పీరియడ్స్ నొప్పి తగ్గాలంటే ఈ ఆసనాలు వేయండి! ఆడవారికి నెలసరి అనేది సాధారణం. ఒక వయసులో ఋతుచక్రం మొదలయ్యాక  ప్రతి నెలా ఈ సమస్యను ఎదుర్కోవాల్సింది. ఇది ఒక నెలతోనో, ఒక ఏడాదితోనో ముగిసేది కాదు. కొందరికి నెలసరి సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు. మరికొందరిలో మాత్రం తీవ్రమైన రక్తస్రావం, కడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి యోగాలో కొన్ని ఆసనాలు సహాయపడతాయి. ఆ ఆసనాలేంటో తెలుసుకుంటే.. బలాసనం.. బలాసనం వేయడం చాలా సులువు.  మోకాళ్లమీద  పాదాలకు పిరుదులు తగిలేలా కూర్చోవాలి. దీన్ని వజ్రాసనం అని అంటారు. ఇప్పుడు ముందుకు వంగి తలను నేలకు ఆనించాలి. చేతులు రెండూ పొడవుగా చాపాలి. ఈ స్థితిలో 10నిమిషాల సేపు ఉండవచ్చు. ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడమే కాకుండా జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. మానసిక సమస్యలు, జీర్ణసమస్యలుంటే తగ్గుతాయి. నాడీవ్యవస్థ చురుగ్గా మారుతుంది. పశ్చిమోత్తానాసనం.. వెన్నెముకను వంచి చేసే ఆసనం కాబట్టి దీన్ని పశ్చిమోత్తనాసనం అని అంటారు. పద్మాసనంలో కూర్చుని పాదాలను ముందుకు చాపాలి. ఇప్పుడు తలను కిందకు వంచి మోకాళ్లకు తల తగిలేలా వంగాలి. ఈ ప్రయత్నంలో రెండు చేతులను ముందుకు చాపి పాదాలను అందుకోవాలి. మొదట్లో ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటైపోతుంది. ఈ ఆసనం వెన్నెముకను బలపరుస్తుంది.  నెలసరి సమయంలో కలిగే కడుపునొప్పి, కండరాల తిమ్మిర్లు  తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతత ఇస్తుంది. అలసటను తగ్గిస్తుంది. సీతాకోక చిలుక భంగిమ.. సీతాకోక చిలుక ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండటం వల్ల దీన్ని సీతాకోక చిలుక భంగిమ అని అంటారు.  పద్మాసనంలో కూర్చోవాలి. రెండు కాళ్లను ఎడంగా చేసి రెండు పాదాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచాలి. ఇప్పుడు చేత్తో రెండు పాదాలను పట్టుకుని మోకాళ్లను సీతాకోక రెక్కల్లా ఆడించాలి. దీని వల్ల యోని కండరాలు బలపడతాయి. యోని సమస్యలు పరిష్కారం అవుతాయి. నెలసరి సమయంలో కడుపునొప్పి నుండి ఉపశనం లభిస్తుంది. శవాసనం.. శవాసనం సాధారణంగా యోగా లేదా వ్యాయామాలు చేసిన తరువాత శరీరం విశ్రాంతి తీసుకోవడానికి   వేస్తారు. అయితే మహిళలు తమ నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడుతుంటే శరీరాన్ని రాలాక్స్ గా వదులుగా ఉంచి శవాసనం భంగిమలో ఉండాలి. కాళ్లు, చేతులు, శరీరంలో కండరాలు వదులుగా ఉండటం వల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. ఇది కడుపునొప్పిని తగ్గిస్తుంది.                                                  *నిశ్ళబ్గ.

ఈ ఒక్క ఆసనం వేస్తే చాలు.. మహిళలకున్న బోలెడు సమస్యలు మాయం! శారీరక సమస్యలను తగ్గించడంలో ఆసనాలు బాగా సహాయపడతాయి. మహిళలలో ఎక్కువగా వెన్ను నొప్పి, సయాటికా, నాడీ వ్యవస్థ బలగీన పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. వీటి కారణంగా రోజువారి పనులలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలు తగ్గడానికి వైద్యులను కలిసి బోలెడు మందులు  కూడా వినియోగిస్తుంటారు. అయితే వీటన్నింటిని కేవలం ఒకే ఒక్క ఆసనం సెట్ చేస్తుంది. అదే సేతుబంధాసనం. దీన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. దీన్ని ఎలా వెయ్యాలి?  దీని ఇతర ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. *సేతుబంధాసనం.. సేతుబంధాసనం వెయ్యడం సులభమే.. మొదట వెల్లికిలా పడుకోవాలి. ఆ  తరువాత కాళ్లను మోకాళ్ల దగ్గర వంచి పాదాలను దూరం జరపాలి. ఇలా జరిపినప్పుడు వంచిన కాళ్ల మద్య గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు చేతులతో పాదాల చీలమండలు పట్టుకోవాలి.  ఒకవేళ చేతులకు చీలమండలు అందకపోతే చేతులను తొడల దగ్గర నేలపై ఉంచాలి. ఊపిరి తీసుకుని వదులుతూ కడుపును లోపలికి తీసుకోవాలి. తలను భుజాలను నేలపై ఉంచి కాళ్లపై బరువు మోస్తూ మెల్లిగా నడుమును పైకి ఎత్తాలి. పై స్థితిలోకి వచ్చినప్పుడు గడ్డం   ఛాతీని తాకుతుంది. ఈ పొజీషన్లోకి వచ్చాక సాధారణ శ్వాస తీసుకుంటూ వీలైనంత వరకు ఆ భంగిమలో ఉండాలి. ఆ తరువాత శ్వాస వదులుతూ తిరిగి మామూలు స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చెయ్యాలి. *సేతుబంధాసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే.. నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది, నడుము కండరాలు అనువుగా మారతాయి.   మోకాళ్లు, తొడలు,  కోర్ కండరాలు బలాన్ని పొందుతాయి. వెన్నునొప్పి, స్లిప్ డిస్క్,  సయాటికా నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. వెన్నెముక బెండ్ కావడం, బోలు ఎముకల వ్యాధిలో ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, ప్రేగులు, మూత్రపిండాలు, కాలేయం, ప్లీహము, పురీషనాళం,  మూత్రాశయాన్ని బలపరుస్తుంది. ఇది అడ్రినల్, థైమస్, థైరాయిడ్,  పారాథైరాయిడ్ గ్రంధులను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్త్రీలలో అండాశయాలు,  గర్భాశయ బలాన్ని పెంచుతుంది.  రుతుక్రమం లోపాలను తొలగిస్తుంది. గమనిక: హెర్నియా, అల్సర్, మెడ నొప్పి సమస్యలున్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు.                                           *నిశ్శబ్ద.

