తేనెతో పెదాలకు మరింత అందం! మొహానికి అందాన్ని తెచ్చి పెట్టేవి పెదాలంటే మీరూ  ఒప్పుకుంటారు కదూ. అలాంటి పెదాలు మరింత ఎర్రగా మెరిసిపోవాలంటే వాటిని మరికాస్త ఎక్కువగా పట్టించుకోవాల్సిందే. కొంతమందికి టెన్షన్ లో పెదాలు కోరికే అలవాటు ఉంటుంది. అది మానుకుంటే చాలు పెదాలు బండగా తయారవ్వకుండా ఉంటాయి. కొంత మంది పెదాలు నల్లగా ఉండి అందాన్ని తగ్గిస్తాయి. అలాంటివారు రాత్రి పడుకునే ముందు నిమ్మరసాన్ని రాసుకుని పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదాలపై ఉండే నల్ల మచ్చలు కూడా మాయమవుతాయి. ఇలాగే ఇంకొన్ని చిట్కాలని చూద్దామా. * మూడు స్పూన్ల పంచదార పొడిలో రెండు స్పూన్ల వెన్న కలిపి పేస్ట్ లా చేసి పెదాలకి పట్టించి ఉంచి ఒక గంట తర్వాత చన్నీళ్ళతో కడుగుకోవాలి.పంచదార డెడ్ స్కిన్ సెల్స్ ని తీసేస్తుంది,వెన్న మృదుత్వాన్ని ఇస్తుంది. * బీట్రూట్ పేస్టు ని రాత్రి పడుకునే ముందు పెదాలకి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకున్నా పెదాలు ఎరుపురంగులోకి మారతాయి. * ఒక స్పూన్ నిమ్మరసం, కొబ్బరి నూనె, రెండు స్పూన్ల పంచదార పొడి కలిపి పేస్ట్ లా చేసి ఉంచుకుంటే వారం రోజులు నిలవ ఉంటుంది. ఈ పేస్ట్ పెదాలకి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. * ఒక స్పూన్ స్ట్రాబెర్రీ పేస్ట్ లో రెండు స్పూన్ల పెట్రోలియం జెల్లీ కలిపి పెదాలకి పట్టిస్తే పెదాలు స్ట్రాబెర్రీ  రంగులోకి మారిపోతాయి. *   మనకి సులువుగా దొరికేవి గులాబి రేకులు. వాటిని ముద్దలా చేసి పెదాలకి పట్టించి ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే చాలు అందమైన పెదాలు మీ సొంతమవుతాయి. ఇలాంటివి చేస్తూ వీటితో పాటు తగినంత నీళ్ళు తాగటం వాళ్ళ కూడా పెదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. నీళ్ళతో పాటు ఆయా కాలాల్లో దొరికే పళ్ళు తినటం వల్ల కూడా పెదాలు అందంగా కనిపిస్తాయి. ఇలా కొద్దిపాటి శ్రద్ధ చూపిస్తే చాలు మాములుగా ఉండే మీ పెదాలు ఎర్రని ద్రాక్ష పళ్ళలా మెరిసిపోతాయి.    కళ్యాణి...

మీ అందాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు! అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. స్పాట్‌ లెస్‌ బ్యూటీ సొంతం చేసుకోవడానికి.. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్స్‌ ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ క్రీమ్‌లు, ఫేస్‌ ప్యాక్‌లు వాళ్ల చర్మతత్వానికి సరిపోతాయో? లేదో అన్న విషయం గురించి కూడా ఆలోచించరు. ఇలా ఏదిపడితే అది బ్యూటీ కేర్‌లో యాడ్ చేసుకుంటే.. చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది. మీరు మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 1. మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించడానికి.. రోజూ బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవడం తప్పనిసరి. సన్‌స్క్రీన్ మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది . మీ చర్మాతత్వానికి సరిపోయే సన్ స్క్రీన్ ని సరైన స్కిన్ కేర్ నిపుణులను అడిగి తెలుసుకుని మరి వాడండి .. ఏవి పడితే అవి వాడకూడదు .. దాని వల్ల మీ స్కిన్ డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తే తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్ రాసుకుంటూ ఉండాలి . 2. స్క్రబింగ్‌ వల్ల చర్మంపై పేరుకున్న మురికి, డెడ్‌ సెల్స్‌, టాక్సిన్స్‌ తొలగుతాయి. స్క్రబ్‌ ద్వారా చర్మంపై పేరుకొన్న మృతకణాలతో పాటు, దుమ్ము, ధూళి కూడా సులభంగా తొలగిపోతాయి. స్క్రబ్‌ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మగ్రంథులు తెరుచుకుని శుభ్రపడతాయి. అందుకే వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్‌ చేసుకుంటే.. చర్మం తాజా మారుతుంది. మొటిమలు ఎక్కువగా ఉంటే.. స్క్రబ్‌ చేయవద్దు. 3. నిద్ర లేవగానే, నిద్రపోయే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి. నిద్రపోయేటప్పుడు మన ముఖంపై పేరుకునే బ్యాక్టీరియాను తొలగించాలంటే ముఖాన్ని బాగా కడుక్కోవాలి. ముఖ్యంగా నిద్రపోయే ముందు మేకప్‌ని పూర్తిగా తొలగించి శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. 4. కొంతమంది ముఖం శుభ్రం చేసుకునేప్పుడు, రఫ్‌గా హ్యాండిల్‌ చేస్తూ ఉంటారు. గోళ్లతో గీరుకోవడం, ముఖాన్ని గట్టిగా రుద్దుకోవడం వల్ల.. చర్మ కణాలు దెబ్బతింటాయి. ఇలా చేయడం వల్ల మీ అందం దెబ్బ తింటుంది. మీ చర్మాన్ని సున్నితంగా ట్రీట్‌ చేయాలి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. 5. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. మీ డైట్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌, విటమిన్‌ ఈ, ఏ, సీ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. బాదం, వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఈ సమృద్ధిగా ఉంటుంది. 6. ఒత్తిడి, ఆందోళనలు అందంపై ప్రభావం చూపుతాయి. టెన్షన్‌ పడినప్పుడు మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా జరిగే శారీరక మార్పుల వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్ట్రెస్‌ కారణంగా.. పిగ్మెంటేషన్‌, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు దరిచేరడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో సమయం గడపండి.

 ప్రతి రోజూ ఉదయాన్నే చేసే ఈ ఆరు తప్పుల వల్ల అమ్మాయిలు  ఎంత నష్టపోతున్నారో తెలుసా?   ఉదయం లేచింది మొదలు మనిషి రోజు మొదలవుతుంది. ఈకాలంలో చాలామంది ఎక్కువగా ఆరోగ్యోం మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఆరోగ్యం అనుకుంటూ ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు. మరికొందరు సాధారణం అనుకునే అలవాట్లు ఎన్నెన్నో  నష్టాలకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు డైటింగ్ విషయంలోనూ, అందాన్ని కాపాడుకోవడంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీటిలో చాలావరకు లాభం చేకూర్చకపోగా నష్టం చేకూర్చుతాయి. వీటిని తెలుసుకోకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, పూర్తీగా అందం ఆరోగ్యం నష్టపోయాక భాధపడాలి. అందరూ కామన్ అనుకుంటూ చేస్తున్న ఆ ఆరు తప్పులు ఏంటో తెలుసుకుంటే.. ఓట్స్.. అమ్మాయిలు ఉదయాన్నే ఎక్కవగా తీసుకునే అల్పాహారం ఓట్స్. ఓట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరగరని తద్వారా అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చని అనుకుంటారు. కానీ ప్రతి రోజూ ఓట్స్ తీసుకుంటే ఉదయాన్నే శరీరానికి అందాల్సిన పోషకాలు చాలావరకు లాస్ అవుతారు. ఓట్స్ లో పైబర్, బరువు తగ్గింటే కారకాలు ఉంటాయి తప్ప శరీరానికి ప్రోటీన్ ఏమీ అందించదు. పైపెచ్చు ఓట్స్ ను ప్రతిరోజూ తింటే చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది. చర్మం మీద చారలు చారలుగా గీతలు ఏర్పడటం జరుగుతుంది. స్నానం.. ఉదయాన్నే వేడినీటితో స్నానం చేస్తే కలిగే రిఫ్రెష్మెంట్ యే వేరు. కానీ ప్రతిరోజూ వేడి నీటి స్నానం ఆరోగ్యానికి మంచి చేకూర్చకపోగా చెడు చేస్తుందంటున్నారు. వేడినీటి స్నానం శరీరంలో తేమశాతాన్ని చాలా తొందరగా లాగేస్తుందట. ఇక ముఖం కడగడానికి వేడి నీటిని ఉపయోగించడం వల్ల ముఖ చర్మం చాలా తొందరగా  ముడతలు వస్తాయి. ముఖం ముసలిగా మారిపోతుంది. కాఫీ.. చాలామందికి కాఫీ అనేది ఒక ఎమోషన్.  ఉదయాన్నే ఒక కప్పు కాఫీ పడితే కానీ పనులు ముందుకు సాగవు. ఆ తరువాత కాఫీ టిఫిన్  కు ముందు, ఇక చాలామందికి టిఫిన్ తరువాత  వేడిగా, స్ట్రాంగ్ గా కాపీ పడాల్సిందే. కానీ ఈ అలవాటు చాలా చెడ్డది. సహజంగానే కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. శరీరంలో ఉన్న టాక్సిన్ లు బయటకు వెళ్లడంలో ఇబ్బంది కలిగిస్తుంది. సన్ స్క్రీన్.. అమ్మాయిలు సన్ స్క్రీన్ అప్లై చేయడం లైఫ్ స్టైల్ లో భాగం చేసుకున్నారు. ఇది  సుర్యకిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కానీ కొందరు అలవాటులో పొరపాటుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్నానం తరువాత సన్ స్క్రీన్ అప్లై చేస్తుంటారు. దీని కారణంగా చర్మం దారుణంగా దెబ్బతింటుంది. అందుకే అవసరమైన సందర్బాలలో మాత్రమే సన్ స్క్రీన్ ఉపయోగించాలి. బ్యూటీ ప్రోడక్ట్స్.. చర్మం  ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి అమ్మాయిలు చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ చర్మం బాగుండాలంటే ఈ బ్యూటీ ఉత్పత్తులేవీ అక్కర్లేదు. కేవలం సీజన్ కు తగ్గట్టుగా చర్మ సంరక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అవేమీ పట్టించుకోకుండా సీజన్ తో సంబంధం లేకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడితే  ముఖచర్మం చాలా తొందరగా వృద్దాప్యంగా మారుతుంది. ఫేస్ వాష్.. ఉదయం లేవగానే చాలామందికి ముఖమంతా చాలా జిడ్డుగా ఉంటుంది.  దీన్ని వదిలించుకోవడానికి చాలా గాఢత కలిగిన కెమికల్స్ తో కూడిన ఫేస్ వాష్ లు ఉపయోగిస్తుంటారు. మరికొందరికి పేస్ వాష్ ఉపయోగించడం అంటే అదొక ఫ్యాషన్. కానీ  ఫేష్ వాష్ లు ముఖ చర్మాన్ని సున్నితంగా మార్చేస్తాయి. అందుకే  ముఖం జిడ్డుగా ఉంటే తేలికపాటి క్లెన్సర్ ని ఉపయోగించి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి.                                               నిశ్శబ్ద.  

