొద" అని విసుక్కున్నాడు.  కానీ వంశమర్యాద కాపాడటానికి కంకణం కట్టుకున్న అనంత్ మాత్రం "పాపా, నువ్వు కాసేపు మాట్లాడ్డం ఆపితే మేం ఈ ఆటలపోటీలు చూస్తాంగా. ఇప్పుడు స్కూలు పిల్లల తల్లులందరూ గోనుసంచులు తొడుక్కుని  పరుగె డతారన్నమాట. నువ్వూ, మీ బంగారు కూడా చూడండి." అని ఊరుకోబెట్టబోయాడు.
:నేనూ పోటీల్లో పాల్గొంటాగా.." అంది. ఆ పాప కళ్ళు మహా తిప్పుతూ.
:ఏదీ వాగుడు పోటీల్లోనా..?" అడిగాడు రాంపండు కసిగా.
"కాదు, లెమన్ అండ్ స్పూన్. మరేమో నిమ్మకాయ ఒక చెంచాలో పెట్టుకుని.." అంటూ పాప చెప్పబోతుండగానే ఆత్రం పట్టలేని రాంపండు "నీ పేరు మమతా?"
అని అడిగేశాడు.
ఆ పిల్లకు కోపం వచ్చేసింది.
"కాదు, సుమతి అంటే అది. ఆ ఎర్ర పరికిణీ లేదూ, ఆ పిల్ల. నా పేరు వెంకట లక్ష్మి. సుబ్బు మా క్లాసే. వాడిని పోటీల్లోంచి తీసేశారుగా. మా బాగా అయింది. మొన్న నా జడ పట్టుకుని లాగి.." అంటూ మళ్ళీ మొదలెట్టింది.
కానీ రాంపండు అవేవీ వినే స్థితిలో లేడు. తన ఎదురుగా ఉన్న నల్లటి, పొట్టి, గుమ్మటం లాంటి స్వరూపమే వెంకటలక్ష్మి అని తెలియగానే అతనికి భయం వేసింది. " ఒరే అనంతూ, ఆచలపతిని నమ్ముకుని పొరబాటు చేసాం రా. ఈ అమ్మాయి వణక్కుండా బెణక్కుండా గిన్నె నిండా అంబలి తేవచ్చు కానీ, స్పీడ్ సంగతి ఆలోచించి చూడు. అ సుమతిని చూడు. చలాకీగా, సలాకలా ఉంది. ఈ వెంకటలక్ష్మి కదిలేసరికి అ సుమతి ఆరడుగులు ముందుంటుంది. ఒరే, అచలపతి హామీ చూసుకుని ఈ వెంకటలక్ష్మి మీద చాలా పెట్టుబడి పెట్టేశానురా. కొంప మునిగినట్టుంది"
అంటూండగానే అచలపతి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.
"సర్, ఈ భూషణానికి చాలామంది గూఢచారులు ఉండి ఉంటారు. మన విశాలాక్షి మంచి కాండిడేట్ అని అతనికి తెలిసిపోయినట్టుంది. తన కాండిడేట్ కి గట్టిపోటీ ఇస్తుందని గ్రహించేసేడు లాగుంది. ఇందాకటి నుండి చూస్తున్నాను. వెళ్ళి అవీ, ఇవీ, కబుర్లు చెప్పి మూడుసార్లు స్కూలు క్యాంటీనుకి తీసుకెళ్ళి బోల్డంత మెక్కబెట్టాడు. ఇప్పుడావిడ ఓ మూల కూర్చుని ఆపసోపాలు పడుతోంది. పోటీలో ప్రైజు రాకపోయినా పర్వాలేదు. దాన్లో వచ్చేదాని కంటే ఎక్కువ ఖరీదైన ఐస్ క్రీములు పెట్టించాడు. ఈ పెద్ద మనిషి అంటోంది పక్కింటావిడతో" అని వార్త మోసుకొచ్చాడు.
విషయం వింటుండగానే వెంటనే రియాక్టయింది రాం పండే! " ఒరే అనంతూ, క్షమించరా, నేను పార్టీ ఫిరాయించేసాను. భూషణం గాడితో చేతులు కలిపేస్తున్నాను, ఈ లెమన్ అండ్ స్పూన్ రేసు మీద చాలానే రిస్కు తీసుకున్నాను. పోతే తట్టుకోలేను." అంటూ భూషణం కోసం పరుగుపెట్టాడు.