సీతాకోకచిలుక ఆసనం.. మహిళల చింతలన్నీ మాయం! యోగాలో ఆసనాలు బోలెడు. ఈ ఆసనాలు కూడా మహిళలకంటూ కొన్ని ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి. వీటిని వేయడం వల్ల మహిళ అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మహిళలకు పెళ్లి, ప్రసవం, ఆ తరువాత మెనోపాజ్ వంటి కారణాల వల్ల శరీరంలో చాలా అసౌకర్యాలు ఏర్పడతాయి. వాటిలో కొన్నింటికి సీతాకోక చిలుక ఆసనం ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. వెన్నునొప్పి.. చాలామంది మహిళలు వెన్ను నొప్పి సమస్యతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే దీనికి సీతాకోకచిలుక ఆసనం చక్కని పరిష్కారం.  ప్రతిరోజూ సీతాకోకచిలుక ఆసనం ఫాలో కావడం వల్ల వెన్ను నొప్పి ఈజీగా తగ్గుతుంది. మానసిక ఒత్తిడి, తలనొప్పి.. మానసిక ఒత్తిడి, తలనొప్పి మహిళల జీవితంలో ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం వారు అనారోగ్య సమస్యలు లెక్క చేయకుండా ఇంటి పనులలోనూ, భర్త  పిల్లలను చూసుకోవడంలోనూ మునిగిపోతారు. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి కాస్తా మానసిక సమస్యలుగా రూపాంతరం చెందుతాయి. పదే పదే తలనొప్పి కూడా వస్తుంది. అదే సీతాకోకచిలుక ఆసనం వేస్తే ఇవి తగ్గిపోతాయి. నడుమునొప్పి.. ప్రసవం తరువాత, నెలసరి సమస్యలున్న మహిళలు చాలావరకు నడుము నొప్పితో ఇబ్బందులు పడుతుంటారు. సీతాకోకచిలుక ఆసనం ఈ నడుమునొప్పికి చక్కని పరిష్కారంగా నిలుస్తుంది. దీన్ని రెగ్యులర్ గా చేస్తే నడుమునొప్పి సమస్య తగ్గిపోతుంది. బలం.. చాలామందికి హిప్స్ బలహీనంగా ఉంటాయి.  మరికొందరికి హిప్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. హిప్ ప్యాట్ ఎక్కువగా ఉంటే శరీరం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.  సీతాకోకచిలుక ఆసనం వేస్తే హిప్స్ కు బలం చేకూరడంతో పాటు హిప్స్ ఫ్యాట్ తగ్గి మంచి ఆకృతిలోకి వస్తాయి. సీతాకోకచిలుక ఆసనం.. యోగా మ్యాట్ లేదా దుప్పటి పరుచుకుని దాని మీద పద్మాసనంలో కూర్చోవాలి. కాళ్లు రెండూ పొడవుగా చాపి కాళ్లు దగ్గరగా చేసి కూర్చోవాలి. ఇప్పుడు మోకాళ్లను మడుస్తూ కాలి పాదాలు రెండూ ముందుకి  తీసుకురావాలి. రెండు కాళ్ల పాదాలు ఎదురెదురుగా కలుసుకుని ఉండాలి. ఈ పొజిషన్ లో అలాగే ఉండి రెండు పాదాలను చేతులతో పట్టుకుని తొడల నుండి మోకాళ్లను పైకి కిందకు లేపుతూ సీతాకోకచిలుక రెక్కలు ఆడించినట్టు ఆడించాలి. ఈ ఆసనాన్ని  రోజూ చేస్తుంటే పైన చెప్పుకున్న ప్రయోజనాలన్నీ ఉంటాయి.                                         *నిశ్శబ్ద.

హలాసనంతో భలే లాభాలు.! యోగాతో  శరీరం చాలా ఫిట్ గా మారుతుంది. చాలామంది జిమ్ లో కసరత్తులు చేస్తారు, బరువులు ఎత్తుతారు, డైట్ ఫాలో అవుతారు. చాలా కష్టపడతారు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫలితాలు యోగా చేస్తే లభిస్తాయి. యోగాలో ఆసనాలు, ధ్యానం, శ్వాసవ్యాయామాలు ఇలా అన్ని ఉంటాయి. ఒక్కో ఆసనం వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది. యోగాలో ఉన్న ఆసనాలలో హలాసనం కూడా ఒకటి. హలము అంటే నాగలి. పొలాన్ని దున్నే నాగలి భంగిమలో ఉండటం వల్ల దీన్ని హలాసనం అని అంటారు. మహిళలు హలాసనం వేస్తే బోలెడు లాభాలుంటాయి.  ఈ ఆసనాన్ని ఎలా వెయ్యాలో.. దీని వల్ల కలిగే లాభాలేంటో  తెలుసుకుంటే.. హలాసనం వేసే విధానం.. హలాసనాన్ని ఖాళీ కడుపుతో మాత్రమే వెయ్యాలి. మొదట ప్రశాంతమైన ప్రదేశంలో దుప్పటి లేదా యోగా మ్యాట్ వేసుకోవాలి. యోగా మ్యాట్ మీద వెల్లికిలా పడుకోవాలి. ఇలా పడుకున్నప్పుడు కాళ్లు రెండూ పక్కపక్కనే ఆనుకుని ఉండాలి. చేతులు నడుముకు రెండు వైపులా అరచేతులు నేలకు తాకుతూ చాపుకుని ఉండాలి. శరీరాన్ని బిగించినట్టు కాకుండా వదులుగా రిలాక్స్ గా పడుకోవాలి. రిలాక్స్ గా పడుకున్నప్పుడు కాళ్లను నిటారుగా పైకి లేపి  లంబకోణంలోకి తీసుకునిరావాలి. ఇప్పుడు కాళ్ల పాదాలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటాయి. కాళ్లు ఇలా లంబకోణంలోకి తెచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు పాదాలను క్రమంగా వెనక్కు వంచుతూ పాదాలను తల వెనుకకు తీసుకెళ్ళాలి. అయితే ఈ ఆసనం వేసేటప్పుడు మోకాళ్లు వంచకూడదు. హలాసనం వల్ల కలిగే లాభాల.. హలాసనం శరీరాన్ని, మనస్సునూ ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ ఆసనం వేస్తే వెన్నెముక, భుజాలు బాగా బెండ్ అవుతాయి. ఈ కారణంగా వెన్ను నొప్పి, భుజాలనొప్పి వంటి సమస్యలున్న వారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. థైరాయిడ్ పనితీరు దెబ్బతింటే శరీరంలో చాలా సమస్యలు ఏర్పడతాయి. అయితే హలాసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా మారుతుంది. ఒత్తిడి, అలసట వంటి సమస్యలు ఉంటే కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు. కానీ హలాసనం వేస్తే ఒత్తిడి, అలసట దూరమై మంచి నిద్ర సొంతమవుతుంది. హలాసనం వేసే క్రమంలో పొత్తి కడుపు కండరాలు బాగా పనిచేస్తాయి. ఈ కారణంగా పొత్తికడుపు కండరాలు బలంగా మారుతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలుంటే అవి తగ్గుతాయి. శరీరంలో కండరాలన్నీ ఈ ఆసనం వేసేటప్పుడు పనిచేస్తాయి. ఈ కారణంగా శరీర కండరాల సామర్థ్యం పెరుగుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది. చెడు కొలెన్ట్రాల్ తగ్గుతుంది. హలాసనం వేయడం వల్ల మానసిక ఒత్తిడి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధ సమస్యలు దరిచేరవు.                                                      *నిశ్శబ్ద.  

ప్రసవం గురించి  భయాలున్నాయా? ఈ  వ్యాయామాలు చేస్తే!     ఆడపిల్లల జీవితంలో తల్లికావడం అత్యుత్తమమైన దశ. నెలలు గడిచేకొద్దీ కడుపులో పెరుగుతున్న బిడ్డ క్షేమం గురించి, ప్రసవం గురించి తలచుకుని భయపడుతుంటారు. ఈ భయాలను పోగొట్టి సుఖవంతమైన ప్రసవానికి బాట వేసేది ప్రసవం కోసం ప్రత్యేకంగా రూపొందింటిన వ్యాయామాలు. ఇవి ప్రసవ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ వ్యాయామాలలో పెరినియల్ మసాజ్, కెగెల్ వ్యాయామాలు ముఖ్యమైనవి.  ఇవి ప్రసవ సమయంలో కలిగే అసౌకర్యాన్ని దూరం చేసి  బిడ్డ  క్షేమంగా బయటకు వచ్చేందుకు సహాయపడుతుంది. పెరినియల్ మసాజ్ యోనికి పాయువుకు మధ్య కణజాలాన్ని సున్నితంగా సాగదీస్తుంది. బిడ్డ సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. యోని మార్గం చిరిగిపోయే ప్రమాదాన్ని అరికడుతుంది. కెగెల్ వ్యాయామాలు పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. ప్రసవం సాఫీగా జరగడానికి, ప్రసవం తరువాత మహిళలు వేగంగా కోలుకోవడానికి కూడా ఈ కెగెల్ వ్యాయామాలు సహాయపడతాయి. అసలు పెరెనియల్ మసాజ్ అంటే ఏంటంటే.. పెరెనియల్ మసాజ్ అనేది సుఖవంతమైన ప్రసవం కోసం యోని, పురీషనాళం మధ్య ప్రాంతాన్ని సాగదీయడానికి, ప్రసవం కోసం సన్నద్దం చేయడానికి చేసే మసాజ్. ఇది ప్రసవం సమయంలో యోని ప్రాంతం చిరిగిపోకుండా చేయడంలో సహాయపడుతుంది. యోనిని దృఢంగా మారుస్తుంది.  ప్రసవం సమయంలో నొప్పిని తగ్గిస్తుంది.  దీని వల్ల సరైన ఫలితాలు కావాలంటే 34నుండి 36వారాల గర్బం ఉన్నప్పుడు దీన్ని మొదలుపెట్టాలి. దీనికోసం శుభ్రమైన నూనెను చేతులతో లేదా కందెన  ఉపయోగించి మసాజ్ చేయాలి. మసాజ్ సమయంలో వెనుకకు కూర్చోవడం, పక్కకు కూర్చోవడం వంటి బంగిమలు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ మసాజ్ చేసేటప్పుడు సున్నితంగా ఒత్తిడి తెస్తూ కిందివైపుకు మసాజ్ చేయాలి. కెగెల్ వ్యాయామాలు అంటే ఏంటంటే.. కెగెల్ వ్యాయామాలు పెల్విక్ ఫ్లోర్ కండరాలను టార్గెట్ చేసుకుని చేసే వ్యాయామాలు. ఈ కండరాలను ఈ వ్యాయామాలు బలోపేతం చేస్తాయి. మూత్రాశయ నియంత్రణను మెరుగుపరుస్తాయి. ప్రసవం తరువాత తొందరగా కోలుకోవడంలో సహకరిస్తాయి. గర్బధారణ సమయంలో, గర్భధారణ తరువాత యోని లీక్ కావడం వంటి  సమస్యలను ఇది చక్కగా నియంత్రిస్తుంది. పెరినియల్ మసాజ్, కెగెల్స్ వ్యాయామం ప్రతిరోజూ అయినా చేయవచ్చు. లేదా వారానికి ఒకసారి ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని అయినా చేయవచ్చు. దీనిని భాగస్వాముల సహకారంతో చేయడం వల్ల గర్బవతులు మరింత సంతోషంగా తమ గర్బం మోసే కాలాన్ని అనుభూతి చెందగలుగుతారు.                                                          *నిశ్శబ్ద.