హెయిర్ పాక్స్! ఎవరి జుత్తయిన వత్తుగా నిగనిగలాడుతూ ఉంటే మనసు పారేసుకోని  ఆడవాళ్లు ఉండరనటంలో ఆశ్చర్యం లేదు. అలాంటి శిరోజాలు పొడిబారి జీవం లేకుండా ఉంటే బ్యూటి పార్లర్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హెయిర్ పాక్స్ చేసుకోవటం ఎంతో సులభం. కొంతమంది జుట్టు పొడిబారిపోయి ఉంటే మరికొందరి జిడ్డుగా ఉంటుంది కదా?అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితోనే మళ్లీ అందమైన జుట్టుని తమ సొంతం చేసుకోవచ్చు. సాధారణ జుట్టుకి సరిపోయే హెయిర్ ప్యాక్: కేరట్ శరీరానికే కాదు జుట్టుకి కూడా మంచి బలాన్ని ఇస్తుంది. ఐదు కేరట్ దుంపలని మెత్తగా గ్రైండ్ చేసి పేస్టులాగా తయారుచేసుకోవాలి. ఆ పేస్టుని  జుట్టు మొదళ్ళ నుంచి చివరి దాకా బాగా పట్టించి నలభై నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత చల్లని నీటితో కడగాలి. జిడ్డుగా ఉండే జుత్తు కోసం(oily hair)   మూడు కమలాపండ్ల నుండి తీసిన తొక్కలను(పచ్చివి)  మెత్తగా గ్రైండ్ చేసుకొని, దానిలో ఒక స్పూన్ శెనగపిండి, 1/2 స్పూన్ కాఫీపొడి, ఒక కమలాపండు నుండి తీసిన జ్యూస్ ని అన్నిటిని కలిపి మెత్తటి ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుత్తుకి పట్టించి 25 నిమిషాల పాటు ఉంచి, తరువాత చల్లని నీటితో జుట్టుని కడగాలి.  ఈ విధంగా 15 రోజులకొకసారి మనకి కావలసిన ప్యాక్ ని వేసుకొంటూ ఉంటే జుత్తు అందం రెట్టింపు అవుతుంది. చుండ్రుని నివారించే హెయిర్ ప్యాక్ గుడ్డులో ఉండే తెల్ల సొనని అరకప్పు పెరుగులో కలిపి అందులో మూడు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ  మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట తర్వాత నీతితో కడగాలి. పదిహేను రోజులకొకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నిగనిగలాడే జుట్టు కోసం నాలుగు స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్టు చేసి అందులో రెండు స్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి అరగంట ఆరాకా చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా పదిరోజులకి ఒకసారి ఈ ప్యాక్ వెయ్యటం వల్ల జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది. జుట్టుకి ఎప్పుడు హెన్నా పెట్టుకున్నా లేదా ఎలాంటి ప్యాక్ వేసుకున్నా అదే రోజు షాంపూ వాడటం కన్నా మరుసటి రోజు షాంపూ వాడటం మంచిది.జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలకి మనకి అందుబాటులోనే ఎన్నో నివారణలు కూడా ఉంటాయి,వాటిని కాస్త ఓపికతో తెలుసుకుని అప్లై చేసుకుంటే చాలు,ఒత్తుగా నిగనిగలాడే మన జుట్టుని చూసుకుని మనమే మురిసిపోవచ్చు. - కళ్యాణి

కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ రహస్యం.. నివారణోపాయం! మహిళల ముఖం ఎంత అందంగా ఉన్నా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఉండటం వల్ల చెప్పలేనంత చిరాకు, విసుగు మాత్రమే కాకుండా ముఖారవిందాన్ని మొత్తం పాడు చేస్తుంటాయి. ఈ నల్లని వలయాలు పోగొట్టుకోవాలని మహిళలు చేసే ప్రయత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే… అయితే చేసే పని ఏదైనా దానికి తగినట్టు చేస్తున్నామా లేదా అనేది ఎంతో ముఖ్యం. సమస్య ఏమిటో తెలియకుండా వైద్యుడు మందు ఇవ్వడు అన్నట్టు.. సమస్యకు కారణం తెలియకుండా కనిపించిన చిట్కా పాటించడం కూడా తప్పే… కళ్ళ చుట్టూ వచ్చే నల్లని వలయాలకు కారణం ఏమిటి?? ఎందుకొస్తున్నాయి ఈ నల్లని వలయాలు.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి ముందు. కళ్ళచుట్టూ నల్లని వలయాలకు కారణాలు:- కళ్ళు, ముక్కు, పెదవులు ఈ అవయవాల చుట్టూ ఉండే చర్మం సహజంగానే సున్నితంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కళ్ళ కింద చర్మం ఎక్కువ సున్నితంగా ఉంటుంది. ఈ అవయవాల చుట్టూ ఉన్న ప్రాంతాలలో సబ్ క్యుటేనియస్ ఫ్యాట్ అనే పదార్థం ఉంటుంది. విపరీతంగా అలసట కలిగించే పనులు చేసేవారికి, పోషకాహార లోపంతో బాధపడేవారికి, రక్తహీనత కలవారికి, కళ్ళు, ముక్కు, పెదవుల ప్రాంతంలో ఉండే  ఈ పదార్థం తగ్గిపోయి అక్కడి చర్మం కాస్త లోపలికి పోతుంది. అయితే… కళ్ళ చుట్టూ ఉండే చర్మం మరింత సున్నితం కాబట్టి అక్కడి చర్మం చాలా తొందరగా ప్రభావానికి గురవుతుంది. ఫలితంగా కళ్ళచుట్టూ చర్మం నల్లబడుతుంది. ఇదే నల్లని వలయాలుగా మారుతుంది.  ఈ కారణం తెలుసుకోకుండా పై పూతగా చర్మానికి చెప్పలేనని క్రీమ్ లు ఉపయోగిస్తారు మహిళలు. కానీ దీనికి పాటించాల్సిన పద్ధతులు వేరుగా ఉంటాయి… దీనికోసం రెండు రకాల పద్ధతులు పాటించాలి.. ఒకటి లైఫ్ స్టైల్.. రెండు.. నాచురల్ టిప్స్.. లైఫ్ స్టైల్… లైఫ్ స్టైల్ అంటే తీసుకునే ఆహారం, అలవాట్లు మొదలైనవాటిలో మార్పు చేర్పులు చేసుకోవడం. తీసుకునే ఆహారంలో విటమిన్ ఎ,బి,సి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అలసట కలిగినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. అంతేకానీ అలసట కలుగుతున్నా అలాగే పని చేయకూడదు. సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే సమయానికి నిద్ర కూడా ఎంతో అవసరం. రోజులో తగినంత నిద్ర లేకపోతే కళ్ళు అలసిపోతాయి. మరీ ముఖ్యంగా సిస్టం ల ముందు పనిచేసేవారు స్క్రీన్ లైటింగ్ వల్ల కళ్ళ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. కళ్ళను చల్లని నీటితో అప్పుడప్పుడు కడగాలి. చేతులను రుద్దుకుని అందులో పుట్టే వేడిని సున్నితంగా కళ్ళకు తగిలేలా తుడవాలి. వీలైనంత ఎక్కువగా స్క్రీన్ నుండి దృష్టిని మళ్లించాలి.  శరీరానికి తగినంత వ్యాయామం ఉంటే శరీరం అలసిపోవడం వల్ల నిద్ర కూడా బాగా వస్తుంది. కాబట్టి వ్యాయామం చేయాలి. చిట్కాలు.. టీ డికాక్షన్ లో కాటన్ ముంచి తరువాత కాస్త పిండేసే తడిగా ఉన్న  ఆ కాటన్ ను కళ్ళ మీద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ లో  సగం స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు కళ్ళచుట్టూ రాసుకోవాలి.  ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే టమాటా రసం కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా తీసుకోవాలి. ఇవి రెండూ సమానంగా తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ రాసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలిమ్ ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ ఇ ఆయిల్ ను కళ్ళ కింద రాస్తున్నా మంచి ఫలితం ఉంటుంది. పై రెండు విధానాలు పాటిస్తే తొందరలోనే కళ్ళచుట్టూ నల్లని వలయాలు మాయమైపోతాయ్..                                     ◆నిశ్శబ్ద.

