ఆత్రేయకు ఇష్టమైన పాట ఏది...?
on Nov 28, 2011
ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిళాంబి నరసింహాచార్యులు. ఆచార్య ఆత్రేయ అనేది ఆయన కలం పేరు. తెలుగు సినీ పరిశ్రమలో మనసు మీద ఆచార్య ఆత్రేయ వ్రాసినన్ని పాటలు మరే సినీ కవీ వ్రాయలేదంటే అతిశయోక్తి కాదు. అసలు ఆయన్ని "మనసు కవి", "మన సుకవి" అని అందరూ పిలుస్తుండేవారు. అలాంటి ఆత్రేయ గారికి ఆయన వ్రాసిన పాటల్లో బాగా ఇష్టమైన పాట ఏమిటని విలేఖరులడగ్గా...!
దానికాయన "నాకు "మురళీకృష్ణ" సినిమాలోని "ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా...నీ సుఖమే నే కోరుతున్నా నినువీడి అందుకే వెళుతున్నా" అనే పాట చాలా ఇష్టం. ఎందుకంటే నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది...ఈ పాటలో నాలోని ప్రేమికుడి మనసు మీకు వినపడుతుంది" అని సమాధానం చెప్పారు. ఈ "మురళీకృష్ణ" సినిమాలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సీనియర్ నటీమణి జమున జంటగా నటించారు...!