 వర్షాకాలంలో ఫిట్నెస్ విషయంలో బెంగా.. అయితే ఈ ఆసనాలు వేసేయండి..   ఫిట్ గా ఉండటం కోసం మహిళలు చాలా కష్టపడతారు. కానీ వారి కష్టానికి వాతావరణం శత్రువుగా మారే సందర్బం ఇది. ఈ వర్షాకాలంలో మహిళలు  ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడం కాస్త కష్టం.  తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల మధ్య  వ్యాయామాలు,  ఇతర వర్కౌట్లు చేయడం కాస్త కష్టం.  అయితే దీనికి కూడా చక్కని పరిష్కారముంది.  తేమతో కూడిన వాతావరణంలో నీటిని సరిపడినంతగా తీసుకుంటూ కాసింత గాలి వెలుతురు ఉన్న ప్రదేశంలోనే యోగా చేయడం వల్ల మహిళల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే..  సూర్య నమస్కారాలు.. సూర్యనమస్తారంలో  వేసే  భంగిమలు  క్రమంగా  శరీరాన్ని వేడెక్కేలా చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీలంలో పట్టుత్వాన్ని  పెంచుతుంది.  సూర్యనమస్కార  భంగిమలను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడ  శరీరంలో వివిధ  అవయవాలు సుష్టంగా మారతాయి, ఇది  అంతర్గత ముఖ్యమైన అవయవాలు మెరుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. రిథమిక్ శ్వాస ,  కదలికలు ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణంలో ఉత్తేజాన్నిస్తాయి. సాధారణ అభ్యాసంతో..  శరీరం, శ్వాస, శరీరంలో చైతన్యం  మధ్య లోతైన సంబంధాన్ని ఏర్పరుచుకునే అవగాహనను పెంచుతుంది. త్రికోణాసనం.. త్రికోణాసనం శరీరంలో ముఖ్యంగా ఛాతీ భాగాన్ని యాక్టీవ్ చేస్తుంది.  నిలబడుకుని ఉన్నప్పుడు ఇది భుజాలను సాగదీయడానికి సహాయపడుతుంది. శరీరం సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. శలభాసనం.. దీనినే మిడత భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం శరీరం వెనుక భాగంలో ఉండే కండరాలను యాక్టీవ్ చేస్తుంది. వీపు దిగువ భాగాన్ని బలపరుస్తుంది. భుజంగాసనం.. భుజంగాసనం లోతైన శ్వాసను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఊపిరితిత్తులు, ఛాతీ ఆరోగ్యం దృఢంగా మారడంలో ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. బాలాసనం.. బాలాసనం శరీరానికి మంచి ఓదార్పును ఇచ్చే భంగిమ. ఈ భంగిమలో వెనుక తుంటి భాగంను సాగదీసేటప్పుడు  శరీరం విశ్రాంతి దశలోకి వెలుతుంది.  ఈ కారణంగా ఇది శరీరానికి మంచి విశ్రాంతి అనుభూతి ఇస్తుంది. శవాసనం.. సాధారణంగా వెల్లికిలా శరీరాన్ని చాలా వదులుగా ఉంచి పడుకోవడమే శవాసనం. ఈ ఆసనంలో శరీరం చాలా విశ్రాంతి  దశలో ఉంటుంది. దీని కారణంగా శరీరంలో ఉష్ట్రోగ్రతను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది.                                                *నిశ్శబ్ద.

 యోగాతో హెర్నియేటెడ్ డిస్క్ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చంటే.. మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య వెన్నునొప్పి. వెన్ను నొప్పితో బాధపడే చాలామంది మూవ్ లేదా పెయిన్ కిల్లర్ వేసుకుని ఉపశమనం పొందుతుంటారు. అయితే ఈ వెన్ను నొప్పి సాధారణమైనది కాకపోవచ్చు.  హెర్నియేటెడ్ డిస్క్ సమస్య కావచ్చు. వెన్నుపూస మధ్య ఉన్న డిస్క్‌లు విడిపోయినప్పుడు,  డిస్క్ లోపలి భాగం పొడుచుకు వచ్చినప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది పక్కనే ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, ఇంటర్‌వర్‌టెబ్రల్ డిస్క్‌లు కుదించబడి, బయటికి ఉబ్బడం ప్రారంభించినప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో చీలిక ఏర్పడినప్పుడు హెర్నియేటెడ్ డిస్క్ సమస్య వస్తుంది. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు, కాళ్ళు, వీపు రెండూ ప్రభావితమవుతాయి. ఈ నొప్పి కదలికల ద్వారా తీవ్రమవుతుంది. హెర్నియేటెడ్ డిస్క్ ప్రధాన కారణాలు : వయస్సు, ధరించే దుస్తులు , కుంగిపోవడం కూడా వెన్నెముక క్షీణించడానికి కారణమవుతుంది. ప్రమాదాలు జగినప్పుడు వెన్నుభాగంలో గాయాలు కావడం ఈ సమస్యకు కారణం అవుతుంది. క్రీడలకు సంబంధించిన గాయాలు ప్రభావం చూపిస్తాయి. నిశ్చల జీవనశైలి కలిగిన మహిళలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. యోగాలో మూడు రకాల భంగిమలు వెన్నెముక అమరికపై దృష్టి సారిస్తాయి.  ప్రభావిత ప్రాంతంపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి, ఇది నొప్పిని,  అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉష్ట్రాసనం.. ఒంటెను సంస్కృతంలో ఉష్ట్రము అని అంటారు. అందుకే దీన్ని ఒంటె భంగిమ లేదా కామెల్ పోజ్ అని కూడా అంటారు. ఈ భంగిమ ద్వారా వెన్నెముక దృఢంగా మారుతుంది. దీన్ని ఎలా చేయాలంటే.. ఒంటె భంగిమలోకి రావడానికి, నేలపై మోకరిల్లి, ఆపై రెండు చేతులను  తుంటిపై ఉంచాలి.  పాదాల పై భాగం చాప మీద ఉండాలి. ఇప్పుడు వెన్నెముకను పొడిగించాలి.  మడమల మీద రెండు చేతులను ఉంచుతూ నెమ్మదిగా వెనుకకు వంచాలి.  మెడను చాచి తలను వెనుకకు వంచాలి. తరువాత, రెండు చేతులను అరికాళ్ళకు తాకుతూ ధనస్సులా వెనక్కు వంగాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. శలభాసనము.. ఈ భంగిమ మిడతను పోలి ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి మొదట బోర్లా పడుకోవాలి. ఇందుకోసం యోగా మ్యాట్ లేదా మెత్తగా ఉన్న దుప్పటి వంటిది ఉపయోగించాలి. బోర్లా పడుకుని చేతులు  కిందకు చాపాలి. నేలపై  నుదిటిని ముఖాన్నిఆనించి కాస్త  విశ్రాంతి తీసుకోవాలి.  ఊపిరి పీల్చుకున్నప్పుడు,  ఛాతీ, తల, కాళ్ళు  చేతులను నేల నుండి పైకి ఎత్తాలి. ఈ సమయంలో  కాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.  చేతులు ఇరువైపులా  ఫ్లాట్‌గా ఉండేలా చూసుకోవాలి. తరువాత,  కాళ్ళను,వేళ్లను వీలైనంతగా సాగదీయాలి. ఇది చేస్తున్నంతసేపు శ్వాస పీల్చడంపై దృష్టి పెట్టాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. తరువాత తిరిగి సాధారణ స్థితికి రావాలి. భుజంగాసనం.. సంస్కృతంలో పామును భుజంగం అంటారు. ఈ ఆసనం నాగుపాము నిలబడినట్టు ఉంటుంది. నేలపై పడుకుని రెండు అరచేతులు చదునుగా  భుజాల క్రింద ఉంచుకోవాలి. పాదాల పైభాగం  నేలపై ఫ్లాట్‌గా ఉండాలి. ఆపై బొడ్డు బటన్‌ను లోపలికి తీసుకుంటూ పెల్విస్ విభాగాన్ని బిగుతుగా చేయడం  ద్వారా పొట్ట కండరాలను  బిగించాలి. ఇప్పుడు అరచేతులను నొక్కుతూ వేళ్లను సాగదీయాలి. భుజం అంచులు ముందుకు వంచుతూ  భుజాలను వెనక్కి లాగాలి.  శరీర  పైభాగంలో  మొండెం ఉపరితలం నుండి  చేతులను నిఠారుగా ఉంచాలి. ఇప్పుడు పాదాలు, కాళ్ళను నేలపై గట్టిగా  ప్రెస్ చేయాలి.  గడ్డం పైకి వంచి, ఛాతీని పైకి ఎత్తాలి. ఇదే భుజాంగాసనం. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి. తరువాత సాధారణ స్థితికి రావాలి. ఈ మూడు ఆసనాలు ప్రతిరోజూ  వేస్తుంటే  డిస్క్ సమస్యలు తగ్గుతాయి.                                                       *నిశ్శబ్ద