టీనేజ్ మొటిమలకు చెక్ చెప్పాలంటే... టీనేజ్ లోకి రాగానే ప్రతి వాళ్ళు ఎదుర్కొనే సమస్యే మొటిమలు. కాని వీటివల్ల అంతగా భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు డెర్మిటాలజిస్టులు. అప్పటిదాకా నున్నగా, ముద్దుగా కనిపించే మొహంలో ఎర్రగా కనిపించే ఈ మొటిమలు వాళ్ళ అందానికి ఆనకట్టలుగా కనిపిస్తాయి. కొంతమంది అంతగా పట్టించుకోకపోయినా,మరికొందరు మొటిమల మొహంతో బైటకి వెళ్ళాలంటే తెగ ఇబ్బంది పడిపోతారు. వయసు పెరుగుతూ 14, 15 సంవత్సరాల వయసు రాగానే శరీరంలో వచ్చే హార్మోన్ ఇమబాలన్స్ వల్ల ఎక్కువగా ఈ సమస్య మొదలవుతుందిట. శరీరంలో వచ్చే మార్పులు ఎదుర్కోవటం ఒక సమస్య అయితే ఈ మొటిమల బాధ ఇంకో సమస్య. దీనికోసం తల్లితండ్రులే కాస్త జాగ్రత్తలు తీసుకుని కొన్ని ఇంటి వైద్యాలు చేయటం వల్ల వాళ్ళ బాధని కొంతైనా తగ్గించగలుగుతారు. ఈ సమస్య నివారణకి ముఖ్యంగా చేయాల్సింది శుభ్రత పాటించటం. పిల్లలు పడుకునే పిల్లో కవర్స్ వారానికి ఒకసారి మర్చిపోకుండా మారుస్తూ ఉండాలి. వాళ్ళు అస్తమాట్లు మొటిమలని ముట్టుకోకూడదని హెచ్చరించాలి. వాటిని గిల్లటం వల్ల సమస్య ఇంకా పెద్దదవుతుందని చెప్పాలి. బయట తినుబండారాలు తగ్గించాలి. ఈ వయసులో ఎక్కువగా బయట నూనేతో చేసిన పదార్థాలు తినటం వల్ల మొటిమలు ఎక్కువ అవుతాయి. ఇక వచ్చిన మొటిమలనితగ్గించుకోవటం ఎలాగో చూద్దాం... బేకింగ్ సోడా - మొటిమల నివారణకు బేకింగ్  సోడా చక్కగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి ఆ పేస్టుని వాటి మీద రాసి కాసేపు ఉంచాకా నీతితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఓట్స్ - చర్మంలో ఉన్న సూక్ష్మ రంద్రాలనిశుభ్రపరిచే గుణం ఓట్స్ లో పుష్కలంగా ఉంది. అంతేకాక ఎక్కువగా ఉన్న జిడ్డుని కూడా తగ్గిస్తుంది. ఉడికించిన ఓట్స్ లో 1 స్పూన్ తేనే,1/2 స్పూన్ నిమ్మరసం కలిపి మొటిమలపై రాసి అరగంట తరవాత గోరువెచ్చటి నీటితో కడుగుకుంటే చాలు, సమస్య తగ్గుముఖం పడుతుంది. ముల్తాని మిట్టి -  మొహం మీద ఉండే మృత కణాలు సులువుగా పోవాలంటే ముల్తాని మిట్టి ఒక మంచి ఉపాయం. రోజ్ వాటర్, చందనం పొడి, ముల్తాని మిట్టి ఈ మూడింటిని సమపాళ్ళలో పేస్టులా కలిపి వాటిని మొహం మీద అప్లై చేసి అది ఆరేవరకు ఆగి నీటితో శుబ్రపరుచుకుంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు. టూథ్ పేస్టు - ఆశ్చర్యపోయే పని లేదు నిజంగానే టూత్ పేస్టు మొతిమలకి మంచి మందు. రాత్రి పడుకునే ముందు తెల్లగా ఉండే టూత్ పేస్టు మొటిమలపై రాసి మర్నాడు ఉదయం కడిగేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే రెండు, మూడు రోజులలోనే మార్పు గమనించచ్చు. దాల్చిన చెక్క పొడి - ఇంట్లో సులువుగా దొరికే దాల్చిన చెక్క పొడిని మొటిమల నివారణకు వాడచ్చు. రెండు చెంచాల తేనెలో ఒక చెంచా దాల్చీనీ పొడి కలిపి దానిని మొటిమలపై రాస్తే అవి బాగా తగ్గుతాయి. బొప్పాయి - బొప్పాయి కూడా మొటిమల నివారణకి ఒక మందులా పనిచేస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. పండిన బొప్పాయిని గుజ్జులా చేసి మొహానికి పట్టించాలి, అది పూర్తిగా ఆరాకా గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే చాలు మోహంలో మొటిమలు పోవటమే కాదు, నున్నగా కూడా కనిపిస్తుంది. అరటి తొక్క - అరటిపండు ఆరోగ్యానికి ఎంత మంచిదో దాని తొక్క మొటిమలకు అంత మంచి మందు. అరటి తొక్కతో మొహం మీద గుండ్రంగా రుద్దుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు ఇలా చేసాకా అరగంట ఆరనిచ్చి కడిగెయ్యాలి. బంగాళదుంప - ఇంట్లో ఉండే ఆలుని పెట్తటి పేస్టులా చేసి మొటిమలపై రాసి ఒక పావుగంట తరువాత కడిగితే మొటిమలు తగ్గుముఖం పడతాయి. మొటిమలతో బాధపడే వాళ్ళు వారానికి ఒకసారి మొహానికి ఆవిరి పట్టటం మంచిదని చెప్తున్నారు వైద్యులు. అలాగే పచ్చి పాలల్లో దూది ముంచి దానితో మొహాన్ని తుడుచుకుంటూ ఉండాలి. ఇలా చెయ్యటం వల్ల మొహం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మాయం అయ్యి మొహంలో నిగారింపు వస్తుంది. అలాగే టీనేజ్ లోకి వచ్చిన పిల్లలు ఎక్కువగా నూనేతో చేసిన పదార్థాలు తినటం తగ్గించాలి. ఇలా మొటిమలపై కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టావు. - కళ్యాణి

