'ఆ నలుగురు' మూవీ ఎందుకు క్లాసిక్ అయ్యింది?
on Oct 26, 2020
"నేనే గెలిచాను.. నేనే గెలిచాను".. 'ఆ నలుగురు' చిత్రం చివరి సన్నివేశంలో రఘురామ్ పాత్రధారి రాజేంద్రప్రసాద్ నోటి నుండి వచ్చే మాటలవి. ఆ మాటలు సరిగ్గా ఆయనకూ, ఆ సినిమాకూ వర్తిస్తాయి. 2004 సంవత్సరం నంది అవార్డుల్లో ఆ నలుగురు చిత్రం బంగారు నందిని గెలుచుకుంటే, ఉత్తమ నటుడి అవార్డును రాజేంద్రప్రసాద్ అందుకున్నారు. మనుషులకు అన్నింటికంటే డబ్బే ముఖ్యమని అందరూ అనుకొనే స్థితిలో.. కాదు.. డబ్బు కంటే బంధాలు, అనుబంధాలే ప్రధానమని తన చుట్టూ ఉన్న మనుషులు నిరూపించడంతో ఆనందం పట్టలేని రఘురామ్ ఆత్మ క్లైమాక్స్ సీన్లో "నేనే గెలిచాను.. నేనే గెలిచాను" అంటుంది.
దాంతో అంతదాకా యమభటులుగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు దేవదూతలుగా మారిపోతారు. నిజాయితీగా జీవించాలనుకునే ఓ మధ్యతరగతి వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో, అతని నిజాయితీకి అడుగడుగునా ఎలాంటి పరీక్షలు ఎదురవుతాయోననే కథకు, ఫాంటసీ అంశాన్ని జోడించి తీసిన ఈ సినిమా విడుదలయినప్పుడు దానిని చూసేందుకు మొదట ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. అయితే విమర్శకుల ప్రశంసలు అమితంగా పొందడం, ఆ ప్రశంసలు ప్రచారంలోకి రావడంతో నెమ్మదిగా ఈ సినిమా జనంలోకి వెళ్లింది. సినిమా కథ, కథనం, ప్రజావేదిక పత్రికా సంపాదకుడు రఘురామ్ పాత్ర అందర్నీ అమితంగా ఆకట్టుకున్నాయి.
రఘురామ్ సహా సినిమాలోని దాదాపు అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులు తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారు. సహజ పాత్రలు, సహజ వాతావరణం, సహజ సంభాషణలు.. ఈ సినిమాకు జీవాన్ని తీసుకొచ్చాయి. అందుకే నంది అవార్డుల్లో ఈ సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడు (కోట శ్రీనివాసరావు) అవార్డులు రావడం ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు.
అయితే ఇంత చక్కని కథనీ, సంభాషణల్నీ రాసిన మదన్కూ, హృదయాల్ని స్పృశించేలా ఆయా సన్నివేశాల్ని చిత్రీకరించిన దర్శకుడు చంద్రసిద్ధార్థ్కీ అవార్డులు రాకపోవడం సమంజసం అనిపించదు. ఓ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైనప్పుడు.. దాని కథకుడు, దర్శకుడు ఆ గౌరవానికి నోచుకోకపోవడం న్యాయమేనా?.. అనే ప్రశ్నలు ఉదయించక మానవు. ఈ అసంతృప్తి చంద్రసిద్ధార్థ్లోనూ వ్యక్తమవుతుంది.
అయినప్పటికీ సినిమాకు గుర్తింపు లభించిందనే ఆనందం, రాజేంద్రప్రసాద్కు ఉత్తమ నటుడు అవార్డును సాధించిపెట్టిన రఘురామ్ పాత్రను మలచగలిగాననే సంతోషం ఆయనలో కనిపిస్తుంది. "రఘురామ్ పాత్రను పోషించిన రాజేంద్రప్రసాద్కు అవార్డు ఇవ్వడం నంది అవార్డుల స్థాయిని పెంచిందని నా ఉద్దేశం. ఆ మధ్యకాలంలో ఉత్తమ నటులుగా అవార్డులు పొందిన నటుల అభినయం, వారు చేసిన పాత్రలతో పోలిస్తే రాజేంద్రప్రసాద్ అభినయం, రఘురామ్ పాత్ర మరింత ఉత్కృష్టమైనవి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజేంద్ర ప్రసాద్ ఉత్తమ నటునిగా నంది అవార్డు పొందడం అది రెండోసారి. అంతకుముందు 'ఎర్రమందారం' చిత్రంలో చేసిన అభినయానికి ఆయన అవార్డును అందుకున్నారు. ఇలాంటి ఉత్తమ చిత్రం కాలానికి నిలబడి క్లాసిక్గా పేరు తెచ్చుకోవడంలో ఆశ్చర్యమేముంది!
- బుద్ధి యజ్ఞమూర్తి
Also Read