గుండె సమస్యలు ఉంటే ఈ  4 యోగాసనాలు వేయకూడదు..!! శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగాసనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. రోజూ యోగా చేయడం  దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నిపుణులు కూడా ఇవే సలహా ఇస్తున్నారు.  యోగా అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం రెండూ సమతూకంగా ఉంటాయి .కానీ నిపుణుల సలహా తీసుకోకుండా కొన్ని యోగా వ్యాయామాలు చేస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు.. యోగా నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే యోగా వ్యాయామాలు చేయడం మంచిది. మీకు తోచినట్లు ఏదొక ఆసనం వేసినట్లయితే.. మరో అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యోగాసనాలు గుండె ఆరోగ్యానికి మంచివి కావు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో యోగా పాత్ర మరువరాదు.  యోగాసనాల ద్వారా అనేక రకాల గుండె సమస్యలు పరిష్కారమవుతాయనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే రోజూ కొన్ని యోగాభ్యాసాలు పాటిస్తే గుండెకు హాని కలుగుతుందని మీకు తెలుసా?  మరి అలాంటి యోగాసనాలు ఏంటో చూద్దాం... చక్రాసనం: సాధారణంగా, యోగా నిపుణులు వెన్నునొప్పి లేదా వెన్నుపాముకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నవారు చక్రాసనానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. అదేవిధంగా అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మధుమేహంతో బాధపడేవారు ఈ చక్రాసన యోగాభ్యాసం చేయకూడదని యోగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరాన్ని తేట్ చక్రం పద్ధతిలో ఉంచుతుంది కాబట్టి దీనిని చక్రాసనం అంటారు. ఈ ఆసనాన్ని అభ్యసిస్తున్నప్పుడు, శరీరం, గుండె రెండింటిపై అధిక ఒత్తిడి పడి, శ్వాస రేటు కూడా పెరుగుతుంది. ఇవి గుండెకు హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు.. ఈ యోగాభ్యాసం చేయకపోవడమే మంచిది. శీర్షాసన: శీర్షాసనం చేయడం అంత ఈజీ కాదు. ఈ యోగాభ్యాసం చేసే వ్యక్తి తన తలను నేలపై ఉంచి రెండు కాళ్లను పైకి ఎత్తాలి. అంటే మీరు తలక్రిందులుగా నిలబడాలి, మీ తల క్రిందికి, మీ కాళ్ళను పైకి ఉంచాలి. మీ శరీరాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేయాలి. ఈ యోగాభ్యాసం సమయంలో రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండెపై విపరీతమైన ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. హలాసనం: హలాసాన్ని నీల భంగి అని కూడా అంటారు. ఈ యోగాను అభ్యసించే వ్యక్తి ఉదర కండరాలపై పీల్చేటప్పుడు, నొక్కినప్పుడు నేల నుండి పాదాలను పైకి ఎత్తాలి. అటువంటి సందర్భంలో, వ్యక్తి గుండె శరీరం దిగువ భాగంలో రక్త ప్రసరణను కలిగిస్తుంది కాబట్టి, ఇక్కడ రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా, గుండె ప్రాంతానికి రక్త ప్రసరణ పెరిగే అవకాశం ఉంది, తద్వారా గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఈ యోగాసనాలు వేయకూడదు. కరణిఆసనం: నేలపై పడుకుని రెండు పాదాలను గోడలపై ఉంచి చేసే యోగాభ్యాసం ఇది. కానీ ఇలా చేయడం వల్ల గుండెపై అదనపు భారం పడుతుందని, రక్త ప్రసరణ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.-అందుకే ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కరణి యోగాను అతిగా చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సూర్య నస్కారాలు వాటి ఉపయోగాలు! ఇప్పుడున్న ఊరుకులపరుగుల జీవితం లో ఆరోగ్యం మీద శ్రద్ద లేకుండా పోతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఒత్తిడికి గురవడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి రోజు ఒక అరగంట వ్యాయామానికి సమయం కేటాయించడం వలన అందం, ఆరోగ్యం రెండింటిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఆ వ్యాయామాలు ఏంటో? వాటివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం . సూర్య నమస్కారం ఎనిమిది ఆసనాలతో 12 దశల్లో సాగుతుంది. * జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.. ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయడంవల్ల .. జీర్ణవ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఇది పేగులోలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని ముందుగు వంచడం, సాగదీయం వల్ల.. పొత్తికడుపుపై ఒత్తిడి పడుతుంది. ఇది కడుపులో చిక్కుకున్న గ్యాస్‌ తేలికగా బయటకు వెళ్లేలా సహాయపడుతుంది. రోజూ సూర్య నమస్కారం చేస్తే అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. * బరువు తగ్గుతారు.. ఒక సెట్‌ సూర్య నమస్కారం చేస్తే.. శరీరం నుంచి అదనపు కేలరీలు, కొవ్వును బర్న్‌ చేస్తుంది. సూర్యనమస్కారాలు వేగంగా చేయడం వల్ల.. వేగంగా బరువు తగ్గవచ్చు. ఇవి జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడతాయి. * పీసీఓఎస్‌ తగ్గిస్తుంది.. సూర్యనమస్కారాలు 12 వారాల పాటు 10 - 15 నిమిషాలు చేస్తే.. సాధారణ వ్యాయామాల కంటే.. చాలా ప్రభావవంతంగా ఉంటుంది. క్రమం తప్పిన పీరియడ్స్‌ను.. సమయానికి వచ్చేలా చేస్తాయి. సూర్య నమస్కారం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పీసీఓఎస్‌కు ఒత్తిడి హార్మన్‌ పెరగడం కూడా ఓ కారణం. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు.. క్రమతప్పకుండా సూర్యనమస్కారాలు ప్రాక్టిస్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. సూర్య నమస్కారం శరీరాన్ని డీటాక్స్‌ చేస్తుంది, అదనపు కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు విడుదల చేస్తుంది. స్ట్రెస్‌ తగ్గిస్తుంది.. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి. సూర్యనమస్కారాలలోని లోతైన శ్వాస ప్రక్రియలు.. నాడీ కణాలను రిలాక్స్‌ చేస్థాయి. ఇవి భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచుతాయి. రోజూ సూర్య సమస్కారాలు చేయడం వల్ల.. సృజనాత్మకత కూడా పెరుగుతుంది. * మెరిసే చర్మం మీ సొంతం.. సూర్య నమస్కారాలు.. సౌందర్య సంరక్షణలోనూ సహాయపడతాయి. ఈ ఆసనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖానికి ప్రకాశవంతమైన కాంతిని అందిస్తాయి. ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. సూర్యనమస్కారాలు నిద్రను ప్రేరేపిస్తాయి, విశాంతిని అందిస్తాయి, జీర్ణక్రయను మెరుగుపరుస్తుంది. సూర్యనమస్కారాలు.. వేగంగా చేస్తే చెమట ఎక్కువగా పడుతుంది. చమట ద్వారా చర్మంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి. మీ చర్మం తాజాగా మారుతుంది * వీళ్లు వేయకూడదు.. గర్భిణులు మూడోనెల తర్వాత సూర్య నమస్కారాలను వేయకూడదు. హైపర్‌టెన్షన్‌, గుండెజబ్బు, హెర్నియా, పేగుల్లో క్షయ వంటి సమస్యలు ఉన్నావారు, గతంలో స్ట్రోక్‌కు గురైనవారు సూర్యనమస్కారాలు వేయకూడదు. వెన్నునొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేసే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మేలు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పి ఉన్నవారు సూర్యనమస్కారాలు చేయవద్దు.