ఏళ్లు గడిచినా అందం చెక్కుచెదరకూడదంటే వీటిని తినాల్సిందే!    అందం వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంచారు. ఇందులో మహిళలదే పైచేయి. అందంగా కనిపించడం కోసం మహిళలు ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ వాడుతుంటారు.  కెమికల్స్‌తో నిండిన బ్యూటీ ప్రొడక్ట్స్   తాత్కాలిక అందాన్ని ఇస్తాయే కానీ దీర్ఘకాల అందాన్ని,  యవ్వనాన్ని ఎప్పటికీ అందించవు. పైపెచ్చు ఎక్కువ కాలం వాటిని వాడటం వల్ల చర్మం దెబ్బ తింటుంది. నిజానికి, బ్యూటీ ప్రొడక్ట్స్ చర్మం అందంగా కనిపించేలా చేస్తాయి  కానీ  చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా,  అందంగా ఉంచవు. కొల్లాజెన్ ఈ పని చేస్తుంది. కొల్లాజెన్ ఒక ప్రొటీన్. శరీరం  30 శాతం ప్రోటీన్ కొల్లాజెన్‌తో రూపొందించబడింది, ఇది  చర్మం, కండరాలు, ఎముకలకు సపోర్ట్ ను, బలాన్ని అందిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ  శరీరంలోని కొల్లాజెన్ విచ్ఛిన్నమవుతుంది.  కొత్త కొల్లాజెన్‌ను తయారు చేసే ప్రక్రియ కూడా క్రమంగా తగ్గుతుంది. అందువల్ల  తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి,  చర్మం వృద్ధాప్యాన్ని నిరోధించడానికి కొన్ని శక్తివంతమైన ఆహారాలు ఉన్నాయి. ఇవి ఔషదాలుగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..  అశ్వగంధ.. తీసుకునే  ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవాలి. ఇది ఆయుర్వేద మూలిక, దీన్ని  ఉపయోగించడం వల్ల  వృద్ధాప్య లక్షణాలను క్రమంగా తగ్గించవచ్చు. ఉసిరి.. ఉసిరిలో  విటమిన్ సి చాలా ఉంటుంది. ఉసిరి శరీరంలోని కొల్లాజెన్ స్థాయిని సహజంగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్య సంకేతాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు దెబ్బతిన్న చర్మాన్ని కూడా రిపేర్ చేస్తుంది.   తులసి.. తులసి గొప్ప ఔషద మూలిక. ఇందులో ఉండే  ఉర్సోలిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్,  యూజినాల్  చాలా శక్తివంతమైనవి. ఇవి  గొప్ప యాంటీఆక్సిడెంట్లు.  ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి తులసిలో చాలా  ఉంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే   చర్మంలో కొల్లాజెన్ పెరుగుతుంది. నెయ్యి.. నెయ్యిలో విటమిన్ ఎ, డి,  ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి ఎంతో అవసరం. విటమిన్ ఎ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా మార్చే  ప్రోటీన్. నెయ్యిలో విటమిన్లు కూజా చాలా  ఉంటాయి.  ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది,  అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రహ్మి.. బ్రాహ్మిని సరస్వతి అని కూడా అంటారు. ఇది  ఆయుర్వేద మూలిక. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కణాలను మెరుగుపరుస్తుంది,  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఫార్మాస్యూటికల్,  ఆయుర్వేద సూత్రీకరణలలో ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్,  స్ట్రెచ్ మార్కులను తేలికగా చేయడానికి ఉపయోగిస్తారు.                                            *నిశ్శబ్ద.

నెయిల్ పాలిష్ రిమూవర్ లేకుండా నెయిల్ పెయింట్ తొలగించుకోవచ్చు..  అమ్మాయిల అందానికి బోలెడు అలంకారాలు. వీటిలో దుస్తులు, నగలు, పాదరక్షల దగ్గర నుండి దుస్తులకు వేసుకుని పిన్నులు, జడలకు వేసుకుని క్లిప్పుల వరకు బోలెడు ఉంటాయి. ఇక చేతులు అందంగా కనిపించడం కోసం, బయటకు పార్టీలకు వెళ్లినప్పుడు అట్రాక్షన్ గా ఉండాలని గోళ్ళకు  నెయిల్ పాలిష్ వేస్తుంటారు. ఈ రోజుల్లో బట్టలకు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకునే ట్రెండ్ ఎక్కువైంది. నెయిల్ పాలిష్ వేయడం చాలా సులభం, కానీ దానిని తొలగించేటప్పుడు చాలా కష్టం. డ్రస్ మార్చిన ప్రతిసారి నెయిల్ పాలిష్ మార్చడం చాలామందికి సమస్యగా ఉంటుంది. కారణం నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా నెయిల్ పాలిష్ అంత ఖరీదైనదే.. భీభత్సంగా వాడితే అది మాత్రం అయిపోకుండా ఉంటుందా ఏంటి? అయితే  గోళ్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ కింది ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలు.. టూత్‌పేస్ట్.. పళ్లు తోమడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్  గోళ్లకున్న పాత నెయిల్ పాలిష్ తొలగించడంలో  కూడా ఉపయోగించవచ్చు.  ఇందుకోసం గోళ్లపై టూత్‌పేస్ట్‌ను రాసి లైట్ గా  బ్రష్ సహాయంతో గోళ్లను తేలికగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ తొలగిపోతుంది. టూత్‌పేస్ట్,  బేకింగ్ సోడా.. టూత్‌పేస్ట్‌లో బేకింగ్ సోడా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని  గోళ్లపై రాస్తే పాత నెయిల్ పాలిష్ చాలా సులువుగా  తొలగిపోతుంది. వేడి నీరు..  వేడి నీటి సహాయంతో నెయిల్ పాలిష్‌ను తొలగించుకోవచ్చు. ఇందుకోసం కొంచెం నీటిని ఒక పాత్రలో వేడి చేయాలి.  తరువాత వేళ్లను  గోరు వెచ్చని నీటిలో 25-30 నిమిషాలు ఉంచాలి. ఇది ఓపికతో కూడుకున్నది అయినా గతిలేని పరిస్థితిలో కచ్చితమైన ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఇస్తుంది.  ఇలా ఉంచితే క్రమంగా నెయిల్ పెయింట్ దానంతట అదే రాలిపోతుంది. నిమ్మరసం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉపయోగించడం  ద్వారా కూడా గోళ్ళకు ఉన్న  నెయిల్ పాలిష్‌ను వదిలించుకోవచ్చు. నిమ్మరసం కలిపిన నీళ్లలో గోళ్ళను ముంచాలి. ఇలా కొద్దిసేపు ఉంచితే  నెయిల్ పాలిష్ పోవడమే కాదు గోర్లు పూర్తిగా శుభ్రంగా ఉంటాయి. వెనిగర్  నెయిల్ పాలిష్‌ను తొలగించడానికి వెనిగర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం వెనిగర్‌లో నిమ్మరసం మిక్స్ చేసి చేతులకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే  నెయిల్ పాలిష్ ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది.                                                           *నిశ్శబ్ద.

కేవలం 10రూపాయలకే ముఖం చందమామలా మెరిసిపోతుంది! అమ్మాయిలు ముఖ చర్మం మెరిసిపోవడానికి ఎన్ని మార్కెట్ ఉత్పత్తులు వినియోగిస్తారో లెక్కపెట్టడం కష్టం. కానీ విచారించాల్సిన విషయం ఏమిటంటే..ఎన్ని వాడినా  చర్మం అలాగే కనిపిస్తుంది. టీనేజ్ అమ్మాయిల్లా చర్మం మిల్కీగా, ముడతలు లేకుండా, మెరుస్తూ ఉండాలనేదే అమ్మాయిల ఆరాటం అంతా. అయితే దీనికోసం వందలు, వేలు ఖర్చు పెట్టి బ్యూటీ ప్రోడక్ట్స్ కొని వాడక్కర్లేదు. కేవలం 10రూపాయల ఖర్చుతో అద్భుతం చేయవచ్చు.  ఈ టిప్ ఫాలో అయితే ముఖం మీద ముడుతలు, మచ్చలు, మొటిమల తాలూకు గుంతలు అన్నీ మాయమైపోతాయి. ఇంతకూ అంత మ్యాజిక్ చేసే టిప్ ఏంటి? దీన్నెలా ఉపోయోగించాలి తెలుసుకుంటే.. ఇప్పటికాలంలో బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యే అమ్మాయిలందరికీ విటమిన్-ఇ గురించి తెలిసే ఉంటుంది. జుట్టు పెరుగుదల కోసం క్యారియర్ ఆయిల్ తో కలిపి విటమిన్-ఇ ఆయిల్ ను అప్లై చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే కొబ్బరి నూనెలో విటమిన్-ఇ ఆయిల్ కలిపి రాయడం వల్ల మ్యాజిక్ జరుగుతుంది. రెండు స్పూన్ల  కొబ్బరినూనెలో రెండు విటమిన్-ఇ టాబ్లెట్ల ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని చిన్న కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. కావాలంటే ఎక్కువ మోతాదులో తయారుచేసి నిల్వచేసుకోవచ్చు. మొదటగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ముఖం మీద తడిలేకుండా తుడుచుకుని తయారుచేసుకున్న  ఆయిల్ ను నాలుగైదు చుక్కలు అరచేతిలో వేసుకుని బాగా రబ్ చేసి ముఖమంతా పట్టించుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని ఓ అయిదు నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయాలి. దీన్ని ఓ 20నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత ముఖం కడుక్కోవాలి. ఈ ఆయిల్ వల్ల మరింత మంచి ఫలితాలు కావాలంటే దీన్ని రాత్రి సమయంలో అప్లై చేయడం మంచిది. ఇలా చేస్తే ముఖ  చర్మంలోకి బాగా ఇంకిపోయి ముఖం మీద ముడుతలు తొలగించడంలో మరింత ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇలా ప్రతిరోజూ ఈ నూనెను అప్లై చేస్తుంటే ముఖ చర్మం చాలా తొందరగా యవ్వనంగా మారుతుంది. ఈ నూనె ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉదయం సమయంలో అప్లై చేయకపోవడం మంచిది. విటమిన్ ఇ లో  అధిక మోతాదులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కారణంగా ఇది   రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.  చాలామందికి ముఖంపై నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కూడా. ఇలాంటి మచ్చలు హార్మోన్ల అసమతుల్యత   లేదా ఎండకు  ఎక్కువగా చర్మం ఎఫెక్ట్ కావడం వల్ల వస్తుంటాయి.  విటమిన్-సితో కలిపి  విటమిన్-ఇ ఆయిల్‌ని ఉపయోగించడం ద్వారా  ఈ మచ్చలు తొలగించుకోవడమే కాకుండా హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడెలాగో వర్షాకాలం మొదలయ్యింది. వర్షం, చలికి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారి పెదవులు చాలా తొందరగా పగులుతాయి. ఇలాంటి వారు పగిలిన పెదవులు, పెదవుల మూలల్లో విటమిన్-ఇ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల చర్మం రిపేర్ అయ్యి సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో విటమిన్-ఇ తో స్కిన్ కు మ్యాజిక్ చేయండి.                                                 *నిశ్శబ్ద.

