ప్రభాస్, మహేశ్, తారక్.. ఆ వరుసలో చిరు నిలుస్తాడా?
on Dec 2, 2020
సంభాషణల రచయిత నుంచి దర్శకునిగా మారి, మొదటి చిత్రం 'మిర్చి'తో అత్యంత భారీ విజయం సాధించాడు కొరటాల శివ. ఈ సినిమా అప్పటికి ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం గమనార్హం. స్వతహాగా డైలాగ్ రైటర్ అయినా సంభాషణలు మోతాదు మించకుండా చక్కని స్క్రీన్ప్లేతో మిర్చిని శివ రూపొందించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. అందుకే ఏకంగా మహేశ్ లాంటి సూపర్స్టార్ను తన రెండో సినిమాలో డైరెక్ట్ చేసే అవకాశం లభించింది శివకు. ఫ్యామిలీ బాండింగ్, భావోద్వేగాలు మేళవించిన యాక్షన్ ఎంటర్టైనర్గా 'శ్రీమంతుడు'ను తీసి, మహేశ్కు కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ను ఇచ్చాడు.
ఆ తర్వాత మూడో సినిమాని జూనియర్ ఎన్టీఆర్తో తీసి, 'జనతా గ్యారేజ్' అనే బ్లాక్బస్టర్ను ఆయనకు అందించాడు. 'సింహాద్రి' తర్వాత తనకు మళ్లీ అసలైన విజయం ఇదేనని తారక్ ఎమోషనల్ అయ్యాడంటేనే ఆ సినిమా సక్సెస్ రేంజ్ ఏంటనేది ఊహించుకోవచ్చు. నాలుగో సినిమాని మరోసారి మహేశ్తో తీసిన శివ, 'భరత్ అనే నేను'తో మరోసారి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ను ఆయనకు అందించాడు.
ఇలా నాలుగు సినిమాలు డైరెక్ట్ చేస్తే.. ఆ నాలుగూ ఆయా హీరోలకు ఆ టైమ్లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ కావడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పుడు తన ఐదో మూవీ 'ఆచార్య'ను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నాడు కొరటాల శివ. తన మునుపటి సినిమాల తరహాలోనే 'ఆచార్య'తో చిరుకు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ను అందిస్తాడని ఆయన అభిమానులు శివపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. చిరు కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్.. మునుపటి సినిమా 'సైరా.. నరసింహారెడ్డి'. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసింది. అయినప్పటికీ కాస్ట్ ఫెయిల్యూర్గానే నిలిచింది. మరి, ఆ సినిమా కలెక్షన్ను 'ఆచార్య' అధిగమిస్తాడా? చూద్దాం.
Also Read