  యోగా లో జాగ్రత్తలు                                    యోగ చేయడమన్నది ఇప్పుడు సర్వ సాధారణమై పోయింది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ యోగ వైపు మొగ్గు చూపుతున్నారు . యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా, అది చేసే ముందు కొన్ని విషయాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. సాధారణంగా యోగాసనాలు చేయడానికి నేలమీద టవల్ పరచి చేస్తుంటారు. అయితే టవల్ కన్నా సూపర్ మార్కెట్ లో దొరికే యోగా మేట్ వాడటం మంచిది అంటున్నారు యోగ నిపుణులు. యోగ చేసే గది లేదా ఆ ప్రదేశంలో ఎలాంటి  ఫర్నీచర్ లేకుండా చూసుకోవడం అవసరం. యోగ చేసే గది వాతావరణం మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాక ఆ గదిలోని ప్రశాంతతకు భంగం కలగకుండా కూడా చూసుకోవాలి. వారంలో రెండూ లేదా మూడు సార్లు అని కాకుండా ప్రతిరోజూ యోగా చేసే విధంగా మీ దినచర్యని మార్చుకోండి. అలా చేయడానికి వీలున్నప్పుడే యోగా మొదలుపెడితే  ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు. యోగ చేయడం ఎవరికోసమో అన్నట్లు కాకుండా మీ కోసమే మీరు చేస్తున్నారు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఆహారం తీసుకున్న రెండు గంటల తరవాత యోగ చేయడం మంచిది. యోగ చేసే ముందు చాక్లెట్ లు, కాఫీ, ఆల్కహాల్, ఉల్లిపాయ , పుల్లటి పండ్లు, స్పైసీ లేదా మసాల నిండిన ఆహారం , ఇంకా మాంసాహారం తీసుకోకూడదు.. యోగ చేస్తున్నంత కాలం తాజా పండ్లు, కూరగాయలు మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిది. అందువల్ల అనుకున్న రీతిగా బరువుతగ్గడం, సౌందర్య పోషణ వంటి ఫలితాల్ని త్వరగా పొందగలుగుతారు . కొన్ని సందర్భాలలో మీ శరీరం యోగ చేయడానికి సహకరించకపోవచ్చు. అలాంటి  సందర్భాలలో మొండిగా యోగ చేయడానికి ప్రయత్నించక, విశ్రాంతి తీసుకోండి. యోగ చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో చేస్తేనే మంచిదని నిపుణులు చెపుతున్నారు.    

ఈ ఆసనాలు వేస్తే కొవ్వు కరిగిపోతుంది! ప్రస్తుతకాలంలో మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు.  ఎక్కువగా కూర్చొని పని చేయడం, తక్కువ శారీరక శ్రమ కారణంగా శరీరంలో అధిక కొవ్వు పెరుగుతుంది. రోజంతా డెస్క్ వర్క్ వల్ల శరీరంలో కింది భాగం బలహీనంగా మారుతుంది. అధిక కొవ్వు తొడలు, తుంటిలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, శరీరం పై భాగం కంటే దిగువ భాగంలో కొవ్వు పెరుగుతుంది దీనివీల్ల శరీరం లావుగా  కనిపిస్తుంది. ఊబకాయం లేదా శరీరంలో ఇలా పెరిగిపోయిన కొవ్వును వ్యాయామం లేదా యోగా ద్వారా తగ్గించవచ్చు. శరీర పరిస్థితికి అనుగుణంగా ఏ వ్యాయామం లేదా యోగా చేయాలో చాలామంది మహిళలకు తెలియదు. లావుగా ఉన్న తొడల కొవ్వును తగ్గించాలనుకుంటే, ఆయా ప్రాంతాలలో ఉన్న కొవ్వును కరిగించే యోగాసనాలు చెయ్యాలి. ఇందుకోసం యోగాలో ఎన్నో అసనాలున్నాయి కూడా. ఈ కింద పేర్కొన్న మూడే మూడు యోగాసనాల ద్వారా తొడలు, తుంటి భాగంలో పేరుకున్న కొవ్వును చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఉత్కటాసన ఉత్కటాసనాన్ని కుర్చీ భంగిమ అంటారు. ఈ ఆసనం చేయడానికి రెండు కాళ్ల మధ్య కొద్దిగా ఖాళీని ఉంచి, చేతులను ముందు వైపుకు చాచి, నమస్కార భంగిమలో అరచేతులను కలపండి. ఇప్పుడు చేతులను పైకి లేపి, మోకాళ్లను వంచి, కటిని తగ్గించాలి. ఇప్పుడు, చీలమండలు, మోకాళ్లను నిటారుగా ఉంచి, నమస్కార ముద్రలోకి వచ్చి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఈ భంగిమను ప్రతిరోజు పాటిస్తూ ఉంటే తొడల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.  ఏకపాదాసనం ఏకపాదాసనం చేయడం వల్ల తొడల్లోనే కాకుండా తుంటి భాగంలో పేరుకున్న కొవ్వు కూడా తొందరగా తగ్గుతుంది. పాదాలను వెడల్పుగా ఉంచి నిటారుగా నిలబడాలి. ఇప్పుడు చేతులు పైకి లేపి, ప్రాణ ముద్రలో అరచేతులను కలపండి. వీపును నిటారుగా ఉంచి, శ్వాస వదులుతూ, శరీరాన్ని నేలకి సమాంతరంగా ఉండే వరకు వంచాలి. ఈ సమయంలో, చేతులను చెవుల దగ్గర ఉంచి, నెమ్మదిగా వెనుకభాగాన్ని పైకి లేపాలి. కుడి కాలు, కటి, ఎగువ శరీరం, చేతిని నేరుగా పైకి ఎత్తండి. కళ్ళను నేలపై ఉంచేటప్పుడు బ్యాలెన్స్  చూసుకోవాలి. వృక్షాసనం.. వృక్షాసనం శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. ఈ ఆసనం చేయడానికి , నిటారుగా నిలబడి కుడి కాలును నేల నుండి పైకి లేపాలి. ఎడమ కాలుపై శరీర బరువును బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు కుడి కాలు లోపలి తొడపై ఉంచి, అరచేతులతో సపోర్ట్ ఇవ్వాలి. ప్రాణ ముద్రలో ఉన్నప్పుడు చేతులు పైకి ఎత్తాలి. ఈ యోగాను కొంత సమయం పాటు రిపీట్ చెయ్యాలి.                              ◆నిశ్శబ్ద.

