50 ఏళ్ల పద్మాలయా స్టూడియోస్ ఎక్కడ?
on Jul 10, 2020
పద్మాలయా స్టూడియోస్.. ఎంతటి ప్రతిష్ఠాత్మక సంస్థ! సూపర్ స్టార్ కృష్ణ.. తన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావుతో కలిసి స్థాపించిన సంస్థ. జూలై 10తో ఆ బ్యానర్ను ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. నిజానికి మొదట దీనికి పెట్టిన పేరు పద్మాలయా ఫిలిమ్స్. ఆ బ్యానర్పై తొలిగా నిర్మించిన చిత్రమే సంచలనాలు సృష్టించింది. అది.. 'మోసగాళ్లకు మోసగాడు'. ఆ మూవీ 1971 ఆగస్ట్లో విడుదలైంది. ఆ మూవీతో కృష్ణ ఇండియన్ కౌబాయ్గా పేరు తెచ్చుకున్నారు. 'ద ట్రెజర్ హంట్' పేరిట ఇంగ్లీష్లోనూ ఆ సినిమా విడుదలవడం ఆ రోజుల్లో పెద్ద విశేషం.
1986లో వచ్చిన బ్లాక్బస్టర్ ఫోక్లోర్ మూవీ 'సింహాసనం' సినిమా నుంచి పద్మాలయా స్టూడియోస్గా ఆ బ్యానర్ రూపాంతరం చెందింది. ఈ బ్యానర్పై తెలుగులోనే కాకుండా హిందీలోనూ సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. హైదరాబాద్లో ఆ పేరుతో స్టూడియోస్ను నిర్మించారు కృష్ణ. 2000 సంవత్సరంలో వచ్చిన మహేశ్ మూవీ 'వంశీ' వరకు ఆ బ్యానర్పైనే సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత దాని పేరును పద్మాలయా టెలిఫిలిమ్స్గా మార్చారు. అప్పుడే పద్మాలయా స్టూడియోస్ అప్పులపాలైంది. ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిలో సగభాగాన్ని జీ టెలీఫిలిమ్స్కు అమ్మేసింది. ఇలా ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అమ్మకూడదంటూ కోర్టులో కేసులు నడిచాయి. కొన్నేళ్లుగా పద్మాలయా స్టూడియోస్ అనేది ఉనికిలో లేకుండా పోయింది. ఇప్పుడది కేవలం గత వైభవపు జ్ఞాపకం.