బాలకృష్ణ 'అల్లరి పిడుగు' ప్రేక్షకుల నెత్తిన పిడుగులా ఎందుకు పడింది?
on Oct 31, 2020
ప్రపంచం ముందుకు పోతుంటే, కొంతమంది మాత్రం వెనక్కి పోవడానికి ఇష్టపడుతుంటారు. నిండా మునిగాక కానీ తాము చేసింది పొరపాటనే వాస్తవం తెలిసిరాదు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన 'అల్లరి పిడుగు' (2005) సినిమాని చూస్తే అలాగే అనిపిస్తుంది. అప్పటికే 300 చిత్రాలకు రచన చేసిన దిగ్గజ రచయితలు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు సంభాషణలు రాయడమే కాకుండా, కథనీ వాళ్లే రాసి, స్క్రీన్ప్లేనూ సమకూర్చారు. అంటే సినిమాకు సంబంధించిన సాంకేతిక అంశాల్లో దర్శకుడి తర్వాత స్థానం వాళ్లదే. తలపండిన జ్ఞానవంతులైన వారు కథ, కథనం, సంభాషణలు మూడింటిలోనూ వైఫల్యం చెందడమే ఆశ్చర్యం!
తప్పులు కొల్లలుగా కనిపించే అల్లరి పిడుగులో ప్రారంభం, మధ్యమం, ముగింపులలో ఏ ఒక్కటీ ఆకట్టుకోదు. ఈ సినిమా కథలో ప్రధానాంశం మిలటరీ ఆఫీసర్ చక్రవర్తి (పునీత్ ఇస్సార్)కూ, ఆయన చిన్నకొడుకు గిరి (బాలకృష్ణ)కూ మధ్య సంఘర్షణ. ఈ సంఘర్షణకు చూపించిన కారణం ఏమాత్రం కన్విన్సింగ్గా లేకపోవడం ఆరంభంలోనే సినిమాను దెబ్బతీసింది.
తన కవల పిల్లలైన రంజిత్, గిరిలలో చిన్నవాడు సరిగా చదవక అల్లరి పనులు చేస్తుండటంతో బాధ్యతగల అంతోటి మిలటరీ ఆఫీసర్ కూడా అతడ్ని 'ఎక్స్ట్రా కొడుకు'గా భావిస్తుంటాడు. ఆ అభిప్రాయాన్ని చిన్నతనంలోనే ఆ పిల్లాడిలో ఇంజెక్ట్ చేస్తాడు. తండ్రి తన పట్ల వ్యవహరిస్తున్న తీరుతో గిరి మరింత మొండిగా, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటాడు. చదువు ఆపేసి, అల్లరి చిల్లరి పనులు చేస్తుండే ఈ గిరినే 'అల్లరి పిడుగు'గా దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, రచయిత సోదరులు చూపించారు. 'ఎక్స్ట్రా కొడుకు'గా భావించే తండ్రిచేతే అతన్ని 'ఎక్స్ట్రార్డినరీ కొడుకు'గా మెచ్చుకునేలా చేసేందుకు రెండున్నర గంటల కథలో నానా శ్రమపడ్డారు. కానైతే ఈ 'ఎక్ప్ట్రార్డినరీ' పిడుగు చేసే పనులు మొదట్నుంచీ ఏవగింపునే కలిగిస్తుంటాయి.
పద్నాలుగేళ్ల తర్వాత తండ్రి తమ వద్దకు వస్తుంటే గిరి ఇంట్లో ఉండకుండా పోకిరీ మూకతో ఆటలాడి, ఐదొందలు ఇవ్వలేదనే కోపంతో కత్తి తీసుకొని బెదిరిస్తాడు. అంతకుముందు మరదలు సుబ్బలక్ష్మి (చార్మి) చేత దర్జాగా పరీక్షల్లో కాపీ రాయిస్తాడు. లెక్చరర్ని పూచికపుల్లంత కూడా లెక్కచెయ్యడు.
క్లైమాక్స్ సీన్లో కొండరాయి మీదనుంచి వెల్లకిలా కిందకు పడిపోయిన గిరి ఆ వెంటనే మళ్లీ కొండపైకి వచ్చిన సన్నివేశం తలచుకున్న కొద్దీ నవ్వు వస్తుంటుంది. ఈ అపహాస్య ధోరణిలోనే సినిమా అంతా సాగుతుంది. రంజిత్, గిరి క్యారెక్టర్లు నిర్దిష్టమైన తీరూ తెన్నూ లేకుండా సాగడంతో ఏ ఒక్కటీ ఆకట్టుకోదు. కొద్దిసేపు తండ్రంటే విపరీతమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే గిరి, ఆ వెంటనే తండ్రి మెప్పుకోసం యత్నించడం చూస్తే ఆ పాత్ర చిత్రణలో రచయితలు ఎంతగా తికమకపడిందీ అర్థమవుతుంది. హీరోయిన్ల క్యారెక్టరైతే మరీ ఘోరం. ఆడబొమ్మ అనే మాటకు సరైన అర్థంగా ఆ పాత్రలు కనిపిస్తాయి. స్వాతి అనే హీరోయిన్ క్యారెక్టర్లో కత్రినా కైఫ్ నటించింది.
మొత్తానికి పరుచూరి సోదరులు కథ, కథనం విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి, పాత్రల్నీ కన్ఫ్యూజ్ చేశారు. బట్.. ఆడియెన్స్ కన్ఫ్యూజ్ కాలేదు. వారు స్ట్రయిట్ ఆన్సరే ఇచ్చారు. నెత్తిన పిడుగు పడబోతూ ఉందని తెలిశాక, వారు అక్కడ్నుంచి తప్పుకోరూ!
Also Read