కేరళలో వకీల్ సాబ్ డ్యూయెట్
on Dec 2, 2020
వకీల్ సాబ్ తో రి-ఎంట్రీ బాట పట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిందీ చిత్రం పింక్ ఆధారంగా రూపొందుతున్న ఈ కోర్ట్ డ్రామాని శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో పవన్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. ప్రధాన పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి పవన్ పాత్ర తాలూకూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని త్వరలోనే పిక్చరైజ్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్స్ లో పవన్, శ్రుతి కాంబినేషన్ లో కొన్ని సీన్స్ తో పాటు ఓ పాటని కూడా చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఆ పాటని కేరళలో ప్లాన్ చేశారని తెలిసింది. గబ్బర్ సింగ్, కాటమ రాయుడు తరువాత పవన్, శ్రుతి కాంబినేషన్ లో వస్తున్న వకీల్ సాబ్ కూడా.. గత రెండు చిత్రాల్లాగే రీమేక్ కావడం విశేషం.
కాగా, 2021 ఏప్రిల్ లో వకీల్ సాబ్ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని అంటున్నారు.