రాంపండు అనుకున్నదే అయింది. గోనెసంచుల పోటీలో విశాలాక్షికి మూడో స్థానం. నిమ్మకాయల పోటీలో వెంకటలక్ష్మికి ఆరో స్థానం వచ్చాయి. కానీ ప్రైజులు అనౌన్స్ చేయడానికి కాస్త ఆలస్యమయింది. దానికి కారణం హెడ్ మాస్టారు  పరంధామయ్య తన ప్రసంగంలో వివరించారు.
"... ఈ ఆటల పోటీలు పిల్లలలో క్రీడా స్పూర్తిని పెంపొందించడానికి ఉద్దేశించబడ్డాయని అందరికీ తెలుసు.కానీ ఊళ్ళో కొందరు సోమరులు జూదరులు ఈ పిల్లలను గుర్రాల కింద జమకట్టి వాళ్ళ మీద పందాలు కట్టి డబ్బు చేసుకుంటున్నారని తెలిసి చాలా బాధపడుతున్నాను. కానీ సాక్ష్యాలు దొరక్క ఏమీ చేయలేకపోతున్నాను. మూడేళ్ళ క్రితం ఇటువంటి సంఘటన నా దృష్టికి వచ్చింది. అదృష్టవశాత్తు సాక్ష్యం కూడా లభించింది. అప్పుడు పోటీలన్నీ కాన్సిల్ చేసి వేశాను. ఈ ఏడాది కూడా ఇటువంటి పందాలు జరిగాయని నాకు సాక్ష్యం దొరికింది.."
ఎఫెక్ట్ కోసం పరంధామయ్య అడిగినప్పుడు అనంత్ ఆచలపతికేసి చూడబోయి ఎక్కడున్నాడని కళ్ళతో వెదికాడు. పరంధామయ్యకు కాస్త దూరంగా తలవంచుకుని నిలబడ్డ ఆచలపతిని చూసి అయోమయంలో పడిపోయాడు. ఇంతలోనే పరంధామయ్య తన ప్రసంగాన్ని కొనసాగించాడు.
"... పనిపాటా లేని ఓ కుర్ర జమీందారు తన వద్ద పనిచేసే అతని ద్వారా లెమన్ అండ్ స్పూన్ పందెంలో పాల్గొనే కొంతమంది పిల్లలకు లంచం పెట్టి ఆటల ఫలితాలను తన స్వార్థం కోసం ప్రభావితం చేసాడు. యజమాని ఆజ్ఞ మేరకు అతని ఆదేశాన్ని శిరసావహించినా, ఆ పనివాడి అంతరాత్మ మాత్రం ఊరుకోలేకపోయింది. తను చేసిన తప్పు ఒప్పుకోమని చెప్పింది. అంతరాత్మ ప్రబోధాన్ని విని అతను జరిగిన సంగతి యావత్తు నాకు వివరించి క్షమాపణ కోరాడు...." ఇక్కడ పరంధామయ్య ఆగి, అచలపతికేసి ఆగి ఒక్కసారి చూసి, తిరిగి ప్రసంగం కొనసాగించడం అనంత్ దృష్టిని దాటిపోలేదు.
"నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తి కోరిక మేరకు అతని పేరును, అతని యజమాని పేరును నేను బయట పెట్టడం లేదు. కానీ లంచం పుచ్చుకుని ఆటలాడిన పిల్లలను మాత్రం పోటీ నుండి తొలగిస్తున్నాను. లెమన్ అండ్ స్పూన్ పోటీలో మొదటగా వచ్చిన ఐదుగురు పిల్లలను అనర్హులుగా ప్రకటిస్తూ ఆరవ స్థానంలో వచ్చిన వెంకటలక్ష్మిని విజేతగా ప్రకటిస్తున్నాను. అమ్మాయ్, వెంకటలక్ష్మీ... ఇలా రా, లంచం ఇవ్వజూపినా పుచ్చుకోనీ నీ నిజాయితీని అభినందిస్తూ ఈ బహుమతిని నీకు అందజేస్తున్నాను...."
  ఈ ప్రకటన వింటూ రాంపండు చేసిన ఆర్తనాదం ప్రజల హర్షధ్వానాల మధ్య వినబడలేదు.