నమ్మించి 4 కోట్లు మోసం చేశాడు.. భోరుమన్న జయలలిత
on Mar 4, 2021
'లారీడ్రైవర్' చిత్రంలో బోరింగు పాప పాత్రలో నటించి పాపులర్ అయ్యారు నటి జయలలిత. అంతకు ముందు వంశీ 'ఏప్రిల్ 1 విడుదల' చిత్రంలో భాగ్యంగానూ కనిపించి ఆకట్టుకున్న ఆమె ఆ తరువాత వ్యాంప్ తరహా పాత్రల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో అరకొరగా కనిపిస్తున్న జయలలిత బుల్లితెర సీరియల్స్లో ఆకట్టుకుంటున్నారు.
'బొమ్మరిల్లు' శ్రీరామ్ నటిస్తూ నిర్మిస్తున్న 'ప్రేమ ఎంత మధురం' సీరియల్లో తల్లి పాత్రలో హుందాగా కనిపిస్తూ తన అభినయంతో అలరిస్తున్నారు. గత 35 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ఆమె వినోద్కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడి దారుణంగా మోసపోయారు. రెండేళ్ల క్రితం కొంత మందిని నమ్మి 4 కోట్లు పోగొట్టుకున్నారు. ఇదే విషయాన్ని అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఆలీతో సరదాగా' షోలో వెల్లడించారు.
"వాళ్లు విజయనగరం రాజులు.. జీఎస్టీలు కట్టలేకపోతున్నాం. సీరియల్స్ చేయడం కష్టంగా వుంది అంటే నేను వాళ్లని గుడ్డిగా నమ్మేశా. నా దగ్గర వున్న డబ్బుతో మీరు చేసుకోండి.. నాకు షేర్ ఏమీ వద్దు అని చెప్పి వాళ్లకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టా.. అలా కొంత కాలం గడిచాక 2018 డిసెంబర్ నాటికి నాదగ్గర 4 కోట్ల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి వాడు చేతులెత్తేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు నేను కారు లేక క్యాబ్లలో తిరుగుతున్నాను. ఓ వ్యక్తిని నమ్మి మోసపోయాను." అని భావోద్వేగానికి లోనై భోరుమన్నారు. ఆమెను మరో నటి వరలక్ష్మి ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
Also Read