చేతులు, కాళ్ళలో కొవ్వు పేరుకుని ఎబ్బెట్టుగా కనిపిస్తోందా... ఈ ఆసనాలు వేస్తే చాలు! కాలం ఏదైనా అమ్మాయిలు స్లీవ్‌లెస్ టీ షర్టులు లేదా టాప్స్ ధరిస్తారు. ఇక  షార్ట్స్ లేదా మినీ డ్రెస్ వేసుకుంటే ఫ్యాషన్ గా ఉంటుందని అటువైపు దృష్టి సారిస్తారు. కానీ కాళ్ళలో, చేతులలో పేరుకున్న కొవ్వు కారణంగా చాలామంది అధికబరువు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంటారు. కేవలం ఈ స్లీవ్ టాప్స్, మోకాళ్ళ వరకు ఉన్న షార్ట్ కారణంగా ఇలా జరగడం అమ్మాయిలకు చాలా చిరాకు తెప్పిస్తుంది. కాళ్ళూ, చేతుల్లో కొవ్వు కరగడం కోసం చాలామంది డైటింగ్ మాయింటైన్ చేస్తారు. నిజానికి కొన్ని శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫాలో అవ్వాల్సింది డైటింగ్ ప్లాన్ కాదు. ఆ భాగాల్లో కొవ్వు కరిగించే వ్యాయామం ఫాలో అవ్వాలి ఇలా చేతులు, కాళ్ళలో పేరుకున్న కొవ్వు కరిగించడానికి యోగా బాగా పనిచేస్తుంది. యోగా వల్ల పొట్ట, మెడ కొవ్వు తగ్గడంతోపాటు కాళ్లను, చేతులను టోన్‌గా మార్చవచ్చు. అందుకోసం వెయ్యాల్సిన ఆసనాలు ఏవంటే..  వశిష్ఠాసనం.. చేతుల కొవ్వును తగ్గించడానికి వశిష్ఠాసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ఆసనం నడుము కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి, ముందుగా ప్లాంక్ పోజ్ లోకి వెళ్ళి. క్రంచెస్ వేసేటప్పుడు ఎలాగైతే చేతులు పాదాల మీద శరీరం బరువు మోపుతూ బ్యాలెన్స్ చేస్తామో అదే ప్లాంక్ పోజ్. . అప్పుడు కుడి వైపున చెయ్యి, కుడి కాలి మీద బరువు ఉంచండి. ఆ తరువాత, ఎడమ కాలు, ఎడమ చేతిని పైకి లేపుతూ, ఎడమ పాదాన్ని కుడి పాదంపై ఉంచాలి. ఎడమ చేతిని మీ తొడలపై ఉంచాలి.  శ్వాస తీసుకుంటూ కొన్ని క్షణాలు ఈ స్థితిలో ఉండాలి. తరువాత ఊపిరి పీల్చుకుంటూ తిరిగి ప్లాంక్ పొజిషన్‌కు రావాలి. ఇదే వశిష్టాసనం.  కోణాసనం.. లావుగా  చేతులతో పాటు తొడల్లో ఉన్న కొవ్వును తగ్గించడానికి కోనాసన సాధన చేయవచ్చు. ఈ ఆసనం వేయడానికి, ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాల మధ్య దూరం ఉంచుతూ, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని పైకి కదపాలి. శ్వాస వదులుతున్నప్పుడు, వెన్నెముకను వంచి శరీరాన్ని ఎడమవైపుకు వంచాలి. ఎడమ చేతిని పైకి చాచి, తలను పైకి చూసేలా తిప్పాలి.  ఈ సమయంలో మోచేతులను సరళ రేఖలో ఉంచాలి. గాలి పీల్చేటప్పుడు పాత భంగిమకు తిరిగి వచ్చి, ఊపిరి పీల్చుకుంటూ ఎడమ చేతిని క్రిందికి తీసుకురావాలి.  మాలాసనం.. కాళ్లను సన్నగా చేయడానికి రెగ్యులర్ గా మాలాసనంను ప్రాక్టీస్ చేయవచ్చు. మాలసనం తొడలు, కాళ్ళను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన ఆసనం. ఈ ఆసనం దిగువ శరీరం యొక్క దృఢత్వాన్ని పెంచుతుంది, అదనపు కొవ్వును తొలగిస్తుంది. మాలాసనం చేయడానికి, పాదాల మధ్య దూరం ఉంచుతూ తాడాసనం స్థితిలో నిలబడాలి.  స్క్వాట్ పొజిషన్‌లో మోకాళ్లను వంచండి. ముందుకు వంగి రెండు చేతులను వంచి మోకాళ్లను లోపల ఉంచాలి. ఇప్పుడు నమస్కార ముద్రలో చేతులను గుండె దగ్గర ఉంచండి. ఇదే మాలాసనం. ఈ మూడు ఆసనాలు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే.. అమ్మాయిల కాళ్ళు, చేతులలో కొవ్వు తగ్గి అందంగా నాజూగ్గా మారతాయి.                                      ◆నిశ్శబ్ద.  

Importance of Yoga In Daily Life Yoga in Daily Life is a system of practice consisting of eight levels of development in the areas of physical, mental, social and spiritual health. Yoga can do in our daily life. Yoga keeps us physically and mentally fit. Helps in curing lethal diseases like Diabetes, H.B.P., Angina, Blockages in Arteries, Obesity, Asthma, Bronchitis, Leucoderma, Depression, Parkinson, Insomnia, - Migraine, Thyroid, Arthritis, Cervical Spondalities, Hepatitis, Chronic Renal Failure, Cancer, Cirrhosis of Liver, Gas, Constipation, Acidity etc. which are still a challenge in modern medical science. Yoga gives us new freshness and energy in daily life by giving body, breath and mind to stretch, relax and energize and responsible for the Body cleansing and purification of the blood. This helps us in maintaining a natural glow on our face. Yoga keeps immune system of the body very strong, which gives us the strength to fight against diseases or helps in improving our concentration.

వ్యాయామం తరువాత నొప్పులు వస్తున్నాయా.. ఇలా చేస్తే చాలు! మహిళల ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిలో వ్యాయామాలు ముఖ్య భాగం. మహిళల్లో ఎముకలు, కండరాలు, గుండె ఊపిరితిత్తులను బలపరుస్తుంది. కానీ వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. మహిళల శరీరంలో కండరాలు ముందే సున్నితంగా ఉంటాయి. అలాంటివారు పొట్ట కొవ్వు తగ్గించుకోడానికో.. నడుము కొవ్వు వదిలించుకోవడానికో.. పిరుదుల పరిమాణం తగ్గించుకోడానికో.. ఇలా కొత్త కొత్త వ్యాయామాలు మొదలుపెడుతుంటారు. ఇలా చేసినప్పుడు కండరాల నొప్పులు, కండరాలు చీలడం వంటి సమస్యలు వస్తాయి.   పోస్ట్-వర్కౌట్ నొప్పులకు తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను పాటించాలి. విశ్రాంతి వ్యాయామం తర్వాత నొప్పిని ఎదుర్కోవటానికి అతి ముఖ్యమైన చిట్కా విశ్రాంతి తీసుకోవడం. కండరాలు కోలుకోవడానికి అవి తిరిగి సాధారణంగా మారడానికి  సమయం కావాలి. అప్పటికే అలసిపోయిన కండరాలను మరింత దెబ్బతీసే ఎలాంటి కఠినమైన వ్యాయామం చేయకుండా ఉండాలి.  స్ట్రెచింగ్.. కండరాల నొప్పులు ఉండకూడదు అంటే దానికి మరొక మార్గం స్ట్రెచింగ్. స్ట్రెచింగ్ బిగుతుగా ఉండే కండరాలను విప్పడంలో వాటి పనితీరు సాధారణంగా మారడంతో సహాయపడుతుంది. ఇది గొంతు ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. హాట్, కోల్డ్ థెరపీ.. హాట్, ఓల్డ్ థెరపీ  వల్ల కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మంచు మంటను తగ్గించడానికి, నొప్పిని అణచడానికి సహాయపడుతుంది. వేడి నొప్పి ఉన్న ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కండరాల నొప్పులతో ఇబ్బంది పడేటప్పుడు ఈ రెండూ ఫాలో అవుతూ ఉండాలి.  మసాజ్.. కండరాలకు మసాజ్ చేయడం కూడా నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మసాజ్ వల్ల నొప్పి ఉన్న ప్రాంతంలో రక్త ప్రవాహం పెరుగుతుంది.  హైడ్రేట్ అలసిపోయిన కండరాలు తిరిగి హైడ్రేటెడ్ గా మారడం చాలా అవసరం. నీరు, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, కండరాలలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. నొప్పులు తగ్గించే ఆహారాలు.. శోథ నిరోధక ఆహారాలు తినడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. సాల్మన్, గింజలు, ఆకు కూరలు వంటి ఆహారాలు కండరాల నొప్పులు తగ్గించడానికి, కండరాల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి అద్భుతంగా సహాయపడతాయి. నొప్పి నివారణలు తీసుకోవాలి.. నొప్పి తీవ్రంగా ఉంటే, ఇబుప్రోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ నొప్పి నివారణలు మంటను తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అయితే ఈ నొప్పి నివారిణిలను మితంగా మరియు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించడం ముఖ్యం.  నిద్ర కండరాల పునరుద్ధరణకు తగినంత నిద్ర కూడా ముఖ్యం. దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి. శక్తి స్థాయిలను పునరుద్ధరించడానికి నిద్ర సహాయపడుతుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తేలికగా వ్యాయామం చేయాలి.. నడక, ఈత లేదా సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ తక్కువ-ప్రభావ వ్యాయామాలు కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి, ఇవి కండరాలు కోలుకోవడంలో  సహాయపడతాయి. అవగాహతో ఉండాలి.. కండరాల బెణుకులు, గాయాలను నివారించడానికి వ్యాయామం గురించి అవగాహన ముఖ్యమైనది. జీబ్ లో లేదా ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో వారు సూచించిన విధంగా మొదలుపెట్టడం ముఖ్యం. తరువాత కావాలంటే వాటిని ఒక్కరే కొనసాగించుకోవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