కళ్ళు పెద్దగా కనపడాలంటే....   అమ్మాయి అందాన్ని పొగడాలంటే ముందుగా కవులు పొగిడేది వాళ్ళ కళ్ళనే. కళ్ళు పెద్దగా ఉంటే చాలు అందం రెండింతలు ఎక్కువవుతుంది. మరి చిన్న కళ్ళు ఉన్న వాళ్ళ సంగతేంటి అంటే దానికీ ఉపాయాలు లేకపోలేదు. వేసుకునే మేకప్ లో, తీసుకునే జాగ్రత్తల్లో కాస్త మెళకువలు పాటిస్తే చాలు చిన్న కళ్ళని కూడా పెద్దగా చూపించచ్చు. మరి అవేంటో చూసేద్దామా. మనం రోజూ పెట్టుకునే కాటుకతో పాటు మరికొన్ని మేకప్ ఐటమ్స్  జతచేసుకోవటం ఎంతైనా అవసరం. ఐ లైనర్ కళ్ళని పెద్దగా చూపించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది  వేసుకోవటం మొదట్లో కాస్త రాకపోయినా అలవాటయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. మొదటిగా ఒకేసారి కనురెప్పలపై  పెద్దగా ఐ లైనర్ దిద్దుకుని వెళితే మీ స్నేహితులు మిమ్మల్ని ఏడిపించే వీలుంది. కాబట్టి మొదట్లో  రెప్పలపై సన్నగా వేసుకోవటం మంచిది. అలా అలా ఆ లైన్ ని పెంచుతూ వెళ్ళండి.   మస్కారా కళ్ళని పెద్దగా చూపించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనురెప్పలని పైకి ఒత్తుతూ వేసుకునే మస్కారా వల్ల  కళ్ళు విశాలంగా కనపడతాయి. కొంతమందికి కనుబొమలు, కనురెప్పలు కూడా పల్చగా ఉంటాయి. అలాంటి వాళ్ళ కళ్ళు మరీ చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు రోజూ పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుంటే కొన్ని రోజుల్లోనే అవి వత్తుగా మారతాయి. కొంతమంది ఆముదాన్ని కూడా వాడతారు.   కళ్ళకి ఐ లైనర్ పెట్టుకునేటప్పుడు కంటి చివర వరకు  దానిని అప్లై చేస్తూ కాస్త బయటకి కూడా తీసుకెళ్ళి కోన్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే కళ్ళకన్నా కాస్త బయటకి తీసుకెళ్లటం అన్నమాట. రెగ్యులర్ గా ఐబ్రోస్ షేప్ చేయించుకుంటూ ఉండాలి కూడా. ఐబ్రోస్ ఎప్పుడయితే మరీ వత్తుగా ఉంటాయో అప్పుడు అవి కళ్ళని డామినేట్ చేస్తాయి. అలా కాకుండా చూసుకుంటే చాలు.   మనం ఎంత మేకప్ వేసుకున్నా కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ కళ్ళ అందాన్నిదెబ్బతీసి అవి హైలైట్ అవ్వకుండా చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ పోవటానికి ఒక మంచి చిట్కా ఉంది. రెండు స్టీల్ చెంచాలని రాత్రి పడుకునే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచండి. ఉదయం లేవగానే వాటిని కళ్ళపై బోర్లించి మూడు నిముషాలు అలానే ఉంచండి. దీనివల్ల కళ్ళ చుట్టూ ఉండే నలుపు పోవటమే కాదు ఆ రోజంతా కళ్ళు కాస్త పెద్దగా కనిపించటం కూడా మీరే గమనించచ్చు. అలాగే కనురెప్పలు  వెనక్కి వంపు తిరిగి ఉండాలంటే రెండు చెంచాలని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి వాటిని తీసి కనురెప్పలను వంచుతూ వెనక్కి నొక్కి పెట్టి ఆ చెంచాను అలానే ఉంచాలి. రెండు మూడు నిమిషాల తరువాత తీసి చూస్తే రెప్పలు వంపు తిరిగి కనిపిస్తాయి. అవి ఆ రోజంతా అలానే ఉంటాయి కూడా. ఇప్పుడు మార్కెట్ లో ఫాల్స్ ఐ లాషేస్ కూడా దొరుకుతున్నాయి. వాటిని జాగ్రత్తగా పెట్టుకోవటం వస్తే చాలు, వాటివల్ల కూడా కళ్ళు పెద్దగా కనిపిస్తాయి. మొత్తానికి చిన్నగా కనిపించే కళ్ళు మరింత అందంగా, ఆరోగ్యంగా కనపడాలంటే రోజూ తగినన్ని నీళ్ళు తాగటం మర్చిపోకూడదు. అలాగే కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి వాటి కోసం వాడే ఐ లైనర్స్, మస్కారా, ఐబ్రో పెన్సిల్, కాజల్ ఇలాంటివన్నీ మంచి కంపెనీవి ఎంచుకుని కొనుక్కోవాలి. ఎంతైనా కళ్ళే కదా మనకి అందాన్ని రెట్టింపు చేసేవి. - కళ్యాణి

జుట్టు బాగా రాలిపోతోందా...ఈ నాలుగు వాడితే సెట్! నేటి కాలంలో చాలామంది  జీవనశైలి దారుణంగా తయారైంది.  బయటి ఆహారం,  పానీయాల కారణంగా  శరీరంలో ప్రతి భాగం ఊహించని ప్రతికూలతలు ఎదుర్కొంటుంది. ఇలా ప్రతికూలతలు కలిగే వాటిలో జుట్టు మరీ ముఖ్యమైంది. జుట్టు తెల్లబడటం, రంగు మారటం, చిన్నవయసులోనే బట్టతల, జుట్టు సామర్థ్యం తగ్గడం, పలుచగా మారడం ఇలా చాలా విధాలుగా జుట్టు దెబ్బతింటుంది.  ఇక జుట్టు రాలడం, తలలో చుండ్రు వంటి సమస్యల గురించి చెప్పక్కర్లేదు.  జుట్టు ఎక్కువగా రాలడం వల్ల బట్టతల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఆడవారిలో కూడా కనిపించడం చాలా విచారించాల్సిన విషయం.  దీని కోసం ప్రజలు అనేక రకాల హెయిర్ ట్రీట్మెంట్ లు తీసుకుంటారు.  కానీ ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా సరైన ప్రభావం కనిపించడం లేదు. అయితే  శరీరం అంతర్గతంగా పోషకాలను పొందినప్పుడు మాత్రమే జుట్టు బలంగా ఉంటుంది.  శరీరానికి ఏయే పదార్థాలు లభిస్తే జుట్టు బలంగా ఉంటుంది. వేటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుంటే వాటిని ఫాలో అవ్వడం వల్ల ఆరోగ్యవంతమైన, ధృడమైన జుట్టును పొందవచ్చు. అవేంటంటే.. క్యారెట్ విటమిన్ ఎ క్యారెట్‌లో పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లను బాగా  ఉపయోగించడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. ఇది తలలో సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల జుట్టు హైడ్రేటెడ్ గా,  ఆరోగ్యంగా మారుతుంది. క్యారెట్ తినడం వల్ల రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. గుడ్లు గుడ్డులో ఉండే ప్రొటీన్లు జుట్టును లోపలి నుండి దృఢంగా మార్చుతాయి. గుడ్లలో కూడా బయోటిన్ ఉంటుంది, ఇది జుట్టుకు చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడానికి ప్రయత్నించండి. సిట్రస్ పండ్లు సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. మీ జుట్టు రాలుతున్నట్లయితే, విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితం  ఉంటుంది. అవకాడో అవకాడోలో పొటాషియం, బి విటమిన్లు,  ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. అంతేకాదు  జుట్టును మందంగా చేస్తాయి.కాబట్టి ఆహారంలో అవోకాడోను చేర్చడానికి ప్రయత్నించండి.                                          *నిశ్శబ్ద

