ఆ స్టార్లలో కనిపిస్తున్న దూకుడు మహేశ్లో ఏదీ?
on Dec 3, 2020
సూపర్స్టార్ మహేశ్ కెరీర్లో 'దూకుడు' ఓ బ్లాక్బస్టర్. ఆ టైమ్కు అది ఆయనకు బిగ్గెస్ట్ గ్రాసర్. అయితే ఆ దూకుడును ఆయన సబ్జెక్టుల ఎంపికలో చూపించలేకపోతున్నారని ఫిల్మ్నగర్ జనాలు అభిప్రాయపడుతున్నారు. ఆయన తోటి హీరోలు స్క్రిప్టుల విషయంలో యమ దూకుడు చూపిస్తుంటే, 'దూకుడు' లాంటి సినిమా చేసిన మహేశ్లో ఆ దూకుడు కనిపించడం లేదని ఫ్యాన్స్ కూడా వాపోతున్నారు.
టాలీవుడ్లో నిన్నటి దాకా ఆయన మార్కెట్ కంటే తక్కువ స్థాయి మార్కెట్ కలిగిన ప్రభాస్ ఏకైక పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయినా, కెరీర్లో ఎంత దూకుడు చూపిస్తున్నాడో తెలిసిందే. 'రాధే శ్యామ్' షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే మరో మూడు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. లేటెస్ట్గా 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో 'సలార్' మూవీ చేస్తున్నట్లు ఆయన అనౌన్స్ చేశాడు. 'రాధే శ్యామ్' పూర్తయిన వెంటనే అది ప్రారంభం కానున్నది. ఆ వెంటనే ఓమ్ రౌత్ డైరెక్షన్లో రామాయణ గాథతో 'ఆదిపురుష్' మూవీని చేయనున్నాడు. ఆపైన నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఎటూ తిరిగీ ఉంది.
మెగాస్టార్ సైతం 'ఆచార్య' తర్వాత మూడు సినిమాలకు ఓకే చెప్పడం గమనార్హం. 'లూసిఫర్' రీమేక్, 'వేదాళమ్' రీమేక్తో పాటు, బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయడానికి ఓకే చెప్పాడు. సుకుమార్తో 'పుష్ప' చేస్తున్న బన్నీ, దాని తర్వాత కొరటాల శివతో కలిసి పనిచేయడానికి సరే అన్నాడు. ఇక పవన్ కల్యాణ్ అయితే వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటూ వస్తున్నారు. 'వకీల్ సాబ్', క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో పాటు 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ కూడా పైప్లైన్లో ఉన్నాయి.
ఇలా తన తోటి స్టార్స్ అందరూ ఆల్రెడీ చేస్తున్న సినిమాల తర్వాత చేసే సినిమాల విషయంలో క్లారిటీకి వచ్చేయగా, మహేశ్ ఆ దూకుడు కనపర్చడం లేదు. 'సర్కారు వారి పాట' తర్వాత ఆయన ఎవరితో చేస్తాడో ఇంతదాకా వెల్లడి కాలేదు. సుకుమార్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లలో సినిమాలు చేయడానికి వచ్చిన అవకాశాల్ని ఆయన వదులుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో సినిమా ఎప్పుడు ఉంటుందో, అసలు చేస్తాడో, లేదో కూడా తెలీడం లేదు. మిగతా స్టార్లు కొవిడ్ కారణంగా ఏడెనిమిది నెలల విరామం తీసుకుంటే, మహేశ్ మాత్రం ఇప్పటికే ఏడాది విరామం తీసుకున్నాడు. 2020లో ఆయన సినిమా కోసం కెమెరా ముందుకు ఒక్క రోజు కూడా రాలేదు. 2021 జనవరిలో 'సర్కారు వారి పాట'ను మొదలు పెడుతున్నాడు. అది పూర్తయ్యేలోగా తన తదుపరి ప్రాజెక్టును ఆయన ఎనౌన్స్ చేస్తాడా?
Also Read