అనసూయతో కలిసి స్టెప్పులేయడం గొప్పగా ఉందంటున్న హీరో!
on Mar 1, 2021
'రంగమ్మత్త' అనసూయకు థాంక్స్ చెప్పాడు కార్తికేయ గుమ్మకొండ. ఎందుకంటే అతను హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'చావు కబురు చల్లగా'లో "పైన పటారం ఈడ లోన లొటారం.. ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం.." అంటూ సాగే స్పెషల్ సాంగ్లో ఆమెతో కలిసి డాన్స్ చేసే అవకాశం తనకు వచ్చినందుకు! యస్. ఆ సాంగ్ లిరికల్ వీడియో ఈ రోజే రిలీజయ్యింది. జేక్స్ బిజోయ్ ట్యూన్స్ కట్టిన ఈ జానపద శైలి పాటను సనరే రాయగా.. మంగ్లీ, రామ్, సాకేత్ కొమాండూరి పాడారు.
ఆ సాంగ్ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన కార్తికేయ, "ఈ పాట షూటింగ్ను గార్జియస్ అనుసూయతో కలిసి చేయడం గొప్పగా అనిపించింది. మీ ప్రెజెన్స్ ఈ పాటకు ఫుల్ లైఫ్నిచ్చింది. అమేజింగ్ కొరియోగ్రఫీ ఇచ్చిన జాని మాస్టర్కు థాంక్స్" అని రాసుకొచ్చాడు కార్తికేయ. లోకంతీరు, మనుషుల తీరు ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా కళ్లకు కట్టినట్లు చెప్పారు.
మంగ్లీ సూపర్బ్గా ఆ సాంగ్ను పాడారనేది నిస్సందేహం. కానీ ఆ వాయిస్ కల్చర్ అనసూయకు సూట్ కాలేదన్నది వాస్తవం. అనసూయ నోరు కదులుతుంటే ఇంకెవరో పాడుతున్నట్లుగా ఉంది. అది మినహాయిస్తే అనసూయ ఈ పాటలో ఎప్పట్లా అదరగొట్టారు. కార్తికేయ రాసినట్లు గార్జియస్గా ఉన్నారామె. ఆమె లుక్స్, ఆమె మూమెంట్స్కు దాసోహం కాని ఆడియెన్స్ ఉండరు.
కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్గా పరిచయమవుతున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. మార్చి 19న 'చావు కబురు చల్లగా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.