అందమైన గోళ్లు కావాలా ఇదిగో అయిదు టిప్స్ పాటిస్తే చాలు!   అందమైన గోళ్లు ఎంతోమంది అమ్మయిలకు ఇష్టం. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా, పొడవుగా మెరుస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. అందంగా నెయిల్ పాలిష్ వేసుకుని అట్రాక్షన్ గా కనిపించడం కొందరికి ఇష్టమైతే సాధారణంగా గులాబీరంగులో ఉన్న గోళ్లను చూసి మురిసిపోవడం మరికొందరికి ఇష్టం. మొత్తానికి గోళ్ల వల్ల ఏదైనా సమస్య ఉంటే అబ్బాయిలు బెంగ పడిపోతారు.   గోళ్లకు ప్రత్యేక శ్రద్ధ అవసరం, ఎందుకంటే రోజులో  వేడి, తేమ గోళ్లకు తగులుతూ ఉంటాయి. వీటి కారణంగా అవి పొడిగా, పెళుసుగా  మారి తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన గోళ్ల రహస్యం ఏమిటా ని చాలా మంది నెట్టింట్లో వెతికేస్తూ ఉంటారు. బలమైన, ఆరోగ్యకరమైన, మెరిసే గోళ్లు కావాలంటే దోసకాయలు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలలో నీరు బాగా ఉంటుంది. అలాగే వీటితో పాటు శరీరానికి సరిపడినంత నీరు తీసుకోవాలి.  గోర్లు మరియు క్యూటికల్స్‌ను ఆరోగ్యంగా  ఉంచడానికి వాటికి మాయిశ్చరైజింగ్ హ్యాండ్ లోషన్ లేదా నెయిల్ ఆయిల్‌ను అప్లై చేయవచ్చు. గోరు సంరక్షణకు ముఖ్యమైన చిట్కాలు: చేతి తొడుగులు ధరించాలి.. కఠినమైన రసాయనాలు, దుమ్ము, ధూళి చేతులకు తగిలే పరిస్థితులు ఉన్నప్పుడు గోళ్లను రక్షించడానికి గ్లౌజులు ధరించాలి. సింకులో పాత్రలు కడగడం, టాయిలెట్ క్లినింగ్, రసాయనాలు ముట్టుకోవడం వంటి సందర్భాల్లో గ్లౌజులు బెస్ట్ ఆప్షన్. ఇదంతా విదేశాల్లో చేస్తారు మనకెందుకు అనుకుని తీసిపారేయాల్సిన అవసరం లేదు. మంచి చేకూర్చే అలవాటు ఏదైనా పాటించడంలో తప్పులేదు. విటమిన్ డి.. విటమిన్ డి ఆరోగ్యకరమైన గోళ్లను అందిస్తుంది. సూర్యరశ్మి ద్వారా ఇది మనకు లభిస్తుంది. అయితే ఎక్కువ ఎండకు గోర్లు గురైనప్పుడు గోళ్లు పెళుసుబారతాయి.  మీ గోర్లు ఎండిపోవచ్చు, రంగు మారవచ్చు లేదా ఎక్కువ సూర్యరశ్మితో పగుళ్లు రావచ్చు. బయట ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు, మీ చేతులు మరియు గోళ్లకు సన్‌స్క్రీన్‌ అప్లై చేయాలి. ఎక్స్‌ఫోలియేట్ చేయడం మర్చిపోకండి.. చర్మాన్ని  ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల గోళ్లు, క్యూటికల్స్ కూడా ప్రయోజనం పొందుతాయి. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, గోళ్లకు రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి, మృదువైన నెయిల్ బ్రష్ లేదా బాడీ స్క్రబ్ ఉపయోగించాలి.  అదనంగా, ఇది మీ క్యూటికల్స్ ఆరోగ్యంగా కనిపించేలా, పెరుగుదల లేకుండా ఆగిపోయిన గొళ్లను మళ్ళీ పెరిగేలా చేస్తుంది.  గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి..  పొడవాటి గోళ్లు అందంగా అనిపించవచ్చు, కానీ గాఢత కారణంగా అవి విరిగిపోయి, గీసుకోవడం కోసుకోవడం జరిగి హాని కలిగించే అవకాశం ఉంది. అందుకే గోళ్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి.  దీనివల్ల గోళ్ల పరిశుభ్రతను కొనసాగించడం సులభం అవుతుంది.  నెయిల్ పాలిష్ నుండి విరామం తీసుకోవాలి.. నెయిల్ పాలిష్ వేసుకోవడం  చాలామందికి ఇష్టం. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ నెయిల్ పాలిష్ నుండి  గోళ్లకు విరామం ఇవ్వడం చాలా ముఖ్యం.  అన్ని సమయాల్లో నెయిల్ పాలిష్ ధరిస్తే గోళ్లు బలహీనంగా, పెళుసుగా మారవచ్చు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే గోళ్లకు నెయిల్ పాలిష్ వేస్తుండాలి.                                    ◆నిశ్శబ్ద.

ముఖ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ ఫేస్ మాస్క్ బెస్ట్! అమ్మాయిలు తమ ముఖం చాలా అందంగా కనిపించాలని అనుకుంటారు. ఇక ఫంక్షన్లు, ప్రత్యేక సందర్భాలలో ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం చాలా రకాల ఫేస్ ప్యాక్ లు, క్రీములు, బ్యూటీ థెరపీలు తీసుకుంటారు. అయితే ముఖం కాంతివంతంగా కనిపించడానికి  కొన్ని రకాల ఫేస్ మాస్క్ లు చాలా బెస్ట్ గా పనిచేస్తాయి. అలాంటి వాటిలో మందార పువ్వుల ఫేస్ మాస్క్ చాలా బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. ఇంతకీ ముఖం మెరిసిపోవాలి అంటే మందార ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలి? దీని వల్ల కలిగే ఇతర బెనిఫిట్స్ ఏంటి?  తెలుసుకుంటే.. మందార పువ్వులను హైబిస్కస్ అని కూడా అంటారు. ఇది జుట్టుకు, చర్మానికి చాలా గొప్పగా సహాయపడుతుంది. మందార పువ్వులతో ఫేస్ మాస్క్ వేస్తుంది ముఖం యవ్వనంగా మారుతుంది.  ముఖం మీద ముడుతలు, గీతలు, మచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. మందార ఫేస్ మాస్క్ వేసుకోవడానికి కావలసిన పదార్థాలు.. మందార పొడి 2 టేబుల్ స్పూన్లు.. పచ్చి తేనె 1 టేబుల్ స్పూన్..   పాలు.. 1 టేబుల్ స్పూన్.. పై మూడు పదార్థాలను ఒక చిన్న గిన్నెో వేసి బాగా మిక్స్ చేసి మెత్తని పెస్ట్ లా చేసుకోవాలి.   మొదట ముఖాన్ని చల్లని నీటిలో శుభ్రపచుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ముందైనా ఇదే పని చేయాలి. ఇలా చేస్తే ఫేస్ ప్యాక్ తాలూకు మెరుపు, వాటిలోని గుణాలు చర్మానికి బాగా పనిచేస్తాయి. ముఖం  శుభ్రం చేసుకున్నతరువాత తయారుచేసుకున్న మందార పువ్వుల మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ ను ముఖం మీద 20నిమిషాల పాటూ  అలాగే ఉంచి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. మందార ఫేస్ ప్యాక్ ను పాలతోనే కాకుండా మరొక విధంగా కూడా ట్రై చేయవచ్చు.. మందార పొడి 2 టేబుల్  స్పూన్లు.. తేనె 1 టీ స్పూన్.. పెరుగు కొద్దిగా.. పై మూడు పదార్థాలను బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు  ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.  సుమారు 15 నిమిషాలు దీన్ని అలాగే ఉంచి ఆ తరువాత కాటన్ సహాయంతో ముఖం మీద ఉన్న ఫేస్ మాస్క్ ను తొలగించాలి.  దీని తరువాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న రోజు మొత్తం ముఖానికి ఎలాంటి సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ ఉపయోగించకూడదు.                                           *నిశ్శబ్ద.  