ప్రాణాయామం - ఆస్తమా నుంచి ఉపశమనం అస్తమా శ్వాస నాళాలకు సంబంధించిన వ్యాధి . మనం పీల్చే గాలి లోపలికి వెళ్ళేటప్పుడు గాని, లేదా ఒత్తిడి వల్ల గాని బ్రాంకియోల్స్‌ లోపలి పొర వాచి, మ్యూకస్‌ మెంబ్రేన్‌ ముడుచుకుపోతుంది.  దాని వల్లఅస్తమా రోగులు గాలి పీల్చడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.  ఈ వ్యాధి తీవ్రత వర్షాకాలంలో,లేదా శీతల ప్రాంతాల్లో ఉండేవారిలో అధికంగా ఉంటుంది. పెరుగుతున్న పారిశ్రామీకరణ, ఆహారపుటలవాట్లు, వాయుకాలుష్యం వల్ల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అస్తమాకు చికిత్స లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ క్రమం తప్పకుండా సాధన చేస్తే అస్తమాను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ప్రాణాయామం ద్వారా అస్తమా నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రాణాయామం ఎపుడు చేయాలి..? ప్రాణాయామం శ్వాసకు సంబంధించిన వ్యామామం. దీనిని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఉదయం 4 నుండి 6 గంటల లోపు వాతావరణం కాలుష్య రహితంగా ఉంటుంది. కాబట్టి స్వచ్చమైన గాలిలో, ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా యోగా మ్యాట్ పై కూచుని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడానికి ముందే ముక్కు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ ఆసనం చేసేటప్పుడు ముక్కు రంధ్రాలు మూస్తూ తెరుస్తూ ఉండాలి కాబట్టి ముక్కులో ఎటువంటి మలినం లేకుండా శుభ్రపరచడం వల్ల శ్వాస పీల్చే సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రాణాయామానికి కనీసం మూడు గంటలు ముందుగా ఏమీ తినకూడదు.    ప్రాణాయామం చేసే పధ్ధతి: మొదట యోగ మ్యాట్ పై కానీ, కుర్చీలో కానీ కంఫర్ట్ గా కూర్చోవాలి. వజ్రాసనం వేస్తే మరీ మంచిది. ముందుగా వీలైనంతగా గాలిని లోపలికి పీల్చాలి. వెంటనే గాలిని వదలకుండా, మీకు వీలైనంత సేపు ఊపిరి బిగపట్టి మెల్లిగా గాలిని వదలాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. ఆ తరవాత చూపుడు వేలుతో బాటు మధ్య వేలును మడచి నాభిని ఉబ్బిస్తూ గాలిని వదలాలి. అదేవిధంగా మెల్లిగా గాలిని పీలుస్తూ నాభిని కూడా లోపలికి లాగాలి, ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఆ తర్వాత కుడి చేతి బొటన వేలితో ముక్కు కుడి రంద్రాన్ని మూసి ఉంచి ఎడమ రంద్రం ద్వారా గాలిని లోపలికి పీల్చి సాధ్యమైనంత వరకు ఊపిరి బిగపట్టి మెల్లిగా గాలిని వదలాలి. తరవాత కుడి ముక్కు రంద్రాన్ని మూసి మీకు సాధ్యమైనంత వరకు ఊపిరి బిగపట్టి ఆ తరవాత కుడి ముక్కు రంద్రం ద్వారా గాలిని వదలాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఎడమ రంద్రాన్ని మూసి ఉంచి కుడి రంద్రం ద్వారా గాలిని పీల్చి వీలైనంత సేపు ఊపిరి బిగపట్టి ఆ తరవాత కుడి రంద్రాన్ని మూసి ఎడమ రంద్రం ద్వారా గాలిని వదలాలి. అదే విధంగా కుడి రంద్రాన్ని మూసి ఉంచి ఎడమ రంద్రం ద్వారా గాలి పేల్చి వీలైనంత వరకు ఊపిరి బిగపట్టి ఎడమ రంద్రాన్ని మూసి కుడి రంద్రం ద్వారా గాలిని వదలాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి.

ఆహరం : మనిషి జీవించి వుండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహారం నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలన్నీ వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా, ఆరోగ్యంగా బ్రతకవచ్చు. ఆకు కూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి(వెల్లుల్లి), నిమ్మ, కొబ్బరి మొదలుగా గా ఆహారపదార్థాలు మితంగా వాడాలి. ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్బుజా, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయి, నారింజ, కమలా, పనస, రేగి, ద్రాక్ష, సీతాఫలం మొదలుగా గల పండ్లు తినవచ్చు. ఆయా పండ్ల రసాలు తాగవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు, కిస్ మిస్, ఎండు ద్రాక్ష, ఆఖరోట్, వేరుసెనగ, పిస్తా, అంజీర మొదలుగా గల తిండి పదార్థాలు కూడా లభిస్తున్నాయి.   గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలచందలు, శనగలు, మొదలుగా గల తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తున్నాయి. పాలు, వెన్న, మీగడ, నెయ్యి, లస్సీ, మజ్జిగ, పెరుగు, పాలతో తయారయ్యే పాలు రుచికరమైన పదార్థాలు నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుంచి వెలువడు నూనెలు, తేనే, బెల్లం, పంచదార, తాటిబెల్లం, చెరకు మొదలుగా గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే, వేళకు తీసుకుంటూ వుంటే రోగాలు దరిదాపుకు రావు. గుడ్లు, చేపలు, మాంసం తామస పదార్థాలు వీటిని తిన్నందువల్ల తామసరాజస గుణాలు అధికం అవుతాయి. అందువల్ల వాటిని తినక పోవడం మంచిది. మద్యం, గంజాయి, బంగు, నల్లమందు, పొగాకు మొదలగునవి మత్తు లేక నిషా ఎక్కించే పదార్థాలు. వీటిని వాడకూడదు. ఖాద్య పదార్థాలు, స్వీట్లు, ఎప్పుడు బడితే అప్పుడు లభించాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలు పట్టుకుంటాయి. భోజనం రెండు పూటలు మాత్రమె చేయడం మంచిది. టిఫినుకు భోజనానికి మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి అవసరం. ఉదయం పూట 9 గంటల నుంచి 11 గంటల లోపున భోజనం చేసే వాళ్ళు ఉదయం తీసుకోకూడదు. మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య పండ్లు తినవచ్చు. పండ్ల రసంగాని, అలవాటు అయిన వాళ్ళు ఒక కప్పు, కాఫీ గాని, టీ గాని తాగవచ్చు. కాయ కష్టం చేసే వాళ్ళు తగిన పరిమాణంలో ఆహరం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్ళు తక్కువ ఆహరం తీసుకోవాలి. ఆహారపదార్థాల్ని తాగాలి, నీళ్ళను తినాలి, ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అనునది అందరికీ తెలిసిన నానుడియే. మనం తినే ఆహరం లాలాజలంతో కలిసి జీర్ణ కోశంలోకి వెళ్లి జీర్ణం అవుతుంది అంటే ఆహారాన్ని నీరువలె మార్చి తినాలన్నమాట. నీళ్ళు మరియు పేయ పదార్థాలు నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ వున్నట్లు తాగాలి. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టి పడతాయి. సూచనలు : 1) ప్రొద్దున మేల్కొనగానే చెంబెడు లేక గ్లాసెడు మంచి నీళ్ళు తప్పని సరిగ్గా తాగాలి. 2) మలమూత్ర విసర్జన చేయకుండా ఏమి తినకూడదు. ప్రొద్దున్నే మల విసర్జనం అలవాటు లేని వాళ్ళు అట్టి అలవాటు చేసుకోవాలి. అందుకు రెండు గ్లాసులు గోరు వెచ్చని నిరు తరగాలి. 3) భోజనం చేయునప్పుడు సాధ్యమైనంత వరకు మధ్యన నీళ్ళు తాగకూడదు. 4) యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్ది సేపటి దాకా ఏమి తినకూడదు. వాహ్యాళికి వెళ్లి వచ్చిన తరువాత కూడా కొద్దిసేపు ఏమి తినకూడదు. 5) నిద్రపోయే ముందు ఏమి తినకూడదు. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవది వుండటం అవసరం. 6) ఉపవాస సమయంలో టిఫిన్ల పెరట అమితంగా తినకూడదు. జబ్బు పడినప్పుడు పత్యంగా ఆహరం తీసుకోవాలి. 7) పాసిపోయిన, మురిగిపోయిన ఆహార పదార్థాలు తినకూడదు. 8) సగం పాడైన పండ్లు, పాడైనంత వరకు తొలగించి, బాగా వున్నది కదా అని మిగతా భాగం తినకూడదు. 9) భోజనం చేయుటకు ముందు నీళ్ళతో పాదాలు, ముఖం, చేతులు తప్పక కడుక్కోవాలి. అందువల్ల టెన్షను తగ్గుతుంది. భోజనం తేలికగా జీర్ణం అవుతుంది. 10) భోజనం చేయు సమయంలో ప్రశాంతంగా వుండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ వుండటం, మధ్య మధ్యన ఫోన్లు చేస్తూ వుండటం, ఫోన్లు వచ్చినప్పుడు భోజనం చేస్తూ మాట్లాడుతూ వుండటం సరికాదు. 11) భోజనానికి ముందు దైవ ప్రార్థన తప్పక చేయాలి. 12) భోజనం చేశాక 10 నిమిషాలపాటు పచార్లు చేసి, కనీసం 5 నుంచి 10 నిమిషాల సేపు వజ్రాసనం వేయాలి.

  సూర్య నమస్కారాలు   ఆసనాలు:  1. ప్రణామాసనం                        నిటారుగా ప్రార్థనా భంగిమలో నిలుచుని ఉండాలి. రెండు పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసలను ( inhale – exhale) చేయాలి. ' ఓం మిత్రాయ నమః ' అందరికీ మిత్రుడనైన నీకు అంజలి ఘటిస్తున్నాము అనే అర్థం వచ్చే ఈ మంత్రాన్ని పఠించాలి .   ప్రయోజనాలు : ఈ ఆసనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచడం వల్ల, మనస్సును హృదయం పై కేంద్రీకరించి ఉండటం వల్ల మనస్సు సూర్యాభివందనం చేయడానికి అనువుగా మారుతుంది. 2.హస్త ఉత్థానాసనం శ్వాస లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపుకు వెనుకకు వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగాను, చాలాకాలంగా అభ్యసిస్తున్న వారైతే గాఢంగాను ఊపిరి పీల్చుకోవాలి.  ' ఓం రవయే నమః' ప్రకాశవంతుడైన ప్రకాశదాతవైన నీకివే వందనాలు దేవా! అనే అర్థాన్నిచ్చే ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. ప్రయోజనాలు : వెన్నెముకకు శక్తి ఇవ్వడం , దాని రుగ్మతలను నిరోధించేది గాను ఈ ఆసనం పని చేస్తుంది. వెన్నెముకలోని నరాలను ప్రభావితం చేయడం వల్ల మనస్సును ఆహ్లాదంగా ఉంచుతుంది. ఛాతీని విరిచినట్లుగా వెడల్పుగా చేయడం వల్ల శ్వాసక్రియ మెరుగుపడి ఊపిరితిత్తుల శక్తి మెరుగుపడుతుంది. అంతేకాక థైమస్, థైరాయిడ్ వంటి గ్రంథులపై బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెంపు, మెటబాలిక్ హార్మోన్ ఉత్పత్తి, కాల్షియం, మెగ్నీషియం, మెటబాలిజం మెరుగుపరిచి, సారా థైరాయిడ్ చురుకుగా పనిచేస్తుంది. 3. పాదహస్తాసనం శ్వాసను వదులుతూ ముందుకు వంగి రెండు చేతులను నేలపై ఆన్చాలి. రెండు చేతులను నేలపై ఆన్చలేని పక్షంలో మోకాళ్ళను వంచి చేతులను పాదాలకు ఇరుపక్కలా ఉంచాలి. తల తొడలను చూస్తున్నట్లు ఉండాలి. ' ఓం సూర్యాయ నమః ' సకల ప్రాణుల పుట్టుకకు కారణమైన పరమాత్మ అనే భావాన్నిచ్చే ఈ మంత్రాన్ని జపించాలి. జాగ్రత్తలు: మెడ కింద వైపు వేలాడేలాగా ఉంచాలి. పైకి చూడకూడదు . అలా కానిచో మెడ పట్టేసే ప్రమాదముంది . ప్రయోజనాలు: ఈ ఆసనం వల్ల ఉదరం పై ఒత్తిడి పడిన కారణంగా జీర్ణ సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. చర్మం బిగువుగా యవ్వన కాంతితో ప్రకాశిస్తుంది . మెదడు చల్లబడి కోపాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తొడల వెనుక భాగానికి బలాన్నిస్తుంది , కొవ్వుని తొలగించి శరీరం నాజూకుగా మారడానికి ఈ ఆసనం సహకరిస్తుంది. 4.అశ్వ సంచలనాసనం లోనికి శ్వాసిస్తూ కుడిపాదం వెనుక వైపునకు కదిలించాలి. అదే సమయంలో శరీరాన్ని కిందకు వంచుతూ చేతులను నేలమీదకు వంచాలి. కుడి మోకాలుని కూడా అదే సమయంలో వెనుకకు వంచాలి. తల ఎత్తి ఇంటి కప్పులపైకి చూడాలి. నేలపై రెండు చేతులను ఉంచాలి. ఈ భంగిమలో శరీరం అర్థ చంద్రాకృతిని కలిగి ఉంటుంది. ' ఓం భానవే నమః ' అజ్ఞానాన్ని తొలగించే గురువుకు వందనం ' అనే అర్థాన్నిచ్చే మంత్రం పఠించాలి. జాగ్రత్తలు : ప్రారంభ దశలో ఎక్కువమంది సాధకులు మోకాలిని వెనుకకు వంచడాన్ని మరిచిపోతారు. శరీరమంతా సక్రమమైన భంగిమలో ఉన్నదా లేదా అన అంశాన్ని గమనించాలి. చాలామంది పైకి చూడటం మరిచిపోతారు . తప్పనిసరిగా తలను పైకెత్తి చూడాలి. థైరాయిడ్ గ్రంథి చర్య క్రమబద్ధం చేసేందుకు ఈ భంగిమ కీలకమైన పాత్రను కలిగి ఉంది. ప్రయోజనాలు: శరీరానికి మంచి ఆకృతిని ఇవ్వడంతో పాటు నాజూకుగా మలచడంలో ఈ ఆసనం ఉపయోగకారి. ఈ భంగిమలో థైరాయిడ్, ఎడ్రినల్, మరియు యురోజెనిటల్ గ్రంథులు వంటివి ఉత్తేజితమవుతాయి . శ్వాస సంబంధమైన ' సైనస్' సమస్యను అధిగమించడం, సంతాన సాఫల్యం , శ్వాసక్రియ మెరుగుపడటం - ఈ ప్రక్రియ వల్ల కలిగే ప్రయోజనాలు. . సూర్య నమస్కారాల్లోని మిగిలిన ఆసనాలు మూడవభాగంలో ..

సూర్య నమస్కారాలు పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస, వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి . హార్మోనుల అసమతుల్యాన్ని (ఇంబాలెన్స్ ని) సవరించడం వీటి వల్ల వచ్చే అదనపు ప్రయోజనం. జాగ్రత్తలు ఋతు సమయాలలోను, వెన్నెముక కింది భాగంలో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వీటిని ఆచరించకూడదు. గుండె , రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలున్న వారు, జ్వరం, అల్సర్ లు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయకూడదు. సూచనలు ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే జీవనశైలికి అలవాటుపడిన వారు, చెడు రక్తం, జీర్ణ సమస్యలు వంటి రుగ్మతలున్నవారు ' పవనముక్తాసన శ్రేణి' భంగిమలను మెల్లగా ప్రాక్టీస్ చేసి ఆ తరవాత సూర్య నమస్కారాలకు ఉపక్రమించాలి . పవనముక్తాసనం వలన శరీర భాగాలలోని మజిల్స్ సాగి, సూర్య నమస్కారాలలోని కదలికలకు అనువుగా సర్దుకుంటాయి. అలా కాని పక్షంలో కీళ్ళ నొప్పులు , జ్వరం, పాదాలవాపు , చర్మం పగలడం వంటి సమస్యలు వస్తాయి. సూర్యనమస్కారాలను సాయంత్రం వేళల్లో చేయకూడదు . సూర్యుని వైపు తిరిగి, వేకువఝామునే సూర్య నమస్కారాలు చేయడాన్ని అభ్యసించాలి.