మచ్చలేని ముఖం కావాలా? ఇంట్లోనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి చాలు..! ప్రతి ఒక్కరూ శుభ్రమైన,  మొటిమలు లేని చర్మాన్ని కోరుకుంటారు. కానీ బిజీ రొటీన్‌లో చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టం. ఈరోజుల్లో చర్మసంరక్షణకు బోలెడు రకాల ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి.  వీటని చర్మంలో మెరుపు కనిపించాలని, చర్మం యవ్వనంగా కనిపించాలని వాడతారు. ఇవి వాడినప్పుడు నిజంగానే అనుకున్న ఫలితాలను కేవలం క్షణాలలో ఇస్తాయి. అయితే వీటని ముఖానికి పట్టింటి రిమోవ్ చేస్తే ఆ తరువాత ముఖం చాలా చండాలండా మారుతుంది. ముఖ చర్మం దారుణంగా మారుతుంది. డ్యామేజ్ అవుతుంది. అమ్మాయిలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, డేట్ నైట్లు మొదలైనవాటి కోసం చాలా అందంగా తయారవుతారు కూడా. అయితే అలాంటి సందర్భాలలో సహజంగానే అందంగా, మచ్చలేని చర్మంతో మెరిసిపోవాలంటే మాత్రం ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి. గంధం,  గులాబీ రేకుల పేస్ట్.. గంధం,  గులాబీ రేకుల పేస్ట్  శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉత్తమ ఎంపిక. ఇది  సహజంగా మంచి సువానసను కలిగి ఉంటుంది.   గంధం,  గులాబీ రేకులతో తయారు చేసిన పేస్ట్  చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ముఖంలోని మురికిని శుభ్రపరచడమే కాకుండా మృతచర్మాన్ని కూడా తొలగిస్తుంది. కావలసినవి - 2 టేబుల్ స్పూన్లు గంధపు పొడి ఒక పిడికెడు  ఎండు గులాబీ రేకులు 1 టేబుల్ స్పూన్  పెరుగు ఎలా చేయాలి ముందుగా ఎండిన గులాబీ రేకులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గంధపు పొడికి గులాబీ రేకుల పొడి కలపాలి. దీన్ని పేస్ట్ చేయడానికి  పెరుగును ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్‌ను  చర్మంపై అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడగాలి. దీని తర్వాత పొడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకుని ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.   కుంకుమ పువ్వు, పాలు.. సహజ పదార్థాలు ఎల్లప్పుడూ ముఖ సంరక్షణ కోసం చాలా మంచి ఎంపిక. కుంకుమపువ్వు అలాంటి  సహజ పదార్ధాలలో ఒకటి. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. కుంకుమపువ్వు కేవలం రంగు మాత్రమే కాదు.. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇక పాలలోని పోషక గుణాలు చర్మాన్ని తేమగా మార్చడానికి పని చేస్తాయి. ఈ రెండూ కలిస్తే ముఖ చర్మానికి చక్కగా పనిచేస్తాయి. కావలసినవి:  కుంకుమపువ్వు రేకలు  2 టేబుల్ స్పూన్ల పాలు   1టేబుల్ స్పూన్  శనగపిండి ఎలా చేయాలి..  కుంకుమపువ్వు రేకలను పాలలో కొన్ని  నానబెట్టాలి. ఇప్పుడు శనగపిండిని అందులో  వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. వేప తులసి పేస్ట్.. వేప,  తులసితో చేసిన పేస్ట్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. దీన్ని  ముఖానికి అప్లై చేయడం వల్ల మెరుపుతో కూడిన ఆరోగ్యకరమైన చర్మం  సొంతం అవుతుంది. కావలసినవి.. ఒక పిడికెడు వేప ఆకులు ఒక పిడికెడు తాజా తులసి ఆకులు 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి ఎలా చేయాలి..  వేప,  తులసి ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ముల్తానీ మట్టిని పేస్ట్‌లో కలపాలి. ఈ పేస్ట్‌ను  చర్మంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.  ఇప్పుడు గోరువెచ్చని నీటితో కడిగి, టవల్ తో తుడుచుకుని మైల్డ్ లోషన్ లేదా క్రీమ్ రాయాలి. గంధం, బాదం పేస్ట్.. గంధం,  బాదంతో  తయారుచేసుకున్నపేస్ట్  చర్మ కాంతిని పెంచడమే కాకుండా చర్మానికి చలువదనాన్ని   ఇస్తుంది కావలసినవి.. 2 టేబుల్ స్పూన్ గంధపు పొడి 1 టేబుల్ స్పూన్  బాదం పొడి 1 టేబుల్ స్పూన్  తేనె కొన్ని చుక్కల పాలు ఎలా తయారు చేయాలి.. గంధం  బాదం పేస్ట్  కోసం చందనం, బాదం పొడి  ఒక గిన్నెలో వేయాలి. దీన్ని పేస్ట్ చేయడానికి తేనె,  తగినంత పాలు జోడించాలి.  దీన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత కడిగేయవచ్చు. ఇక్కడ పేర్కొన్న  స్క్రబ్స్  చర్మానికి మెరుపు అందించడానికి, చర్మం మీద మురికి తొలగించడానికి సహజమైన చిట్కాలలా పనిచేస్తాయి.  ఇవన్నీ  సహజ పదార్ధాలతో తయారు చేయబడినప్పటికీ, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉండటం కోసం . వీటిని ఉపయోగించే  ముందు చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం.                                           *నిశ్శబ్ద.   

  కొరియన్ అమ్మాయిల గ్లాసీ స్కిన్ సీక్రెట్ ఇదే..! బ్యూటీ ప్రపంచంలో కొరియన్ అమ్మాయిల రూటే సపరేటు. చాలామంది కొరియన్ అమ్మాయిల లాంటి స్కిన్ టోన్ తెచ్చుకోవడం కోసం బోలెడు చిట్కాలు పాటిస్తుంటారు. కొరియన్ అమ్మాయిల ముఖ చర్మం మచ్చలు, ముడతలు లేకుండా అద్దంగా మెరుస్తూ ఉండటమే కొరియన్ అమ్మాయిలకు క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.  అయితే కొరియన్ అమ్మాయిలు తమ ముఖ చర్మం అద్దంలా మెరవడం కోసం ఈ కింది సప్లిమెంట్లు తీసుకుంటారు. అవేంటో తెలుసుకుంటే.. గ్రీన్ టీ.. గ్రీన్ టీ శతాబ్దాలుగా కొరియన్ సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పాలీఫెనాల్స్,  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ సప్లిమెంట్ గా పేర్కొనబడుతుంది. జీవక్రియను పెంచడానికి, గుండె ఆరోగ్యానికి,  బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. పసుపు.. కొరియన్ వంటకాలలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శోథ నిరోధక,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. విటమిన్-సి.. విటమిన్ సి భారతీయులు కూడా చాలా విరివిగా తీసుకుంటారు.  ఇందులో  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  రోగనిరోధక వ్యవస్థను  బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొరియన్లు తరచుగా వారి ఆహారంలో సిట్రస్ పండ్లు, బెర్రీలు,  ఆకుపచ్చ కూరగాయలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటారు.  కొందరు విటమిన్ సి సప్లిమెంట్లపై ఆధారపడతారు. కొల్లాజెన్.. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కొల్లాజెన్ పాత్ర ముఖ్యమైనది. కొల్లాజెన్ ఒక ప్రోటీన్. ఇది చర్మం, జుట్టు,  గోర్లు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలా మంది కొరియన్లు తమ బ్యూటీ డైట్‌లో కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకుంటారు. ఈ సప్లిమెంట్లు చర్మ స్థితిస్థాపకత,  ఆర్ద్రీకరణను ప్రోత్సహిస్తాయని నమ్ముతారు. అంతే కాదు ముఖంపై వచ్చే ముడతలను తగ్గించుకోవడానికి ఇది మంచి మార్గం. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు.. సాల్మన్,  మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో సమృద్ధిగా లభించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనవి. ప్రతి ఒక్కరూ చేపలను క్రమం తప్పకుండా తినరు కాబట్టి, చాలా మంది కొరియన్లు ఒమేగా-3 సప్లిమెంట్లను  ఎంచుకుంటారు. ముఖ్యంగా చేపనూనె లేదా ఆల్గే కలిపి తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. ప్రోబయోటిక్స్..  దక్షిణ కొరియాలో ఈ ప్రోబయోటిక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కిమ్చి, పెరుగు,  ఇతర సాంప్రదాయ కొరియన్ వంటకాలు,  పులియబెట్టిన ఆహారాలు మంచి బ్యాక్టీరియాను తీసుకోవడానికి దోహదం చేస్తాయి. అయినప్పటికీ చాలా మంది కొరియన్లు జీర్ణ ఆరోగ్యాన్ని,  రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ప్రోబయోటిక్ సప్లిమెంట్లను తీసుకుంటారు. రెడ్ జిన్సెంగ్.. రెడ్ జిన్సెంగ్ ఒక ప్రసిద్ధ సాంప్రదాయ కొరియన్ రెమెడీ. ఇందులో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది,  శక్తి స్థాయిలను పెంచుతుంది. రెడ్ జిన్‌సెంగ్‌ను కొరియన్లు క్యాప్సూల్స్, ఎక్స్‌ట్రాక్ట్‌లు, టీలు,  టానిక్‌లలో ఒక భాగంలా తీసుకుంటారు.                                        *నిశ్శబ్ద.

అదిరే అదరాల కోసం..   ఎవరి ముఖమైనా చూడగానే మొదట కనిపించేది పెదాలు...ఎర్రని పెదవుల మధ్య నుంచి చిరునవ్వులు చిందించగానే ఎదుటివారికి అదో ఆత్మీయ పలకరింత. పెదాలు అందంగా ఉంటేనే మొహం అందంగా కనిపిస్తుంది. మొహం తెల్లగా ఉన్నా కూడా పెదాలు అంద విహీనంగా ఉంటే ఉపయోగం లేదు. అదే ముఖం నల్లగా ఉన్నా పెదాలు ఎర్రగా ఉంటే ఆ కళే వేరు. ఇంతటి ప్రత్యేకత కలిగిన పెదాలను మరింత అందంగా ఉంచుకోవటానికి ముఖ్యంగా అమ్మాయిలు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. మార్కెట్లో కొత్తగా వచ్చిన లిప్‌బామ్‌లు, లిప్‌స్టిక్‌లు పూయడమే పనిగా పెట్టుకుంటారు...వీటి వల్ల అందం పెరగటం మాట అటుంచితే ధీర్ఘకాలంలో పెదవుల సౌందర్యం పాడయ్యే అవకాశం ఉంది. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువల సాయంతోనే పెదాలను అందంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం.. * బీట్‌రూట్ రసం తీసుకుని, దానికి మీగడ కలిపి పెదాలపై రుద్దాలి. కొద్ది సమయం తర్వాత చల్లని నీటితో దానిని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సాఫ్ట్‌గా అవ్వడంతో పాటు ముడతలు పోతాయి. * మరీ పోడిబారిన చర్మతత్వం ఉన్నవారు ఒక చెంచా సెనగపిండిలో తగినంత బాదం నూనె కలిపి పొడిబారిన పెదాల దగ్గర రాసి ఆరిన తర్వాత కడిగేయొచ్చు. నెమ్మదిగా సమస్య తగ్గుముఖం పడుతుంది. * నిమ్మరసాన్ని నల్లగా ఉన్న ప్రాంతంలో రాసి రాత్రంతా ఉంచేయాలి. తెల్లవారిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మరసంలో తేనే కలిపి రాసిన ప్రయోజనం ఉంటుంది. * తాజాగా తీసిన కలబంద గుజ్జుని పెదాలపై అప్లై చేసి రాత్రంతా ఉంచి తెల్లారి కడిగేయటం వల్ల పెదాల తగ్గుతుంది. * పెదాలు రంగు మారడంతో పాటు తరచూ పగులుతుంటే రాత్రి పోడుకునే ముందు నెయ్యితో మర్ధన చేసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే మార్పు కనిపిస్తుంది. * గులాబీ రెమ్మలను పేస్ట్‌గా చేసి, ఆ పేస్ట్‌కు కాసిన్ని పాలు కలిపి, ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ వర్ణంలోకి మారి అందంగా ఉంటాయి. * తరచూ నాలుకతో పెదాలను తడుపడం మానండి..దీని వల్ల చర్మం నల్లగా మారే అవకాశం ఉంది. * నీరు, తాజా పండ్లు, కాయగూరలు తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి పెదాలు పొడిబారకుండా ఉంటాయి.

కొబ్బరినూనెలో ఇవి రెండూ కలిపి తలకు రాస్తే చాలు.. మొండి చుండ్రు కూడా మటుమాయం! జుట్టుకు సంబంధించిన సమస్యలలో చుండ్రు చాలా సాధారణమైన విషయం. తేలికపాటి చుండ్రు సమస్య ఉంటే అది పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కానీ చుండ్రు సమస్య ఎక్కువ ఉంటే మాత్రం అది అనుభవించేవారికి నరకాన్ని పరిచయం చేస్తుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో చుండ్రు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. చుండ్రు కారణంగా జుట్టు బలహీనంగా మారడం, కాంతి కోల్పోవడం, రాలిపోవడం జరుగుతుంది. దీన్ని అరికట్టాలంటే  కొబ్బరినూనెలో కేవలం రెండు పదార్థాలు కలిపి రాస్తే చాలు. మొండి చుండ్రు కూడా చాలా సులువుగా తగ్గిపోతుంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం, ఉపయోగించే తీరు పూర్తీగా తెలుసుకుంటే.. చుండ్రు తగ్గించుకోవడానికి తలకు కర్పూరం, నిమ్మకాయ నూనె తయారుచేసుకోవాలి. దీన్ని వారంలో మూడు సార్లు ఉపయోగించాలి. ఈ నూనె తయారుచేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే.. భీమసేని కర్పూరం..2,3 నిమ్మకాయ.. సగం కొబ్బరినూనె..  ఒక కప్పు మొదట భీమసేని కర్పూరాన్ని బాగా పొడిగా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సగం నిమ్మకాయను పిండి రసం తీసి  ఆ రసాన్ని కలపాలి. దీంట్లో వేడిచేసిన కొబ్బరినూనె వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. వారంలో మూడుసార్లు దీన్ని తలకు పట్టించి తలస్నానం చేస్తుంటే తలలో చుండ్రు చాలా సులువుగా తగ్గిపోతుంది. ఈ నూనెను ఎక్కువగా కాకుండా కొద్దిమొత్తంలో తయారుచేసుకుని అప్పటికప్పుడు వాడుకుంటే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నూనె ఎలా పనిచేస్తుందంటే.. వాస్తవానికి భీమసేని కర్పూరం యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫంగస్ పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. అలాగే స్కాల్ప్ కు చల్లదనాన్ని అందించడం ద్వారా చికాకును తగ్గించడంలో  సహాయపడతుంది.  దీన్ని  జుట్టుకు అప్లై చేస్తే  జుట్టు కుదుళ్లను తెరవడంలో సహాయపడుతుంది,  జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే  నిమ్మరసం దాని ఆమ్ల గుణాల కారణంగా జుట్టు pH స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది  ఫంగస్ పెరుగుదలను నిరోధిస్తుంది. కాబట్టి ఇది తయారు చేయడం సులభం, వాడటం కూడా సులువు  మాత్రమే కాకుండా ప్రభావవంతంగా ఉంటుంది.                                               *నిశ్శబ్ద.  

అమ్మాయిలూ.. రోజ్ వాటర్ ను ఇలా అస్సలు వాడకండి! రోజ్ వాటర్ అమ్మాయిలు చాలా ఎక్కువగా  ఉపయోగించే సౌందర్య సాధనం. నేరుగా ముఖానికి పట్టించాలన్నా, టోనర్ గా వాడాలన్నా, మేకప్ తొలగించిన తరువాత  ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచాలన్నా, ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించాలన్నా రోజ్ వాటర్ చాలా విరివిగా ఉపయోగిస్తారు. బోలెడు బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయనే కారణంతో చాలామంది అమ్మాయిలు రోజ్ వాటర్ ను వివిధ పదార్థాల కాంబినేషన్  లో ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖం చాలా చండాలంగా మారుతుంది. అకారణంగా ముఖం మీద దద్దుర్లు,  మచ్చలు రావడం. ముఖ చర్మం పాడైపోవడం జరుగుతుంది. అసలు రోజ్ వాటర్ వల్ల కలిగే లాభాలేంటి? దీన్ని ఎలా వాడితే  ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఎలా వాడకపోవడం మంచిది? పూర్తీగా తెలుసుకుంటే.. గులాబీ రేకులను ఆవిరి చెయ్యడం ద్వారా గులాబీ నీరు తయారు చేస్తారు. ఇది ముఖం మీద గీతలు, మచ్చలు తొలగించడమే కాకుండా ముడుతలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే రోజ్ వాటర్ లో కొన్ని రకాల పదార్థాలను కలపడం వల్ల ముఖ చర్మం దెబ్బతింటుంది. రోజ్ వాటర్ లో నూనె పదార్దాలు కలిపి రాయకూడదు. రోజ్ వాటర్ నీటి గుణం కలిగి ఉంటుంది, నూనె రోజ్ వాటర్ లో సరిగా  కలవదు.  ఈ కారణంగా ముఖం మీద నీరు, నూనె గందరగోళం సృష్టించి  మచ్చలు రావడానికి కారణం అవుతుంది.  మొదట శుభ్రమైన ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేసి ఆరిన తరువాత దానిమీద ఫేస్ ఆయిల్ అప్లై చెయ్యాలి. విటమిన్-సి అధికంగా ఉండే నిమ్మరసం, నారింజ రసం వంటివి రోజ్ వాటర్ లో కలపకూడదు. ఇది చర్మాన్ని చికాకు పెడుతుంది. ర్యాషెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కొందరికి టోనర్ ను రోజ్ వాటర్ తో కలిపి వాడే అలవాటు ఉంటుంది. అయితే ఆల్కహాల్ ఆధారిత టోనర్ ను రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి అస్సలు వాడకూడదు. మరీ ముఖ్యంగా సున్నిత చర్మం ఉన్నవారు, పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా నష్టం కలిగిస్తుంది. రోజ్ వాటర్ ను ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తుంటారు. సున్నిత చర్మం, పొడిచర్మం ఉన్నవారు దీన్ని వాడకపోవడం మంచిది. ముల్తానీ మట్టిలో PH స్థాయిలు ఉంటాయి. ఇవి ముఖాన్ని పాడు చేస్తాయి.                                 *నిశ్శబ్ద.